తెలుగువారి జానపద కళారూపాలు/ధర్మరాజు గుళ్ళూ మహాభారత వీథి నాటకాలూ

వికీసోర్స్ నుండి

ధర్మరాజు గుళ్ళూ మహాభారత వీథి నాటకాలూ

భారత భాగవత కథలంటే చెవి కోసుకునే వాళ్ళు భారత దేశంలో కోకొల్లలుగా వున్నారు. కానీ, మహాభారతాన్ని ఒక "ఇన్నిస్టిట్యూషన్" లాగా రూపొందించడం ఆంధ్రప్రదేశంలో ఒక్క చిత్తూరు జిల్లాలోనే జరిగిందనీ, బహుశా దేశం మొత్తంలో ఇంకెక్కడా కూడా మహాభారతం ఇంతగా ప్రజల సాంస్కృతిక జీవనంలోకి చొచ్చుకు పోలేదేమోనంటూ పసుపులేటి పూర్ణచంద్రరావు గారు, ఆంధ్రజ్యోతి పత్రికలో వివరించారు.

ధర్మరాజు గుళ్ళు:

ధర్మరాజు గుళ్ళు పేరుతో చిత్తూరు జిల్లాలో నూరుకు పైగా ధర్మరాజు గుళ్ళున్నాయి. వీటిని గుళ్ళు ఆనటం కన్నా, సాంస్కృతి ప్రదర్శనా కేంద్రాలుగా పిలువవచ్చు. ప్రతి సంవత్సరం 12 నుంచి 18 రోజుల వరకూ మహాభారతం లోని పర్వాలన్నిటినీ వీథి నాటక రూపంలో ధర్మ రాజు గుళ్ళ ముందు ప్రదర్శిస్తారు. ఇలా చిత్తూరు జిల్లా అంతటా ఈ ప్రదర్సనాలు జరుగుతాయి. ఈ ప్రదర్శనాలను ఆసరాగా చేసుకుని చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ తరలివస్తారు. ఇలా తరలివచ్చే ప్రజలకు సదుపాయంగా వివిధారకాలైన అంగళ్ళూ, గ్రామీణ ఆట పాటలూ, వినోదాలు చోటు చేసుకుంటాయి. ఇలా ప్రతి గుడి ముందూ ఒక జాతరలాగా తయారౌతుంది. ముఖ్యంగా పని పాటలన్నీ అయిపోయిన తరువాత వేసవిలోనే ఈ కార్య క్రమాలు జరుగుతాయి. జాతరలూ, వీథి నాటకాలో, ఆధ్ర దేశంలో ఇతర చోట్ల ప్రదర్శింపబడినా, నూరు ప్రదర్శనాలకు పైగా ప్రదర్శింపబడటం చిత్తూరు జిల్లా విశేషం.

ఎన్నో వీథి నాటక బృందాలు:

మహాభారత కథకు చిత్తూరు జిల్లాలో ఎంత ఆదరణ వుందో, ఈ నాటికీ చిత్తూరు జిల్లాలో ఇంకా బ్రతికి వున్న వీథి నాటక బృందాల్ని చూస్తే తెలుస్తుంది. హరిజనులు, యానాదులు, జంగాలు, బలిజలు, గొల్లలు, రెడ్లు మొదలైన అనేక కులాలవారు రోజుల తరబడి ఈ ప్రదర్శనాలను ప్రదర్శిస్తూ వుంటారు. అంతే కాదు అన్యమతస్తులైన క్రిష్టియన్లూ, ముస్లిములూ మహాభారత నాటకాల్లో నటించటమే కాక అనేక వీథి భాగవత దళాలకు శిక్షణ ఇచ్చే గురువులుగా కూడా వున్నారంటే, ఇంతకంటే మాత సామరస్యానికి దాఖలా ఏం కావాలి. సాంస్కృతిక ప్రదర్శనాలు జాతీయ సమైకత్యను ఎలా పెంపొందిస్తున్నాయో తెలుసుకోవచ్చు.

ఇవి యక్షగాన వీథి నాటకాలు:

చిత్తూరు జిల్లాలో ప్రదర్శించే వీథి నాటకాల శిల్పం యక్షగాన రీతికి చెందింది. ఇందులో కుప్పం ప్రాంతంలోని 'కంగుంది సంస్థానం' లో వెల్లివిరిసిన 'కంగుంది బాణీ' అనేది చిత్తూరు యక్షగాన నాటకాల ప్రత్యేకత. అయితే చిత్తూరు జిల్లా తూర్పు ప్రాంతంలో 'సంత వేలూరు బాణీ' కి ఎక్కువ ప్రత్యేకత వుంది. ముఖ్యంగా వీరు రామ నాటకాలను ఎక్కువ ఆడతారు. అందులో కుశలవుల నాటకం ఎంతో ప్రాముఖ్యం వహించింది.

చిత్తూరు జిల్లాలోని ఈ భారత నాటక ప్రదర్శనం కేవలం స్టేజికి మాత్రమే పరిమితం కాకుండా, రంగస్థల స్థాయినీ, నటుల స్థాయినీ దాటి ఊరందరూ పాల్గొనే సమిష్టి రంగ స్థలంగా మారి పోతుంది. ఉదాహరణకు "బకాసుర వధ" ఘట్టంలో భీముడి పాత్ర ధారి, రంగాన్ని వదిలేసి, నిజంగా ఓ బండి మీద ఊళ్ళోకి బయలు దేరి గడప గడపకూ బోణాల్ని స్వీకరించి, రాక్షస వధానంతరం 'సమిష్టి బంతి' జరపడం విశేషం.

