తెలుగువారి జానపద కళారూపాలు/ముకెబర్ల జంగాల బిట్రో నిట్రో పదాలు

వికీసోర్స్ నుండి

ముకెబర్ల జంగాల బిట్రో నిట్రో పదాలు

హైరోసైరో- బిట్రో నిట్రో
జగితగ - బిట్రొ నిట్రో.

అనే మకుటంగా గల బిట్రో నిట్రో పదం కంచు జాగంటపై హృదయాహ్లాదంగా వినిపింప బడుతుంది. ఈ పదాలను పాడేవారు ముకెబర్ల జంగాలూ. ఈ ముకెబర్ల జంగాలనే తెగవారు, కాకతీయ రాజ్య పరిపాలన కాలంలో వారి ఆస్థానంలో వందిమాగదులుగా వున్న శైవులు, ఈ జంగాలు తెలంగాణాలోనూ అటు శ్రీకాకులం జిల్లాలోనూ చెదురు మదురుగా వున్నారని వినికిడి. ముకెబర్ల జంగాలు బిట్రేశ్వ్రరుడు నిట్టేశ్వరీదేవి అనే దేవుళ్ళను ఈ నాటికీ పూజించుకుంటూ వుంటారట. పైన వుదహరించిన దేవుళ్ళ గుళ్ళు ఆంధ్రదేశంలో తాను తిరిగినంత వరకూ ఎక్కడా కనబడ లేదని, పరిశోధకులైన మల్లేల నారాయణగారు ఆంధ్రప్రభలో తెలియచేశారు.

బిట్రేశ్వరుడు, నిట్రేశ్వరి:

బిట్రేశ్వరుడంటే ఈశ్వరుడని, నిట్రేశ్వరి అంటె పార్వతి అని చెపుతారు. ముకెబర్ల జంగాలు, కాని శివ పార్వతులకు శైవ పురాణాల్లోగానీ, ఇతర ఇతిహాసగ్రంథాల్లోగానీ ఎక్కడా బిట్రేశ్వర, నిట్టేశ్వరి పేర్లు వున్న ఉదాహరణలు లేవు. వారు శైవులవడంవల్లా వారి ఇలవేల్పు శివ పార్వతులను స్తుతిస్తూ ఎంతో పసందైన పాటలను పాడుతారు. వారు పాట ప్రారంభించ బోయే ముందు నాందీ ప్రస్తావనగా ఇష్ట దేవతల్ని ఈ విధంగా ప్రార్థన చేస్తారు.

ప్రార్థన, పదం:

ఓ హర హర బిట్రో నిట్రో
అమ్మ బిట్రో - నిట్రోల్లూ బిరబిర వత్తారు
తోడుండు నంతమ్మ నే సెప్పి చాల్లూ.

అని ప్రారంభించి ముకిరెంక దరువు వేస్తూ కంజేగంటల మీద పొడుగైన లావుపాటి పుల్లతో మ్రోగించు తారు. ఇలా మోగించే పుల్ల పేరు- నికోరు పుల్లంటారు. ఇష్టదేవతల ప్రార్థనను ఈ విధంగా ప్రారంభిస్తారు.

కాలర్లలచ్చిదేవి- బజే బజే
కూకర్ల ముచ్చుదేవి - శివో శివో
మోకర్ల బిచ్చాదేవి - హరో హరోం
కాకుల లెచ్చుదేవి - పాండ్రో పాండ్రో
బాకా మూల్గు నేలలోకి - మాకు జగావత్తారు
మమ్ము ముంచి పోతారు.

ఆడ పిల్లలు అత్తవారింటికి త్వరగా వెళ్ళనట్టయితే, పక్క ఇంటి అమ్మలక్కలు ఆ అమ్మాయి దరి జేరి ఈ విధంగా పాడుతారు.

తొలి జంగమేలకే పో, పోవమ్మా
మలి జంగమేలకే రా రా ॥బిట్రో - నిట్రో॥

నెలచెరువు రాకే రారావమ్మా
కోలాకుర్లు రాకే పోపో ॥బిట్రో - నిట్రో॥

మాలాగ నగుచూ రా రావమ్మా
తో తొందరగానే పోపోపో. ॥బిట్రో - నిట్రో॥

ఈ పాటనే రాయలసీమలోని పశువులకాపరులు ఈ విధంగా పాడుతారు.

పశువుల కాపరుల పాటలు:

ఓ, ఓలేటి జంగామయ్యా- బిట్రాయుడు - నిట్రేశ్వరి
కాల్లు గాలు టెండలోన కాపలాగా యాయుచుండే
వులవ దంటు ఉదరపైన ఊగుతూ
వుండినావో ఏమో మొండి గానే జెప్పా?

ఓ, ఒడ్డి కాసు మెంకట్రమణ, బిట్రాయుడు - నిట్రేశ్వరి
దొడ్డి దోలిదొల్లుకుంటు నీవు ఎడ్డినాలు జేస్తుంటే
పడ్డ రామి తెర్వుగానె గడగగా నే జెప్పా?
ఓ అహోబిల నరసింహ - బిట్రాయుడు - నిట్రేశ్వరి

గుహలలోనికి గుల్ల దోలీ- గుండ్లుపైన నిలచేసి
అహిల యహిల మని యంటూ - దరువుతో మూదరేయు
గిహిలకాడ నుంచి వేమో - కేరూతునే జప్పా?
ఓ కోట్ల కొండయ మామ - బిట్రాయుడు - నిట్రేశ్వరి.

