పుట:కాశీమజిలీకథలు-05.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

119

మఱియు నం దష్టాదశపీఠంబులలోఁ బ్రధానమగు భ్రమరాంబాదేవి నాగమోక్తవిధానంబున మహాశక్తిగా స్థాపనం జేసి యందు శిష్యులతోఁ గూడఁ గొన్నిదినంబులు వసియించెను. ఒకనాఁడు శంకరయతీంద్రులు పద్మపాదాదిశిష్యులతోఁ భాష్యంబు ముచ్చటింపుచుండ నాకర్ణించి యందున్న పాశుపతులు వైష్ణవులు వీరశైవులును మాహేశ్వరులు దాని నధిక్షేపించి తచ్ఛిష్యులచేతనే పూజితులై కొంద రతనికి శిష్యులైరి. మరికొందరు కోపమువిడువక వారికి సమాధానము చెప్పలేక తదీయమరణావసానసమయ మరయుచుండిరి.

ఉగ్రభైరవుని కథ

ఒకనాఁడు శంకరాచార్యవర్యుండు పాతాళగంగానదీతీరంబున వసియించి భాష్యరహస్యంబు లాలోచించుచున్న సమయంబున గాపాలికుఁ డొకడు సీతాపహరణార్థమై యరుదెంచిన రావణుండు వోలె నవధూతవేషము వైచికొని యమ్మహాత్ముని యొద్దకు వచ్చి మిగుల సంతసించుచు నల్లన నిట్లనియె యతీంద్రా! సర్వజ్ఞత్వానద్యత్వాది భవద్గుణవిశేషంబు లెల్లెడం జెప్పుకొన మిగుల వేడుకపడుచు మిమ్ముఁ జూడ నిచ్చోటి కరుదెంచితిని. నిరస్తమోహుండవన నీవొక్కండవే కదా దేహాభిమానాదుల విడిచి భేదబుద్ధి నించుకయుం బూనక శుద్ధాద్వైతసిద్ధిం బొందితివి. నీవు పరోపకారమునకై యవతరించిన మూర్తివని నీకిర్తి యమర్త్యలోకములవఱకు వ్యాపించియున్నది నీ కటాక్షపాతమాత్రంబున సజ్జనులయార్తి పోవుచున్నది నీవు గుణాకరుండవు. సర్వజ్ఞుండవును జితేంద్రియుండవు. వదాన్యుండవు నగుటచే భువనైకమాన్యుండవై యుంటివి పరాపరజ్ఞులును సమస్తకల్యాణగుణనిలయలును నగు భవాదృశులు లోకంబున బ్రకాశింపుచుండ నర్థిజనుల కామ్యంబు లెట్టివైనను సమకూరకుండునా? నే నొక్కకార్యంబు కొఱకు నీ పరిసరంబున కరుదెంచితి దాని సఫలమైనదానిఁగా నేఁదలంచుచుంటిని. వినుము.

నేనీ దేహముతోఁ గూఢఁ గైలాసంబున కరిగి యగ్గిరియం దీశ్వరునితో సమముగా విహరింప నుత్సకముఁజెంది శతాబ్దంబు లుగ్రతపం బీశ్వరునిఁగూర్చి కావించితిని అమ్మహాత్ముండు ప్రత్యక్షంబై మత్కామితంబు దెలిసికొని యొక్కింత యూహించి యోహో! నీ వసాధ్యపుకామంబు గోరికొంటి వైనను నీ వ్రతంబులు మదీయహృదయంబు నచ్చెరువు పరచెం గావునఁ దీరుపకతీరదు. పుడమియందు సార్వభౌముని శిరంబుగాని లేక సర్వజ్ఞుండైన యతీశ్వరుని శిరంబుగాని నా నిమిత్త మగ్నియందు హోమముఁ జేసితివేని నీ కార్యంబు సాఫల్యంబు నొందఁగలదని పలుకుచునే యంతర్హి తుండయ్యెను.