తెలుగువారి జానపద కళారూపాలు/దడదడ లాడించే డప్పుల నృత్యం

వికీసోర్స్ నుండి

దడదడ లాడించే డప్పుల నృత్యం


భాసుని నాటకంలో డప్పు నృత్యం:

బాలచరితం భాసుని నాటకం. దీనిలోని ప్రధాన ఇతి వృత్తం, "శ్రీకృష్ణ బాల క్రీడలు" తృతీయాంకం మొదటి రంగం ప్రవేశంలో గ్రామీణుల డప్పుల నృత్యాన్ని ప్రవేశ పెట్టాడు భాసుడు. ఇక్కడ కృష్ణుడు వృద్ధ గోపాలుడుగా ప్రత్యక్షమవుతాడు. గొల్ల పడుచులు "ఘోష సుందరి, వనమాలి, చంద్రలేఖ, మృగాక్షి" మొదలైన వారు నృత్యం చేయటానికి ఒక చోటకు చేరుతారు.

అప్పుడు అక్కడకు వచ్చిన దామోదరుడు ఆడ పడుచుల అందాలకు అచ్చెరువంది వారితో చేరి నృత్యం చేదామంటాడు. వాళ్ళు సరేనంటారు.

వాళ్ళ సంభాషణ ఇలా కొనసాగుతుంది. దామోదరు డంటాడు. ఘోషవాణీ పల్లె వాసులకు అనుకూలమైన "హల్లీసక" మనే నృత్యం చేదాం అంటాడు.

అందుకు సంకర్షణుడు "అయితే డప్పులు మోగిద్దాం" అంటాడు. అప్పుడు వృద్ధ గోపాలుడు కృష్ణునితో మీరు నృత్యం చేస్తూ వుంటే నేనో? అంటాడు. నువ్వు చూస్తూ కూర్చో అంటాడు కృష్ణుడు. వాళ్ళు నృత్యం చేస్తూ వుంటారు. మంచి రక్తిలో వుండగా వృద్ధ గోపాలుడు ఉత్సాహం పట్టలేక డప్పు మ్రోతతో నృత్యం అద్భుతంగా వుంది నేనూ నృత్యం చేస్తానంటూ వాళ్ళతో కొంత సేపు నృత్యం చేసి అలసి పోతాడు. ఇంతలో కృష్ణునిపై కంసుడు ప్రయోగించిన అరిష్ట అర్భకుడు అనే రాక్షసుడు వస్తున్నాడని తెలుసుకుని నృత్యాన్ని ఆపేస్తారు.

ఈ నాటకంలో ఆటపాటతో పాటు నృత్యం కూడ వుంది. వీటికి తోడు డప్పుల నృత్యం కూడ చోటు చేసుకుంది. ఇది పక్కా పల్లెటూరి నృత్యమంటారు. ఇతర భాస నాటకాల్లో ఇలాంటి జానపద కళను ప్రవేశపెట్ట లేదంటారు. ఓగేటి అచ్యుతరామ శాస్త్రి గారు నాట్య కళ జానపద కళల ప్రత్యేక సంచికలో ప్రాచీన జానపద కళల ప్రస్తావనలో అంటే డప్పు నృత్యం ఈ నాటిదే కాదు, ఆనాటిదే అని చెప్పటానికి ఇది చక్కని ఉదాహరణ.

డప్పుల కోలాట నృత్యం :

ఈ డప్పుల నృత్యాన్నే తప్పెట్ల వాయిద్య మంటారు. దీనినే రాయల సీమ ప్రాంతాల్లో కనక తప్పెట్లంటారు. ఈ వాయిద్యాన్ని మాదిగ కులస్థులు ఎక్కువగా వాయిస్తూ వుంటారు.

ఈ నాటికీ ప్రతి పల్లె లోనూ ఒక కార్యక్రమాన్ని గాని, ఒక విశేషాన్ని గాని ప్రజలందరికీ తెలియ జెప్పాలంటే ఒక్క డప్పుతో వూరంతా ఏటువంటి విషయాన్నైనా చాటిస్తారు. వివాహలకు, అమ్మవారి జాతర్లకూ, వీరుళ్ళ పూజలకూ ఈ వాయిద్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ వుంటారు. వాయిద్యం చాల ఉద్రేక పూరితంగా వుంటుంది. ఈ డప్పులను వేప చెక్కలతోనూ, చండ్రపు చెక్కలతోనూ చట్రంగా తయారు చేస్తారు. లేగేదూడ చర్మాన్ని ఒక ప్రక్క మూసి నిప్పు సెగ మీద కాసి వాయిస్తే కణకణమని శబ్దం వస్తుంది. ఈడప్పులతో వలయాకారంగా నిలబడి

నీలాలారా, నిమ్మాలారా
నీళ్ళకు పోయే కన్యాలారా
రేపే వైనామాని చెప్పండోయ్
మేలన్నాలారా.॥నీలాలారా॥

కోటా దుమికే, పేటా దుమికే
కోటలో గజ - నిమ్మా దుమికే
నిమ్మా ముల్లూ - రొమ్మూ నాటేనూ
మేలన్నాలారా

శెలవాలిత్తే గడియా కొత్తూనూ,
సద్దీ తిన్న జలది కాడా సాబానాలా బావికాడా.
జోడుంగరాలు - మారచీపోతినే - మామయ్య గారు
శెలవాలిత్తే గడియా కొత్తూనూ.

