తెలుగువారి జానపద కళారూపాలు/వీరనాట్యమే వీరుల కొలుపు

వికీసోర్స్ నుండి

వీరనాట్యమే వీరుల కొలుపు

ఆంధ్ర దేశంలో వీరశైవ మతం విరివిగా ప్రచారంలో వున్న రోజుల్లో ఆలయాల్లో శైవమతానికి చెందిన దాసీల నృత్యారాధన చేయటమే కాక, శివభక్తులు తాండవ పద్ధతికి చెందిన వీరావేశాన్ని కలిగించే నాట్యంకూడ చేసేవారని నటరాజ రామకృష్ణ గారు జానపద కళల ప్రత్యేక సంచికలో వివరించారు.

వీరరస ప్రధానలైన రచనలైన ఖడ్గాలను చదువుతూ ఒక చేత ఖడ్గాన్ని, మరొక చేతిలో డాలును ధరించి నాట్యం చేసేవారు. ఈ నాట్యం వీర నాట్యంగా పిలువ బడింది.

వీరు చేసే నర్తనాలన్నిటిలో ఊర్ధ తాండవం అతి ముఖ్యమైంది. ఈ నర్తనాన్ని శివరాత్రి నాడు, రాత్రి పన్నెండు గంటల సమయంలో లింగోద్భవ సమయంలో ప్రదర్శించేవారట. శైవ సంప్రదాయానికి సంబంధించిన అన్ని నృత్యాలలోకి ఈ నృత్యం అతి ముఖ్యమైనదంటారు.

పల్నాటి యుద్ధంలో ప్రాణాలు వదిలిన వీర యోధుల సంస్మరణార్థం వీరుల కొలువులు ప్రారంభమయ్యే ఆరాధన నృత్యాలు కూడ తాండవ పద్ధతికి చెందినట్టివే, కారెంపూడు, గురుజాల, మాచెర్ల మొదలైన పలనాటి ప్రాంతంలో ఈ నర్తనాలు ప్రదర్శింపబడుతూ వున్నాయి.

వీరంగం

వీర నాట్యంలో, వీరణమనే యాయిద్యం వాయించబడుతూ వుంటుంది. అందు వల్లనే ఈ నాట్యానికి వీరంగం అంటారు. ఇందులో ముఖ్యంగా అయిదు అక్షరాల ఖండం ఏకతాళ గతి ఎక్కువగా ప్రదర్శింపబడుతుంది.

తత్తడిక - తడిక
తజ్జనుత - తడిక

వీరుల కొలువులో ముఖ్యంగా వాడబడే వాయిద్యం "పంబజోడు" ఇందులో ముఖ్యంగా "చతురశ్ర గతి" ప్రయోగింపబడుతూ వుంది.

జం జం జం జం
జం త రుం త రుం
జం జం జం జం
తరుం త రుం త రుం .

కాకతీయుల ఆంధ్రదేశాన్ని పరిపాలించిన కాలంలో, వీర శైవమూ అందులోనూ పశుపతి సాంప్రాదాయం విరివిగా ప్రచారంలో వుంది.

ఇంటి కొక వీర పుత్రుడు:

ఆ కాలంలో ప్రతి తల్లీ తండ్రీ తమ యింట పుట్టిన పుత్రుల్లో ఒకణ్ణి వీరునిగా దేశానికి అర్పించే వాడుక వుండేదట. వారినే పశుపతులని కూడా పిలిచేవారు. ఈ వీరులు అవివాహితులై దేశరక్షణ కోసం ప్రాణాలు అర్పించేవారట. వీరు ప్రతి రోజూ ఆరు పర్యాయాలు శివార్చన చేసేవారట.

ఆ పూజల్లో భక్తి భావంతో కూడు కున్న నృత్యం ఒక భాగంగా వుండేదట. ఆ నృత్యాలే వీర నాటాలుగా ప్రచారంలోకి వచ్చాయంటారు రామకృష్ణగారు.

ఈ నృత్యాలలో ఏ రస భావం లేని హస్తపాద విన్యాసాలు మాత్రం ప్రదర్శిత మౌతాయి. శివునిచే ప్రదర్శింపబడిన 108 కరణములు అందుకు తగిన చారి భేదాలు కొన్ని ఈ నర్తనంలో ప్రదర్శింపబడుతూవున్నాయి. అలాగే ఆయా ప్రాంతాల్లో వీర శైవ మతానికి చెందిన వారు. వీర శైవులు వీర భద్ర విన్యాసాలు చేయడం, వీరావేశంతో ఖడ్గాలు చదవడం, ఆవేశంతో నారసాలు పొడుచుకోవడం, వీరావేశంతో తాండవ పద్ధతిలో నృత్యాలు చేయటం పరిపాటి. ఒకో ప్రాంతంలో, ఒకో పేరుతో అవి జరుగుతూ వుంటాయి. అలా కోనసీమలో అమలా పురం ప్రాంతంలో వీర నాట్యం చేయడంలో నిపుణులున్నారు.

తూర్పు గోదావరి జిల్లా కోన సీమలో వీర నాట్యం చేసే కళాకారు లున్నారు. వీర నాట్యానికి ఒక ప్రత్యేకత, జనాకర్షణా వుంది. వీరనాట్యం దేశవ్వాప్తంగా ప్రసిద్ధి చెందింది.

