తెలుగువారి జానపద కళారూపాలు/సాధనా శూరులు

వికీసోర్స్ నుండి

సాధనా శూరులు

పద్మశాలీలను మాత్రమే అర్చించే వీరిని సాధనా శూరులని పిలుస్తూ వుంటారు. వీరి ప్రదర్శనాలను అందరికీ ప్రదర్శిస్తారు. ఒక గ్రామ నుంచి మరో గ్రామానికి సంచారం చేస్తూ ప్రతి గ్రామలోనూ పద్మశాలీల అనుమతితో వీరు ప్రదర్శనలు ప్రారంబిస్తారు. వీరి ప్రదర్శన ఇంద్రజాలానికి సంబంధించింది. వీరి ప్రదర్శనం పగటి వేళే జరుగుతుంది. దీనిని పగటి వేషంగా భావించవచ్చు. వీరి ప్రదర్శన కాలం మూడు గంటల వరకూ వుంటుంది. వీరి రంగస్థలం గ్రామ కూడలిలో వున్న విశాలస్థలంలో జరుగుతుంది. వీరి కళారూపాల సాధనకు నిష్ట అవసరమంటారు. వీరి పనులు కనుకట్టు గారడీగా వుంటాయి. ఉదాహరణకు వీరి ప్రదర్శనంలో ఇరువురు

వ్యక్తులు రెండు రేకు పళ్ళెములు తీసుకుని చేతులకు ఎదో ఆకు పసరు పూసుకుని దూరంగా నిలబడతారు. వారు చేతులకు పూసుకున్న పసరు ప్రభావం వల్ల వారి హస్తాల్లో వున్న పళ్ళెములు ఒక్కసారి పైకి ఎగిరి రెండు పళ్ళెములూ కొట్టుకుని మరల యథాస్థానాన్ని చేరుకుంటాయి.

రొమ్ముమీద ఆకు:

అలాగే మరొక వ్వక్తి రొమ్ము మీద ఒక ప్రత్యేకమైన ఆకును అతికించి ఆ ఆకును గురిచూసి కొట్టవలసిందిగా ఒక తుపాకిని ప్రేక్షకులలో ఎవరు ముందుకు వస్తే వారికిచ్చి రొమ్ము మీద ఆకును గురి పెట్టి కొట్టమంటారు. అలా గురిచూచి ఎవరైనా కొట్టి నట్లైతే ఆ గుండు రొమ్ములోపలి భాగానికి పోక ఆ ఆకును కొట్టుకుని అక్కడే పడిపోతుంది. ఆ ప్రదేశంలో ఈ విధమైన గాయమూ మనకు కనిపించదు. ఇది కని కట్టో ఆకు పసరు ప్రభావమో లేక ఇంద్ర జాలమో మనకు తెలియదు గానీ వారు ఇలాంటి ప్రదర్శనలో నిజంగా సాధనాశూరులే. ఈ సాధనా శూరులు ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ తాలూకా వల్లభాపురంలో వున్నారు. ఈ ప్రదర్శన ద్వారా వీరు జానపదులను దిగ్భ్రాంతులను చేస్తారు.