అంటూ డప్పులను వాయిస్తూ కోలాటం వేస్తారు. మామూలు కోలాటంలో అందరూ చిరుతలు ఉపయోగిస్తే, ఈ కోలాటంలో అందరూ డప్పులను చంకలో ధరిస్తారు. డప్పులు మ్రోగించే పుల్లలతో మధ్య ఒకరికి కొకరు కోలాటం వేస్తూ ఎగిరె ఎగిరి గజ్జెల కాళ్ళతో నృత్యం చేస్తూ అద్భుతంగా కోలాటం వేస్తారు. ఈ కనక తప్పెట్ల వాయిద్యం చాల ఉత్తేజాన్ని కలుగ జేస్తుంది. ఈ వాయిద్యంలో కృష్ణజిల్లా కనుమూరు వాస్తవ్యుడు అమృతయ్య, వుంగుటూరు వాస్తవ్యుడు ఏసు దాసు, వీరిద్దరూ డప్పుల మీద మృదంగం వరుస లన్నింటినీ అద్భుతంగా వాయించి నలబై సంవత్సరాలకు ముందే ప్రదర్శించారు. వీరిరువురూ ఆంధ్ర ప్రజా నాట్య మండలి రాష్ట్ర దళంలో బొంబాయి, అహమ్మదాబాదు, పూనా, షోలాపూర్, మద్రాసు, ఢిల్లీ మొదలైన ప్రాంతాలకు వెళ్ళి దేశభక్తి ప్రబోధాన్ని చేశారు. సామాన్య వరుసలతో ప్రారంభమైన జాన పదుల ఈ డప్పుల వాయిద్యం ఈనాడు ఒక శాస్త్రీయ వాయిద్యంగా రూపొందింది.

తాలేలిల్లియ్యల్లో:

తాలేలిల్లియ్యలో, శివ తాలే లిల్లియ్యలో అనే పాట ఆంధ్రదేశంలో డప్పుల వాయిద్యం ద్వారా చాల ప్రచారం పొందిన పాట. హరిశ్చంద్ర నాటకంలో వీర బాహుడు కల్లు త్రాగి నృత్యం చేస్తూ ఈ పాట ద్వారానే వేదాంతాన్ని బోధిస్తాడు.

తాలే లిల్లియలో, శివ తాలేలిల్లియ్యలో
కుల మేలాగున్నది, వినుమయ్యలో
మూలము గోచర్మ - మైదుకీళ్ళు గల
తోలు బొమ్మలట - ఈ జగము

అంతా, తాలేలిల్లియ్యలో, కులమేలా
ఐదైదుల ఇరవైఐదు తత్వముల
మనుషులు పుట్టిరి
కులమేలా గున్నది. ॥తాలే ॥

దేవదాసి యను వూర్వసి గర్భము
సుద్భవించిన - వశిష్ట కులమూ
కులమేలా గున్నది . ॥తాలే ॥

దొరలు పెద్దీంటోణ్ణి - తొలగి పోనిండయ్య దొరలు
కాసంత కల్లేసి - కాశీకి పోతాను. ॥తాలే ॥

డప్పుల వాయిద్యాన్ని ముఖ్యంగా జాతర్ల సందర్భాలలోనూ, అమ్మవారి వుత్సవాలలోనూ వీరభద్ర విన్యాసాలలోనూ ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒకేసారి నాలుగు డప్పులు వాయిస్తూ వుంటే ఆ గంభీర నాదం ప్రళయంగా వుంటుంది. ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ వాయిద్యాన్ని మాదిగలనే ఆది ఆంధ్రులు ఎక్కువగా ఆరాధిస్తారు.

డప్పు వాయిద్యంలో నిపుణత్వం:

ఆంధ్ర దేశంలో డప్పు వాయిద్యంలో నిపుణత్వాన్ని ఆయా రీతుల్లో అనేక మంది చూపించిన వారున్నారు. ఈ డప్పుల వాయిద్యాన్ని ఆ యా సమయాలను బట్టి

కూడ వాయిస్తూ వుంట్ఘారు. పెండ్లి వూరేగింపులో వాయించే వాయిద్యానికీ, దేవుళ్ళ లుత్సవాల్లో వాయించే వాయిద్యానికీ ఎంతో వ్యత్యాసముంటుంది. అలాగే మనుషులు చనిపోయి నప్పుడు వాయించే వాయిద్యం మరో రకంగా వుంటుంది. ఆయా సంఘటనలకు అనుగుణంగా ఈ వాయిద్యాన్ని మలుస్తారు.

నిజామాబాదు జిల్లాలో:

నిజామాబాదు జిల్లాలో దాదాపు అన్ని గ్రామాలలోనూ డప్పు వాయిద్యానికి అధిక ప్రాదాన్యం యిస్తారు. పెళ్ళిళ్ళ సందర్భంలో ఎన్ని ఎక్కువ డప్పులు ఉపయోగిస్తే ఆ పెళ్ళి వూరేగింపును గురించి అంత గొప్పగా చెప్పుకుంటారు. పెళ్ళి ఊరేగింపుల్లో, డప్పుల వారు రకరకాల విన్యాసాలను చేస్తూ వుంటారు. నేలపైన ఒక డప్పును బోర్లించి, దానిపైన చిల్లర డబ్బులు వుంచుతారు వాద్య కారుడు మరో డప్పుతో వాయిస్తే, ఆ శబ్ద కంపనానికి డప్పు మీదున్న చిల్లర

డబ్బులన్నీ నీల మీద పడి పోతాయి. అలాగే నేలపై కరెన్సీ నోట్లను వేసి, లయ తప్పకుండా డప్పును వాయిస్తూనే నేలపై వుంచిన కరెన్సీ నోట్లను చేతితో ముట్టకుండా కంటి రెప్పలతో అందుకుంటారు.