తెనాలి రామకృష్ణకవి చరిత్రము/విష్ణుచిత్తీయ విమర్శన

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కానతిచ్చితిని. నీ వెట్లు బ్రతికివచ్చితివి?' అని ప్రశ్నింపగా, రామకృష్ణుడు జరిగినదంతయు జెప్పెను. ఆతని యుక్తికి రాయ లపరిమితాహ్లాదము నొందెను.


19 విష్ణుచిత్తీయ విమర్శన

రాయలు సకల సామంత మంత్రి పురోహిత బంధుమిత్రపరివార సమాకీర్ణంబై న కొలువుకూటమున గూర్చుండి కవుల నుద్దేశించి యిట్లనెను.

'కవీంద్రులారా ! మద్విరచితమైన విష్ణుచిత్తీయమును మీ రందఱును జదివియుంటిరిగదా ! ఆగ్రంథమునందలి గుణావగుణముల దెలిపిన వారికి మంచి బహుమానమిత్తు' న నెను. ఏమాటయన్న నేమి కీడుమూడునో యను సందేహించి, యెవ్వరును నేమియుజెప్పక యూరకుండగా, రామకృష్ణుడు లేచి, 'మహారాజా! 'పెక్కు నసందర్భపువాక్యములతో గూడియున్న యాగ్రంథము విమర్శించుట కే మున్నది? ఇచ్చట నేమియునులేదు- భోజనముజేసి పొమ్ము' అనుటలో నర్ధమున్న దా!' యనెను.

రామకృష్ణకవీ ! నాగ్రంథ మసందర్భముగా నున్నదా? నీ మాటలసందర్భముగా నున్న వా! ఎప్పుడును బరియాచకమేనా'యని రాయలడుగ, రామకృష్ణుడు 'మహారాజా ! పరియాచకమాడుట కే నెంతవాడను, ఉన్నదున్నట్లుగనే చెప్పితిని, వలయునేని యొకపద్యమును నిదర్శన పూర్వకముగ జదివి చూపింతును.

శా. 'ఆనిష్టానిధిగేహసీమ నడు రేయాలించినన్ మోవియున్
     తేనాగేంద్ర శయాను పుణ్యకథలుం దివ్యప్రబంధాను సం
     ధానధ్వానమునాస్తి శాకబహు తా, నాస్త్యుష్ణతా, నాస్త్యపూ
     పో, నాస్త్యోదన సౌష్టవంచ కృపయాభోక్తవ్యమన్నల్కులున్ •

తా. కూరలాట్టేలేవు. అందున్న కొంచమైనను వేడిగాలేవు. పిండివంటలు, అన్నముకూడ నంత బాగుగాలేదు. దయచేసి భోజనము చేయుడు.

దీనిలో నిజముగా సందర్భమున్న దా! యని రామకృష్ణుడడుగగా రాయ లాశ్చర్యాన్వితస్వాంతుఁడై ' రామకృష్ణా! నీ సాహసమును మెచ్చుకొంటి' నని బహుమాన మొసంగెను.


20 ఠీవి

రాయల యాస్థానమున ఠీవిగా గూర్చుండువారు సామంతరాజులు. ఆ సామంతుల ఠీవిని జూచినపుడెల్ల రాయలకే నవ్వు వచ్చుచుండును. ఒకనాడు సభలో రాయ లందరనుజూచి, 'ఠీవి విషయమై ప్రసక్తి వచ్చినప్పుడు మా సామంతులను జెప్పి, మరియొకరి పేరెత్తవలయు' అనఁగా, రామకృష్ణుడు లేచి 'మహారాజా! కోపింపకుడు, నాఠీవిసంగతి మీ రెఱుగరు కావున నట్లు జెప్పుచున్నారు. ఎల్లప్పుడు నేను గురుగుకూర, తిందును. తరిగినకూర యన్న నాకు జాల ప్రీతి ఆగి మన్న పడిచత్తును. మేకయెరువు కుంపటి బెట్టుకొని హాయిగా నులక మంచంమీద ఠీవిగా పండుకొందును' అనెను

'ఏమిఠీవి అదియా నీఠీవి' యని రాయలపహసింపగా, రామకృష్ణకవి 'ప్రభువువారు విష్ణుచిత్తీయమున నెట్లు సెలవిచ్చినారో మఱచిపోయినట్లున్న ది వినుడు.

‘మ. గురుగుంజెంచలి తుమ్మిలేఁదగిరి నాకుందింత్రిణీపల్లవో
      త్కరముంగూడ పొరంటి నూనియలతో గట్టవికుట్టారిగో
      గిరిముల్మెక్కి తమిం బసుల్పొలములోఁ గ్రేపున్మెయిన్నాకమే
      కెరువున్ గుంపటి మంచ మెక్కిరి ప్రభుత్వైకాప్తిరెడ్లజ్జడిన్'

ఆమాటలు విని రాయ లెంతమాత్రము గినియక చాల ధన మొసగి సత్కరించెను.