జ్యోతిష్య శాస్త్రము/జాతకుని జాఫతకము

వికీసోర్స్ నుండి

46. జాతకుని జాఫతకము[మార్చు]

ఇంతవరకు జ్యోతిష్యము ప్రకారము జాతకమును (జాఫతకమును) తెలుసుకొను నిమిత్తము కావలసిన సూత్రములన్నిటినీ వివరించుకొన్నాము. నేడు ఏ మనిషికైనా పుట్టిన తేదీ, పుట్టిన సమయమును ఇస్తే కంప్యూటర్‌లో ముందే సెట్‌ చేయబడిన జాతకము బయటపడును. పూర్వకాలము పుట్టిన దినమునకు సంబంధించిన ఆ సంవత్సర పంచాంగమును తీసుకొని చూచి దాని ద్వార జాతకమును తీసుకోవలసియుండెడిది. జన్మలగ్నము కొరకు, దశా సంవత్సరము కొరకు కొంత గణితమును ఉపయోగించి లెక్కాచారము ప్రకారము వ్రాసుకోవలసియుండెడిది. దానికొరకు జ్యోతిష్యులు 100 సంవత్సరముల వరకు పాత పంచాంగములను తమవద్ద దాచుకొనెడివారు. జాతక లగ్నములను వ్రాయుటకు వారము దినములు పట్టెడిది. నేడు అటువంటి అవసరము లేకుండ ఐదు నిమిషములలో జాతక లగ్నము లభించుచున్నది. ఇదంతయు సర్వసాధారణముగా నవగ్రహముల జాతకములే కంప్యూటర్‌లో లభించుచున్నవి. మేము ఈ గ్రంథములో పన్నెండు గ్రహములను చెప్పాము. కావున వాటిని అనుసంధానము చేసి మిగత సూత్రములను చెప్పవలసి వచ్చినది. ఇంతవరకు మేము చెప్పిన సూత్రములను ఉపయోగించి ఒక జాతకునికి జీవితమెట్లుండునో తెలియుటకు ఉదాహరణకు ఏదో ఒకరి జాతకమును తీసుకొని చెప్పాలి. ఎవరికీ తెలియని మనిషి యొక్క జాతకమును గురించి చెప్పితే అది నిజమెంతో అబద్దమెంతో తెలియదు. కొందరికి తెలిసిన వ్యక్తి జాతకమును గురించి చెప్పితే అందులో సత్యాసత్యములు కొన్ని అయినా తెలియునను ఉద్దేశ్యముతో చాలామందికి తెలిసిన ఒక వ్యక్తి జాతకమును గురించి వివరించదలుచుకొన్నాను. వాస్తవముగా నేను జ్యోతిష్యుడను కాను. అందువలన నేను ఎవరికీ జ్యోతిష్యమును చెప్పను. అలాగే కొంత వరకు వైద్యమును గురించి తెలిసినా నేను వైద్యుడను కాను వైద్యము చేయనుగానీ, ఆపదలోనున్న వారు వచ్చి అడిగితే వారికి సలహా చెప్పి పంపేవాడిని. రోగమును గురించి వివరించి చెప్పి మందును గురించి సలహా చెప్పేవాడిని మాత్రమే. ఎంతమందికి రోగాలు పోయాయి అనేది నాకు తెలియదుగానీ, నాకు సలహాజెప్పడము మాత్రమే తెలుసు. ఇక్కడ ముఖ్యముగా హిందూ సమాజమునకు సంబంధించిన జ్యోతిష్యము కొంతమంది చేత హేళన చేయబడుచుండడము వలన అటువంటి స్థితినుండి బయటపడుటకు, జ్యోతిష్యము యొక్క విలువ పది మందికి తెలియుటకు మేము ఈ జ్యోతిష్య గ్రంథమును వ్రాయాలను కొన్నాము, వ్రాశాము. జ్యోతిష్యము సత్యమా కాదా అని నేను పరిశోధించి సత్యమేనని తెలుసుకొన్న తర్వాత, అటు అనుభవములను నేను చూచిన తర్వాత ఇంతగొప్పగాయున్న దానిని గురించి కొంతయినా ఇతరులు తెలియుట మంచిదను భావముతో జ్యోతిష్యములోని క్రొత్త విషయములను గురించి చెప్పడము జరిగినది. జ్యోతిష్యము తెలుసుకొనుటకు మాత్రమేగానీ, రాబోవు దానిని తెలుసుకొని తప్పించుకొనుటకు గాదు. తెలుసుకొన్నంత మాత్రమున రాబోవు ఆపదను తప్పించుకొనుటకు వీలుపడదు. ఆపద జరుగకుండ ఉండుటకు శాంతులు చేయవచ్చునని కొందరంటుంటారు. అదంతయు కేవలము భ్రమ మాత్రమే. జాతకరీత్యా ఏమి జరుగవలెనని నిర్ణయించబడియుండునో అది జరిగితీరును. ప్రపంచ కార్యములతో ఏమి చేసినా జరిగేది జరుగక మానదు. కర్మనుండి తప్పించుకోవాలనుకొంటే ఒక జ్ఞానము తప్ప మరేదీ లేదు. జ్ఞానము వలన కర్మ కాలిపోవునని ముందే చెప్పుకొన్నాము. జ్ఞాన సంబంధములేనిది కర్మపోదు అనుటకు నా అనుభవములోని ఒక విషయమును చూస్తాము. 