పండ్రెండు రాజుల కథలు/విష్ణువర్ధనమహారాజు కథ

వికీసోర్స్ నుండి

మాడి, రాజముఖి యజ్ఞాతవాసదీక్ష దీర్పుమని ప్రార్థించిరి. రాజ శేఖరుం డందుల కనుమతించి, వసిష్ఠమహర్షికడ సెలవు వేడుకొన నామునిసాధుఁడు రాజశేఖరుని దీవించి, ఆతనికి సమంత్రకంబులగు వివిధాస్త్ర శస్త్రంబులనొసంగి, పురుషాకృతితో నున్న అనంగసేననుగూడ తోడుగా నొసంగి నేపాళ దేశంబున కంపెను. రాజశేఖరుఁడు మునిదత్తంబులగు నాయుధంబుల బలంబువలన, యక్షసైన్యంబుల దైన్యంబునొందించి, ప్రచండ సంగ్రామం బాచరింప, యక్షనాధుఁడు, దీనుఁడై సంధి కిచ్చగించెను. తత్సమయంబునకు వసిష్ఠ నారడు లటకువచ్చి——యక్షేశ్వర రాజశేఖరులకు సంధి యొనరించి, నిజ వృత్తాంతముల నెల్లం దెలిపి, నిజమగు ననంగసేనను, చిత్రసేనను రాజశేఖరునకిచ్చి వివాహం బొనరించుటేకాక, రాజముఖిని యక్షేశ్వర పుత్రుఁడగు చిత్రగ్రీవునకిచ్చి——పెండ్లి చేయించి, యాదినంబు మొదలు, నేపాళ, కాశ్మీర దేశాధీశ్వరులకు మైత్రిగల్గునట్లు సమ్మతింపఁ జేసిరి. రాజశేఖరుం డిరువురు భార్యలతోడను, కాశ్మీర నేపాళ భూములం బాలించుకొనుచు, నప్పుడప్పుడు యక్షలోకంబునకరిగి చెల్లెలిని బావమఱందినిఁ జూచివచ్చుచు, పుత్రపుత్రికా లాభముం గాంచి, బహువర్షంబులు భూతలంబున మహేంద్ర వైభవంబుల ననుభవించెను.


పండ్రెండవనాటి రాత్రికథ

పండ్రెండవనాటి రాత్రి యధావిధంబుగా కృష్ణార్జునులు, యమునాసై'కత భూములం దాసీనులై యున్నతరి, పొర్ధుఁడు గోపాలుం దిలకించి, పండ్రెండవదియగు, నచల పరిపూర్ణతత్త్వ ప్రభావంబు నెఱిఁగింపు మని ప్రార్థించుటయు, నానంద నందనుఁడు, పరమపవిత్రంబగు, విష్ణు వర్ధనమహారాజు చరిత్రంబు నాకర్ణింపుమని యర్జునున కీ క్రిందివిధంబునఁ జెప్పదొడంగెను.

విష్ణువర్ధన మహా రాజు కథ.

