తెలుగువారి జానపద కళారూపాలు/నాట్యకళను ఆరాధించిన రెడ్డిరాజులు

వికీసోర్స్ నుండి

నాట్యకళను ఆరాధించిన రెడ్డిరాజులు

కాకతీయ సామ్రాజ్య పతనానంతరం దానిని ఆశ్రయించుకున్న సామంత రాజులు, సేనానాయకులూ, స్వతంత్ర రాజ్యాలను స్థాపించారు. అటువంటి వాటిలో రెడ్డి రాజ్యాలు. వెలమ ప్రభువుల రాజ్యాలు ముఖ్యమైనవి. ఈ కాలంలోనె అటు విజయనగర సామ్రాజ్యం కూడ ఏర్పడింది. వీటిలో రెడ్డి రాజ్యమే ప్రాముఖ్యం వహించింది. రెడ్డి రాజులు ముఖ్యంగా అద్దంకి, కొండవీడు, రాజమహేంద్రవరము, కందుకూరు ప్రాంతాలలో క్రీ.శ. 1324 నుండి దాదాపు 1425 వరకు రాజ్యం చేశారు. వారి రాజ్యం కర్నూలు జిల్లానుండి విశాఖ పట్టణం వరకూ దక్షిణాన నెల్లురువరకూ విస్తరించింది.

కొండవీడు గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి కెక్కిన దుర్గం. దీని చుట్టు కొలత సుమారు ముప్పయి మైళ్ళుంటుంది. పర్వతాగ్రమే రెండున్నర మైళ్ళ వరకూ వుంటుంది. పర్వతాగ్రంలో మొత్తం 50 దుర్గాలవరకూ వున్నాయి. క్రింది భాగంలో వుంది కొండవీడు పట్టణం. ఆనాటి ఆ పట్టణం ఈ నాడు గ్రామంగా వుంది. శత్రుదుర్భేద్యమై చూచేవారికి ఆత్యాశ్చర్యం కలిగించే ఈ దుర్గం కాకతీయాంధ్ర చక్రవర్తుల కాలం నుంచి ముఖ్య రాజధానిగా విరాజిల్లడం వల్ల బహు ప్రాచీనమైనదని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

రెడ్డిప్రభువుల దొడ్డతనం:

కాకతీయ సామ్రాజ్యంలో చివరివాడైన ప్రతాప రుద్రుని దగ్గర కోమటి ప్రోలయ రెడ్డి సేనానిగా వుండి మొట్టమొదటగా రెడ్డి సామ్రాజ్యాన్ని స్థాపించి, అద్దంకిని రాజధానిగా చేసుకుని 1324 లో రాజ్యాన్ని పరిపాలించాడు.

ఆయన తరువాత రాజ్యానికి వచ్చిన వాడు ప్రోలయ వేమారెడ్డి. ఈయన చాల పరాక్రమం కలవాడు. పండితుల్నీ, కవుల్నీ, సన్మానించే వాడు. ఒంగోలు తాలూకా లోని చెదలవాడ వాస్తవ్వుడైన ఎర్రాప్రెగడ మహాకవి తన ఆస్తానంలో వుంచు కుని ఆదరించాడు. ఈ విధంగా ఆయన క్రీ.శ. 1350 వరకూ అజేయంగా పరిపాలించాడు.

ఆయన తరువాత క్రీ.శ.1366 లో ఆనపోతారెడ్డి రాజ్యానికి వచ్చి, పదహారు సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన చాల శాసనాలు వ్రాయించాడు. బ్రాహ్మణులకు అనేక దానాలు చేసాడు. ఈయన తరువాతి రాజ్యాని కొచ్చిన వారు ఆయన కుమారుడు కుమారగిరి రెడ్డి. క్లుప్తంగా ఇదీ రెడ్డి రాజుల చరిత్ర.

