తెలుగువారి జానపద కళారూపాలు/జనం మెచ్చిన జముకుల కథలు

వికీసోర్స్ నుండి

జనం మెచ్చిన జముకుల కథలు


జముకుల కథలను జక్కుల కథలని పిలవడం కూడా కద్దు. ఈ కథలు కాకతీయుల కాలంలో బహుశ ప్రచారంలో వున్నట్లు ఎన్నో ఉదాహరణ లున్నాయి.

ఎల్లమ్మ కథ:

ఓరుగల్లులో ఆనాడు ఓరుగంటి ఎల్లమ్మ అనే ప్రసిద్ధ దేవత వుండేది. ఈ ఎల్లమ్మనే రేణుక అని కూడ పిలిచేవారు. కాకతీయుల కాలంలో బవనీలు అంటే మాదిగ స్త్రీలు ఎల్లమ్మ కథను వీరావేశంతో చెపుతూ వుండేవారనీ, వారు ప్రయోగించే జవనిక..... జుకజుం, జుకజుం జుమ్మంటూ వీనుల విందుగా నాదం సాగేదనీ, క్రీడాభిరామంలో ఈ విధంగా ఉదహరింపబడి వుంది.

వాద్య వైఖరి కడు నెరవాది యనగ
ఏక వీరా దేవి ఎదుట నిల్చి
పరశురాముని కథ లెల్ల ప్రౌఢి పాడె
చాతుర కీర్తి బవనల చక్రవర్తి.

నగ్న నృత్యాలు:

రేణుకాదేవి జమదగ్ని మహముని భార్య, పరశురాముని తల్లి, తండ్రి ఆజ్ఞను అనుసరించి పరశురాముడు తన తల్లి తలను ఖండించగా తలకాయ మాదిగవాడలో పడిందట. శిరస్సు లేకుండా వున్న విగ్రహం ముందు నగ్న నృత్యంతో పూజిస్తూ వుండేవారట. నగ్నంగావున్న ఈ విగ్రహాల ముందు స్త్రీలు కూడా నగ్నంగా పూజిస్తూ నాట్యం చేస్తూ వుండేవారట. ఈ నృత్యాలలో జవనికల వాయిద్యం వుత్తేజాన్ని కలిగించేదట.

నాడూ, నేడూ:

చారిత్రాత్మకమైన ఈ జముకుల కథలే, ఆనాటి జక్కుల కథలు, ఈ కథలు ఈ నాటికీ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ పట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలోనూ, తెలంగాణా లోనూ, విశేష ప్రచారంలో వున్నాయి. ఈ కథలు శృంగార లాలిత్యం తోనూ కరుణ రసాన్ని ప్రతిబింబించేవి గానూ వుంటాయి. ఈ కథల్లో అనేక రకాలైన సంగీత పట్టులున్నాయి. మట్టులకు తగినట్లు వాయిద్యాలు మలుపు తిరుగుతాయి. ఈ ప్రదర్శనం మూడు గంటల కాలం నడుస్తుంది.

బుడికి పాట:

శ్రీకాకుళం జిల్లాలో నేటి జముకుల కథ పూర్వ నామం బుడికి, లేక బుణికి పాట అనీ, బోనుల పాట అనీ టమకటమా అనీ, బుడబుక్కల పాటనీ నామాంతరాలని ( ప్రజాసాహితి ప్రజాకళా రూపాల ప్రత్యేక సంచికలో ) ఛాయారాజు గారు ఉదహరించారు.

బుడికి వాయిద్యాన్నే "బోను" అని కూడ అంటారట. అందుకే అది బోనుల పాట అయింది. బుడికి చేసే శబ్ధం ...బుడుక్కు, బుడుక్కు కాబట్టి బుడబుక్కల పాట అని కూడా అంటారు. మొత్తం మీద ఇది వాద్య ప్రధానమైన కళారూపం.

