తెనాలి రామకృష్ణకవి చరిత్రము/సమస్యా పూరణము

వికీసోర్స్ నుండి

'రామకృష్ణా! నీవు నాకు ముఖ్యుఁడవుగాన నీతో నిజము చెప్పుచున్నాను. స్మార్తమతము బహు పాపిష్టిమతము. స్మార్తుని జూచిన వైష్ణవునకు మఱుజన్మమున గాడిద పుట్టుక యే సంప్రాప్తమగును గావున స్మార్తులఁజూచుట మానివైచితిని. రామకృష్ణు డప్పుడేమియు ననక యూరకుండెను. కొంతకాలము గడచిన వెనుక రాయలు కవులందఱితో గలిసి, నగరము వెలుపలనున్న యుద్యాన వనమునకు షికారువెళ్ళెను. ఉద్యానవనమునఁ జాలసేపు కూర్చుండి వారందఱు నీవలికి రాగా నచట కొన్నిగాడిదలు కాన్పించెను.

రామకృష్ణుడు ఒక్కొక్క గాడిదకడకు బోయి సాస్టాంగ దండప్రణామ మొనరింపసాగెను. రాయలును తదితరులును కడుపుబ్బునటుల నవ్వసాగిరి. రాయలు 'కృష్ణకవీ! నీకు మతిపోయినదా యేమి? ఎవరైనను గాడిదెలకు మ్రొక్కుదురా?' యనగా, రామకృష్ణుఁడు ప్రభువర్యా! నే నెన్నడు నర్థములేని పనిచేయను. ఈ గాడిద మన తాతాచార్యులగారి మేనమామ కందాళై తిరుచూర్ణాచార్యులుగారు. ఈ గాడిద మన యాచార్యులవారి తాతయగు పర్పటం అళహసింగరాచారిగారు. తక్కుంగల ఖరములన్నియు వీరి బంధువులే వైష్ణవమతాగ్రేసరులకు వీరికి మ్రొక్కి. నాయఘ వినాశమునకై ప్రయత్నించుటయే తప్పగునా? తాతాచార్యులవారు కూడ నీ మధ్య స్మార్తుల మొగము చూచుట మానినారుసుడీ యనెను.

తాతాచార్యులు సిగ్గుపడి యా దినము మొదలట్లు చేయుట మానెను. రామకృష్ణుని యుక్తికి సంతసింపనివారు లేరు.

8 సమస్యా పూరణము

భట్టుమూర్తియను నామాంతరముగల కాకమాని రామరాజుభూషణుఁడు రాయల యాస్థానములోనున్న యష్టదిగ్గజములలో నొకడు, రాయలు రామకృష్ణునియెడ నాదరాభిమానములు గలిగి యున్నాడని యీర్ష్యచెంది యొకనాడు సభలో నందఱు నుండగా, రామకృష్ణకవి కెట్లయినఁ బరాభవము సేయదలంచి యిట్లనెను. -

'అయ్యా! రామకృష్ణకవీ! నేనొక సమస్య నిచ్చెదను. అద్దానిం పూరించి, నీవు సత్కవివని, వికటకవివని సార్థకనామధేయుండ వగుదువు గాక!' కుంజరయూధంబు దోమకుత్తుకజొచ్చె౯.

రామకృష్ణుడు భట్టుమూర్తి తన్నవమానించుటకే యిట్టి సమస్య నిచ్చినాడను కోపముతో నిట్లు పూరించెను.

'క. గంజాయిఁద్రావి తురకల
    సంజాతులగూడి కల్లుచవిఁగొన్నవా
    లంజలకొడుకా యెక్కడ
    కుంజరయూధంబు దోమకత్తుక జొచ్చెన్ . ”

రామరాజభూషణుఁడు చిన్నబుచ్చుకొని కూర్చుండుట గాంచి రాయలు “రామకృష్ణా! ఆపద్యము నట్లు చెప్పఁజనదు. భారతపదముగా జెప్పు' మన నతడిట్లు చెప్పెను. '

'క. రంజనచెడి పాండవులరి
    భంజనులై విరటు గొల్వుపాలై రకటా!
    సంజయ విధినేమందును
    కుంజరయూధంబు దోమ కుత్తుక జొచ్చెన్ . '

9 భారతరచన

అల్లాయుద్దీన్ గంగోబహమనీ భామినీరాజ్యమును, బరిపాలించిన పిదప నేదులశాహి రాజ్యమున కధికారియయ్యెను. ఏదులశాహి తాతయగు, కుతుబ్ శాహి నాదిండ్ల అప్పొమాత్యుఁడు రచించిన తపతీ సంవరణోపాఖ్యానము నంకితమందెను. బాల్యమునుండియు నేదులశాహి తానుకూడ గ్రంథములకృతిభర్తృత్వము నందవలయు


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.