పుట:కాశీమజిలీకథలు-05.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

122

కాశీమజిలీకథలు - ఐదవభాగము

అమ్మహారవం బాలించి యందున్న శిష్యులెల్లరుఁ దల్లడిల్లుచు నచ్చోటి కరుదెంచి చచ్చిపడియున్న కాపాలికుని నృసింహాకృతితోనున్న పద్మపాదుని సమాధిలోనున్న గురువరునిం గాంచి విస్మయాకులహృదయులై చూచుచున్న సమయంబున శంకరయతివర్యుండును సమాధి చాలించి కన్నులం దెరచి యందు జరిగిన వృత్తాంత మంతయు శిష్యులవలనం దెలిసికొని పద్మపాదు నావేశించియున్న నరసింహమూర్తి నిట్లని స్తుతియించెను.

శ్లో॥ కల్పాంతోజ్గృంభమాణప్రమథపరిపృఢప్రౌఢలాలాటవహ్ని
     జ్వాలాలీఢత్రిలోకీజనితచటచటధ్వానధిక్కారధుర్యః
     వధ్యేబ్రహ్మాండభాండోదరకుహరమనైకాంత్యదుస్థ్సామవస్థాం
     స్త్యానస్త్యానోమమాయందళయతుదురితం శ్రీనృసింహాట్టహాసః॥

వ. అని యనేక ప్రకారంబుల నమ్మనుజసింహమూర్తిని స్తోత్రముఁజేయుటయు నాభక్తప్రియుండు నుగ్రమూర్తి నుపసంహరించుకొని యంతర్ధానమునొందెను. పిమ్మట శాంతుండైయున్న పద్మపాదుం జూచి వెరఁగు పడుచు శిష్యులెల్లరు "ఆర్యా! నీ వీదేవు నెటు ప్రసన్నుం జేసికొంటి నీకపటం బెట్లెఱింగితివి? ఇద్దురాత్ముం డెవ్వండని" యడిగిన నతం డిట్లనియె.

అహోబల నృసింహునికథ

నేను బూర్వమొకప్పు డహోబలశైలంబున కరిగి యందొక యరణ్యంబున భక్తవశ్యుండగు నరసింహమూర్తిఁ గురించి పెక్కుదినంబులు తపంబు గావింపుచుంటిని. అట్టిసమయంబున నొకదినమున నాయెద్ద కొకకిరాతకుమారుం డరుదెంచి "అయ్యా నీవెవ్వఁడవు? ఒక్కండ విక్కొండబిలంబున నేమిటికి వసియించెదవు? నీవు చేయుపని యేమి?" యని యడుగుటయు వానిమాటఁ బాటింపక మౌనముతోఁ బోపొమ్మని హస్తసంజ్ఞ చేసి నిరాకరించితిని.

వాఁ డంతటితో బోక యప్పుడప్పుడు నాకుఁ గనబడుచు నా రీతినే యడుగు చుండ నొకనాఁ డిట్లంటిని ఓరీ! నీవు మూఢజాతివాఁడవు. మఱియు బాలుండవు. ఇట్టి నీకు మాబోంటివారిం బల్కరింప నుచితముకాదు విను మీయరణ్యంబునఁ గంఠమున సింగమును గ్రింద మానిసిరూపుంగల సామియొకం డుండవలయును అట్టివాని నెందేనిఁ గంటివేనిఁ జెప్పుము. వానిం జూచు తలంపుతోడనే నేనిందున్నవాఁడ. అతండు నాకుఁ జుట్ట మిదియే నాపని వానిం దీసికొని రాఁగలవా? యని పరిహాసముగా నడిగితిని.

అప్పు డబ్బాలుండు నవ్వుచు నోహో! యీపనికేనా యింత శ్రమపడుచుంటివి. నా కీపని మొదటనే చెప్పితివేని యప్పుడే తీసికొని రాకపోవుదునా? ఆయనను