ఎప్పుడూ పొంచి ఉంటుంది. లిపి లేని జనజాతుల భాషలు తమ ప్రాంతంలో అధికారికంగా చెలామణి అయ్యే పెద్ద భాష లిపిని తమ వాజ్బయం భద్రపరిచేందుకు వాడుకుంటాయి. ఒకే లిపిలో ఉన్నప్పుడు పెద్ద భాషలోని పదాలతో పాటు, భావాలు కూడా చిన్న భాషలోకి చొరబడి ఆ చిన్న భాషను పెద్ద భాషకు ఒక యానగానో, మాండలికంగానో కనిపించేలా చేసి, ఆఖరున ఆ చిన్న భాష మాట్లాడే వారందరూ పెద్ద భాష మాట్లాడే వారిగా రెండు మూడు తరాల్లో జరిగిపోవటం చూస్తూ ఉన్నాం.
ప్రారంభ దశల్లో చిన్న భాష-పెద్ద భాష మథ్య వారధిగా ఉండే దుబాసీలు, మిగితా చిన్న భాష మాట్లాడే జనాభాను చిన్నబుచ్చడం, అలా చిన్నంతరం -పెద్దంతరం వచ్చి ఆ భాషను మాట్లాడే ప్రజలకే వాళ్ళ మాతృభాషలు హీనంగా కనిపించడమూ ఉంది. ఈ విధంగా పలు పెద్ద భాషలు చిన్న భాషలను మింగివేయటం మనం చూస్తూనే ఉన్నాం. నేడు కన్నడ, తెలుగు, తమిళం మాట్లాడే వారెందరో రెండు-మూడు తరాలకు ముందు వారి జనజాతి భాష మాట్లాడెవారు. హిందీ భాషీయులుగా గుర్తింపు పొందుతున్న బ్రజ, అవధీ, హర్యాణవీ, కనౌజీ, బుందేలీ, ఛత్తీస్గఢీ, బాఘేలీ, సుర్గుజియా, మగథీ, నాగ్పురీ, కుర్మాలీ, మార్వాడీ, మాల్చీ, ఇలా ఎన్నో వందల భాషల వారు తమ ఇంటి/మాత్చ భాషను నేడు హిందీ భాషకున్న ఎన్నో మాండలికాలు లేదా యాసల్లో తమదొకటి అన్న భావదారిద్యంలో ఉన్నారు.
మన దేశ రాజకీయాలు కూడా ఎదురించి నిలబడిన భాషలకు గౌరవమిస్తూనే, పెద్ద భాషల నీడలో ఉన్న చిన్న భాషలను పెద్ద భాషలతో కలిపేసేలా చట్టాలు రూపొందించారు. ఎనిమిదవ షెడ్యూలుకెక్కని లక్షల జనాభా ఉన్న తుళు లాంటి భాషలు ఈ అసమానతను భరిస్తూ ఉన్నాయి.
ఈశాన్య రాష్ట్రాలలో ఐదు కోట్ల జనాభా జనజాతుల భాషలే మాట్లాడుతున్నారు. విద్య విషయానికి వచ్చేసరికి వారు తమ ప్రాంతపు పెద్ద భాషను అభ్యసించాల్సిందే, వేరే మార్గం లేదు. అలా రెండు-మూడు తరాలకు వారి మాతృభాష ఒక సాంస్కృతిక ప్రతీకగా మిగిలిపోతుందే తప్ప ప్రధాన జనజీవన స్రవంతిలో పెద్ద భాషకే చోటు దక్కేది.