దక్ష ప్రజాపతి:

దక్ష ప్రజాపతి తల పెట్టిన యజ్ఞానికి కన్న కూతురుకీ, అల్లునికీ ఆహ్వానం అందలేదు. పిలవని పేరంటానికి వెళ్ళకూడదని, పరమ శివుడు వారిస్తున్నా పార్వతి ఆ యజ్ఞానికి వెళ్ళి అవమానం పాలై అత్మాహుతి చేసుకుంది. ఆ ఘటనకు ఉగ్రుడైన ముక్కంటి జటాజూటాన్ని నేలకు కొట్టి, అటనుంచి వీరకుమారులతో ప్రయాణ మయ్యాడు. శూలధారుడై ఆగ్రహ జ్వాలలు గ్రక్కుతూ యజ్ఞ వాటికను చిందర వందర చేసిన వీరకుమారుల పదఘట్టనలే నాట్య మైంది. అదే వీరనాట్యం.

వీరముష్టుల, వీర నాట్యం:

ఆంధ్ర దేశంలో వీర ముష్టులు చేసే వీరనాట్యం శైవ సాంప్రదాయానికి అద్దం పడుతుంది. శివాలయాల్లో జరిగే ధూపసేవ సందర్భంగా ఆలయం ముందు నడివీథిలో వీరనాట్య కార్యక్రమాలు జరుగుతూ వుంటాయి. అలాంటి వీర నాట్యాలు అమలాపురం తాలూకా అయిన వల్లి మండలం. వెలవలపల్లికి చెందిన చింతా వెంకటేశ్వర్లు వీరనాట్యం మీద మోజు పెంచుకుని కట్టుదిట్టంగా నేర్చుకుని, దానినొక కళారూపంగా తీర్చి దిద్ది, వీథుల్లో ప్రజల సమక్షంలో ప్రదర్శించి ప్రశంసలందుకున్న ఈ వీర నాట్య కళారూపాన్ని, జాతీయస్థాయిలో ప్రచారం కల్పిచటానికి విశేషమైన కృషి చేశాడు.

అయిదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్న వెంకటేశ్వర్లు ఒక బృందాన్ని తయారు చేసి 1962 నుంచి పలు దేవాలయల ఉత్సవాల్లో ప్రదర్శించాడు. వీరనాట్యం చేసే వారిని వీరకుమారు లంటారు. వీరు మొలకు ఎరుపురంగు గుడ్డలను ధరిస్తారు. కాళ్ళకు గజ్జెలు కట్తి, మెడలోనూ, జబ్బలకు, రుద్రాక్ష మాలలను అలంక రిస్తారు. నుదుట గంభీరంగా విభూతి రేఖలను దిద్దుకుంటారు. చిన్న శూలాలూ, నిలువెత్తుగల పెద్ద శూలాలూ నోటిలో, బుగ్గలకూ, కంఠానికీ ధరిస్తారు. శూలాల చివర నూనెవత్తులు వెలిగిస్తారు. ఆ వెలుగుతో వారు మరింత ఆవేశపరులౌతారు.

వీర కుమారుల విజృంభణ:

ఆ విధంగా పది మంది వీర కుమారులు రౌద్ర రసాన్ని పోషిస్తూ... ఖండ సంకీర్ణంలో విశ్రజతులపై నాట్యం సాగిస్తారు...వీర కుమారుల

నాట్యానికి అనుగుణంగా ...సన్నాయి, డోలు, తంబురా, తాషామార్పాల ధ్వనులు ఉత్తేజాన్ని కలిగిస్తాయి. దక్ష వాటికలో వీర భద్రుని ఆధ్వర్యంలో నాటి వీర కుమారుల విధ్వంసం ఇతి వృత్తంగా సాగే వీరనాట్యం ప్రేక్షకులకు గగుర్పాటును కలిగిస్తుంది. ప్రజలు కూడ వీరావేశంలో మునిగిపోతారు.

వీర నాట్యం ప్రారంభం, చతురస్ర జాతి నడకలో... తకధిమి... తకధిమి, తకఝణు, తకఝణు, స్వరాలతో ప్రారంభమై దక్షయాగం బెరచి...దక్షుని తల ద్రుంచి దక్ష సంహారమై తరలినావు. అనే పదాలతో, శరభా, అశ్శరభా, దశ్శరభా, శరభ, శరభా అనే నినాదాలతో, శూలాలను నాలుకకూ, కంఠాలకూ గుచ్చుకుని భక్తి తన్మయత్వంతో చేసే వీరనాట్యం ప్రజలను పరవశుల్ని చేస్తుంది. అందరూ ఆవేశంతో ఊగి పోతారు.

చింతా వెంకటేశ్వర్లు 1981 లో రాజమండ్రిలో ప్రదర్శనం ఇచ్చి, ప్రముఖుల ప్రశంసలందుకున్నాడు.నాట్యానికి హైదరాబాదులో రెండు మాసాలు నుంచి శిక్షణ ఇచ్చి దానినొక విశిష్ట కళారూపంగా తయారు చేశారు. ఆ తరువాత రాష్ట్ర వ్వాప్తంగా, అన్ని జిల్లాలలోనూ, ఆకాశవాణిలోనూ, అప్నా వుత్సవం లోనూ, ఇతర రాష్ట్రాలలోనూ వెయ్యి

ప్రదర్శనాలకు పైగా ప్రదర్శనలనిచ్చారు. వెంకటేశ్వర్లుకు చదువు లేక పోయినా, పట్టుదలతో వీర నాట్యాన్ని అభివృద్ధి పర్చి, దానికొక మన్నన తీసు కొచ్చారు.