1994వ సంవత్సరము నాకు పరిచయమున్న వ్యక్తి యొక్క జాతకమును చూడడము జరిగినది. ఆ దినము ఆయన తన జాతకమును చూడమని నన్ను అడగలేదు. అయినా నేనే అడిగి ఆయన పుట్టిన దినమునూ, పుట్టిన సమయమునూ తెలుసుకొన్నాను. నేను ఏ విషయము లోనూ బయటపడను. ఆ రోజు నేనే ఎందుకు ఆయన పుట్టిన తేదీ (డేట్‌ ఆఫ్‌ బర్త్‌) అడిగానో నాకు తెలియదు. తర్వాత ఆ డేట్‌ ప్రకారము జాతకమును చూచి ఆయన జాతకము అంతా బాగుంది అని తెలుసు కొన్నాను. అయితే అతను ప్రమాదములో అకాల మరణము పొందునని తెలుసుకొన్నాను. నాకు పరిచయమున్న ఒక మంచి వ్యక్తి అలా చనిపోవునని తెలియడము బాధాకరమే, అయినా కర్మను ఏ ప్రపంచ శాంతులచేతగానీ, అనుభవించకుండా తప్పించుకొనుటకు వీలులేదు. భగవంతుడు చెప్పిన దానిప్రకారము ఎంతటి కర్మనైనా జ్ఞానమువలన దానినుండి తప్పించు కోవచ్చును. అయితే కర్మవున్న జాతకునికి జ్ఞానము ఉండాలి కదా! ఒకవేళ నేను ప్రమాదమును గురించి చెప్పినా ఆ వ్యక్తి నామాట వినునను నమ్మకము లేదు. అందువలన ఆ విషయమును అలాగే వదలివేశాము. ఆయన ప్రమాదమును గురించి నాకు పరిచయమున్న వారితో చెప్పడము జరిగినది. ప్రమాద విషయము జ్యోతిష్యశాస్త్రము ద్వారా తెలుసుకోగల్గినా, ఆ ప్రమాదము దేనివలన జరుగుతుందనిగానీ, ఖచ్ఛితముగా ఎప్పుడు జరుగు తుందనిగానీ, నాకు కూడా తెలియదు. పైగా జ్యోతిష్యము మీద నాకు కొంతవరకు నమ్మకమున్నా, నేను తెలుసుకొన్నది వాస్తవమేనా అని నాకే కొంత అనుమానముండేది. అయినా నాలో ఒకవైపు జ్యోతిష్యము అసత్యము కాదని అనిపించేది. నేను ఎక్కడా బయట తిరగను, ఎవరితోనూ ఎక్కువగా సంబంధము పెట్టుకోను. ఇప్పుడు కూడా నా గ్రంథములు ఎక్కువగా సమాజములో ప్రచారమైనా నేను ఎవరో కూడా చాలామందికి తెలియదు. అటువంటి నేను తర్వాత 2002వ సంవత్సరము నావెంట జిహ్వానందస్వామి రాగా ఇద్దరము కలిసి ఆ జాతకుని దగ్గరకుపోయి ఆ సంవత్సరము ఆగష్టు నెలలో జరుగు కృష్ణాష్టమి సందర్భముగా జరుగు ఆధ్యాత్మిక సభలో మేము వ్రాసిన ఒక గ్రంథమును ఆవిష్కరించమని అడిగాము. అప్పుడు ఆయన ‘‘ నేను మత సంబంధమైన సభలకు రాను’’ అని చెప్పడము జరిగినది. అంతటితో మేము వెను తిరిగి వచ్చాము. అప్పుడు నా ప్రక్కనున్న మనిషితో ‘‘ఇది దేవునికి దేవుని జ్ఞానమునకు సంబంధించిన సభ. గ్రంథము కూడా అటువంటిదే. ఈ సభకు వచ్చియుంటే ఆయన కర్మలో కొంత మార్పు వచ్చేది’’ అని చెప్పాము. అంతటితో ఆ విషయమును మేము మరచి పోయాము. తర్వాత కొన్ని సంవత్సరములకు 2008 సంవత్సరములో ఆయన ప్రయాణించు హెలిక్యాప్టర్‌ చేరవలసిన స్థలమునకు చేరలేదు, ఏమి జరిగిందో అని కొందరనుకోవడము ఆళ్లగడ్డలో హోటల్‌లో భోజనము చేస్తూ విన్నాము. అప్పుడు నా వెంట పదిమంది నాకు భక్తులైనవారే ఉన్నారు. అప్పుడు నా తలలో 1994వ సంవత్సరములో చూచిన జాతకము జ్ఞాపకము వచ్చినది. నాకు ఆయన ప్రయాణ వార్త దాదాపు 1-20 నిమిషము లప్పుడు తెలిసినది. ఒక నిమిషము ఆలోచించి అది మేము జాతకములో చూచిన ప్రమాదమే అయి ఉంటుందని అనుకొని, ఆ విషయమును నా ప్రక్కనే యున్న మా వారికి చెప్పడము జరిగినది. నేను ఏది అనవసరముగా చెప్పనని తెలిసిన మా భక్తులు నేను చెప్పిన మాటను పూర్తి విశ్వసించారు. ఆయనకు ప్రమాదము జరిగినదని రెండవ రోజు వరకు తెలియకున్నా మేము మాత్రము ముందే అది ప్రమాదమే అయివుంటుందనీ, జాతకము ప్రకారము జరిగిన దనీ అనుకొన్నాము. ఈ సంఘటనతో జ్యోతిష్యము పూర్తి సత్యమని మేము తెలుసుకోగలిగాము. నాకు సత్యమని తెలిసిన తర్వాత అదే విషయమునే బయటికి జ్యోతిష్యము సత్యమని చెప్పుచున్నాము.