తపస్మాన్:

ఈ సందర్భంలో ... అర్జునుడు దివ్యాస్త్రాల కోసం చేసే తపస్సుకు ప్రతీకగా నిలబెట్టిన ఒక స్థంభాన్ని ఎక్కుతాడు. ఆర్జున పాత్రధారి మెట్టు మెట్టుకూ ఎక్కుతూ నాటకీయంగా పద్యం పాడుతూ అధిగమిస్తాడు. తపస్సుకు వీలుగా మాను పైన

వెడల్పుగా ఒక మంచెను ఏర్పాటు చేస్తారు. ఇలా ఏర్పాటు చేసిన మానును "తపస్మాన్" గా పిలుస్తారు.

ఆర్జునుడు తపస్మాన్ ఎక్కే రోజు అనగానే చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి ప్రజలు వేల సంఖ్యలో తెల్లవారు జామునే వచ్చి చేరుకుంటారు. అర్జునుడు తపస్మాన్ ఎక్కిన తరువాత, ఓ విల్లు ఆకారం కలిగిన వెడల్పాటి చత్రంలో కూర్చుని, నిమ్మ కాయలు, విభూతి, పళ్ళు, పూలూ నేల మీదికి వెదజల్లుతాడు. అర్జునుని తపస్మాన్నీ, ఎక్కడాన్నీ స్వర్గారోహణంగా అప్రజలు భావించి, పైనుంచి క్రింద పడే పళ్ళూ, పూలూ, ఎంతో పవిత్రమైనవిగా ఎంచి వాటిని అందుకోవడానికి జనం త్రొక్కిసలాడుతారు.

పిల్లలు లేని తల్లులు:

అంతే కాదు పిల్లలు లేని తల్లులు ఈ వుత్సవానికి హాజరవుతారు. తపస్మాన్ పై నుంచి పడే పళ్ళూ పూల కోసం తలారా స్నానం చేసి తడి బట్టలతో తపస్మాన్ క్రింది వేచి వుంటారు. అర్జనుడు మెట్టు మెట్టుకూ పాట పాడుకుంటూ, తీరిగా తపస్మాన్ ఎక్కేటంత సేపూ ఈ స్త్రీలు పడుకుని సాస్టాంగ దండ ప్రమాణం చేస్తూ తల ఎత్తకుండా అలాగే పడి వుంటారు. అర్జునుడు ప్రసాదాల్ని నేల మీదికి పడవేసే సమయంలో ఎంతో భక్తి శ్రద్ధలతో వారి వారి కొంగుల్ని సరిచేసుకొని, మోరలెత్తి ఎదురుచూస్తారు. ఆ పళ్ళూ, పూలు పడిన ముఖాలు ఎంతో వికసిస్తాయి. పడని ముఖాలు నిరుత్సాహ పడిపోతాయ. అంటే దీనిని బట్టి వీథి నాటక తపస్మాన్ ఎంత బలవత్తరమైనదో తెలుసుకోవచ్చును.

ఈ విధంగా మహాభారతం వీథి నాటక స్థాయి నుంచి జీవితంలోకి ఎలా ప్రవేశించిందో అర్థం చేసుకోవచ్చును.

కూచిపూడి వారసులే కోటకొండ భాగవతులు

భరత నాట్య సంప్రదాయ ప్రవర్తకులలో కూచిపూడి కన్న ప్రథములు పోతకమూరి భాగవతులు. వీరు అహోబల స్వామి సన్నిధిని నాట్యాచార్యులై నిత్య నాట్య సేవ చేసారు.

శ్రీవెలయపాల వారధి పవ్వళించి జోజో, అన్న జోల పాట ఈ భాగవతులు రచించిందే. వీరిని తాళ్ళపాక అన్నామాచార్యులే పేర్కొన్నారన్న, గీత నాట్యాలలో వీరికి గల ప్రతిభ వ్వక్తం కాగలదనీ వీరు 1280 ప్రాంత్రపువారనీ తెలుస్తూంది. దీనినిబట్టి భాగవతకళ రాయలసీమలో తర తరాలుగా ప్రచారంలో వున్నట్లు తెలుస్తూవుంది.

భాగవత కళ, నవాబుల ఆదరణ:

భాగవత కళను రాయలసీమలో విరివిగా ప్రచారం చేయవలెనన్న తలంపుతో క్రీ॥శ॥ 1700 - 1750 ప్రాంతాలలో బనగానిపల్లె నవాబు గారు కూచిపూడి నుండి కొందరు కళావేత్తల కుటుంబాలను ఆహ్వానించి కోటకొండ, కపట్రాల గ్రామాలలో వారికి భూములు ఇచ్చి, వారి చేత కర్నూలు జిల్లాలో భాగవత కళ ప్రచారాన్ని ప్రోత్సహించారు. అప్పటిలో కూచిపూడి నుండి తరలి వెళ్ళిన కుటుంబాలలో ప్రథముడు చల్లా భాగవతం దాసం భొట్లు, సిద్ధేంద్రయోగి నేర్పించిన పారిజాతాపహరణాన్ని పారంపర్యంగా ప్రదర్శించిన వారిలో చల్లావారు ముఖ్యులు. తొమ్మిదవ తరానికి భరత శాస్త్రం లక్ష్మీనారాయణశాస్త్రి సుప్రసిద్ధ నాట్య కళా విశారదుడు. భామా కలాపాన్నీ, గొల్ల కలాపాన్నీ, క్షేత్రయ్య పదాలనూ, తరంగాలనూ అభినయించడంలో దిట్ట. సంగీత నృత్య విద్యల్లోనే కాక, సంస్కృతాంధ్ర భాషల్లో చక్కని పాండితీ ప్రతిభ గడించినవారు.