జముకుల, వన్నె చిన్నెలు:

జముకులంటే ఈ తరానికి చాల మందికి తెలియదు, దీనినే ... జమిలిక, జమిడిక, బుడికి, అని కూడ పిలుస్తారు. ఈ వాయిద్యం కుంచం ఆకారంలో వుంటుంది. కొన్ని ఇత్తడి తోనూ, మరి కొన్ని కొయ్యవి కూడ వుంటాయి. దానిని ఒక ప్రక్క భాగం సన్నని పొరలాంటి గేదెల బక్కీ చర్మంతో మూస్తారు. మధ్య భాగంలో చిన్న రంధ్రం చేసి నరాన్ని కట్టి లోపలి భాగం నుంచి రెండవ ప్రక్క ఒక కర్ర ముక్కకు కట్టి చేతితో దానిని లాగి పట్టి లోపలి భాగంలో ఆ నరాన్ని మోగించి నట్లయితే శ్రావ్యమైన మోతలు వస్తాయి.

రంగస్థల వేషాలు, విశేషాలు.

జముకుల కథా ప్రదర్శనానికి ఏ విధమైన రంగస్థలమూ అవసరంలేదు. గ్రామం మధ్యలో చిన్న పందిరి వేసి, రెండు లైట్లు కడితే సరిపోతుంది. ప్రదర్శన కారులు ముగ్గురు. అందులో మధ్య వ్వక్తి కథకుడు, వంత దారుల్లో ఒకరు హాస్యం, రెండవవారు వ్వాఖ్యానం, వేషధారణలో కథకుడు నల్ల కోటు, తెల్లకట్టు పంచ, తల గుడ్డ చుట్టి చక్కగా నృత్యం చేస్తూ కలియ దిరుగుతాడు. స్త్రీ పాత్రలు, కథా విధానంలో వచ్చి నప్పుడు అక్షరాలా స్త్రీ అభినయాన్నే కథకుడు చేస్తూ వుంటాడు. వంత దారులు రెండు జముకలను శ్రావ్వంగా వాయిస్తూ వుంటారు.

బుడికి కథా ప్రదర్శనం:

శ్రీకాకుళం జిల్లాలో ప్రచారంలో వున్న, జముకుల కథకు ప్రత్యామ్నాయ మైన బుడికి కథా రూపంలో పాల్కొనే వారు ముగ్గురుంటారు. రెండు బుడికెలు (అవే జముకులు) కాళ్ళకు గజ్జెలు తప్ప మరే ఇతర వాయిదాలూ వుండవు.

ఈ ముగ్గురులో మధ్యనుండే పాట గాడు స్త్రీ పాత్రలో, అంటే భామాకలాపంలో సత్య భామ వేషం మాదిరి వుంటుంది. వంత పాట దారులకు ప్రత్యేక వేష ధారణేమీ వుండదు. వీరిద్దరూ బుడికెలను చంకలకు తగిలించుకుని లయ బద్ధంగా, పాటల ననుసరించి వరుసలు మారుస్తూ వాయిద్యాన్ని సాగిస్తారు.

చేతిలో రుమాలు:

ఇక అన్నిటికంటే ముఖ్యమైనది కథకుని చేతిలో వుండే పట్టు రుమాలు. కథకు ప్రాణం కథకుడైతే, కథకుని ప్రాణం చేతిలోని పట్టు సెల్లాయే. అది ఎంత ముఖ్య మైనదో చాయారాజ్ గారు ఈ క్రింది ఉదాహరణను ఉదహరించారు. ఒకసారి ప్రదర్శన జరుగుతూ వుండగాకథకుని చేతిలో రుమాలు తీసుకుని కథను సాగించమన్నారట. వాళ్ళు బొమ్మల్లా నిలుచుండి పోయారట. అడుగు కదలలేదట. రాగం రాలేదట, రుమాలు లేకుండా కథ చెప్పలేమన్నారట.