నాకు తెలిసిన జ్యోతిష్యము ప్రకారము, ఇంతవరకు ఈ గ్రంథములో వ్రాసిన పన్నెండు గ్రహములను ఉపయోగించి ఇప్పుడొక జాతకమును వివరిస్తాను చూడండి. ఈ జాతకుడు పుట్టిన తేదీ, పుట్టిన కాలమును చూస్తే ఇలా కలదు. 21వ తేదీ, డిశంబరు 1972 గురువారం రాత్రి 1-30 A.M సమయములో జమ్మలమడుగులో జన్మించినట్లు కలదు. ఇతను జన్మించిన సమయములో ప్రారబ్ధకర్మ ఎలా నిర్ణయించబడినదో, అతని జన్మలో మొదటనే నిర్ణయించబడిన జాఫతకము అను జీవిత ఫతకము ఏమిటని చూచుటకు ముందు ఖగోళములో ఆ సమయానికి పన్నెండు గ్రహములు ఏది ఎక్కడున్నదో తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడమేకాక సూర్యుని కిరణములు కర్మచక్రము మీద ఏ భాగములో పడుచున్నవో తెలియ గలగాలి. ఇదంతా మనము పంచాంగమునుండి గ్రహించవలసియున్నది. అయినా ఈ కాలములో అటువంటి శ్రమ ఎవరికీ అవసరములేదు. అన్ని లెక్కలను కంప్యూటర్‌ చేసి మనకు జాతకుని జన్మ లగ్నము, జాతకునికి గ్రహములు ఏయే లగ్నములందు ఏయే నక్షత్రములలో గలవో, అలాగే నక్షత్రము యొక్క ఎన్నో పాదములో గ్రహముగలదో సులభముగా తెలియు చున్నది. అంతేకాక పుట్టిన సమయములో జాతకుడు ఏ దశలో ఉన్నాడో, జరుగబోవు దశలు ఏవో కూడా తెలియుచున్నది.

