పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/354

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముందుమాట



ఆంధ్రసాహిత్య పరిషత్కార్యాలయమున ‘వనమాలి విలాసము’ యొక్క అసమగ్రమగు వ్రాతిప్రతి యొకటి కలదు (సంఖ్య 158/20) ఇందలి తొలిపుటలో “శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారి తాటియాకు ప్రతినిఁ జూచి పరిషద్భాండాగారమునకై వ్రాయఁబడినది” అని అప్పటి పరిషత్పండితులగు శ్రీ చిలుకూరి పాపయ్యశాస్త్రిగారి సంతకముతోఁ గూడిన వివరణము కలదు.

ఈ ప్రతియందు గద్య పద్యములు మొత్తము 446 కలవు. ప్రథమాశ్వాసమున అవతారికా కథాప్రారంభములకు సంబంధించిన గ్రంథభాగము లేదు. ఇందు భీష్మకనృపాలుఁడు తన కొమార్తయగు రుక్మిణికి స్వయంవరము చాటించె ననియు, రుక్మిణి వాసుదేవునిపై మాత్రమే వలపు నిలిపియున్న దనియు ఏకాంతముగ నొక్క తన్వంగి వాసుదేవునకు శుభవార్త నివేదించును. వాసుదేవుఁడు రుక్మిణిపై వలవంతగొని వేగుచుండ ఆ వేడిమి చల్లార్చుటకై నారదుఁడు విచ్చేయును. ఇది ప్రథమాశ్వాస మందలి కథాభాగము.

కృష్ణునకు రుక్మిణిమీఁది వలవంత వేడిమి యట్లే యుండఁగా దానిని చల్లార్చుటకు బదులు నారదుఁడు వేఱొక క్రొత్తవేడిమి దరికొల్పెను. అది మిత్రవింద మీఁది వలపు. అవంతిదేశ ప్రభువగు విందుని చెల్లెలు మిత్రవింద. ఆమెయు కృష్ణుని మీఁదనే మనసు నిల్పియున్నది. దుర్యోధన మిత్రుఁడగు విందుఁడు అందుకు ప్రతికూలుఁడై అనేకరాజుల చిత్రపటములు వ్రాయించి వారిలో నెవ్వరినేని వరింపుమని కోరఁగా నామె వడవడ వణఁకి పోవును. నారదు నుపదేశానుసారము కృష్ణుఁడు మిత్రవింద యొద్దకు మందారమాలికయను నర్మసఖిని పంపును. వలపు రాయబారము ముగించుకొని వచ్చి, యామె మిత్రవింద కృష్ణునిపై నెంత విరాళిగొని యున్నదో వివరించి, తత్స్వయంవరము జరుగుచున్న వార్తయు నివేదించును — ఇది ద్వితీయ తృతీయ చతుర్థాశ్వాసము లందలి కథాభాగము. చతుర్థాశ్వాసము అసమగ్రము.

కావ్యనామము ‘వనమాలివిలాసము’ కనుక రుక్మిణి మిత్రవిందల వృత్తాంతములే కాక తక్కిన నాయికల వృత్తాంతములు కూడ పంచమాద్యాశ్వాసములలో నుండునేమో! విజయవిలాసాదులగు గ్రంథనామములు వనమాలివిలాసము వంటివే.