రుమాలు తమాషా:

బుడి కథలో కథకునికి రుమాలు ఒక అవయవం లాంటిది. అది చేతిలో లేక పోతే చెయ్యి విరిగి పోయినట్లే. ఆ యా సన్నివేశాల్లో అది ఒక పాత్రగానే వ్వవహరిస్తుంది. ఒకోసారి కర్పూరం వెలిగించిన పళ్ళె మవుతుండట, వాయినం అందించే పాత్రగా మారుతుందట. ఒకోసారి ఆకాశంలో చంద మామగా, మరోసారి సిగ్గును దాచుకోడానికి. మరోసారి గుఱ్ఱాలను అదిలించే చర్నా కోలలా రూపొందుతుంది. ఇంకోసారి రాయబారాన్ని పంపే హంసగా. పావురంగా, చివరకు ఉత్తరంగా దుఃఖ రసంలో కళ్ళు అద్దు కోవడానికి, శృంగారంలో వయ్యారంగా ఊగించడానికీ, ఇలా ఎన్నోవిధాల ఆయా రసాల, అభినయాల, సన్నివేశాల కనుగుణంగా చేతిలోని రుమాలు ప్రముఖ పాత్ర వహిస్తుంది.

బుడికి రంగస్థలం:

ఈ కళారూపాన్ని గూడేలలోనూ, గ్రామాలలో కూడలి వద్దా, నలుగురూ కూర్చుండే రచ్చబండల వద్దా ప్రదర్శిస్తారు. కథ ప్రారంభమై తెల్ల వార్లూ నడుస్తుంది. ప్రదర్శనా రంగ స్థలంలో ఒక దీపపు స్థంభాన్ని పాతుతారు. దీనిని గిరడ అని పిలుస్తారు. ఈ గిరడ చుట్టూ వలయాకారంగా తిరుగుతూ, పాడుతూ, కథకుడు నృత్యం చేస్తూ కథ చెపుతాడు.

ఇప్పుడిప్పుడు గిరడకు బదులు, పెట్రొమాక్స్ లైట్లు స్టూలు మీద వుంచి దానినే గిరడగా భావించి చుట్టు తిరుగుతూ ప్రదర్శన ఇస్తున్నట్లు ఛాయారాజ్ గారు చెపుతున్నారు.

గిరడ ముందు ప్రార్థన:

ముందుగా కథకుడు గిరడకు ఎదురుగా నిలబడి ప్రార్థన చేసి నెమ్మదిగా నాట్యం ప్రారంభించి అప్పటి వరకూ కప్పుకున్న మేలి ముసుగును తొలగించి ఆనం తరం సంభాషణ ద్వారా ఏయే కథలు తాము చెప్పగలరో సభా ముఖాన వివరించి ఏ కథ కావాలో ప్రేక్షకుల్నే ప్రశించి వారు చెప్పమన్న కథను ప్రారంభిస్తారు.

కథలన్నీ పౌరాణికాలే. కథంతా పూర్తి అయిన తరువాత ప్రేక్షకులు కోరిన మీదట సుదీర్ఘమైన పాటలు పాడతారు. వీటిల్లో చెప్పుకో తగినవి మందులాడి పాట, కామమ్మ కథ మొదలైనవే కాక, ఆ ప్రాంతాల్లో జరిగిన సంఘర్షణలను కూడా పాటలు కట్టి పాడుతారు.

ఇరవై బాణీలు, ఇరవై రాగాలూ:

ప్రతి కథలోనూ, కథకుడు షుమారు ఇరవై బాణీల్లో పాటలు పాడుతాడు. పాటకూ, పాటకూ మధ్య కథనాన్ని రాగ యుక్తమైన వచనంలో రాగ రంజితంగా చదువుతాడు. ప్రతి పాటకూ బాణీ మారుతూ వుంటుండి. వాద్య నృత్యగాన సమ్మేళనంతో కథ హృద్యమంగా నడుస్తుంది. ఒక్కొక్క సందర్భంలో వంతదారులుకథలో వచ్చే పాత్రలుగా మారిపోతాడు. ఉదాహరణకు కథకుడు సుభద్రగా నటిస్తే వంత పాటకాళ్ళు ఒకడు అర్జునుడుగానూ మరొకడు మన్మథుడు గానూ, మారి పోతాడు. జముకుల కథా ప్రదర్శనలో ఇలా ఒక విచిత్రమైన డ్రామా నడుస్తుంది.