రెడ్డిరాజుల కాలంలో సామాన్య జనులు దొమ్మరి సానుల ప్రదర్శనాలను, వీథి భాగవతాలను చూసి ఆనందించారు. సాతానులు ఏక తారలను చేత ధరించి శ్రావ్యంగా పాటలు పాడుతూ గ్రామాల్లో ప్రతినిత్యమూ యాచిస్తూ వుండేవారు.

ఆనాటి ఆటపాటలు:

ఆంధ్రరెడ్డిరాజుల యుగంలో అనేక వినోదాలు అభివృద్ధి పొందాయి. వాటిలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించేవి ఆటలు, పాటలు, నాటకాలు.

ప్రజలు నాటకాలంటే ఎంతో అభిమానంతో వుండేవారు. ఎన్నో నాటాకాలు ప్రదర్శించేవారు. కాని ఒక్క నాటకంకూడ సంస్కృత మర్యాదలతో తెలుగులో వ్రాయబడలేదు. ఆనాడు వుద్దండులైన పెద్ద పెద్ద కవులు కూడా ఎక్కువగా యక్షగానాలనే రచించారు. అనాటికి ఉత్తర హిందూస్థాన మంతటా సంస్కృత నాటకాల ప్రభావం బహుముఖాల విజృంబించింది. నన్నయకంటే పూర్వమే దేశికవితా యుక్తమైన పాటల నాటకాలుగా యక్షగానాలు అభివృద్ధి పొందాయి. యక్షగానాల పుట్టు పూర్వోత్తరాలను గురించి మరోచోట ప్రస్తావించినా ఇక్కడ ఈ యుగంలోనూ వాటిని గురించి ఉదహరించడం అవసరమే.

జక్కుల పురంధ్రీకులు:

తెలుగు దేశంలో కామేశ్వర్యాది శక్తిదేవతలను గొలుచు జక్కులవారనే జాతివారుండే వారు. వీరినే అనేక మంది మన ప్రాచీన కవులు తమ గ్రంథాలలో జక్కుల పురంద్రీకులు అని వర్ణిస్తూ వచ్చారు. ఈ జక్కుల వారినే యక్షులుగా వర్ణించారు. కాల క్రమేణా స్త్రీ పాత్రలు ధరించి అఖండమైన పేరు ప్రతిష్టలు తీసుకున్నారు. ఆనాటి యక్షగానాలలో నాగ, అనే స్త్రీ స్త్రీపాత్రలు ధరించి అఖండమైన పేరు ప్రతిష్టలు సంపాదించింది.

పెండెలనాగి:

అగ్రవర్ణపు స్త్రీ గాక తక్కువ జాతి స్త్రీ కావడం వల్ల నాగి అనే పేరు వచ్చింది. పెండెల నాగీ ప్రదర్శించిన పాత్రలలో ముఖ్యమైనది క్రీడాభిరామంలోని స్త్రీ పాత్ర. క్రీడాభిరామం ఆనాటి వీథినాటకాల్లో ముఖ్యమైంది.

ఆ రోజుల్లో పిచ్చుకుంటులవారు శ్రీనాథుడు రచించిన పల్నాటి వీర చరిత్రను, కాటమరాజు కథను గొల్లవారు, యల్లమ్మ కథను బవనివాండ్రు చెపుతూ ఉండేవారు. ఇలా ఆయా కులాలకు చెందిన వారు వారి వారికి ప్రియమైన కథల్ని చెప్పుతుంటూ వుండేవారు.

పైన వుదాహరించిన యల్లమ్మ కథనే బవని వారు రేణుక కథగా చెప్పేవారు. దీనిని విపులంగా, ఇకే కథను రెండు రాత్రుళ్ళపాటు జవనిక (ఈనాటి జముకు) వాయిస్తూ చెపుతూ వుండేవారు. వేరే పెద్ద దేవర కథను రాయలసీమ జిల్లాలలో చెపుతూ వుండేవారు.

