పుట:కాశీమజిలీకథలు-05.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

118

కాశీమజిలీకథలు - ఐదవభాగము

గీ. గరిమఁ బానీయశాలఁ బెక్కండ్రు గూడి
   యంతలో భిన్నమార్గులై యరుగునట్లు
   పెక్కుపేరుల నింటిలోఁ బెరిగి పెరిగి
   సమయుదురు దేహు లాత్మీయసమయమైన.

గీ. భువిసుఖంబుకొఱఁకు బొనరింతురుద్దాని
    దాన వెతయకాని తగదుసుఖము
    కారణంబులేక కలుగదు సుఖవృత్తి
    హేతువునకు నొండు హేతు వుండు.

క. పరిపక్వమతికి నొకమా
   టరసిన శ్రుతివచనసరణి యవబోధ మగున్
   బరి మందమతికి మెల్లన
   గురుపాదాంభోజసేవ గూర్చున్ దానిన్.

ఇందులకు గురుబోధము ప్రధానకారణం బని యాత్మతత్త్వప్రకారం బంతయు బోధించినం దెలిసి మండనమిశ్రుం డయ్యతీంద్రునిచరణపద్మంబుల వ్రాలి, మహాత్మా! నీ కటాక్షంబున నజ్ఞానంబు వాసితి నద్వైతతత్వంబు దెల్లమైనది. కృతికృత్యుండ నైతినని పలుకుచు తత్ప్రసాదలబ్దజ్ఞానుండై యదిమొదలు సురేశ్వరుం డనునామము వహించి శ్రీ శంకరాచార్యుని పాదసేవ గావింపుచుఁ బద్మపాదాది శిష్యులతోఁ జేరి యతని సేవింపుచుండెను.

శంకరయతిచంద్రు డట్లు మండనమిశ్రునకు బ్రహ్మతత్త్వం బుపదేశించి ప్రధానశిష్యుంగాఁ జేసికొని యందు శిష్యులతోఁ గూడ బయలువెడలి మహారాష్ట్రదేశమున కరిగి యందు భాష్యం బెల్లెడల వ్యాపింపఁజేసెను. అందుఁ గొన్నిదినంబు లుండి యచ్చటనుండి శ్రీశైలమునకుం జని యందుఁ బాతాళగంగాంబువులఁ దీర్థములాడి మల్లిఖార్జునలింగము నర్చింపుచు శివానందలహరి యను స్తోత్రశ్లోకంబుల స్తుతియించెను.

శ్లో॥ సంధ్యారంభవిజృంభితం శ్రుతిశిరస్థానాంతరాధిష్ఠితం
     సప్రేమభ్రమరాభిరామ మనకృత్సద్వాసనాశోభితం
     భోగీంద్రాభరణం సమస్తసుమనఃపూజం గుణావిష్కృతం
     సేవే శ్రీగిరిమల్లిఖార్జునమహాలింగం శివాలింగితం.

శ్లో. భృంగీచ్ఛానటనోత్కటఃకరిమదగ్రాహి స్ఫురన్మాధవా
    హ్లాదోనాదయుతో మహాసితవపుఃపంచేషుణాదాదృత
    సత్ఫక్షస్సుమనోవనేషు నపునస్సాక్షాన్మదీయే మనో
    రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీవిభుః.