తెలుగువారి జానపద కళారూపాలు/తాదాత్మ్యం చెందించే తప్పెటగుళ్ళు

వికీసోర్స్ నుండి

తాదాత్మ్యం చెందించే తప్పెటగుళ్ళు

ఆంధ్ర దేశంలో ముఖ్యంగా విశాఖపట్నణం, విజయనగరం, శ్రీకాకులం, జిల్లాలలో తప్పెట గుళ్ళు కళారూపం ప్రచారంలో వుంది. ఇది సంప్రదాయ నృత్యం. గొల్ల కులానికి చెందిన వారు ఎక్కువగా చేస్తూ వుంటారు. వారికి పశువులూ, గొఱ్ఱెలూ, మేకల మందలూ ఎక్కువ. వర్షాలు పడక పశుగ్రాసానికి

కూడా కష్టమైనప్పుడు భగవంతుని కటాక్షంకోసం చేసే దేవతారాధనలో ఈ తప్పెట గుళ్ళు ప్రముఖ స్థానం వహిస్తాయంటారు బిట్టు వెంకటేశ్వర్లు గారు.

ముఖ్యంగా యాదవులు జరిపే గంగ జాతర దశావతారాలు ముఖ్య మైనవి. కాటమ రాజు భార్య గంగమ్మ, పార్వతీ దేవి శివుని ఆజ్ఞ మేరకు కాటమరాజు భార్యగా జన్మించిందనీ,ఆ గంగమ్మ యాదవ కులానికి ఆరాధ్య దేవత అనీ, యాదవుల నమ్మకం. శివుని దర్శించిన భక్తులందరికీ అన్ని వాయిద్యాలనూ ఇచ్చి వేయగా మిగిలి పోయిన తప్పెట గుళ్ళను మాత్రం మిగిలిని యాదవులకు ఇచ్చారని వారి కథనం. తప్పెట గుళ్ళు రొమ్ముకు వ్రేలాడేటట్లు కట్టుకుంటారు. రొమ్ము మీదే ఆ వాయిద్య

తప్పెట గుళ్ళు:

నాడు అశేష ఆంధ్ర ప్రజాసామాన్యాన్ని ఉర్రూతలూగించిన వారి ఉత్సాహ ఉద్వేగాలతో, ఉద్రేకపరచి ఆనంద డోలికలలో ఊగులాడించిన రాజాధిరాజులతో పాటు సామాన్య ప్రజలను మెప్పించి, వారి మన్ననలు పొంది, రంగ రంగ వైభోగంగా వారి జీవితాలలో జీవించి, వారి వారి జీవితాలను తీర్చి దిద్దిన నాటి జానపద కళారూపాలతో పాటు "తప్పెటగుళ్ళు" అనే విశిష్ట సంగీత నృత్య కళా రూపం ఈ నాడు అక్కడక్కడా కనిపిస్తూ కొనవూపిరితో కొట్టు కుంటూ దిక్కూ తెన్నూ లేక ఆదరణ కోసం ఎదురుచూస్తూ వుంది.

కళింగ కళారూపమిది:

తప్పెట గుళ్ళు అనఏ ఒక కళారూపం వుందని, ఈ నాటి తెలుగు వారికి తొంబై మందికి తెలియదంటే ఎవరూ ఆశ్చర్య పోవాల్సిన పని లేదు. అది ఒక విశిష్ట కళా రూపం, అది ఆ నాటి కళింగాంధ్ర దేశంలో ఉత్తమ కళారూపంగా వెలుగొందిన జానపద కళారూపం. అది ఈనాడు కను మరుగై పోతూ వుంది. ఈనాడు ఉత్తరాంధ్ర దేశంలో పల్లెటూళ్ళలో పల్లె ప్రజలు పోషణతో సంరక్షింప బడుతూ వుంది. ప్రతి ఏటా జరిగే దేవతల కొలువుల్లోనూ, జాతర్లలోనూ పండుగ దినాల్లోనూ ఉత్సాహంగా ప్రదర్శింపబడుతూ వుంది.