అంట రాని వాళ్ళూ, అన్నం లేని వాళ్ళూ:

పైన వివరించిన బుడికి లేదా జముకుల పాట గాళ్ళు నిరుపేదలైన అంటరాని కులాలకు చెందిన వాళ్ళు. అక్షర జ్ఞానం లేని వాళ్ళు. ఒక వేళ వున్నా అది అంతంత మాత్రమే. అదీ శ్రీకాకుళం మాండలిక యాసలో వుంటుంది. యాసతో కూడిన వారి భాష నవ్వు పుట్టిస్తూ వుంటుంది. ఎ ఏ అక్షరాలను వె వేలుగా పలుగుతారట, అలాగే ఎన్ని - వెన్ని - ఏనుగు - వేనుగు వచనం చెప్పే టప్పుడు వాక్యంలో ముఖ్యమైన పదాలు ఏవైతే వుంటాయో వాటిని ఈ విధంగా వత్తి పలుకుతారట.

ఖోట కెలపల ఉధ్వేన వనంలో హర్జనుడు తపస్సు
లున్నాడు, అతగాడి ధెగ్గెరికి సుబద్ర భంగారు
తబుకలో నప్పలాం పట్టుకొనె లగెల్తందందే

ఇలా సాగుతుంది వారి భాష. ఇది యాస కాదు గంభీరంగా వాచిక చెప్పడంలో వచ్చే దుశ్శబ్ధాలు.

సంచార జీవితాలు:
జముకుల కథ పిట్టంసెట్టి కథకుడు, డా॥ మిక్కిలినేని, మాచినేని.

ఈ కథలు చెప్పే కళాకారులు దాదాపు అందరూ సంచార జీవనులో ఒక గ్రామంలో కథ చెప్పి మరో గ్రామం పోయి నెలల తరబడి గ్రామాలలో కథ చెప్పి కొంత సొమ్ము కూడ బెట్టుకుని స్వగ్రామం చేరుకుంటారు. పైన వివరిం వివరాలన్నీ ఆ ప్రాంతంలో వున్న ఒక బృందం చెప్పిన వివరాలన్నిటినీ ఛాయారాజ్ సేకరించారు. వారికి ధన్యవాదాలు.

పీసా లక్ష్మణరావు, కన్యక:

జముకుల కథ కళారూపాన్ని దేశ ప్రయోజనాలకు ప్రప్రథమంగా మార్చిన వ్వక్తి విజయ వాడ కమ్యూనిస్టు కార్య కర్త, ప్రజానాట్య మండలి సభ్యుడు కీ॥ శే॥ పీసా లక్ష్మణ రావు. మహారాజుల వ్వస్థలో ప్రబలిన దారుణ హింసా కాండనూ, సాంఘిక దురాచారాలనూ ఉదహరిస్తూ గురుజాడవ్రాసిన 'కన్యక ' గేయాన్ని ఇతి వృత్తంగా తీసుకుని, కన్యక జీవిత గాథను కథగా మార్చి దానిని జముకుల కథగ వ్రాసి మంచి మంచి బాణీలను ఏర్చి కూర్చి రసవత్తరంగా కథా గానం చేసేవారు ఆయన వంత దారుగా రాజకీయ వ్యాఖ్యాతగా వ్వవహారిస్తే నరసింహా రావు కథకుడుగా, తొత్తడి సింహాచలం హాస్యాన్ని అందించేవాడు. అది అద్భుతమైన కథగా నాటి సాంఘిక రాజకీయ పరిస్థితులన్నిటికీ అద్దం పట్టింది.

కథాగాన సరళి:

కన్యకాన చరితం, కర్ణానందం
నిను స్మరియించెడు జనుల కెల్ల నిత్యానందం.

అని ప్రార్థనతో ప్రారంభించి

కళింగ డేశ మీ తెలుగు గడ్డపైన
విష్టువర్థను డనుచు వెలయుచెండేనుగా.

అని వివరిస్తూ

పండిన తన కేమి, మండిన తన కేమి
పన్నులె కావాలి ప్రభువు వారలకు
పన్ను లివ్వాలేని పేద రైతుల నెల్ల
రచ్చ చావడి కీడ్చి రువ్వలతో భాదించు
వన్నెగల స్త్రీ ఒకతె కన్ను కగుపించిన
కామాంధుడై ఒళ్ళు కాన డారాజు.