కర్ణానందమైన కామేశ్వరి కథ:

ఆ రోజులలో అగ్రవర్ణులైన బ్రాహ్మణుల ఇండ్లలో కామేశ్వరి కథను ఎంతో ప్రసిద్ధంగా చెప్పుకుంటూ వుండే వాళ్ళు. కథను ఉదయం ప్రారంబించి సాయంత్రం వరకు చెపుతూ వుండేవారట. ఇరుగు, పొరుగు అమ్మ లక్కలందరూ, ఇండ్లలో పని పాటలు ముగించుకుని సాయంత్రం వరకూ ఈ కామేశ్వరీ కథను కర్ణానందంగా వినేవారు. అందుకే 'అక్కలు లేచేవరకు నక్కలు కూసె' అనే సామెత వచ్చింది. ఈ కామేశ్వరి కథ ప్రథమంలో బ్రాహ్మణ స్త్రీల ద్వారానే ప్రచారంలోకి వచ్చినా క్రమానుగతంగా ఇతర జాతి స్త్రీలలోకి కూడ వ్వాపించి ఇంకా ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది. ఈ కథ ఆంధ్ర దేశంలో గుంటూరు, కృష్ణా జిల్లాలలో బాగా వ్యాపించింది. ఈ కామేశ్వరి కథను జక్కులవారు కూడ బహుళ ప్రచారంలోకి తెచ్చారని క్రీడాభిరామంలో వుదహరించారు.

కామేశ్వరీ కథే కామవల్లీ కథ:

పైన ఉదహరించిన కామేశ్వరి కథే క్రమానుగతంగా కామవల్లి కథగా పరిమాణం చెందింది. దీనిని మోటతోలేవారు, కలుపుతీసేవారు, కోతలు కోసేవారు, వడ్లు దంచేవారు, తిరుగళ్ళమీద పిండి విసిరే వారూ ఎక్కువగా పాడుకునేవారు. ఆ విధంగా వారు కాలాన్ని వెళ్ళబుచ్చుతూ, కష్టాన్ని, అలసటనీ మరచిపోయి ఆనందంగానూ, ఆహ్లాదంగాను ఆయా పనులు పూర్తి చేసుకునేవారు.

గొండ్లియాడే కుండలాకార నృత్యం:

పూర్వంనుంచీ కవిత్వంలోను, సంగీతంలోను, దేశివిధానం, మార్గ విధానం అనే రెండు భిన్న రీతులు ఏర్పడి వున్నట్లు తెలుసుకున్నాం. అందులో దేశి నృత్యాలే ప్రజలకు ఆతి సన్నిహితంగా వ్యాప్తిలోకి వచ్చాయి. పురుషులు కోలాటం వేస్తూ, చిరతలు మ్రోగిస్తూ, చిందులు త్రొక్కుతూ నోటితో పాటలు పాడేవారు. అలాగే స్త్రీలు వలయాకారంగా చప్పట్లు చరుస్తూ బతకమ్మ పాటలు పాడేవారు. ఈ బతకమ్మ పాటలు ఆనాడే, తెలంగాణాలో విశేష ప్రచారంలో వున్నాయి.

అదే విధంగా రాయలసీమలో బొడ్డెమ్మ కథ ప్రచారంలో వుండేది. గొండ్లి అనే కుండలాకార నృత్యంద్వారా బతకమ్మ, బొడ్డెమ్మ పాటల్ని తెలంగాణాలో వున్న మైలార దేవుని పూజల సమయంలో పాడుతూ ప్రజ్ఞలను తెలియజేసేవాళ్ళు.

కుమారగిరి రెడ్డే కర్పూర వసంతరాయలు:

రెడ్డిరాజులలో చివరిరాజు కుమారగిరిరెడ్డి. ఈయన క్రీ.శ. 1386 నుండి 1402 వరకూ - కొండవీడు రాజధానిగా - ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రసిక ప్రభువు. ఈయనకు ధర్మ వేముడని పిలిచేవారు. ఈయన కవుల కవిత్వాన్ని మెచ్చి అనేక పారితోషికాలు బహూకరించేవారు. కుమారగిరికి వసంత రాయలని, కర్పూర వసంత రాయలని రెండు బిరుదులుండేవి. కుమారగిరి స్వయంగా పండితుడు, సంగీత నాట్య శాస్త్రాల్లో ప్రవీణుడు. వసంత రాజీయం అనే నాట్య శాస్త్ర గ్రంథం వ్రాసినట్లు కూడ కాటమ వేమారెడ్డి రచించిన శాకుంతల వాఖ్యవల్ల తెలుస్తూ వుంది.

