తెలుగువారి జానపద కళారూపాలు/అందరికీ ఆశలు రేపే బుడబుక్కల జోస్యం

వికీసోర్స్ నుండి

అందరికీ ఆశలు రేపే బుడబుక్కల జోస్యం

తెలుగువారి జానపద కళారూపాలలో అనాది నుంచి పగటి వేషాలు ఆంధ్ర ప్రజానీకానికి వినోదంతో పాటు విజ్ఞానాన్ని ప్రసాదించాయి. ముఖ్యంగా ఈ కళారూపాల ఆశయం ఆనాటి సమాజంలోని సంఘ దురాచారాలనూ, అవినీతినీ సునిసితమైన హాస్యంతో దుయ్య బట్టి, తద్వారా ప్రజలకు కనువిప్పు కలిగించి సమాజానికి ఒక నూతన మార్గం సూచించేవి. అలాంటి కళారూపాలలో ముఖ్యమైనది బుడబుక్కల వేషం. సాంప్రదాయంగా వచ్చే ఈ కళారూపాన్ని పగటి వేషధారులు సమాజశ్రేయస్సును జోడించి ప్రదర్శిస్తున్నారు.

సంప్రదాయ బుడబుక్కలవారు:

బుడబుక్కల జాతివారి ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారు. ఇతర కులాల వారు పగలు భిక్షాటన చేస్తే, వీరు రాత్రి సమయంలో యాచన సాగిస్తారు. ఇలా సాగించే వారిలో ముఖ్యులు__ బొందిలీలు, భరత సాయిబులు, గంట సాయిబులు, రేయి తురక సాయిబులు , నిడకలోళ్ళని ఇలా ఒకో ప్రాంతంలో ఒకో పేరుతో వ్వవహరించబడుతున్న వీరు రాత్రి పన్నెండు గంటలు దాటిన తరువాత నుంచి తెల్లవారుజాము నాలుగు గంటల వరకు భిక్షాటన చేస్తారు. ఆ సమయంలో ఒక చేతిలో లాంతరు పట్తుకుని, మరో చేతిలో డమరుకం బుడబుక్కను లబ్జుగా వాయిస్తూ రెండు కాళ్ళ నడుమ ఒక గంటను కట్టుకుని... ఒక దాని మీద ఒకటి నాలుగు జతల బట్టలను తొడిగి, పెద్ద తలగుడ్డ ధరించి, ముఖానికి పెద్ద కుంకుమ బొట్టు పెట్టి, గుబురుగా పెంచిన మీసాలతో, భుజం మీద ఒక పెద్ద జంపకానా ధరించి, వీథిలో గంభీరంగా నడుస్తూ భక్తి ప్రచారం చేస్తూ, అనేక పురాణ గ్రంథాల నుంచి ఉదాహరణ లిస్తూ, సామెతలతో ప్రజలను మెప్పిస్తూ నైతిక బోధ చేస్తూ __

అంబ పల్కు జగదాంబా పల్కు
మా ఇష్ట దేవతా పల్కు

అని పొలిమేర దేవతను కట్టి, గ్రామ దేవతను కట్టి, కీడు పల్కే పక్షుల్ని, మేలు పల్కే పక్షుల్ని వేరు వేరుగా తెలిపి, కీడు స్వరూపాన్ని మేలు గల విశేషాల్ని తెలిపి ఎదుటి వారి మనసులో కలిగిన ఉద్దేశాలను వివరిస్తూ, జనరంజకమైన రామ జోగి పలుకులు వినండంటూ__

మహారాజ రాజ మర్థాండ తేజ
రవి కల్ప భూజ రాజసూత్రమా
శుభోజయం కలగవలె
మీ పని నయం వుండాలి
మా పని జయం ఉండాలి
రాను మా భారం
రక్షించుట మీ భారం.

అంటూ లబ్జుగా ప్రజలను ఆకట్టుకుంటాడు.

బుడబుక్కల కుటుంబాలు:

బుడబుక్కల వారు ఆంధ్ర దేశంలో సుమారు మూడు వేల కుటుంబాల వారు జీవనం సాగిస్తున్నారు. విజయనగరం జిల్లా శృంగవరపు కోట మండలం లోని, డాంపురం దగ్గర ఒకప్పుడు మూడు వందల కుటుంబాలు వుండేవట. క్రమేపి ఉపాధి కోసం నాలుగు ప్రక్కలు చెదిరి పోయారు. ప్రస్తుతం పది కుటుంబాల కంటే ఎక్కువ లేవని సూరిసెట్టి రాములు ఈనాడు విలేఖరికి వివరించాడు.

