పుట:అహల్యాసంక్రందనము.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అహల్యాసంక్రందనము

వేంకటకృష్ణప్పనాయకుని రచనల్లో ఉత్తమమైనది. ఆశ్రయమిచ్చి, ఆంధ్రవాణీవిలాసములను అంత అలజడిరోజులలోనూ వన్నె తరగకుండా కాపాడుకుంటూ వచ్చిన ప్రభువుల మనసు వచనకావ్యముల మీదికి మరలినప్పటికిన్నీ, రాచబాటనే, కావ్యనిర్మాణం విషయాల్లో, అనుచరులు అనుసరించవలసిఉన్నప్పటికిన్నీ, నిరంకుశత్వం పరిపాలనలోనేకాని, కావ్యాలాపాలమీదికి మహారాజులు దుమికించనందువల్ల, కవులకు, తామేర్చి కూర్చిన కుసుమాలతో, తమ మనసుకు నచ్చేరీతుల్లో మాలలల్లి కావ్యకన్యకు నేపథ్యశృంగారపు అందాలు దిద్దడానికి వీలైంది. ఆశ్రయుడైన రసికమూర్తి వచనకావ్యములు కృతులందుతూ, కృతులుగా నిర్మించుతూ ఉంటే ఆశ్రితుడై ఆతనిచేత బహువిధముల సన్మానింపబడుతూ ఉన్న కవి-సేనాని, పద్యప్రబంధాలు భగవదర్పణ చేసి ప్రశంసలందుతూండటం కలిగింది. రాజు తలచుకొంటే, రక్తిరహదారులనే ముక్తిమార్గాలుగా మార్చగలుగుతాడుకదా!

ఇతివృత్తము, ప్రఖ్యాతంగా ఉన్నదానినే, ప్రఖ్యాతిలో, ప్రామాణికములుగా ఉన్నగ్రంథాలలోంచి సంగ్రహించుకొని, కల్పనలలో, కథాగమనచాతుర్యంలో, మాత్రం తమపనితనం చూపించడం ప్రబంధకవులలో చాలవరకు పరిపాటిగా వస్తూఉన్నది. వేంకటకృష్ణుడు తెనుగునాటను తెనుగుమీరిపోయి అన్నిమూలలా అల్లుకుపోయిన పురాణగాథను తీసుకుని, ఏదృశ్యానికి ఆదృశ్యం చదువరులకు కళ్ల యెదుట మెరసేలాగా, అన్నిదృశ్యాలూ కలసి ఏకచిత్రంగా చమకితమయే జాణతనపు ఔచిత్యం ఈప్రబంధము రచనలో ప్రదర్శించాడు. అందువల్లనే రసప్రవాహంలో, శాస్త్రరీత్యా గమనానికి ఎప్పటికప్పుడు అడ్డుతగులుతూండవలసిన విస్తరవర్ణనలు, విప్రలంభోపాలంభఉపన్యాసాలు, గాలించినా ఇక్కడ కానరావు. మామూలు మహాప్రబంధాలు, మోడులు కిక్కిరిసి దొర్లుకు వచ్చేనదులవరదలు అయితే, అహల్యాసంక్రందనం, గాలికి చెదరి రాలే కొండపూవులను అలలమీద తేలికగా తేల్చిమోసుకుంటూ, అలసగమనంతో పరవళ్లుపోయే సెలయేరు. తిక్కనను మించిపోయింది ఈతని 'దర్శకత్వం.'