పుట:అహల్యాసంక్రందనము.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

——

మహాకవి రవీంద్రుడు, అహల్య శాపకథాకథనంలో, సుప్తభారత దేవీమూర్తికి, ప్రబోధగీతం ఆలాపించాడు. ఆయనరచనను, వివరణగా విస్తరించుకుని, ఇలా భావమును వ్యాఖ్యానించుకున్న సమాలోచనలలో, శాపాహతికి ప్రణయారంభాన్ని ఆహుతి యిచ్చుకున్న పాపరాశికి, స్మరణమాత్రాన పాపపరిహారం చేసే దివ్యప్రభావం, పాతివ్రత్యబలంచేత దక్కించుకున్న పుణ్యమూర్తులతో జతకలిపి, పంచకన్యలలో ఒకదాన్నిగా గౌరవించిన, పురాణమునుల భావ ఔదార్యం, భావనా-ఔచిత్యం, విస్పష్ట మౌతుంది.

వంకలు మిగిలిపోని అందాలకు నూతనములైన చందములలో అవయవసారూప్యసహయోగానికి అయి, సాఫల్యం ప్రసాదించి వైదీకవిజ్ఞానాన్ని అన్వర్ధమయిపోయేటట్టు నిలుపుకున్న పుత్రికాపతి, మనసార కన్న సంతానం, కానక కానక, కనిన మోహనమూర్తికి వశం అయిపోయిన నిరంతరప్రణయయోగరూఢిని కాని, కామ-సామగానం, ఉదాత్తధోరణీముఖరితముగా ఉద్గీథ - ప్రణయప్రణవోపాంశువు కాలేకుండా ఉండేది.

అహల్య మధురప్రణయమధుమోహిని. ఆమెకు మనసైన పొలయలుకల కలిమినంతా, కావ్యకన్యకు సింగారపు మురిపెములు అందగించడానికి, రాసిక్యపణంతో విలుచుకున్న మధురనాయకుడి కృతి, మధురకృతులకు నాయకమే అని కావ్యానందులు అంగీకరించి తీరవలసింది.

రామకృష్ణశాస్త్రి