పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

‘వనమాలి విలాస’ మందలి కథారచనాదివిశేషములు కొంతవఱకైన రుచిచూపుటకై పరిషత్ప్రతియందలి 446 పద్యగద్యములను 160 పద్యగద్యములుగా ఎడనెడ సంక్షిప్తపఱిచి యిందు అనుబంధముగా యిచ్చుట జరిగినది. ఆశ్వాసాంత పద్య గద్యములు మాత్రము యథాతథముగా ముద్రింపఁబడినవి. పద్య గద్యముల క్రమసంఖ్య పరిషత్ప్రతి ననుసరించి కూర్పఁబడినది

పరిషత్కార్యాలయమందలి వనమాలివిలాసప్రతి ఉదయనోదయ ప్రతికి తీసికట్టుగా లేదు. ప్రక్షిప్తభాగములు, స్ఖాలిత్యములు అనన్విత పద్యగద్యములే కాక, పాదములకు పాదములు, పంక్తులకు పంక్తులు పలుతావుల లుప్తములై యున్నవి. ఉదయనోదయ పరిష్కరణ మెంతక్లిష్టమో యిదియు నంతే యయినను యదావకాశము, యథామతి పరిష్కరించి సంక్షిప్తప్రతిని సిద్ధము చేయుట జరిగినది.

రచనాపద్ధతిని బట్టి చూడ ‘వనమాలివిలాసము’ ‘ఉదయనోదయము’ కంటె ముందే వ్రాయఁబడినదని స్పష్టమగును. ‘ఉదయనోదయము’ వంటి పరిణతకావ్యరచనకు వనమాలి విలాసము అభ్యాసరచన మనియు తోఁపకపోదు. కథాకథనమందును వర్ణనవిశేషములందును దాని కనురూపములైన యంశము లనేకములు గలవు. నారదుఁడు సహస్రానీకునొద్దకు వచ్చి, మృగావతిని గూర్చి వర్ణించి చెప్పినట్లే కృష్ణునొద్దకు వచ్చి మిత్రవిందను గూర్చి వర్ణించి చెప్పును. మృగావతికి చిత్రపటములందలి రాకుమారులను నెచ్చెలి వర్ణించి చెప్పినట్లే మిత్రవిందకు స్వయంవర సందర్భమున దాది రాకుమారులను వర్ణించి చెప్పును. కథాసరిత్సాగరమందలి ఉదయనకథ మనసులో మెదలుచుండగా సూరన వనమాలి విలాస రచన చేసియుండు ననిపించును. విరహవర్ణనలో సంకల్పసురతాది వర్ణనలు రెండు కావ్యములందును పరమ సాదృశ్యము వహించుచున్నవి. సులక్షణమైన ‘ఉదయనోదయ’ ప్రబంధ రచనకు అభ్యాసరూపమైన కవితా రచన ‘వనమాలి విలాసము’లో కొట్టవచ్చినట్లు కన్పట్టుచున్నది. కవి మానసిక పరిణామక్రమము తెలిసికొనుటకు రెండు రచనలను పరిశీలించుట యావశ్యకమగునని ఈ ‘వనమాలి విలాస’ సంక్షిప్తప్రతి అనుబంధములో చేర్పఁబడినది.

సూరన ఈ కృతిని కొండూరి అక్కయ దండనాథున కంకిత మిచ్చెనని ఆశ్వాసాద్యంతపద్యములవలన తెలియుచున్నది. ఇతఁడు ఎల్లమాంబకు పుత్రుఁడనియు ఐతమాంబకు భర్తయనియు, మీఁదుమిక్కిలి సోమయాజి యనియు తెలియుచున్నది.

ఈ అక్కయదండనాథుని గూర్చిన చారిత్రకవిశేషములు అన్వేషిపఁదగియున్నవి.