పుట:కాశీమజిలీకథలు-05.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

106

కాశీమజిలీకథలు - ఐదవభాగము


శ్రీ రస్తు

కాశీమజిలీకథలు

51వ మజిలీ

చతుర్థోల్లాసము

అట్లు శంకరయతిచంద్రం డమరకనృపశరీరంబు బ్రవేశించి తత్కాంతారత్నములతో గంతుక్రీడావిశేషంబు లనుభవించుచున్నంత నియమించినసమయ మతిక్రమించుటయు నచ్చట గొండబిలంబునం గళేబరమును గాచికొనియున్న శిష్యులు విచారముతో నొండొరు లిట్లు సంభాషించుకొనిరి.

పద్మపాదుడు :- అయ్యో! మనయాచార్యుండు నియమించిన యవధి దాటి యైదారు దినములైనది. యిప్పటికిని దనశరీరమున బ్రవేశించి మరల సనాథులం జేయకున్నాడు ఏమి చేయుదము? ఎందు వెదుకుదుము? అతనిజాడ జెప్పువా రెవ్వరు? అన్యశరీరమున నిగూఢుడైన యతని గురుతు పట్టుట యెట్లు?

వామదేవుడు :- పద్మపాద! ఆ తీర్ధపాదుని దర్శనము మనకు వెండియుం గలుగునా?

గుణనిధి - దుర్జనుల యవినయముల బోగొట్టుచు సజ్జునుల సంసారాగ్నిం జల్లార్చునమ్మహాత్ముండు మనల నుపేక్షజేయునా?

హంసుండు - ఓహో సకలదురితంబుల విలయము నొందింపుచు నవనవాహ్లాదముల గలుగజేయు యతీంద్రచరణసేవకన్న మిన్నయగు వ్రత మేమి యున్నది?

చిత్సుఖుడు :- హా! గురువరా! నీవు శీఘ్రముగా రాకపోయితివేని మా శోకమును బోగొట్టువా రెవ్వరు?

చిత్రభానుడు :- మేమెల్ల నిన్ను నమ్మియున్నవారము. అనాథులము. సాధుమతీ! వేగము వచ్చి మ మ్మోదార్పవా?

పద్మపాదుడు :- మిత్రులారా! మీ రూరక చింతించినం బ్రయోజనము లేదు. నే నొకయుపాయంబు వచించెద. వినుడు. మన మీపుడమి నెల్లబర్వతగుహారణ్యములు వెదకి యందు గనఁబడినచో స్వర్గపాతాళముల సైతము వెదకుదము గాక.

చిత్రభానుడు :- మూడులోకములు వెదకినను అన్యశరీరనిగూఢు నతని నెట్లు గ్రహింపగలము?