మునీనాం భరతాదీనా భోజాదీనాంచ భూభూజాం
శాస్త్రాణి సమ్య గాలోచ్య నాట్య వేదార్థవేవదినా
ప్రోక్తం వసంతరాజేని కుమారగిరి భూభుజా
నామ్నా వసంతరాజీయ నాట్యశాస్త్రం యదుత్తమం.

ఈ వసంత రారాజీయం మనకు ఇంతవరకూ లాభించలేదు. ఈయన ప్రతి సంవత్సరం వసంతోత్సవాలు వాసిగా జరిపిస్తూ వుండేవాడు.

వాసిగాంచిన వసంతోత్సవాలు:

విజయనగర సామ్రాజ్యంలో, కృష్ణదేవరాయల కాలంలో, రాజధానిలో మహార్నవమి రోజున వసంత మండపంలో వసంతోత్సవాలు ఎంతటి మహా వైభవంతో జరిగేవో అలాగే వేమారెడ్డి ఆస్థానంలో కూడ జరిగేవి. ఈ సమయంలో రాజ్యం నాలుగు ప్రక్కలనుంచీ కవుల్నీ, గాయకుల్నీ , వాద్యకారుల్నీ ఆహ్వానించి, మహా వైభవంగా వసంతోత్సవం ముగించే వారు. అందుకే ఆయనకు వసంతరాయ, కర్పూర వసంతరాయ బిరుదు లీయబడ్డాయి.

ప్రతిభకు పట్టాభిషేకం, పలు దానాలు:

సంగీత సాహిత్యాలతో వినోదించే వేమారెడ్డి ప్రతిభావంతులైన కళాకారులందర్నీ తగు విధంగా సన్మానిచాడు. సంగీత సాహిత్యాల్లోనూ, భరత నాట్య శాస్త్రంలోనూ ప్రావీణ్యం కలిగిన కంచి, పొన్న , పేరి మొదలైన వారిని సన్మానించిందే కాక పేరి అనే నర్తకికి గుంటూరు జిల్లాలో వున్న పేరుకలపూడి అనే గ్రామం గ్రామాన్నే దానంగా ఇచ్చాడు.

అలాగె కంచి అనే దేవదాసిక -నాట్యగత్తెకు- కంచికచర్ల అనే గ్రామాన్ని బహూకరించాడు.

పొన్ని అనే కళాకారిణికి పొన్నవరం అనే గ్రామాన్నిచ్చి, జీవిత పర్యంతమే కాక వంశపారంపర్యంగా అనుభవించడానికి హక్కు కలిగించాడు.

ఆయన చేసిన దాన ధర్మాలను గురించీ, ఆయన విద్యాభిలాషను గూర్చి, కళాపోషణ గూర్చీ స్థానికంగా వున్న కొండవీటి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించి వుంచిన కోన వెంకటరాయశర్మగారు 'భారతీ' పత్రికలో వుదాహరించారు. అంతేగాక శాలివాహన శకం 1300 నాటి వానపల్లి శాసనంలో కూడ ఆయన సంస్థానంలో నిరంతరం జరిగే కార్యక్రమ ప్రణాళికలన్నీ లిఖింపబడి వున్నాయి.

ఈ విధంగా ఆయన కొండవీటి రాజ్యాన్ని బహుపరాక్రమంతోను, సకల కళావిశిష్టతలతోను పరిపాలించాడు. ఆయన అనంతరం ప్రోలయ దేవుని తమ్ముని కొడుకు పెదకోమటి వేమారెడ్డి రాజ్యానికి వచ్చాడు. ఈయన విద్యత్తుకు మెచ్చి ఈయనకు సర్వజ్ఞ చక్రవర్తి అనే బిరుదు కూడ ప్రసాదించబడింది.

