తెలుగువారి జానపద కళారూపాలు/శారదకాండ్రు

వికీసోర్స్ నుండి

శారదకాండ్రు

శారదకాండ్రు అనే వారు ఒక్క తెలంగాణాలో తప్పా కోస్తా ఆంధ్రదేశంలోనూ, రాయలసీమలోనూ ఎక్కడా కనిపించరు. అయితే తెలంగాణాలో కూడా ఒక్క వరంగల్ తాలూకా లోనే వీరు ఎక్కువ మంది వున్నారు.

నిజానికి బుర్రకథ వాయిద్యాలకూ, శారద కథకుల వాయిద్యానికీ పెద్ద వ్వత్యాసం ఎమీ కనిపించదు. బుర్రకథలో మాదిరే వీరూ డక్కీలు ఉపయోగిస్తారు. వీరు ఉపయోగించే తంబురానే శారద అంటారు. అందు వల్ల వీరికి శారదకాండ్రు అనే పేరు వచ్చింది.

అసలు వీరెవరు?

మున్నూరు, ముతరాసి మొదలైన తెలుగు కులాల నుంచి పుట్టిన ఒక జాతి ఈ శారదకాండ్రనీ భిక్షక జాతుల్లో వీరే ఎక్కువ మంది వున్నారనీ పూర్వం ఈ జాతికి వారికి ఎటువంటి పేరుండేదో తెలియజెప్ప చారిత్రకాధారాలు ఏమీ లేవనీ, వీరికి పేరు ఇటీవలే వచ్చి వుండ వచ్చుననీ, ముఖ్యంగా జానపద గేయాల్లో శారద పాటలు పాడేవారు. ఈ జాతి వారే పాడుతున్నారనీ, ఇతర జానపద గేయాలలో కంటే, ఈ శారద పాటల్లోనే సాహిత్య ప్రతిభ అధికంగా వుంటుందనీ,

ఓ భారతీ కరుణామతి
భళి శారద కరుణానిధి

అనే వంత పాటలు పాడటం వల్ల, వీరికీ పేరు వచ్చిందేమో తెలియదనీ, డా॥ రామ రాజు గారు, తమ గేయ సాహిత్యంలో ఉదహరించారు.;

శారదంటే:

శారదను భుజంమీద ధరించిన కథకుడు__ ఎడమ చేతి బొటన వ్రేలుకు ఆందెలు ధరించి, భుజంపైన తంబురాను కుడిచేతితో మీటుతాడు. దీనినే వారు శారద అని పిలుస్తారు. శారద అంటే సరస్వతి అనే పేరు సర్వ సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే. అదే పేరును ఈ భిక్షకులు తంబురాకు శారద అనే పేరు పెట్టుకున్నారు. అందువల్లనే వారు కథా ప్రారంభంలో శారదాదేవినే స్తోత్రం చేస్తారు.

పురుషుడు కథ చెపితే అతని భార్వ వంత పాడుతూ డక్కీ కొడుతుంది. ఒకోసారి ఇద్దరే కథ చెపుతారు. అయితే వీరిలో బహు భార్యాత్వం వుండడం వల్ల, ఇద్దరు భార్యలూ, వంతలుగానే వుంటారు. అందువల్లే వీరు ఇద్దరు భార్యలను చేసుకోవడం కూడా కద్దు. వీరి కథల్లో స్త్రీ వంతల్లాగా, జంగం కథల్లో గానీ, బుర్ర కథల్లో గానీ స్త్రీలు వంతలుగా కనిపించరు. శారద కథకులు బహు భార్యాత్వం వల్ల, ఎవరి కుటుంబానికి వారే దళంగా ఏర్పడి జీవిస్తున్నారు.

ఈనాటి సంప్రదాయక శారదకాండ్రు

వివిధ వరుసల్లో జంగం కథలు, బుర్ర కథలు సాగినట్లు, శారద కథలు వుండవు. ఒకే వరుసలో ఆయా ఘట్టాల ననుసరించి, సన్ని వేశాలను పండిస్తూ ఒకే వరుసలో కథను సాగిస్తారు. వీరు శారద వరుసల్లో వున్న పాటల్నే కాక ఎన్నో రకాల కథలు చెపుతారు.

వారు చెప్పే కథలు:

బాలనాగమ్మ ... రాములమ్మ ... ఎరుకల నాంచారి ... చిన్నమ్మ మొదలైన కరుణ రస ప్రపూరితమైన కథలతో పాటు 18 వ శతాబ్దంలో తెలంగాణా ప్రాంతాల్ని దద్దరిల్ల చేసిన సర్వాయి పాపడు కథనూ, అలాగే రెడ్డి వీరులకూ, వెలమ వీరులకూ చెరువు నీళ్ళ తగాదాలో వైరుధ్యాలుపెరిగి ...కొండల్రాయుని తండ్రిని చంపిన వారి మీద పగ తీర్చుకోవడానికి యుద్ధానికి సిద్ధమైన పౌరుషవంతుడైన కొండల్రాయుని సాహసోపేతుడైన వీరుని కథనూ, ఈ కోవకే చెందిన సదాసివ రెడ్డి, రాజా రామేశ్వరరావు...గద్వాల సోమానాద్రి కథనూ, చారిత్రక కథలైన, బొబ్బిలి, పల్నాటి యుద్ధానికి సంబంధించిన, వీరరస గాథల్నీ చెపుతారు.

వీరు వరంగల్లు తాలూకాలో వున్న వెంకటరావులపల్లి చుట్టు ప్రక్కల గ్రామాలలో ఎక్కువ మంది వున్నారు. శారద కాండ్రందరూ శైవ మతానికి సంబంధించిన వారే, వీరు మాంసాహారులైన జంగమ జాతికి చెందిన వారనె ప్రతీతి కూడా వుంది. ఎల్లమ్మ ... పోచమ్మ ___ మొదలైన ప్రసిద్ధ దేవతల్ని దైవాలుగా పూజిస్తారు. వీరికి గురువులు జంగాలే. వీరు శైవ మతానికి సంబంధిన వారైనా లింగాలను ధరించరు.

శారద రామాయణం:

ఇన్నీ చారిత్రిక గాథల్ని వీరరస గాథల్నీ, కరుణరస గాధల్నీ, అద్భుతంగా వాల్మీకి రామాయణాన్ననుసరించి ఒక కవి, పుత్రకామేష్టి నుండి, పాదుకా పట్టాభి షేకం వరకూ, శారద వరుసలకు అనుగుణంగా వ్రాసిన శారద రామాయాణాన్నీ ఎంతోభక్తి శ్రద్ధలతో చెపుతారు...ఇదే కథను, ఆంధ్రదేశంలో పగటి వేషాలు ధరించేవారు. రోజు కొక వేషం చొప్పున రోజుల తరబడి వేషాలు ధరించే పగటి వేషధారులు, శుభ సూచకంగా భక్తి భావంతో, శారద రామాయణాన్ని అలాపించి గ్రామస్తుల వద్ద డబ్బునూ, వస్త్రాలనూ, ధాన్యాన్నీ దానాలుగా సంపాదిస్తారు. అయితే వీరు శారద కాండ్ర వరుసలో ఈ రామాయాణాన్ని చెప్పరు. మూల కథను తీసుకుని క్లుప్తంగా వివరిస్తారు. శారదకాండ్రు ఈ కళా

రూపాన్ని, జోవనోపాధి కోసమే ఉపయోగించుకున్నారు. అయినా ఇదొక చక్కని జానపద బాణీ. రోజు రోజుకీ ఈ కథలకు ఆదరణ తగ్గి పోతూ వుంది.