అలాంటి విష్ణువర్థన మహారాజు కన్యకను కోరటం, కన్యక నిరాకరిస్తూ రాజును ఇలా సంబోధిస్తుంది.

రావయ్య రారాజ రాణి ఇచ టున్నాది
నీ దుష్ట చర్యలను దునుమాడు కొరకు
కన్ను గోరిన కయ్న గద్దెపై నున్నాది
పట్టుమోయ్ శక్తుంటే పటుతరము మీర
నను బట్ట నీఛుడా - నీచేత గాకుంటే
నిండు సభలో అగ్ని గుండాన చావు.

అని కన్యక రాజును సవాల్ చేసి, ప్రజలకు రాజు దారుణాలను వివరిస్తుంది. కానీ రాజుకు భయపడిన ప్రజలలో స్పందన కనిపించదు. అంతట కన్యక ....

మండెడు గుండముకు - ముందు దండము పెట్టి
గుప్పించి యా తల్లి గుండాన దూకింది.
అగ్నిలో అ తల్లి ఆహుతై పోయింది.

ప్రజలు క్రోధాగ్నితో లేచారు.

కాడెలు, మేడేలూ,
కత్తులూ, సుత్తూలు,
బాకులా బల్లెములా,
పట్టియా రాజును
ప్రాణాలే తీసిరా

అంతటితో,

రాలిపోయేను రాజూ
కూలిపోయేను కోటలూ
రాణు వల్లు, రాణియలు
రాలిపోయేరు నాడే

మిక్కిలి నేని దళం:

ఇలా నవరసాలను ప్రతిబింబించే ఈ జముకుల కథను రసవత్తరమైన ఈ జముకుల కథను నాటి ప్రజానాట్య మండలి స్థాపకుల్లో ముఖ్యులైన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, మాచనేని వెంకటేశ్వరరావు, పట్టంశెట్టి ఉమామహేశ్వరరావు మొదలైన వారు లక్ష్మణరావు గారి వద్ద నేర్చుకుని దానిని ప్రజానాట్య మండలి ముఖ్య కళారూపంగా తీర్చి దిద్దారు. ఈ దళంలో కథకుడు మిక్కిలి నేని రాజకీయం, ఉమామహేశ్వర రావు హాస్యం, మాచినేని తరువాత కర్నాటి లక్ష్మీ నరసయ్య హాస్యం చెప్పారు.

రసవత్తరమైన ఈ కథ ఆంధ్ర దేశంలో 1944 - 1950 మధ్య ఆంధ్ర ప్రజలను ఉర్రూత లూగించింది. మద్రాసు రేడియోలో మూడు సార్లు, విజయవాడ రేడియోలో రెండు సార్లు, డిల్లీ రేడియోలో ఒకసారీ ప్రసారం చేయబడింది.

ప్రజానాట్య మండలి రాష్ట్ర దళంతో పాటు మద్రాసు, షోలాపూర్, పూనా, బొంబాయి, అహమదాబాదు మొదలైన రాష్ట్రేతర ప్రాంతాల్లో చెప్పబడి అధిక ప్రశంసలను అందుకుంది.

సుబ్బారావు పాణిగ్రాహి - జముకుల కథ:

ఈ జముకుల కథను శ్రీకాకుళం జిల్లా లోని ఏజన్సీ ప్రాంతంలో గిరిజనోత్సవం, భూస్వాముల దోపిడీకి వ్వతిరేకంగా సాగిన రోజుల్లో కామ్రేడ్స్ వెంపటావు సత్యం - అరికె సోములు, దుప్పల గోవింద రావులు ఆ వుద్యమాన్ని చిత్రిస్తూ తమకు చేతనైన పద్ధతుల్లో జముకుల కథగా చెప్పేవారు. దానిని వుత్తమంగా తీర్చి దిద్ది సుబ్బారావు పాణిగ్రాహి, నిమ్మల కృష్ణమూర్తి మొదలైన వారు శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటానికి మద్దత్తుగా కథలు చెప్పి ప్రజలను చైతన్య వంతుల్ని చేశారు. ఇది ఏనాటికీ వర్థిల్ల వలసిన వుత్తమ కళారూపం.