వేమారెడ్డి రచనలు ఎన్నేన్నో;

ఈయన శృంగార దీపిక, అమరుశతక వ్యాఖ్య వ్రాసి దక్షిణ హిందూదేశ మంతటా ప్రఖ్యాతి పొందాడు. కుమారస్వామి, సాహిత్య చింతామణి అనే అలంకార శాస్త్రాన్ని రచించి ప్రఖ్యాతి వహించాడు. అంతేగాక 'సంగీత చింతామణి', 'వీర నారాయణ చరిత్ర', 'శృంగార భూషణం', 'రఘునాథాభ్యదయం', 'వేమాభూపాల చరిత్ర', 'శత్దరత్నాకరం', మొదలైన అనేక గ్రంథాలను కూడ రచించారు.

ఈ విధంగా కోమటి వేమన క్రీ.శ. 1420 వరకూ పరిపాలించాడు. రాజ్యంలో శాంతి భద్రతల్ని నెలకొల్పిన కాటయవేముని బావమరిది అయిన కుమారిగిరిరెడ్డి పరిపాలనా భాద్యతల్నీ కాటయవేమనకు నప్పచెప్పి తాను మాత్రం వసంతోత్సవాలతోను, కవులతోనూ, కళాకారులతోను, నిత్య కళ్యాణంగా పచ్చ తోరణంగా కొండవీటి సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. కుమారగిరి రత్న సింహాసనాధ్యక్ష,, జగద గోపాలరాయ, వేశ్యాభుజంగ, పల్లవాదిత్య, త్రిలింగాధీశ్వర, జంభూద్వీపేశ్వర బిరుదాంకుడు. ఈయన బాపట్ల భావనారాయణస్వామి దేవదాసియైన వల్లెమకు బుట్టిన లకుమాదేవి ప్రియడు. ఆయనవద్ద సేనానిగా వున్న దొరవరెడ్డి లకుమాదేవిని కుమారగిరికి కానుకగా అర్పించాడు.

ఆపరనాట్య సరస్వతి లకుమాదేవి:

లకుమాదేవి కుమారగిరి ప్రేయసి, అందాలరాణి, చక్కదనాల చుక్క, అపర నాట్య సరస్వతి, కుమారగిరి ఆస్థానంలో కవి, గాయక, శిల్పి, సామంతాది మహాజనుల సమక్షంలో తన అభినయచాతుర్యంతో, అందచందాలతో అందర్నీ ముగ్దుల్ని చేస్తూ, ఆస్థానానికి ఒక నూతన శోభను చేకూరుస్తూ వుండేది. అనేక మంది పేద సాదలకు ధనాన్ని, వస్త్రాలను దానంచేస్తూ వుండేది. అందుకే కాటయ వేమన తన శాకుంతల వ్యాఖ్యానంలొ ఓ ఈ విధంగా వుదాహరించాడు.

జయతి మహిమాలోకాతీత: కుమారగిరిప్రభో
స్సదసి లకుమాదేవీ యన్య ప్రియాసదృ శీప్రియా
నవ మభినయం నాట్యార్థానాం తవోతి సహస్త్రధా
వితరతి బహూనర్థా వర్థివ్రజాయ సహస్రశ:

అని వ్యాఖ్యానించాడు. లకుమాదేవి రాజనర్తకి యేకాక, కొమరగిరి ప్రియాసదృశ ప్రియయట. లకుమను గూర్చి ఇంతకు మించిన ఆధారాలు చరిత్రలో లేవని కీ॥శే॥ శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు బహు పరిశోధస చేసి ఇంగ్లీషులో 'హిస్టరి ఆఫ్ రెడ్డి కింగ్ డమ్సు' అనే రెడ్డి రాజుల యుగాన్ని చిత్రించిన మహా గ్రంథంలో వ్రాశారు.

