పుట:అహల్యాసంక్రందనము.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనురాగవిలాసభావనలు నురుగులతరగలై యావనపూర్ణవికాసంలో మానసాంబుధిని అల్లకల్లోలం చేయడానికి తలపడిన పారవశ్యవేళల్లో, కలాచైతన్యంతో అందాలమెరుపులు స్పందించే నీ తరుణజీవనం, శాపంతో, జడమైపోయి, లాస్యము పేరుకుపోయిన చాపరాయిగా అయిపోయిందే! ఆనందజ్వాలామాలికలు, పాషాణశీతలత్వానికి దిగిపోయినవే.

గౌతమముని కోపతాపం విసురుతో, ఆదిమూర్తి అయిన క్షమాదేవి, ఓదార్పు కౌగిలింతలోకి నీవు చేరుకొని, కళంకలేశాన్ని, సర్వమూ పునీతంచేసే మృత్తికాస్నానంతో, గోటమీటేశావు. నీకు సంక్రమించిన దోషము, శాంతమూర్తి అయిన ముని హృదయకమలంలో, నీవు నేరక చేసిన తప్పిదంతో, ఔర్వాంగారాలని రగుల్పడమే. కాని, ఆతని అనుగ్రహంలో, ఆగ్రహానికి కూడా సవ్యమైన వినియోగం కలిగించేనేర్పు, తనశాంతిలో, నీకు శాంత - స్థిరావాసం - మోక్షఫలంగా ప్రసాదించడంలోనే కనిపించడం లేదా?

పతి ఈర్షాతపంలో, యౌవనవైభవ-జీవితకుసుమాలు వాడి రాలిపోయినవి, కాని, అంకురఫలితంకోసం బీజరూపములుగా, వృంతాలు వీడిపడి, నవనవోదయప్రాభవం దక్కించుకున్న పరువం వానికి ఉన్నందువల్ల, నీవు రత్నగర్భలో మరుగుపడి ఉన్నంతకాలమైనా, విశ్వలోచనులైన కవుల మాననసీమలను విడనాడలేక పోయినావు.