పుట:కాశీమజిలీకథలు-05.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

134

కాశీమజిలీకథలు - ఐదవభాగము

   పద్మపాదుండు గలుగ మీ భాష్యమునకు
   వార్తికము సేయ నల సురేశ్వరుఁడు దగునె?

మహాత్మా! పద్మపాదుండే మీ భాష్యమునకు టీక రచించవలయును. కానిచో నుగ్రతపంబున సరస్వతిం బ్రసన్నురాలిం గావించిన యానందగిరి కప్పని సేయ నిరూపింపుడు. అంతియకాని కర్మైకతానమతియగు సురేశ్వరునియం దట్టియనుగ్రహము గలిగించుట యుచితము కాదని చెప్పుచుండగానే పద్మపాదుం డచ్చోటి కరుదెంచి వినయవినమితశిరస్కుండై యాచార్యున కిట్లనియె ఆచార్యా! భవదీయకృపారసవిశేషంబునం జేసి పదునాలుగువిద్యలును హస్తామలకంబు భాతి దెలియబడెను. గావున హస్తామలకుడని సార్థకనామము వహించిన శిష్యవరుండు మీ భాష్యమునకు వార్తికము జేయుట కర్హుడు కాడా? కర్మప్రియుండై బలత్కారంబున సన్న్యాసియైన సురేశ్వరుని యందట్టి యనుగ్రహమేమిటికి గలుగవలయునని యడిగిన మందహాసశోభితవదనారవిందుఁడై శంకరాచార్యుం డిట్లనియె.

వత్సా! పద్మపాద! హస్తామలకు డట్టివాఁడే కాని యితనికి బాహ్యప్రచార మించుకయు లేదు. బాల్యమునుండియు నాత్మప్రచారముగల యీతం డత్యుదారమగు మదీయభాష్యమునకు వార్తికమెట్లు చేయగలడు. ఇతండు బాల్యంబున నేమియుం జదువనివాడు. వీనిచర్యలన్నియుం జూచికదా భూతగ్రస్తుండని తలంచి వీని తండ్రి నాయొద్దకు దీసికొనివచ్చెను. నేను వీని శిరంబున గరంబిడి నీ వెవ్వండవని యడిగినప్పుడుకాదే యానందఘనస్వరూపం బ్రకటింపుశ్లోకముల జదివెను. దీని కొకయద్భుతకారణ మున్నదని చెప్పిన విని శిష్యులెల్లరు నమస్కరింపుచు స్వామీ! యీతండు బోధలేకయే యిట్టి ప్రజ్ఞావంతు డెట్లయ్యె నెరిఁగింపుడని యడిగిన నయ్యాచార్యుండు వారికిట్లనియె.

హస్తామలకుని పూర్వకథ

కొన్నియేండ్లక్రిందట బ్రభాకరుని భార్య రెండేడులు ప్రాయముగల బాలు నెత్తుకొని యమునానదికి స్నానార్ధమైయరిగినది. అమ్మహానదీతీరంబున సంసారవిరక్తుడై యొకసిద్ధుండు తపంబు గావింపుచుండెను. ప్రభాకరుని భార్య తన కుమారుని నా సిద్ధుని మ్రోల నునిచి మహాత్మా! నేను స్నానమునం జేసి వచ్చునందాక యీ బాలుం జూచుచుండుడు. ఎత్తుకొనువార లెవ్వరును లేరు తృటిలోవత్తు. దయాహృదయులగు మీ యెరుగనిదికలదే! యని వేఁడుకొనిన నతండు తలయూచుచు నందుల కియ్యకొనినట్లు సూచించెను.

అయ్యువతియు సుతు నతనిముందర నాడుకొన విడిచి ముద్దిడుకొని వడిగా సఖులతో స్నానముచేయ నది కరిగినది.