ఆనాడు ద్రాక్షారామ భీమేశ్వరుని అఖండ దీపాన్ని వెలిగించండం ఎంతో పుణ్య కార్యంగా ఎంచబడేది. ఆ కారణంచేతనే లకుమాదేవి క్రీ.శ. 1402 లో తన తల్లి దండ్రులకు పుణ్యావ్యాప్తి కోసం అఖండదీపాదానం చేసి విఖ్యాతి పొందింది.

కుమారగిరి లకుమల వసంతోత్సవ విహారాలు:

కుమార గిరీ, లకుమాదేవీ వసంతోత్సవంలో అతి మనోహరంగా విహరిస్తూ వుండేవారట. లకుమ తన నృత్య ప్రదర్శనాలతో, అంగసౌష్ఠవంతో, వయ్యారపు నడకలతో, వివిధ నాట్య భంగిమలతో అజంతా సుందరిలా కుమార గిరిని ప్రేక్షకులను ముగుల్ని చేసేదట. కుమారగిరి తన భార్యలతో పాటు లకుమాదేవి తోనూ, తదితర అంత:పుర స్త్రీలతోనూ జలక్రీడలు ఆడుతూ వుండేవాడు. ఈ క్రీడలన్నీ గృహరాజ సౌధంలో జరిగేవి. కుమారగిరి లకుమల ఆనంద భావనం కూడ ఇదే. కొండవీటిలో ఒక దిబ్బ గృహరాజదిబ్బ అనే పేరుతో కుమారగిరి లకుమల చిహ్నంగా వెలుగొందుతూ వుంది. ఆనందకేళీ విలాసాలతో ఆ ప్రేయసీ ప్రియులు ఎరువురూ ఏకకాలంలో అనంత కాలగర్బంలో కలిసిపోయారు.

ఈ విధంగా కొండవీటి సామ్రాజ్యంలో నాట్యకళా సరస్వతి దేదీప్య మానంగా వెలుగొందింది.

ఇంచు మించు రెడ్డి రాజన్యులందరూ కూడ గొప్ప విద్యాంసులు. సకల కళాభిజ్ఞులు ,కవి, పండిత పోషకులు, వారిలో కొందరు సంగీత సాహిత్యాలలో అపారమైన ప్రజ్ఞకలవారు.

రాజమహేంద్రవరాన్ని ఏలిన అల్లయ వీరభద్రారెడ్డి సంగీత, సాహిత్య విద్యలతో సర్వజ్ఞతను సంపాదించినవాడు.

శివలింగారెడ్డి నాట్య శాస్త్ర పారంగతుడు. మల్లారెడ్డి పౌత్రుడైన శ్రీగిరి రెడ్డి గొప్ప కళా విమర్శకుడే కాక సంగీత సాహిత్యాలలో ప్రవీణుడు.

కొండవీటిని వర్ణించిన శ్రీనాథకవి:

రెడ్డిరాజుల యుగంలో వర్థిల్లిన శ్రీనాథమహాకవి పర రాజుల్ని దర్శించి నప్పుడు కొండవీడు మహా వైభవాన్ని గురించి ఈ విధంగా వర్ణించాడు.

పరరాజ్య పరదుర్గ పర వైభవశ్రీల గొనకొని విడనాడు కొండవీడు
పరిసంధి రాజన్యబలముల బంధించు గురుతైన యురిత్రాడు కొండవీడు
ముగురును రాజులకు మోహంబు బుట్టించు కొమరుమించిన వీడి కొండ వీడు
చటుల విక్రమకళాసాహసం బొనరించు కుటిలారులకు గాడు కొండ వీడు
జవన ఘోటక సామంత సరసవీర భట, నటానేక, హాటా ప్రకట గంధ
సింధురార్భటిమోహన శ్రీల చరవ కూర్మి నమరావతికి జోడు కొండవీడు.

ప్రజ్ఞానాథుడు శ్రీనాథుడు:
శ్రీనాథుడు 1385-1475 మధ్య జీవించిన మహాకవి. ఆయన జీవితంలో చాల భాగం కొండవీడు, రాజమహేంద్రవర రెడ్డి రాజుల వద్దనే గడిచిపోయింది.

