తెనాలి రామకృష్ణకవి చరిత్రము/తాతాచార్యుల నవమానించుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

7 తాతాచార్యుల నవమానించుట

రాయలకు తాతాచార్యులవారియెడ నసమానమగు గౌరవము. రాయలమతగురువాయన. ఈతాతాచార్యులవారి జన్మస్థలము కాంచీపురము. ఈయన మహావిద్వాంసుడు. ఈయన విష్ణ్వంశ సంభూతుఁడని జనులు చెప్పుకొనెడి వారట. ఆచార్యులవారు సంస్కృతమున 'సాత్త్వికబ్రహ్మ విద్యావిలాస' మను గ్రంథమును రచించియుండిరి. చంద్రగిరిలోని వేంకటపతిరాయల సంస్థానమున కీయన తఱచుగా నేగుచుండుటచే రామకృష్ణునకు బరిచయుడయ్యెను తరువాత రాయలయాస్థానమున కేతెంచి విజయనగరముననే స్థిరనివాస మేర్పఱచుకొనెను. రామకృష్ణుడు తాతాచార్యుల వారిని దఱచుగా హేళనము చేయుచుండెను. వైష్ణవమత పక్షపాతియగు తాతాచార్యులవారు స్మార్తమతమునెడల నధికాసహ్యము కలిగి యుండెను. స్మార్తుల నాయన చూడ నొల్లకుండెను. స్మార్తులు కాన్పించినపుడు మొగము పై నుత్తరీయము గప్పుకొనుచుండెను. ఇది చూచి యందరు తాతాచార్యులవారు పరమఛాందసులని చెప్పుకొనసాగిరి. రాయలుకూడ యీవార్తను గర్ణాకర్ణికగ నాలకించి, రామకృష్ణునిరావించి 'తాతాచార్యులవారు ప్రజల యసూయకు బాల్పడుచున్నారు. ఎట్లయినను వారు ఛాందసము: వీడునట్లు చేయుమా' యనిరి.

రామకృష్ణు డట్లేయని యొకనాడు తాతాచార్యులవారు యింటికి వెళ్లెను. ఆసమయమునకే యాయన యీవలకు వచ్చెను. రామకృష్ణుని జూచి, యుత్తరీయము ముఖమున కడ్డు పెట్టుకొనెను. “స్వామీ! తాతాచార్యులవారూ! నేను దమ ప్రియ శిష్యుఁడను గదా! నన్ను జూచి మీరేల ముఖమున కుత్తరీయ మడ్డుపెట్టుకొనుచున్నారు!' లనియడుగ తాతాచార్యుల వారిట్లు సమాధానము జెప్పిరి – 'రామకృష్ణా! నీవు నాకు ముఖ్యుఁడవుగాన నీతో నిజము చెప్పుచున్నాను. స్మార్తమతము బహు పాపిష్టిమతము. స్మార్తుని జూచిన వైష్ణవునకు మఱుజన్మమున గాడిద పుట్టుక యే సంప్రాప్తమగును గావున స్మార్తులఁజూచుట మానివైచితిని. రామకృష్ణు డప్పుడేమియు ననక యూరకుండెను. కొంతకాలము గడచిన వెనుక రాయలు కవులందఱితో గలిసి, నగరము వెలుపలనున్న యుద్యాన వనమునకు షికారువెళ్ళెను. ఉద్యానవనమునఁ జాలసేపు కూర్చుండి వారందఱు నీవలికి రాగా నచట కొన్నిగాడిదలు కాన్పించెను.

రామకృష్ణుడు ఒక్కొక్క గాడిదకడకు బోయి సాస్టాంగ దండప్రణామ మొనరింపసాగెను. రాయలును తదితరులును కడుపుబ్బునటుల నవ్వసాగిరి. రాయలు 'కృష్ణకవీ! నీకు మతిపోయినదా యేమి? ఎవరైనను గాడిదెలకు మ్రొక్కుదురా?' యనగా, రామకృష్ణుఁడు ప్రభువర్యా! నే నెన్నడు నర్థములేని పనిచేయను. ఈ గాడిద మన తాతాచార్యులగారి మేనమామ కందాళై తిరుచూర్ణాచార్యులుగారు. ఈ గాడిద మన యాచార్యులవారి తాతయగు పర్పటం అళహసింగరాచారిగారు. తక్కుంగల ఖరములన్నియు వీరి బంధువులే వైష్ణవమతాగ్రేసరులకు వీరికి మ్రొక్కి. నాయఘ వినాశమునకై ప్రయత్నించుటయే తప్పగునా? తాతాచార్యులవారు కూడ నీ మధ్య స్మార్తుల మొగము చూచుట మానినారుసుడీ యనెను.

తాతాచార్యులు సిగ్గుపడి యా దినము మొదలట్లు చేయుట మానెను. రామకృష్ణుని యుక్తికి సంతసింపనివారు లేరు.

8 సమస్యా పూరణము

భట్టుమూర్తియను నామాంతరముగల కాకమాని రామరాజుభూషణుఁడు రాయల యాస్థానములోనున్న యష్టదిగ్గజములలో నొకడు, రాయలు రామకృష్ణునియెడ నాదరాభిమానములు గలిగి


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.