పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగం 2024-25.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74. కుటుంబంలో సంపాదించే కుటుంబ పెద్ద దురదృష్టవశాత్తు మరణిస్తే, ఆ పేద కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశ్యముతో గౌరవ ముఖ్యమంత్రి గారు వై.ఎస్.ఆర్. బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకము క్రింద 2022-23 ఆర్థిక సంవత్సరము నుండి ఇప్పటి వరకు సహజ మరణం పొందిన 45,000 కుటుంబాలు, ప్రమాదవశాత్తు మరణించిన 4,000 కంటే ఎక్కువ కుటుంబాలకు 650 కోట్ల రూపాయల సహకారం అందింది.

75. కాపు, కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, ఆర్య వైశ్య, క్షత్రియ కులాలలో ఆర్థికముగా వెనుకబడిన వారి సర్వతోముఖాభివృద్ధిపై దృష్టి సారించేందుకు, మా ప్రభుత్వం ఈ వర్గాల వారి సంక్షేమానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ శాఖ క్రింద 2019-2024 సంవత్సరాల మధ్య కాలములో 1 కోటి 15 లక్షల మంది లబ్ధిదారులకు 36,321 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది.

76. వై.ఎస్.ఆర్. కళ్యాణమస్తు మరియు వై.ఎస్.ఆర్. షాదీ తోఫా పథకాల క్రింద షెడ్యూలు కులాల, షెడ్యూలు తెగల, వెనుకబడిన తరగతుల, వికలాంగులు మరియు ముస్లింలకు చెందిన 46,329 మంది లబ్ధిదారులకు 350 కోట్ల రూపాయలకు పైగా పంపిణీ చేశాము.

77. వై.ఎస్.ఆర్. ఇ.బి.సీ. నేస్తం పథకం క్రింద అగ్ర కులాలలో ఆర్థికముగా వెనుకబడిన రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలము మొదలైన ఓసీ వర్గాలలోని ఆర్థికంగా వెనుకబడిన 4 లక్షల 39 వేల మంది మహిళలకు 1,257 కోట్ల రూపాయలను పంపిణీ చేయటం జరిగింది.

78. వై.ఎస్.ఆర్. కాపు నేస్తం క్రింద కాపు, బలిజ, తెలగ, ఒంటరి సామాజిక వర్గాలకు చెందిన 3 లక్షల 57 వేల మంది మహిళలకు 2,029 కోట్ల రూపాయలను పంపిణీ చేశాము. కాపు సామాజిక వర్గ సంక్షేమానికి, మా ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రత్యక్ష నగదు బదిలీ మరియు ఇతర పథకాల ద్వారా 77 లక్షల మందికి 39,247 కోట్ల రూపాయలను బదిలీ చేసింది.

21