93. సామాజిక ఆస్తులైన గ్రామీణ సచివాలయాలు వై.ఎస్.ఆర్. క్లినిక్ లతోపాటు ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, విమానాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్లు మరియు 17 కొత్త వైద్య కళాశాలలలో కీలక మౌలిక సదుపాయలను అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం వ్యూహాత్మక పెట్టుబడులను పెట్టడం జరుగుతోంది. తద్వారా రాష్ట్ర ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి.
94. ఆరోగ్యం, విద్య మరియు గృహ రంగము వంటి సామాజిక మౌలిక సదుపాయాలను, నైపుణ్యం కలిగిన మానవశక్తిని, డిజిటల్ పరిజ్ఞానంతో మేళవించటము వలన గరిష్ట స్థాయిలో పెట్టుబడులు మరియు ఉద్యోగ కల్పనను సాధించవచ్చు. ఇది మన రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తూ స్థిరమైన పారిశ్రామిక అభివృద్ధి వైపు నడిపిస్తుంది.
ఓడరేవులు మరియు విమానాశ్రయాలు
సింగపూర్ జాతిపితగా ప్రసిద్ధిగాంచిన లీ క్వాన్ యూ గారి మాటలలో...
“ఒక దేశం యొక్క గొప్పదనం దాని పరిమాణంతో మాత్రమే కాదు.
ఆ దేశ ప్రజల సంకల్పం, ఐక్యత, సత్తువ, క్రమశిక్షణ మరియు
పటిష్టమైన నాయకత్వం ఆ దేశాన్ని చరిత్రలో
గౌరవనీయమైన స్థానంలో నిలుపుతుంది.”
95. మా ప్రభుత్వం 20 వేల కోట్ల రూపాయల వ్యయంతో నాలుగు పర్యావరణహిత ఓడరేవులను, రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడలలో నిర్మించటం జరిగింది. వీటి ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి 110 MTPA అదనపు సామర్థ్యం సృష్టించటం ద్వారా, దాదాపు 75 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
96. మా ప్రభుత్వం 3,800 కోట్ల రూపాయల వ్యయంతో పది ఫిషింగ్ హార్బర్లను జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, బుడగట్లపాలెం, కొత్తపట్నం, ఓడరేవు, బియ్యపుతిప్ప మరియు మచిలీపట్నంలలో నిర్మిస్తోంది. వీటి ద్వారా 9 వేల కోట్ల రూపాయల స్థూల విలువ గల 4 లక్షల 50 వేల టన్నుల చేపలు మరియు రొయ్యల వేట ద్వారా లక్ష మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి.
25