తప్పెటగుళ్ళు జానపద సంగీత నాట్య దృశ్య రూపకం, రేకుతో గుండ్రంగా తయారు చేసిన తప్పెటలాంటి ఒక వాయిద్య పరికరాన్ని రొమ్ములపై కట్టుకుని రెండు చేతులతోనూ వివిధ గతులలో ఉధృతంగా వాయిస్తూ, కాళ్ళకు గజ్జెలు కట్టి ఒకే విధమైన రంగుల నిక్కర్లను తొడిగి, కేకలతో రూపాలతో కేరింతాలు కొడుతూ, ఆనందంతో వలయాకారంగా తిరుగుతూ కట్టుదిట్తమైన శాస్త్రీయమైన అడుగులతో అందరూ వంగుతూ, లేస్తూ, గెంతుతూ, సుదీర్ఘ రాగాలతో ఆలాపన చేస్తూ మృదు మధుర మైన సంగీతంతో మధురంగా పాటలు పాడుతూ ప్రేక్షకులను రంజింప చేస్తారు.

జట్టు నాయకుడే గురువు:

తప్పెట గుళ్ళు బృందానికి ఒక నాయకుడు వుంటాడు. అతనే ఆ బృందానికి గురువు. నాయకుని చెప్పు చేతల్లో ప్రదర్శనం సాగుతుంది. కేవలం తప్పెట గుళ్ళతో నృత్యం చెయ్యటం మాత్రమే కాక నాయకుడు, రామాయణం, భారతం బొబ్బిలి యుద్ధం మొదలైన కథలను చెపుతూ మధ్య మధ్య రంధరంధరా మా స్వామి జన్నయ్య వంటి కొన్ని కీర్తనలు పాడుతూ ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతారు. లయబద్ధంగా నృత్య చేసే ఈ బృందాలలో ఇరవై మంది వరకూ వుంటారు. ఎంత మందైనా వుండ వచ్చు. కాని వారు సమర్థులై వుండాలి. తాళం, లయ, తప్ప కుండా నృత్యం చేయగలిగి వుండాలి. క్రమం తప్పకుండా వలయాకారంగా తిరుగుతూ వీరు చేసే నృత్యం కన్నుల పండువుగా వుంటుంది.

యాదవుల కళారూపం:

ముఖ్యంగా ఈ కళను గొల్ల సుద్దులను ఆదరించిన యాదవులే ఈ కళనూ ఆరాధిస్తారు. ప్రదర్శన స్థాయి పెరిగే కొద్దీ ప్రదర్శకులు ప్రదర్శన మధ్యలో వారి వారి ప్రత్రిభా విశేషాలను ప్రదర్శిస్తారు. ఒకరి కంటే మరొకరు మిన్నగా రెండు భాగాలుగా చీలిపోయి పోటీలు పడతారు. ఒకరి కంటే మరొకరు తప్పెట్ల మీద వాద్య వరుసలనూ గమకాలనూ వినిపిస్తారు. ప్రదర్శనం పతాక స్థాయి చేరే సరికి సర్కసులో మాదిరి ఫీట్సుచేసే ప్రేక్షకుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తారు. నిజానికి తప్పెటగుళ్ళ ప్రదర్శనానికి ఈ సర్కస్ ఫీట్సుకూ సమన్యయం వుండడు. ఉండక పోయినా ప్రేక్షకులు ఉత్కంఠతో ఈ సాహస ప్రదర్శనాన్ని చూస్తారు.

నృత్యం చేస్తూనే వలయా కారంగా తిరుగుతూనే యము తప్ప కుండానే, చిందులు త్రొక్కుతూనే ఒక ప్రక్క తప్పెటలు వాయిస్తూనే, నెమ్మదిగా ఒకరిపైన మరొకరు ఎక్కుతూ అంచెలంచెలుగా గోపురాకారంగా నిలిచినప్పుడు ఆ దృశ్యం ఎంతో అద్భుతంగా వుంటుంది. పైవారి బరువునంతా క్రింది వారు భరిస్తూ వుంటే ప్రక్కనున్న కొద్ది మంది లయ తప్పకుండా పాటలు పాడుతూనే వుంటారు.

