తెలుగువారి జానపద కళారూపాలు/మాచల్దేవి క్రీడాభిరామం

వికీసోర్స్ నుండి

మాచల్దేవి క్రీడాభిరామం

కాకతీయుల కాలంలో వేశ్యాకులానికి విశేష ప్రాధాన్యముండేది. వేశ్యల్ని పోషించటం ఆనాటి అధికార వర్గాలు గౌరవంగా భావించేవారు. ప్రతాప రుద్రుని వుంపుడుగత్తె మాచల్దేవి భవనం ఓరుగల్లులో నాటి అత్యంత సుందర భవనాలలో ఒకటి.

మాచల్దేవి:

మాచల్దేవి గౌరవార్థం వినుకొండ వల్లభారాయుడు క్రీడాభిరామ మనే వీథి నాటకాన్ని రచించగా అది ఓరుగల్లులో ప్రదర్శించబడింది. రావిపాటి త్రిపురాంతకుడు సంస్కృతంలో వ్రాసిన ప్రేమాభిరామం నాటకాన్ని అనుసరించి తెలుగులో వ్రాయబడిందీ క్రీడాభిరామం. ఈ వీధినాటకాన్ని శ్రీనాథుడే వ్రాశారని కొందరు, మరి కొందరు వల్లభరాయుడే వ్రాశాడని వివాదముంది. ఎవరు వ్రాసినా 14 వ శతాబ్దంలో మొట్టమొదటగా తెలుగులో వెలువడిన వీథినాటకం ఇది. ఆ నాటి నట, విట కవులను గురించి క్రీడాభిరామం నాందీ ప్రస్తావనలో ఈ విధంగా వర్ణించబడింది.

నటులది దోరసముద్రము - విటులది యేరుగల్లు, కవిది వినుకొండ మహా
పుట భేదనమనుత్రితయము - నిటు గూర్చెను బ్రహ్మ రసికు లెల్లరు మెచ్చన్.

అని ఈ వీథినాటకాన్ని మోపూరిభైరవుని తిరునాళ్ళలో ప్రదర్శించినట్లు తెలుస్తూ వుంది.

ఆనాడు ఓరుగల్లు వుత్సవాలలో ప్రదర్శించబడిన అనేక వినోద ప్రదర్శనాలను గురించి క్రీడాభిరామంలో వివరించబడింది.

ఏకశిలానగరంలో ఎన్నో దేవాలయాలు:
ఏక శిలానగరమని పిలువబడే ఓరుగల్లులో ఆనాడు 5500 శివాలయాలు, 1300 విష్ణు దేవాలయాలు, మైలార దేవుడు, దుర్గ, గణపతి, వీరభద్ర ఆలయాలు అదిగా వేల

కొలది ఉన్నట్లు స్థానిక ప్రతాపరుద్ర చరిత్ర వల్ల తెలుస్తూంది. ఓరుగల్లు మైలారదేవుని వుత్సవంనాడు వీరభటులు చేసే సాహస వీరకృత్యాలు ఆతి భయంకరంగ వుండేవి. వీరశైవమతోద్రేకులు మండుతూ వుండే నిప్పుగుండాలలో సాహసంగా దూకేవారు. నారసాలను గ్రుచ్చుకునేవారు. భైరవుని గుడి, చమడేశ్వరి, మహాశక్తి నగరు, వీరభద్రేశ్వరాగారం, బుద్ధదేవుని విహార భూమి, ముసానమ్మ గుడి,కొమరుసామయ్య నగరు మొదలైన ప్రదేశాలు కాకతీయ ప్రతాప రుద్రుని కాలంలో గొప్ప మహత్తు కలిగిన ప్రదేశాలని ప్రసిద్ధి పొందాయి.

దిసమెలదేవత ఏకవీరాదేవి:

ఏకవీరాదేవి శైవదేవత. ఏకవీర పరశురాముని తల్లియైన రేణుకాదేవి యని ప్రతీతి. ఈమెను మూహురం అనే గ్రామంలో వెలసి వుండడం వల్ల మూహురమ్మ అని పిలిచేవారు. ఈమె నగ్న దేవత. ఈమె ఆనాడు రాయలసీమ లోనూ, తెలంగాణా లోను ఎల్లమ్మ దేవత అని కూడ పిలుస్తూ వుండేవారు.

ఓరుగంటిలో ఓరుగంటి ఎల్లమ్మ అనే ప్రసిద్ధ దేవత వుండేది. ఈ ఎల్లమ్మనే రేణుక అనికూడ పిలిచేవారు. కాకతీయుల కాలంలో బవనీలు, మాదిగ స్త్రీలు ఎల్లమ్మ కథను వీరావేశంతో చెపుతూ వుండేవారనీ, వారు మోగించే జవనిక జుక జుంజుం జుక జుం జుమ్మంటు సాగేదనీ, క్రీడాభిరామంలో ఉదహరించబడింది.

వాద్యవైఖరి కడు వెరవాది యనగ ఏకవీరాదేవి యెదుట నిల్చి,
పరశు రాముని కథ లెల్ల ప్రౌఢిపాడె చారుతరకీర్తి బవనీల చక్రవర్తి.

భక్తిపారవశ్యంలో, నగ్న నృత్యాలు:

రేణుకాదేవి జమదగ్ని మహాముని భార్య; పరశురాముని తల్లి. తండ్రి ఆజ్ఞ ననుసరించి పరశురాముడు తన తల్లి తలను ఖండించగా, ఆ తలకాయ మాదిగవాడలో పడిందట. శిరస్సు లేకుండా వున్న విగ్రహం ముందు నగ్ననృత్యంలో పూజిస్తూ వుండేవారట. నగ్నంగా వున్న ఈ విగ్రహం ముందు స్త్రీలు కూడ నగ్నంగా పూజిస్తూ నాట్యం చేస్తూ వుండేవారట.