ఈ వృత్తి వారికి పరిధిలు లేవు. ఏ గ్రామంలో నైనా యాచన చేయవచ్చు. అయితే ఒకరు వెళ్ళిన గ్రామానికి మరొకరు వ్యాచనకు వెళ్ళారు. వారి అచార వ్వవహారాలు వేరుగా వుంటూ వారిళ్ళల్లో జరిగే పెళ్ళిళ్ళు అయిదు రోజులు జరుగుతాయి. ఆ సమయంలో అందరూ మద్యాన్ని సేవిస్తారు. అలాగే వారి కులాచారం ప్రకారం ఎవరైనా తప్పు చేస్తే కుల పెద్దలు విచారించి వారికి జరిమానా విధిస్తారు. ఆ వచ్చిన డబ్బుతో అందరూ విందు ఏర్పాటు చేసుకుంటారు. పురుషులు ఇలా వ్వాచిస్తే స్త్రీలు చాపలు అల్లుతారు.

అర్థరాత్రి జోస్యం:

గ్రామంలో అర్థరాత్రి వ్వాచకానికి బయలు దేరిన బుడబుక్కల వారు ఆ సమయంలో వ్వాచించరు. అలా గ్రామమంతా పది రోజులు అలానే తిరిగి ప్రతి ఉదయమూ ప్రతి ఇంటికి వెళ్ళి డబ్బులు, బియ్యం వసూలు చేస్తారు.

అర్థ రాత్రి బుడబుక్కల వాని ఆగమనం కొంచెం భయంకరంగా వుంటుంది. ఎవ్వరూ అతనిని చూడరు. అతను చెప్పే మాటల కోసం ఆసక్తితో ఎదురు చూస్తారు. ఎవరికి వారు, వారికి సంబంధించిన జోస్యం చెపుతారేమో నని ఎదురు చూస్తారు. 'ఆం శాంభవీ, అంబ పల్కు జగదంబా పల్కవే' అంటూ వారి వారి మనోభీష్టాలకు తగినట్లు చెప్పి వ్వాచించే బొందిలీ క్షత్రియులు ఈ నాటికీ పల్లెలలోనూ, పట్టణాలలోనూ కనిపిస్తూ వుంటారు.

బుడబుక్కల పగటి వేషం.

ఈ బుడబుక్కల వేషాన్ని పగటి వేష ధారులు అత్యంత శోభాయ మానంగా, అతి సహజంగా ప్రదర్శిస్తారు. వారు ఏ గ్రామంలో పగటి వేషాలు ప్రదర్శించదలచుకున్నారో అక్కడ ప్రప్రథమంగా బుడబుక్కల వేషంతోనే ప్రారంభించే వారు, ఇద్దరు ముగ్గురు బుడబుక్కల వేషాలు ధరించి ఢమరుకాలు అతి చాక చక్యంగా మోగిస్తూ ప్రతి ఇంటికీ వచ్చి వారి వారి జాతకాల జోస్యాలను చెపుతూ గ్రామ ప్రజలను ముగ్ధులను చేసేవారు. ఆసక్తిదాయకమైన బుడబుక్కల వేషం ఈ విధంగా ప్రారభమౌతుంది.

ఓం అంబ పల్కు జగదాంబ పల్కే _ జగదాంబా దుర్గి పల్కు, దుర్గాంబా పల్కే_ దుర్గాంబా. ఓంకారి పల్కు, వారాహి పల్కే _ శారదాంబా, జయము జయమౌతది రాజా జయమైతది రాజా. మేలు మేలు మేలౌతది రాజా మేలౌతది రాజా! మేలు మేలు మేలౌతది రాజా_అయ్యగారి కార్యం జయమౌతది_ అమ్మగారి కార్యం జయమౌతది.

అమావాస్య నాడే ఆదివారమున లచ్చి వారమే పొద్దున లచ్చి, లచ్చి ఇచ్చటే కాచుంటాది. మేలౌతది రాజా. శుక్రవారపు సంధ్యన లచ్చి. సుక్క బెట్టుకొని కూసుంటాది. బొఱ్ఱ కలుగుతది_ బొజ్జెదుగతది. గాజు లొస్తవీ, ఘలు ఘలు మంటవి. మేలు మేలౌతది రాజా మేలౌతది. జననీ.

మనసులో వున్న మాటలు చెప్పడం:

జగఝ్ఘాంతాళీ_ మళయాల భగవతీ! ధాతావతీ! యక్షిణీ! పరంజ్యోతీ పల్కు_ అంబా పల్కు _ దేవీ పల్కు, జగదాంబా పల్కు, శాంకరీ పల్కు _ ఓం కారీ పల్కు _ మహంకాళీ పల్కు, నాలుక యందు సరస్వతీ పల్కు, భేతాళా పల్కు, పల్కు, నా యిష్ట దేవతా పల్కు.

