తెలుగువారి జానపద కళారూపాలు/కప్పల కావడి

వికీసోర్స్ నుండి

కప్పల కావడి

నా చిన్న తనంలో కప్పల కావడిని చూశాను. ఒక కావడి భుజాన వేసుకుని రెండు ప్రక్కలా రెండు తట్టల్లో కప్పలను పెట్టి అవి ఎగిరిపోకుండా వేపమండలు వేసి ఇద్దరు ముగ్గురు స్త్రీలు బృందాలుగా ఏర్పడి వానాలమ్మ వచ్చేనూ, వరిచేలు పండేనూ అంటూ పాడుకుంటూ ఇంటింటికీ తిరుగుతూ వ్వాచించే వారు. కప్పలు బెకబెకమంటే వర్షాలొస్తాయనీ, అలాంటి కప్పల్ని పూజిస్తే వర్షాలొస్తాయనీ నమ్మించే వాళ్ళు. ముఖ్యంగా అనావృష్టి జరిగి వర్షం కోసం రైతులు ఎదురు చూసే సమయంలో వాన దేవుడి కోసం చేసే ఆచారాలలో ఇదొకటి.

అనావృష్టి ప్రాంతమైన రాయల సీమలో వర్షం కోసం ఇలాంటి ఆచారమే వుంది. మానవాతీత శక్తుల్ని సంతోషపెడితే వర్షం కురుస్తుందని వారి నమ్మకం. మట్టి మూకుడులో కప్పలనుంచి వాటిపైన తంగేడాకు వుంచి ఆ మూకుణ్ణి నెత్తి మీద పెట్టుకుని లేదా కావడిలో పెట్టి వాన దేవా అని పాడుతూ, భిక్షానికి వస్తారు. వర్షలక్ష్మి ఈ రూపంలో వచ్చిందని నమ్మిన స్త్రీలు బిచ్చం వేస్తారు.

కావడి తగిలించు కున్న వారు ఈ క్రింది విధంగా పాడతారని జానపద విజ్ఞానంలో సుందరంగారు ఈ విధంగా ఉదహరించారు.

బూమెమ్మ కడుపునా బుగ బుగా పొదిలింది,
కన్నీటి పొంగులే, పెన్నేటి కాలువా? ఓ వాన దేవా?
ఏరులూ చెరువులూ ఏకమై పారల్ల
మా కొండ్ర పండల్ల
మా కడుపు నిండల్ల ఓ వాన దేవా..

అనేది కప్పల కావడి సమయంలో పాడే పాటని 1975 లో దోణప్ప గారు ఉదహరించారు.