ఈ రేణుకాదేవే, తరువాత ఎల్లమ్మగానూ, ఏకవీర గానూ ప్రసిద్ధి చెందింది. ఏకవీర ఆలయాలు మండపాక, పొలవాన, మాహూరు మొదలైన గ్రామలలో వెలసి వున్నట్లు క్రీడాభిరామంలో ఉదహరించబడి వుంది.

కాకతీయ రుద్రమదేవి మొగిలిచర్లలో వున్న ఏకవీరాదేవీ ఆరాధించడానికి వెళుతూ వుండేదట. ఓరుగల్లు పట్టణంలో ఏకవీరాదేవి మహోత్సవాలను కూడ తిలకించేదట.

గొండ్లి అనేది కుండలాకార నృత్యం. గొండ్లి విధానం ద్వారా బతకమ్మ, బొడ్డెమ్మల వుత్సవ సమయాల్లో పిల్లన గ్రోవులూదుతూ, ఆటలు ఆడుతూ, కుండలాకార నృత్యం చేసేవారు.

గొరగపడుచులు గొప్ప నాట్యాలు:

ఓరుగల్లు మైలారదేవుని పూజల సమయంలో, మైలారదేవుని కొలిచే గొరగ పడుచులు పాటలు పాడుతూ, ఒక నీటి పాత్రలో ఒక వస్తువును వేసి, మొగ్గవాలి వెనుకకు వంగి నాలుకతో ఆ వస్తువు నందుకుని ఆవిధంగా తమ ప్రజ్ఞను భక్తిపరస్పరంగా తెలియజేశేవారట. ఈ విధానాన్ని గూర్చి క్రీడాభిరామంలో.

చ.వెనుకకు మొగ్గవాలి కడు విన్ననువొప్పగ దొట్టెనీళ్ళలో
మినిగి తదంతరస్థమాగు ముంగర ముక్కున గ్రుచ్చి కొంచు లే
చెను రసనా ప్రవాళమున శీఘ్రము గ్రుచ్చెను నల్లపూస పే
రనుసమలీల నిప్పడుచుపాయము లిట్టివి యెట్లు నేర్చెనో.

ఇక పురుషులు వీరభద్రస్వామిని నెత్తిమీద పెట్టుకుని ప్రభలుగట్టి అడుగుల మడుగులతో, నగారా డోళ్ళు వాయిస్తూ నారసాలు పొడుచుకుని నృత్యం చేసేవారట. వీరిని గురించి__

వీరు మైలారదేవభటులు. గొండ్లి యాడించుచున్నారు. గొరగపడుచు వాడుచున్నది చూడు మూర్థాభినయము. తాను వెట్టిక పీలంతగాని లేదు.

(క్రీడాభిరామం)

వీరిది శైవసాంప్రాదాయం. మైలారలింగస్వామి భక్తులు. వీరు కురుబ జాతికి చెందినవారు. వీరి ఇలవేల్పు వీరభద్రస్వామి. ఇంకా కాకతీయుల కాలంలో కోలాటం, గొండ్లి (గర్భనృత్యం) పేరణి నృత్యం (అంటే కుంభంపై ఎక్కి నృత్యం చేయడం ) వుప్పెన పట్టేలాటలు (అంటే చెఱ్ఱుపట్టీ) గిల్లిదండల ఆట, చిఱ్ఱాగోనె, చిల్లగోడె అనె ఆటలులకూడ ప్రచారంలో వుండేవి. శైవ సాంప్రదాయంలో నందికోల ఆట అనేది వుంది. అది తెలంగాణాలో ఈనాటికి కార్తీక మాసంలో జరుగుతూ వుంది. ఈ నంది కోల ఆటను గురుంచి సోమనాథుడు__

కోలాటమును బాత్ర గొండ్లి పేరణియు - గేళిక జోకయు లీల నటింప.

(బసవపురాణం)

జాణలు మెచ్చే జాజరపాటలు:

కాకతీయుల కాలంలో ప్రచారంలో వున్న జాజర పాటలను గురించి నాచన సోమయాజి తన వసంత విలాసంలో__

వీణాగానము వెన్నెల తేట - రాణ మీరగా రమణుల పాట
ప్రాణమైన వినబ్రహ్మణవీట - జాణలు మెత్తురు జాజరపాట.

బ్రాహ్మణ వీట జాజరపాట రాణించె వనడాన్ని బట్టి అది ఆనాటి బ్రాహ్మణులలో ఎక్కువ ప్రచారంలో వుందని చెప్పవచ్చు.

ఆ కాలంలో తప్పెట్లు, కాహాళాలు, కొమ్ములు, డమాయీలు, బూరలు, శంఖాలు, సన్నాయులు, డోళ్ళు, చేగంటలు మొదలైన వాద్యాలు ప్రచారంలో వుండేవి.

కాకతీయుల కాలంలో నిర్మాణ శిల్పం, విద్య, చిత్రలేఖనము, చేతి పనులు, కళలుగా వరిగణింపబడ్డాయి. ప్రతి చెంబు మీదా చిత్రాలు చెక్కేవారు. బట్టలపైన అద్దకంతో బొమ్మలను అద్దేవారు. ఇండ్ల గోడలపై చిత్రాలను చిత్రించేవారు. పడుచులు ఇండ్ల ముంగిట ముగ్గులతో రకరకాల చిత్రాలను చిత్రిస్తూ వుండేవారు. ప్రజలు

వారి వారి అభిరుచులను బట్టి , చిత్రపటాలు, వ్రాయించుకునే వారు. వీరపూజ అభిలాష గలవారు, వీరుల చిత్రాలను వ్రాయించుకునే వారు.