ఈయన ఆస్థానకవిగా వుండి కాశీఖండం, భీమఖండం, శృంగార నైషధం, హరవిలాసం మొదలైన శృంగార కావ్యాలను రచించిన మహా కవి. విజయనగర ప్రౌఢ దేవరాయల ఆస్థానంలో వున్న గౌడడిండిమ భట్టు నోడించి, కంచు ఢక్కను పగుల గొట్టించిన ఉద్ధండుడు. నానారాజ సందర్శనం చేసి ఆనాటి సమాజంలో వున్న సాంఘికాచారాలను, ప్రజల జీవిత విధానాలను, లలిత కళా వికాసాన్ని, కళ్ళకు కట్టినట్లు తన గ్రంథాల ద్వారా తెలియజేశాడు. నలగామ రాజు దర్బారులో జరిగిన సంగీత నృత్య వాద్యాది విశేషాలను పల్నాటి చరిత్రలో పేర్కొన్నాడు. 14వ శతాబ్దపు చివర నుంచీ 15 వ శతాబ్దపు ప్రారంభంలోనూ యక్షగానాలను గురించి వర్ణిస్తూ భీమ ఖండంలో "కీర్తింతు రెద్దాని కీర్తి గంధర్వులు గాంధర్వమున యక్షగాన సరణి" అని యక్షగానాలను గురించి పొతిడాడు. అంతే గాక, ఒక వేశ్య వేషం ధరించి ద్రాక్షారామ వీథుల్లో భిక్షాటన చేసినట్లు శ్రీ భీమేశ్వర పురాణంలో..

సాని ఈశానియై మహోత్సవమునందు - గల నవచంద్రకాంతంపు గిన్నె పూని
వీథి భిక్షాటన మొనర్చు వేళ జేయు మరులు నృత్యంబు జగముల మరుల గొలుపు.

అని వివరించాడు.

జాదర గీతాలు:

శ్రీనాథుని కాలంలో భోగము వారు కనక వీణలను మీటుతూ, భీమనాథుని గూర్చి 'జాదర జాదర' అనే పల్లవితో మృదువుగా పాడే వారని వర్ణించాడు. ఇది వెన్నెల రాత్రుల్లో మరీ ఆహ్లాదంగా వున్నట్లు భీమ ఖండంలో వివరించాడు.

జాదరజాదరంచు మృదుచర్చరిగీతలు వారుణీ రసా
స్వాదమదాతిరేకముల చంద్రిక కాయగ దక్షవాటికా
వేదుల మీదటన్ కనక వీనలు మీటుచు పాడి రచ్చరల్
మోద మొలర్పగా భువన మోహన విగ్రహభీమనాథునిన్.

శ్రీనాథుడే కాశీఖండంలో, అనేక వాద్యాది విశేషాలతో ఆనాడు ప్రదర్శనాలు ప్రదర్శించినట్లు వర్ణించాడు.

పల్లకి చక్కి కాహళము వంశము ఢక్క హుండక ఝుర్ఘరుల్
ఝల్లరి యాదిగా గలుగు శబ్ద పరంపర తాళ శబ్దమై
యుల్లసిలం బ్రబంధముల కొప్పుగ నాడుచు రగ్ర వేదిపై
బల్లవపాణు లీశ్వరుని బంటమహేశులు పూజ సేయగన్

నాట్యంలో దేశి, మార్గ నృత్యాలను గురించి శ్రీనాథుడు కాశీ ఖండంలో ఉగాహరించాడు. జిక్కిణిచిందు అనీ అది దేశీయ నృత్యమనీ దశావతార చరిత్రలో ఈ విధంగా వర్ణించాడు.

దురుపదంబులు మైసిరుల నొసగ -సరిగ నిరుగెల కుంచియల్ సవదరించి
పెక్కువగ జక్కి ణీకొపుద్రొక్కె వొక-జక్కని మిఠారి సరసతులు సొక్కి చూడ