అద్గది గద్గదిగో దేవరో అయ్యగారు మీసం మెలేస్తండు. రోసంబు చేస్తండు _ సురసురా చూస్తడు. అయ్యగారు మనసులో ఒక చక్కటి కార్యం తల పెట్టిండు అది అగునా కాదా? అని తన మనసున తానే బహు తొక్కిసలాడ్తుండడు.

హద్గదే అయ్యగారి మనసులోని కార్యం సెప్పుడకు బ్రామ్మడైతే ప్రశ్న సెపుతడు. జ్యోతిష్య మతమును బట్టి సెపుతడు. అది ఔటా? కాక పోవుటా? జంగము దేవర ప్రశ్న చెపుతడు. బసవ శంకరుని వేడి సెపుతడు. అదీ అవుటా? కాక పోవుటా? ఎరుకలవాడు ప్రశ్న చెబుతడు. కొల్లాపుర దేవతను వేడి సెపుతడు. అది ఔటా కాక పోవుటా, సోదెమ్మ సోది చెబుతది అది ఔటా? కాక పోవుటా?

అంటూ దొరో ఈ బుడబుక్కల రామ జోగి ప్రశ్న చెపుతడు, బుడబుక్కల రామ జోగి ప్రశ్న చెబితే ఘనంగా వుండాలి దేవరో; మహద్దేవర మతంగా వుండాలి. మహద్దేవర మతమంటే? ఇను దేవరో!

గడబిడ జరగ బోతది:

ఈ గ్రామలో కొద్దిలోపల గొప్ప గడబిడ పుట్ట బోతుండది. అది ఎటువంటి గడబిడ అని అడగ బోతరు. ఊరికి ఉత్తరంగ పెద్ద వూడల మఱ్ఱి వుండాది. దాని మీద కూర్చున్న జోడు పచ్చులు ఏమని పల్కుతున్న వంటే, ఒక తాటి కమ్మల గుడిసెలో తొంబై తొమ్మిదేళ్ళ కన్నె పడుచు గడ గడా వణికి తెల్లారే సరికి తొలి సమర్తాడేవంతుండది దేవరో, అందు మీద ఈ గ్రామంలో ఇకల్పములు పుడతై. రాచ విడ్డూరములు పుడతై. అన్యోన్య కలహంబులు పుడతై. కీడుని ఎల్లగొట్టి, మేలును తెచ్చే ఈ రామ జోగి పేరు సెబితే? అంత లోనే అణగి పోతై దేవరో!

అంటూ ఇలా తన పాండిత్యాన్నంతా చెప్పి, అయ్యగారిలో ఆలోచనలు రేకెత్తించి నమ్మకం కలిగిస్తాడు. దొర కుడి భుజాన వెంకటేశ్వరుడు సాయమైతడు. దొర పట్టిందల్లా బంగారమైతది. చెయ్యదలచినపని చేకూర్తది. అయ్యగారి కుడి కంట్లో పుట్టు మచ్చున్నది. దాని ఇసేసమేమంటే? అయ్య కొద్దిలోపల నాల్గుకాళ్ళ తెల్పు, నడినెత్తిన సుక్క గల పంచ కళ్యాణి గుర్రాన్ని ఎక్కేపోతుండండి. అయ్యకు నొసట లక్ష్మీ రేఖుండది. ఈపున ఇంజామర, అరికాలున తామర పద్మం వుండె. అయ్యగారు తెల్ల ఏనుగు ఎక్కి భూ పరిపాలన చేసేవంతుండది.

దొరా, ఓ దొరా! మాదొరా, మా దొడ్డ దొరా! త్యాగాల దొరా, భోగాల దొరా అంటూ అయ్యగారిని ఈ విధంగా ఊదరగొడతాడు.

అద్గదిగో దొరా, మీమీద కీడు తలపెట్టిన వారిని వెను వెంట పసిగట్టి వాడి పళ్ళన్నీ పీకించి ఒక్కంత మండించి, మరి తగల బెట్టేసి, భస్మంబు చేసేసి అయ్యగారి కిచ్చే భారం ఈ రామ జోగిదే దొరా... తమ కీర్తి ఇంద్రుని కన్న గొప్పది. చంద్రుని కన్న గొప్పది. మీకు మీరే సాటి అంటూ__

రామ జోగి దేవెనలు:

ముత్యాల మూతలే - మీ యింట మూల్గాలె
రతనాల రాసులే - మీ చెంత జేరాలె
వరహాల బేరాలే - మీ రెపుడు సేయాలె
మా వూరి పేరయ్య కూచిపూడిర అయ్య
వినరయ్య కనరయ్య రామజోగిర అయ్య
బుడబుక్కల రామజోగిరా ఓ రయ్య
మా పగటి వేషాలె మీరెపుడు సూడాలె
మీ మంచి శాలువలు మా మెడకు కప్పాలె
 మీ చేతి కంకణమె, మా చేత మెరవాలె
మహారాజ రాజ మార్థాండ తేజా
శుభోజ్జయం శుభోజ్జయం
మీకు జయం మాకు ధనం.