ఒకానొక కాలంబునఁ దొల్లి——యుజ్జయినీ నగరంబును ధర్మపాలుం డను రాజు ధర్మపాలుండై పరిపాలించుచు, బహుకాలంబునకు సావిత్రీ వరప్రసాదంబున, సావిత్రి యను కన్యాలలామముం గాంచెను. ఆ కన్యక సమస్త విద్యావిశారద యయ్యును, వివాహంబునొల్లక, యోగినీ వృత్తి దినంబులు గడుపఁ దలఁచియుండ, అందులకు తలిదండ్రులు మిగులఁ జింతించి, యొకనాడు, వీణావతియను నొక వేశ్యను సావిత్రి కడ కంపి శృంగార రసబంధురంబగు గానముం బాడి తచ్చిత్తవృత్తిని మరల్పుమని, నియోగించిరి. వీణావతియుఁ దన చమత్కృతియంతయుఁ దేటపడ శృంగార గీతములం బాడుటయు——సావిత్రి బిట్టలుక రెట్టింప నావీణావతింబరిభవించి దానివీణను తునియలుగా దొక్కి వేసెను. అమూల్యం బును, తనకు జీవన కారణంబును నగు వీణను సావిత్రి భగ్నముచేయుటకా వీణావతి, పెద్దపెట్టున శోకించుచు రాజుతోఁ జెప్పుకొనెను. రాజు దాని నోదార్చి, యావీణకగు మూల్యంబు లిచ్చినను, అట్టివీణ తనకు లభింపదని యావెలకాంత సంతృప్తి నందదయ్యెను. అనంతరము సావిత్రి తానొనరించిన పనికి బశ్చాత్తాపముఁ జెంది——వీణావతం బిలిపించి, క్షమింపఁబ్రార్థించి, తన కంఠమునందలి వెల నిర్ణయింప నసాధ్యమగు నొక రత్నహారమును రహస్యముగా బహుమానమిచ్చి తనరాజ్యమును వదలి యెందేనిం బొమ్మనియెను. అంత నావీణావతి క్రమంబున ననేక దేశంబులు సంచరించుచు నెందైనఁ దన వీణవంటి వీణ లభించునేమో యని విమర్శించుచునే యుండెను. కళింగ దేశాధీశ్వరుని కుమారుఁడగు విష్ణువర్ధనుండనువాఁడు మహా సౌందర్యశాలియు, రసికుఁడును, గాన ప్రియుండును స్వయముగా వీణలం జేయువాఁడును, నని యాలకించి యటకరిగి——అతనివీణనే గైకొని తనగాన నైపుణ్యంబున నాతని మెప్పించి తన చరిత్రమంతయు నాతని కెఱిఁగించి, యావీణనిమ్మని కోరినది. అతఁడు దానిని మెచ్చి యావీణనిచ్చుచు నూరక పరిహాసంబునకు, దీని కేమి వెలయిత్తువనియడుగ, నాబోటి తనకు సావిత్రియిచ్చిన రత్న హారంబు నిత్తు ననిపల్కి——వీణం గైకొని దాని నీయఁబోవ రాజకుమారుఁడు వారించుచు “బోటీ! క్షత్రియుఁడు తనకుఁగల్లెనేని దానము సేయుటకర్జముగాని, వీణలను అమ్ముకొనుట యగౌరము కావున నాకిదివలదు. నీవేగైకొ"మ్మని పల్కెను. కాని, యావీణావతి తొలుతనిచ్చిన దానిని మఱల గైకొన ననుమతింపదయ్యెను. తుదకాతండా రత్న హారమును వెలయిచ్చి కొనెను. కాని, వీణావతి సావిత్రి గుణగణంబులను వర్ణించి చెప్పినప్పటి నుండియు నాతనిహృదయ మా మదవతిపై, గాఢముగఁ దవుల్కొనియెను. అంత నొక్క దినంబున నాతఁ డీ వృత్తాంతము నెవ్వరికిం దెలుపక ,చిత్త స్థైర్యంబుచే యొక వారువంబు నెక్కీ యిల్లువదలి యరణ్యంబులం బడిపోవుచుఁ దుదకు, నారాయణుండను నోక మహర్షియాశ్రమముం గాంచి, తదీయాశ్రమసందర్శనమాత్రంబున, చిత్తంబు వైరాగ్యాయత్తం బగుటయు, నామునీంద్రుని పాదంబుల కెరగి మోక్షమార్గంబు నుపదేశింపుమని ప్రార్థింప, బాల్యావస్థయందున్న యారాజపుత్రుని చిత్తంబు మరల్పం బ్రయత్నించియు నాజడదారి విఫలమనోరధుండై—— "కుమారా! అచల పరిపూర్ణతత్త్వంబు నెఱింగించెద నాకర్ణించి తన్మార్గంబునఁ దరిం పుమని యుపదేశించెను.

విష్ణువర్ధనుం డచలబ్రహ్మంబు నెఱింగి, కొన్ని దినంబులటనుండ, నొకనాడు, నారాయణ మహర్షి యాతనింజీరి, కుమారా! లోకంబునఁ జతుర్విధాశ్రమంబులందును గృహస్థాశ్రమం బత్యుత్తమంబని పెద్దలు చెప్పుదురు. నీవింకను బాలుండవు గాన నీకీయాశ్రమంబీప్రాయంబున, ననుచితంబై యున్నది; నీయిచ్చవచ్చిన కన్యారత్నంబు నేరుకొని గృహ స్థుడవై రాజ్యపాలనంబొనర్చి రాజర్షి యనఁ బేరందు"మని పలుక నా రాజపుత్రుండు తొల్లి తన చిత్తము సావిత్రియందు హత్తిన తెరంగును, ఆబాలిక వ్రతంబునుం దెలుప, నమ్మునికొండొక యుపాయం బాతనికి బోధించి, తన కడనున్న యోగిని నొకతె నాతనికిఁదోడిచ్చి పంపెను.

