పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉషస్సుషమ

రంగాజమ్మ

ఉషాపరిణయ పీఠిక

.

ఆంధ్రవాఙ్మయ చరిత్రమున దక్షిణాంధ్రయుగము కాలపరిమితిని (క్రీ. శ. 1600–1775) బట్టి సుదీర్ఘము, కవితాపరిణతిని బట్టి కడు విలక్షణము నైనది. ప్రక్రియావైవిధ్యము, కళావతుల కవితాకేళి, రసికశేఖరు లైన రాజుకవుల పరంపర, శృంగారరసాధిదేవతారంగస్థలములు లలితకళాఫలభూములు నగు వారి యాస్థానములు నా యుగవిశిష్టతలు. అట్టి దక్షిణాంధ్రయుగ సాహిత్యవాహినీ తీరమునందు తీర్థభూతము లైన ఘట్టములు తంజావూరు, మధుర, పుదుక్కోట, మైసూరు సంస్థానములు. అందు, తంజావూ రా విశిష్టతల కెల్ల నెల్ల యైనది. అస లా యుగమున కుగాదిపండుగ జరిగినది తంజావూరిలోనే. నాయకరాజులకోవకు నాయకమణి యైన రఘునాథరాయ లా యుగావిష్కర్త. కాని యంతటి వాని యాస్థానకవయిత్రులు (రామభద్రాంబ, మధురవాణి) నేలకో గీర్వాణముతో నూరకుండిరి గాని యాంధ్రమున గ్రంథరచన గావింపరైరి. తరువాత నాతని కౌరసుఁడు, నంతకంటె సరసుఁడు నైన విజయరాఘవనాయకుని రాజ్యకాలమున (క్రీ. శ. 1633-1673) నాంధ్రగ్రంథరచన చేసిన కవయిత్రు లనేకులు బయలుదేఱిరి. వారిలోఁ బేరుప్రతిష్ఠలు గలవారు పసుపులేటి రంగాజి, రావినూతల కృష్ణాజి. కృష్ణాజి యాంధ్రకవితానిష్ణాత యని వినుకలియే గాని యామె కృతుల కనుకలి యబ్బలేదు.