ఈశాన్య రాష్ట్రాల భాషా రాజకీయాలు:
స్వాతంత్య్రం వచ్చినప్పటికి మణిపుర్, త్రిపుర మినహా మిగితా ప్రాంతమంతా అస్సాం రాష్ట్రంగా వ్యవహరింపబడేది. 1953-56 మధ్య జరిగిన భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్విభజన వలన భాషల రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అస్సాంలో ప్రధాన భాష అస్సామీ, కానీ ఇంకెన్నో వందల-వేల భాషలను మాట్లాడే జనాభా ఉంది. కొండలలో, అడవులలో జనజాతుల వారు తమపై రుద్దబడుతున్న అస్సామీ భాషకు విరుద్దంగా, తమ ఇంటిభాషలకు ప్రాధాన్యం దక్కాలని పలు ఉద్యమాలు నడిపారు. శాంతియుతంగా చేసినవి కొన్నైతే, తీవ్ర హింసకు కారణమైనవి కొన్ని అస్సామీ ప్రభుత్వ అస్సామీ భాష రుద్దుడుకు తోడు సరిహద్దు అవతల నుండి బెంగాలీ కాందశీకులు చేరి భాషా అసమానతలను మరింత పెంచారు. బెంగాలీ భాష ఆధివత్యాన్ని తగ్గించేందుకు అస్సామీ భాషను కచ్చితంగా అమలు చేసే చట్టాలు వచ్చాయి. 1960 నాటికి ఈ అస్సామీ భాషా రుద్దుడుపై మరింత ఎక్కువ నిరసనలు బయటపడి, జనజాతుల వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమాలు ఊపందుకున్నాయి. పర్యవసానంగా 1963 లో నాగాలాండ్ నాగా భాషీయుల ప్రాంతంగా, 1970 లో మేఘాలయ ఖాసీ భాష మాట్లాడే ప్రజల రాష్ట్రంగా, 1972 లో మిజోరం మిజో భాష మాట్లాడే ప్రజల రాష్ట్రంగా - రాష్ట్రాలు భాషా ప్రాతిపదికన ఏర్పడ్డాయి. కోక్బొరోక్ భాషను అప్పటి అస్సాం రాష్ట్ర వామపక్ష ప్రభుత్వం రెండవ అధికార భాషగా ప్రకటించినా, లిపి లేని ఆ భాషకు బెంగాలీ లిపిని ఎంచుకుంది. యువత బెంగాలీ లిపికి బదులుగా రోమన్(ఆంగ్ల) లిపిని వాడాలని పట్టుబట్టారు. తక్కువ జనాభా ఉంది, భాషాధారిత అస్తిత్వం కోరుకునే పలు జనజుతుల వారు స్వయంప్రతిపత్తి గల జిల్లా స్థాయి ప్రభుత్వాల కోసం పోరాడారు. అలా మారా, లాయిస్, చక్కా జాతుల వారు మిజోరంలో తమకంటూ ప్రత్వేక గుర్తింపు ఉండాలని ఉద్యమించారు. అదే దీతిలో హ్మార్స్ బ్రూ, పైటె భాషల వారు కూడా స్వయం ప్రతిపత్తి పాలన కోసం పోరాడారు.
మరి భాషలు ముఖ్యంగా ఈశాన్య భారతదేశ భాషలు ఎందుకు కనుమరుగవుతున్నాయి?
1971 తరువాత భారత జనాభా లెక్కల వారు 10,000 అంతకన్నా తక్కువ మాట్లాడే వారున్న జనాభా గల భాషలను “ఇతర” భాషలుగా గుర్తించడం మొదలుపేట్టారు. 2011(ఇటీవల జరిగిన జనాభా లెక్కలు ఇవే) ప్రకారం 121 (ప్రధాన/పెద్ద భాషలు, 270 మాతృభాషలు(చిన్నఉపభాషలు/మాండలికాలు/యాసలు) మన దేశంలో మాట్లాడుతున్నారు. మన దేశంలో రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూలులో గుర్తింపు పొందిన జాబితాలో ఉన్న భాషలు 22 మాత్రమే. ఈశాన్య రాష్ట్రాలలోని జనజుాతుల ప్రజలు ఈ జాబితాలో లేని భాషల ప్రజలే. ఇది ఎంత ఎక్కువ అంటే నాగాలాండ్, మిజోరం, మేఘాలయ రాష్ట్రాలలో జాబితాలో లేని భాషలు మాట్లాడేవారు నూటికి 85 మంది.
అయినా సరే భాషలు అంతరించి పోవటానికి ప్రధాన కారణం, ఆయా భాషలకు ఆర్దిక విలువ లేకపోవటం. ఈశాన్య రాష్ట్రాలలో అభివృద్ది సూచాకాలన్నీ పాతాళంలోనే. అక్కడి జనాభా పొట్ట నింపుకోవడం కోసం వలసలు వెళ్ళిపోతారు, లేదా సంవత్సరంలో కొన్ని నెలలు తమ సొంత ఇంట్లో, మిగతా భాగమంతా భారతదేశంలోని సంపన్న భూభాగంలోని ఫ్యాక్టరీలలో, పరిశ్రమలలో కూలీలుగా పని చేసుకుని బతుకీడుస్తున్నారు. అంటే తమ భాష మాట్లాడని ప్రాంతంలో ఉండి, తమ భాషలను మరిచిపోతున్నారు.