తెలుగువారి జానపద కళారూపాలు/కూచిపూడి వారసులే కోటకొండ భాగవతులు

వికీసోర్స్ నుండి

కూచిపూడి వారసులే కోటకొండ భాగవతులు

భరత నాట్య సంప్రదాయ ప్రవర్తకులలో కూచిపూడి కన్న ప్రథములు పోతకమూరి భాగవతులు. వీరు అహోబల స్వామి సన్నిధిని నాట్యాచార్యులై నిత్య నాట్య సేవ చేసారు.

శ్రీవెలయపాల వారధి పవ్వళించి జోజో, అన్న జోల పాట ఈ భాగవతులు రచించిందే. వీరిని తాళ్ళపాక అన్నామాచార్యులే పేర్కొన్నారన్న, గీత నాట్యాలలో వీరికి గల ప్రతిభ వ్వక్తం కాగలదనీ వీరు 1280 ప్రాంత్రపువారనీ తెలుస్తూంది. దీనినిబట్టి భాగవతకళ రాయలసీమలో తర తరాలుగా ప్రచారంలో వున్నట్లు తెలుస్తూవుంది.

భాగవత కళ, నవాబుల ఆదరణ:

భాగవత కళను రాయలసీమలో విరివిగా ప్రచారం చేయవలెనన్న తలంపుతో క్రీ॥శ॥ 1700 - 1750 ప్రాంతాలలో బనగానిపల్లె నవాబు గారు కూచిపూడి నుండి కొందరు కళావేత్తల కుటుంబాలను ఆహ్వానించి కోటకొండ, కపట్రాల గ్రామాలలో వారికి భూములు ఇచ్చి, వారి చేత కర్నూలు జిల్లాలో భాగవత కళ ప్రచారాన్ని ప్రోత్సహించారు. అప్పటిలో కూచిపూడి నుండి తరలి వెళ్ళిన కుటుంబాలలో ప్రథముడు చల్లా భాగవతం దాసం భొట్లు, సిద్ధేంద్రయోగి నేర్పించిన పారిజాతాపహరణాన్ని పారంపర్యంగా ప్రదర్శించిన వారిలో చల్లావారు ముఖ్యులు. తొమ్మిదవ తరానికి భరత శాస్త్రం లక్ష్మీనారాయణశాస్త్రి సుప్రసిద్ధ నాట్య కళా విశారదుడు. భామా కలాపాన్నీ, గొల్ల కలాపాన్నీ, క్షేత్రయ్య పదాలనూ, తరంగాలనూ అభినయించడంలో దిట్ట. సంగీత నృత్య విద్యల్లోనే కాక, సంస్కృతాంధ్ర భాషల్లో చక్కని పాండితీ ప్రతిభ గడించినవారు.

ఆదరించిన కర్నూలు నవాబు:

కూచిపూడి వీథి భాగవతులకు గోలుకొండ నవాబు తానీషా ఎలా అగ్రహారాన్ని దానం చేశాడో అదే విధంగా కోటకొండ భాగవతులకు కర్నూలు నవాబు 200 ఎకరాల భూమి శ్రోత్రియంగా ఇచ్చారట. ఆ హక్కు ఈ నాటికి వారి అనుభవంలో వుంది.

వీరి ఇలవేల్పు కౌలుట్ల చెన్న కేశవుడు. వీరి కుటుంబంలోని ప్రతి మగపిల్ల వానికి ఐదవ ఏట ఆ దేవాలయంలో ముక్కు కుట్టిస్తారట. ఆ దేవుని ఎదుట గజ్జె కట్తించి, ప్రథమ పాఠాలు ప్రారంభిస్తారట. విద్య పూర్తికాగానే చెన్న కేశవుని సన్నిధానంలో ప్రథమ ప్రదర్శనం ఇచ్చిన అనంతరంగాని రాజుల వద్ద ప్రదర్శించేవారు కారట. వీరికి ఎక్కువ మక్కువతో అభ్యాసమైన విద్యలు, తరంగాలు, అష్టపదులు క్షేత్రయ్య పదాలు.

భరతశాస్త్రం లక్ష్మీనారాయణశాస్త్రి కోటకొండ భాగవతులు
కపట్రాల భాగవతులు:

రెండు వందల సంవత్సరాలకు పూర్వం బనగానిపల్లి నవాబులు కర్నూలు సమీపంలో తుంగభద్రా నదికి అవతల ప్రక్కన అలంపురానికి దగ్గరగా నున్న చారిత్రిక సుందర నగరం కపట్రాల. వీరికి ఇనాముగా యిచ్చారు. ఆనాడే కూచిపూడి నుండి కొంత మంది చల్లా వారు కుటుంబాలతో అక్కడకు వెళ్ళారు. కూచిపూడి సంప్ర

దాయాన్నే వారు నైజాం సంస్థానంలో ప్రచారం చేశారు. కాని రాను రాను వారి కళా సాంప్రదాయం నిర్జీవమైపోయింది.

వీరు కూడ ఆ గ్రామంలో వున్న కాళత్తయ్య దేవాలయంలో బిడ్డలందరికీ చిన్నతనంలోనే ముక్కులూ, చెవులూ కుట్టించి, గజ్జె కట్టించి నాట్యాభ్యాసానికి ప్రారంభోత్సవం చేసేవారట. అక్కడ వున్న కళాకారులు చల్ల మోహన కృష్ణ, చల్లా కాళత్తయ్య, చల్ల ముద్దు కృష్ణ మొదలైన వారు వీధి భాగవతాలను ప్రచారం చేశారు.

చల్లావారు:

సిద్ధేంద్రయోగి పేరు నిలబెట్టిన వారు చల్లావారు. ఈ మధ్య కీర్తిశేషులైన భరత శాస్త్రం లక్ష్మీనారాయణశాస్త్రి, వారిలో తొమ్మిదవ తరానికి చెందినవారు. శాస్త్రి గారు ఆ కళాకారుల కుటుంబానికి చెందిన సుప్రసిద్ధ నాట్య కళావిశారదులు. భామా కలాపాన్ని, గొల్ల కలాపాన్నీ క్షేత్రయ్య పదాలనూ, తరంగాలగానూ అభినయించడంలో దిట్ట. నృత్య విద్యల్లోనే గాక, సంస్కృతాంధ్ర భాషలలో చక్కని పాండితీ ప్రతిభ గడించారు. నృత్యరీతిలో వీరి బాణీకీ, కూచిపూడి వారి బాణీకీ అడుగుల క్రమంలోనూ, జాతి విన్యాసాల్లోనూ తేడా వున్నట్లు ఆంధ్ద్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ వారిచేత జరుపబడిన కూచిపూడి నాట్య సదస్సులో వివరించారు. వీరి కలాపంలో కొన్ని భాగాలను ఆనాడు అఖిల భారత సంగీత నాటక అకాడమీ వారు టేపు రికార్డు చేశారు. వారి సాంప్రదాయం ఎటువంటిదో మనకు తెలియకుండా పోయింది.

కోటకొండలో ఈ నాటికీ వున్న లక్ష్మీనారాయణ శాస్త్రి గారి అన్న

కుమారుడైన రంగయ్య గారికి భరత నాట్య శాస్త్రంలో అభినివేశం అట్లాగే వున్నదట. మరికొందరున్నా జీవనోపాధి కష్టమై ఇతర వృత్తుల లోనూ, వ్వవసాయంలోనూ ఆసక్తిని పెంచు కున్నారు.