సావిత్రి వీణావతికి రత్నహారమును, బహుమానముగానిచ్చిన కొన్ని దినంబుల కావల నొకనాడు రాజపత్ని కూతుం జూడవచ్చి, రత్నహారము లేకపోవుటంగాంచి, యందులకుఁ గారణంబడిగి తెలసికొని, మహావిహద భయాక్రాంతచిత్తయై విలపించుచు——"కుమారీ! స్వతంత్రించి ఎంతయవివేక కార్యంబొనరించితివి! ఆ హారము మనకు, కులక్రమాగతముగా వచ్చుచున్నయది. అది యెవ్వరిచేతఁబడునో వారు, ఆఱు నెలలలో నీ రాజ్యముం బాలింతురని యున్నదఁట! కటకటా! నేటి కొక భోగముతొత్తు మన రాజ్యమున కధికారిణి యగును కాఁబోలును! ఇంకేదిదారి?” యని వాపోవసాగెను. క్రమముగా రాజునకీవార్త తెలిసెను. అతం, డతిరయంబున, నావేశ్యం బట్టి తెచ్చుటకు, నలుదిశలకును దూతలనంపి—— పురనికటంబునఁగల శైలంబున నొక ఋషివచ్చి విడిచి యున్నాఁడనియు, నతం డాగతానాగతవేదియనియు విని, యాతని జోస్యమడుగ నటకరిగెను. యతి, యత్యంత తేజశ్ళాలియై కూర్చుండి, యుండెను. రాజాతనికి నమస్కరింప నాశీర్వదించి, యతఁడు వచ్చిన సంగతిం దెలిసికొని, “రాజేంద్రా! భీతిల్లకుము! అనతి కాలముననే, మాతపశ్శక్తి చే——నారత్నహారము, మీనందన కంఠమునకు వచ్చునట్లోనరింప గలవార"మని పలికెను. ధర్మపాలుండమితానందమునంది, యాముని కడ సెలవుంగొని గృహంబునకు వచ్చి యావార్తను భార్యాపుత్రికల కెఱిఁగించెను. యోగులన్నను, సన్యాసులన్నను సహజముగ ప్రీతిగల సావిత్రి యావార్తవిని, యేకాంతమునఁ దన చెలియగు మంజరిం జీరి "సఖీ! నన్ను పెండ్లియాడుమని నాతలిదండ్రులూరక వ్రేపుకొని తినుచున్నారు. నాహృదయ మందుల కనుమతింపకయున్నది. కాంతలకు సంసారమే మోక్షదాయకమో యోగినీవ్రుత్తియే పరలోక సాధకమో, తోపక నాడెందం బాందోళనమందుచున్నయది. గిరి శిఖరంబున వెలసిన ఋషి వార్త తండ్రిగారు చెప్పఁగా, నీవును వింటివిగదా! ఆయన సమర్థుడని తోఁచుచున్నది. అటకరిగి మన సందియముందీర్చుకోందమా?" యని యడుగ, నామెయు వల్లేయని యామఱునాడు వేకువజామున నటకు బయనించి సావిత్రింగొనిపోయెను. గిరికందరమునఁ దొలుత వారికి యోగిని దర్శనంబిచ్చి—— వారు వచ్చిన కార్యంబు నాకర్ణించి, యోగీం ద్రులలో మనవి చేసివత్తునని బయటి మందిరమున వారినునిచి, తాను లోనికరిగి, కొండొకవడికి బయటకువచ్చి “రాజపుత్రీ! నీభాగ్యమసమానమైనది సుమా! స్వాములవారు, సహజముగా, స్త్రీలనిన విరక్తులగు స్వభావముగలవారు. నాచిత్తశుద్ధి నెటీంగినవారగుట నన్నొక్కతెను మాత్రమే, శిష్యురాలిగా, నంగీకరించినారు. నన్నైనను విశేషకాలము దరినుండనీయరు. నూఱు ప్రశ్నలకొక్క యుత్తరమిచ్చుట యసాధ్యము, నీ పురాకృత పుణ్యం బెట్టిదియో కాని, నీ పేరు చెప్పినంతనే, వికశిత ముఖారవిందులై——నీ సద్గుణ సహస్రంబును, చూచినట్లే, పెద్దగాస్తుతించిరి! నీ భాగ్యముపండినది నాతో రమ్మని పలికి, యప్పుడే సావిత్రి నాయతి సన్నిధికిఁ గొనిపోయెను.—— ఆయతి యతిమాత్ర తేజశ్శాలియై—— భూమి నవతరించిన మన్మధుండోయన నొప్పారుచు—— పురుషుల పేరు చెప్పిననేవగించుకొను సావిత్రికి లజ్జావిభ్రమములం గలిగించెను. యోగి యాబాలిక ప్రణామంబులను స్వీకరించి, మెల్లన నామెచేయినెత్తి ముద్దిడి, "రాజకుమారీ! నీజనకుని రత్నహారమును మాతపశ్శక్తిచే దెప్పించితిమి. ఇదే హారము! మఱియొకనాడు నీకొసంగుదముగాక!" యని యాహారము నామెకుఁజూపి, మఱలగైకొని యానాటికా బాలకు సెలవొసంగెను. రత్నహారవక్షణమున, సావిత్రీ మంజరులకా మహాత్ముని యందు, దృఢ విశ్వాసము నాటుకొనెను. మఱునాడు తప్పక తమ సంశయములం, దీర్చుకొనవలయునని, వేఁగుజాముననే సావిత్రియు మంజరియు మఱల గిరిశిఖరంబునకరగి, యోగినికిఁ దమహృదయాభి