ఏకాగ్రతా నృత్యం:

కూచిపూడి నృత్యంలో నెత్తిన చెంబూ కాళ్ళ క్రింద పళ్ళెమూ మాదిరి వీరు కూడ నీరు నింపిన మట్టి కుండ అంచులపై ఒకరు నిలబడితే, అతనిపై మరో వాద్య కారుడు తప్పెటలను వాయిస్తూనే నీరు నిండిన కుండను నెత్తిన పెట్టుకుని నీరు తొణక కుండా, ఒక ప్రక్క తప్పెట వాయిస్తూ నీరు తొణికి పోతాయేమో అనే దృష్టి లేకుండా నృత్యం చేస్తూ వుంటే చుట్టూ చేరిన జనసందోహం చప్పట్లు చరుస్తారు.

గంగమ్మ కథ:

యాదవులైన తప్పెట గుళ్ళ కళాకారులు ముఖ్యంగా చెప్పే కథ... గంగమ్మ కథ... గంగమ్మను వారు ఆరాధ్య కులదేవతగా ఆరాధిస్తారు. కాటమరాజు భార్య గంగమ్మ అనీ, శివుని ఆజ్ఞ ననుసరించి,పార్వతీ దేవే గంగమ్మగా అవతరించిందని యాదవుల నమ్మకం. అంతే కాదు అందరికీ అన్ని వాయిద్యాలనూ దానం చేసిన శంకరుడు తన వద్ద మిగిలి వున్న తప్పెటగుళ్ళను యాదవుల కిచ్చినట్లు ఇతిహాసం. గంగమ్మ పట్ల వీరు ఎటువంటి భక్తి శ్రద్ధలను కలిగి వుంటారో, గంగమ్మ తిరునాళ్ళలో పాడుకునే ఈ పాటను తిలకిస్తే బోధపడుతుంది.

శోభనమో యమ్మ - శోభనమే తల్లి
శోభనమో గంగ - శోభనమో తల్లి
మూడు మూళ్ళ నరులమే - మురికి జన్మం మాది
ఎంగిలి కంఠాన మేమెంచి - పిలువంగ లేము
పాచి నోరుతోను - పాలింపలేమో యమ్మ
నీకు వందనమమ్మ లోకమాతవు నీవు
దబ్బ వనములోన - దాగుండి నావు తల్లీ
నిమ్మ వనములోన - నిలిచి వున్నావు తల్లీ
నీకు వందన మమ్మ - లోక మాతవు నీవు.

అంటూ గంగమ్మ దేవుని ప్రార్థిస్తూ కథను సాగిస్తారు.

ముఖాలు పైకెత్తి, నివ్వెరపడి అలాగే ఆశ్చర్యంతో చూస్తూ వుంటారు. అది ఎంతటి అద్భుత ప్రదర్శనమో మనం ఊహించుకోవచ్చును.

ఈ ప్రదర్శనం ఎంతో కట్టుబాటుతో క్రమ శిక్షణతో నడుస్తుంది. ఒక ధ్యేయంతో, లక్ష్యంతో నడుస్తుంది. ఎంతో భక్తి భావంతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రదర్శనాన్ని సాగిస్తారు. వారి ప్రదర్శన వరుస క్రమంలో ఏ మాత్రం పొరపాటూ జరిగినా అవమానంగా భావిస్తారు. అందువల్లే వారి ప్రదర్శనం ప్రారంభం నుండీ అసాంతం వరకూ, ఎంతో ఆసక్తికరంగా నడుస్తుంది.

వివిధ విన్యాసాలు:

లయానుగుణ్యమైన పాటలు పడుతారు. ఎన్నో భక్తి గేయాలతో పాటు దశావతారాలు, కృష్ణ లీలలు, సారంగధర చరిత్ర, చెంచీత, అమ్మవారి చరిత్ర లాంటి కథాగేయాలను కూడా పాడుతూ సన్ని వేశాల కనుగుణమైన అభినయాలను ప్రదర్శిస్తూ వారి వారి ప్రతిభను కనపర్చే విన్యాసాలు చేస్తారు.