కొలిమి కుంట్ల కులికన్నకూ పుట్టారో ॥బిట్రో- నిట్రో॥
మతిపోనీ దుత్తాయితో మా ముగ్గురు

సాల్ సాల్ మనేదాకా:

సాల్ సాల్ మనే దాకా మని గాండ్రు ॥బిట్రో- నిట్రో॥
సంకలోని పిల్లతోటి - సాల్ సాల్ మనే దాకా ॥బిట్రో॥
కొల్లు బారెడైన దాక - కందిరీగ లాంటివాల్లు ॥బిట్రో॥
ఎదిగి దాని ఎత్తే లోగ ఏటేటా ఇరు జతలు ॥బిట్రో॥
పెమ్మికుంట నాగరాజుకూ పుట్టారో ॥బిట్రో॥
తుమ్ము తుమ్మవలను లేని డూడ లాంటి మోటు వాల్లు ॥బిట్రో॥
సాలూకూరి కంబరాయికి పుట్టారో ॥బిట్రో॥

ఎవరైనా అమ్మలక్కలు పోట్లాడుకుంటూ, ఆ తగాదా ఏ విధంగానూ పరిష్కారం కానట్లైతే ఈ దేవుళ్ళను మధ్యవర్తులుగా నిర్ణయించుకుని ఇరుకక్షలవారూ రాజీ పడే వారట. ఆ సందర్భంలో పాడే పాట ఇది. బిట్రో నిట్రో అన్న దేవతల మీద కథ మనకు వివరంగా తెలియకపోయినా సంక్షిప్తంగా ఈ క్రింద వుదహరిస్తాను.

కథ:

బిట్రేశ్వరుడు, నిట్రేశ్వరి దేవిని వెంట బెట్టుకుని శైవ మతంలోని శివ భక్తుల్ని పరీక్షించడానికి భూలోకానికి వెళ్ళారట. అప్పుడు ఒక శైవుడు, తన భార్యను చీకటి తప్పు గావించిందన్న నెపంతో బాగా కొట్టి ఇంటి నుంచి వెల్లగొట్టాడట.

ఆమె వెంటనే తను చేసిన తప్పేమిటో తగిన నిదర్శనాలతో భర్త ఎదుట నిరూపించాలని, తద్వారా భర్త యొక్క మొప్పు పొందాలని దీర్ఘమైన పట్టుదలతో తల గొరిగించుకుని విభూతి రేఖలు, రుద్రాక్ష మూలికలు మెడనిండా ధరించి తెల్లని చీర గట్టి రామేశ్వరమునకు పరుగెత్తి పోయిందట. అక్కడుండే ఆళ్వారులు, లింగాయతులు, ముప్పాళ్ళ జోగుళ్ళు ఆమెను చూచి అస్యహించుకుని ఎగతాళి చేశారట. వెంటనే ఆమె రామేశ్వర దేవాలయంలో వున్న నంది వాహనంకు ఎదుట నిలబడి తన రెండు పాదాలపైన ఒక మట్టి కుండలో బియ్యం పోసి ఈశ్వరునికి నైవేద్యం వండటం ఆరంభించిందట. వెనువెంటనే అక్కడ ఆమె భర్త యైన శ్రీకంఠునికి తల తిరిగే రోగం ప్రారంభమవగా తన భార్యయైన ముక్తాక్షిని వెదుక్కుంటూ రామేశ్వరానికి ప్రయాణం చేసాడట. ఈ లోగా ముక్తాక్షికి బిట్రేశ్వరుడు, నిట్రేశ్వరి కన్నులెదుట సాక్షాత్కరించి తిరిగి యథావిధిగా నీ భర్తను త్రోవలోకి తీసుకుని పసుపు కుంకుమలతో ముత్తైదువుగా వుండి చిర కాలం బ్రత్రికిపోదువుగాక అని వరమిచ్చి పంపించారట. అప్పుడామె నిజ గ్రామమైన చోళపల్లికి వస్తుండగా మార్గమధ్యలో భర్తను కలుసుకోగా, ఆయనకు తలతిప్పే రోగ మటుమాయమైనదట. అంతట శ్రీకంఠుడు బుద్ధి తెచ్చుకుని ఇంటికి వెళ్ళి సుఖంగా కాపురం సాగించారట. తెలుగుదేశంలో ఓరుగంటి కాకతీయుల కాలంలో వీర శైవమతం జోరుగా విజృభిస్తున్న

రోజుల్లో ఇలాంటి కట్టు కథలు ఎన్నో ఉద్భవించాయి. అలాంటి కోవకు చెందినదై యుండవచ్చు ఈ కథ. ఎవరికైనా బిడ్డలు లేక పోతే ఈ దేవతలను కొలిచేటట్లైతే సంతానం కలిగేదట.