అంటూ డబ్బులు దండుకుంటారు. ఈ నాటికీ పగటి వేషధారులు బుడబుక్కల వేషాలను అక్కడక్కడ ధరిస్తూనే వున్నారు. అయితే వాటికి అంతగా ఆదరణ లేదు.

కవులు వర్ణించారు:

బుడబుక్కలవారు ప్రాచీనం నుంచీ వున్నవారే. వీరి గురించి అనేక మంది కవులు వారి గ్రంథాలలో వర్ణించారు. కర్నూలు జిల్లాలో 18 వ శతాబ్దానికి చెందిన అయ్యలరాజు నారాయణా మాత్యుడు హంసవింశతిలో వారి వేషధారణ గురించి వివరించాడు.

అలాగే పైడిమర్రి వెంకటకవి చిత్రాంగద చరిత్రలో ఇలా వివరించాడు:

డాకదలిర్చు మబ్బు డుబుడుక్క
మెఱంగు మెఱంగు పట్టనన్
జోక బలాకికా సమితి
చుక్కల నామపురేక, నమ్మబల్
కేక సరోజ భేకకముల
కీడును మేలును దెల్ప కూకగా
జోక ఘనాగమంబు రహిజొచ్చె మహిన్
డుబుడక్క వాడనన్.

అలాగే అధునిక కవులలో కాటూరి, పింగళి తుమ్మల సీతారామమూర్తి మొదలైన వారు బుడబుక్కలవారిని గురించి ప్రస్తావించారు.

ఉత్తర భారతంలో బుడబుడక్కల వారు వున్నారో లేదో తెలియదు, గానీ, మన పొరుగు రాష్ట్రాలైన తమిళ, కన్నడ రాష్ట్రారాలలో వున్నారు. వీరంతా ఒకనాడు ఒక రాష్ట్రంలో కలిసి వున్న వారే. కర్ణాటకలో వీరిని బుడుబుడికె యివరు అని పిలుస్తారు.

ప్రజానాట్య మండలి:

ఆధునిక కాలంలో ప్రజా నాజ్యమండలి కళకారు 1943 నుంచి 1950 వరకూ సాగిన ప్రజా నాట్య మండలి సాంస్కృతిక మహోద్యమంలో ఆ నాటి రెండవ ప్రపంచ యుద్ధ భీభత్సాన్ని గురించి, నాటి కరువు కాటకాలను గురించీ, హిందూ ముస్లిం కలహాల గురించి, బ్లాకు మార్కెట్, లంచ గొండు వుద్యోగుల గురించీ, సంఘ విద్రోహుల గురించీ సవివరంగా

ప్రజలకు వివరించారు. ఈనాడు రాజమండ్రి విభూతి భవాని లింగంగారు వారి ఇతర పగటి వేషాలతో పాటు బుడబుక్కల వేషాన్ని బ్రతికిస్తున్నారు.

తాదాత్మ్యం చెందించే తప్పెటగుళ్ళు

ఆంధ్ర దేశంలో ముఖ్యంగా విశాఖపట్నణం, విజయనగరం, శ్రీకాకులం, జిల్లాలలో తప్పెట గుళ్ళు కళారూపం ప్రచారంలో వుంది. ఇది సంప్రదాయ నృత్యం. గొల్ల కులానికి చెందిన వారు ఎక్కువగా చేస్తూ వుంటారు. వారికి పశువులూ, గొఱ్ఱెలూ, మేకల మందలూ ఎక్కువ. వర్షాలు పడక పశుగ్రాసానికి

కూడా కష్టమైనప్పుడు భగవంతుని కటాక్షంకోసం చేసే దేవతారాధనలో ఈ తప్పెట గుళ్ళు ప్రముఖ స్థానం వహిస్తాయంటారు బిట్టు వెంకటేశ్వర్లు గారు.

ముఖ్యంగా యాదవులు జరిపే గంగ జాతర దశావతారాలు ముఖ్య మైనవి. కాటమ రాజు భార్య గంగమ్మ, పార్వతీ దేవి శివుని ఆజ్ఞ మేరకు కాటమరాజు భార్యగా జన్మించిందనీ,ఆ గంగమ్మ యాదవ కులానికి ఆరాధ్య దేవత అనీ, యాదవుల నమ్మకం. శివుని దర్శించిన భక్తులందరికీ అన్ని వాయిద్యాలనూ ఇచ్చి వేయగా మిగిలి పోయిన తప్పెట గుళ్ళను మాత్రం మిగిలిని యాదవులకు ఇచ్చారని వారి కథనం. తప్పెట గుళ్ళు రొమ్ముకు వ్రేలాడేటట్లు కట్టుకుంటారు. రొమ్ము మీదే ఆ వాయిద్య