వివిధ భంగిమల్లో తప్పెట్లు వాయించటమే కాక, ఒకరి మీద మరొకరు ఎక్కి ఒకని సహాయంతో రెండు వైపులా ఇద్దరు వ్రేలాడుతూ తప్పెటలు వాయించటం రెండు జట్లుగా విడి పోయి తప్పెట గుళ్ళు వాయిస్తూ వారి ప్రతిభను ప్రదర్శించటం అలాగే ఒక కుండ పైన ఒకరు నిలబడి అతని పైన మరొకరు నిలబడి గుళ్ళు వాయిస్తారు. విన్యాసాలలో లెగిరి అమాంతంగా క్రింద పడటం, మోకాళ్ళ మీద కూర్చుని విన్యాసంగా గుళ్ళు వాయించటం.

ఇలా ఈ ప్రదర్శన ప్రేక్షకుల్ని ఆశ్చర్యపర్చే విధంగా నాలుగైదు గంటలు సాగుతుంది. పగటి పూట తమ వృత్తిని చూసు కుంటూ రాత్రి పూట ప్రదర్శనాలను ఇస్తారు. అలాగే రాత్రి పూటే శిక్షణ కూడా పొందుతారు. వారి వారి బిడ్దలకు చిన్న తనం నుంచే ఈ విద్యలో శిక్షణ యిస్తారు. ముఖ్యంగా తప్పెట గుళ్ళలో పురుషులే పాల్గొంటారు; ఒక ప్రాంతానికే ప్రాముఖ్యం ఇచ్చే ఈ కళారూపం జాతీయ వుత్సవాలలోనూ విదేశాలలోనూ కూడా ప్రదర్శింపబడుతూ వుంది.

అభినయ విన్యాసం:

ముఖ్యంగా ఈ ప్రదర్శనాలు జాతర్లలోనే జరుగుతాయి. ఈ ప్రదర్శనం రాత్రి పూటే ప్రదర్శింపబడుతుంది. ప్రదర్శనమంతా అభినయ విన్యాసంతో తొణికిసలాడుతుంది. పాటకు తగిన తాళం, తాళంకు తగిన లయ, లయకు తగిన నృత్యం నోటితో పాట, ముఖంలో ఉత్సాహ వుద్రేకాలతో కూడిన సాత్విక చలనం కొట్టవచ్చినట్లు కనబడతాయి.

తప్పెట గుళ్ళు ప్రదర్శనం ఏ గ్రామంలో ఇవ్వదలచుకుంటారో ఆ గ్రామ పెద్దల వద్ద పావలా డబ్బులతో కొంచెం బెల్లం బజానాగా స్వీకరించి ఏ తేదీన ప్రదర్శనం ప్రదర్శించాలో నిర్ణయించుకుంటారు.

ఎక్కడ వుందీ కళారూపం?

ఎంతో ఉత్తమమైన ఈ కళా రూపం ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగర్, విశాఖ పట్టణం జిల్లాలో అధిక ప్రచారంలో వుంది.

విజయనగరం జిల్లాలో గజపతి నగరం తాలూకా, పల్ల పేట ... మురిపెల్ల గ్రామాలలో ఈ కళారూపం సజీవంగా వుంది. పెల్లాచిన నారాయణ, దుర్ల చినఅప్పల స్వామి నాయకత్వాన గజపతి నగరం వృత్తి కళాకారుల సమాఖ్య సహకారంతో నడుస్తూ వుంది.

ఈ కళకు గుర్తింపు కావలని డా॥ బి.ఎస్.ఆర్.మూర్తి దంపతులు ఎంతో కృషి చేస్తున్నారు. ఈనాడు గజపతి నగరం చుట్టు ప్రక్కల నలభై గ్రామాలలో శిక్షణ పొందిన తప్పెటగుళ్ళు దళాలు వున్నాయి.

శ్రీకాకుళం పట్టణానికి దగ్గరలో వున్న షేరు మహమ్మదు పురంలో,

శిక్షణతో కూడిన ... కోన చిన్న వాడు ...ఆధ్వర్యంలో ఉత్తమంగా ప్రదర్శనాలిస్తూ వచ్చింది. చిన్న వాడు వయసులో పెద్ద వాడైనందువల్ల ఆ కార్యభారాన్ని... కోరాడపోతప్పుడు వహిస్తున్నాడు.