నూలు సూర్వారావు దళం:

పీసా లక్ష్మణరావు వ్రాసిన కన్యక జముకుల కథను మిక్కిలి నేని దళం రేడియోలోనూ ఆంధ్ర దేశంలో అనేక ప్రదేశాల్లో చెప్పేకథలు విని ప్రభావితులైన సామర్ల కోటకు చెందిన నూలు సూర్యారావు, గొంతంసెట్టి సూర్య నారాయణ, నూలు భాను మూర్తి మొదన వారు ఒక దళంగా "సారంగధర" కథను ఆరు వందల కథల దాకా చెప్పారు. రెండు వందల లవకుశ కథలనూ అలాగే కృష్ణ లీలలు, బకాసుర వధ - సీతా కళ్యాణం మొదలైన అనేక కథలను ఉత్తరాంధ్ర దేశంలో విరివిగా ప్రదర్శనాలను ఇస్తున్నారు. పద్దెనిమిది పర్యాయాలు రేడియోలో జముకుల కథా కార్యక్రమాల నిచ్చారు. దాదాపు 25 సంవత్సరాలుగా ఈ బృందం వారు జముకుల కథల ప్రదర్శనాల నిస్తున్నారు.

జముకుల కథా రచనలు:

జముకుల కథల రచనా విధానం హరిహరీ పదాల వలె జంపె వరుసల్లోనే వుంటాయని తంగిరాల వారు జానపద ప్రత్యేక సంచికలో (నాట్యకళ) వివరించారు. తెలుగు సంప్రదాయ వీర గాధల్లో ఎల్లమ్మ కథలు (పరశురాముని కథలు) హరి హరీ పదాలను కూడ జముకులతో పాడటం కూడా జరుగుతూ వుంది. వీటి ననుసరించే ఆధునిక జముకుల కథలు బయలుదేరాయి.

అనేక బుర్రకథలు వ్రాసిన జాతీయ కవి భూషణ బిరుదాంకితులు, శ్రీ వారణాసి సత్యనారాయణ శాస్త్రి గారు జముకుల కథలను విశేషంగా రచించారు. 1947 నాటికే ఆజాద్ హింద్ ఫౌజ్ అనే జముకుల కథని రచించారు. క్రీ॥శే॥ పుట్టా సుబ్బారావు గారు పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణాయపాలెంవారు ఈ కథను తమ దళంతో ప్రచారం చేశారు.

శాస్త్రిగారు రచించిన జముకుల కథలు ఇవి. నేతాజీ సుభాస్ చంద్ర బోస్ అంతర్థాన గాధనూ, (1947 ) 1950 లో రాణీసంయుక్తనూ, 1950 లో ఆజామీళోపాఖ్యానం, 1951 లో భక్త ప్రహ్లద గాంధీజీ నిర్యాణం మొదలైనవి రచించారు. కానీ ఇవి అన్నీ అముద్రితాలుగానే వుండి పోయాయి.

జముకుల కథలలో పీసాలక్ష్మణ రావు కన్యక జముకుల కథ, ప్రజానాట్య మండలి దళమైన మిక్కిలి నేని, మాచినేని, ఉమామాహేశ్వరరావు గార్లు రేడియోలోనూ, ఆంధ్ర దేశమంతటాను విశేషంగా ప్రదర్శించారు. (మరోచోట వివరంగా వ్రాయబడింది) అలాగే శ్రీ ప్రయాగ నర్సింహశాస్త్రి గారు, నేతాజీ సుబాస్ చంద్ర బోసు వీర గాథనూ, మహాత్ముని జీవిత గాథనూ రచించారు. నేడు నూరి గంగాధరం గారు ఆంధ్రరాష్ట్ర ప్రబోధాన్ని రచించారు.

పౌరాణిక గాధలను ప్రచారం చేసిన జముకుల కథలనూ, హరిహరీ పదాలను, జాతీయ ప్రబోధానికీ, సాంఘిక ప్రయోజనానికి కూడ ప్రయోగించారు.