ఒక జాతకమును చూడవలసి వచ్చినప్పుడు జ్యోతిష్యుడు అతను పుట్టిన (జాతకుడు పుట్టిన) కాలమును ఆధారము చేసుకొని మొదట లగ్న కుండలియందున్న పన్నెండు లగ్నములలో ఏ లగ్నము జన్మలగ్నమగు చున్నదో తెలియవలెను. జన్మ లగ్నమును తెలియుటకు జాతకుడు పుట్టిన సమయము 1972-12-21వ తేదీ రాత్రి 1-30 నిమిషములకు అయినప్పుడు ఆ దినము సూర్యోదయము 6-42 నిమిషములకు జరిగినది. పంచాంగము ప్రకారము ఆ దినము సూర్యుడు మూల 2వ పాదములో ఉండుట వలన మూల నక్షత్రముగల ధనుర్‌ లగ్నము ఉదయమున్నదని తెలిసినది. ధనుర్‌ లగ్నము తెల్లవారకముందే 27 నిమిషములు గడచిపోయినది. తెల్లవారిన తర్వాత మిగిలిన ధనుర్‌లగ్నము 1-40 నిమిషములు.

కన్యాలగ్నమున 22 నిమిషములు మిగిలియున్నది. కనుక ఈ జాతకుడు కన్యా లగ్నములో జన్మించాడని చెప్పవచ్చును. క్రింద జన్మ కుండలిలో జనన లగ్నముగా కన్యాలగ్నమును నిర్ణయించడమైనది అలాగే గుర్తించాము. లగ్నమునుండే మిగతా లగ్నములను లెక్కించుకోవాలి.

జాతకుని పేరు జగన్‌, అతని జన్మనక్షత్రము ఆరుద్ర 2, జగన్‌ జన్మలగ్నము తర్వాత పేజీలోగల చిత్రపటములో చూడవచ్చును.

55వ పటము

జనన సమయములో పన్నెండు గ్రహములు ఏయే లగ్నములలో ఉన్నది గుర్తించుకొన్నాము. ఏ గ్రహము ఏ నక్షత్రములో ఉన్నదో, ఏ పాదములో ఉన్నదో క్రింద చూస్తాము.

ఇంకనూ మూడు గ్రహములు ఏ నక్షత్రములో ఏ పాదములో ఉన్నదీ తెలియదు. దానిని ముందు వివరముగా తెలుసుకొందాము.

జాతకుని జన్మకుండలిలోని (కాలచక్రములోని) పన్నెండు లగ్నములలో తొమ్మిది గ్రహములను మాత్రము గుర్తించుకొన్నాము. మిగత మూడు గ్రహములను గుర్తించుకోవలసియున్నది. వాటిని సులభముగా గుర్తించుకొనుటకు జన్మ లగ్నకుండలిని (కాలచక్ర భాగములను) నక్షత్ర పాదముతో గుర్తించుకొనునట్లు పెద్దగా వ్రాసుకొని తర్వాత పేజీలోగల 56వ చిత్రటములో చూస్తాము.

భూమి సూర్యునికి ఎదురుగా సమాన వేగముతో తిరుగుచున్నది. కావున సూర్యుడు ధనుర్‌లగ్నమున మూలా నక్షత్ర రెండవ పాదములో యుంటే, భూమి సూర్యునికి ఎదురుగా మిథునలగ్నమున మృగశిర నక్షత్ర 4వ పాదమున ఉన్నట్లు తెలియుచున్నది. అలాగే మిత్ర గ్రహము కేతువు క్రింది పాదములోయుంటూ కేతువునుబట్టి సమానముగా కదలుచుండును. కావున కేతువు ఎక్కడుంటే దానిక్రింది పాదమే మిత్రదని తెలియవలెను. ఈ జాతకము ప్రకారము మిత్ర పునర్వసు 2వ పాదములో ఉన్నట్లు తెలియుచున్నది. ఇకపోతే చిత్ర గ్రహము యొక్క విషయానికి వస్తే చిత్ర ఎల్లప్పుడూ రాహు గ్రహమును అనుసరించి కదలుచూ రాహువున్న నక్షత్రము కంటే క్రింది నక్షత్రములోయున్నది. కావున చిత్ర రాహువుకంటే క్రింద
56వ చిత్రపటము
నక్షత్రములో పూర్వాషాడ 4వ పాదమున ఉన్నట్లు తెలియుచున్నది. ఇప్పుడు వెనుక ఖాళీగాయుంచిన మూడు గ్రహముల నక్షత్రములనూ, వాటి పాదములను గుర్తించుకొందాము.

ఇంతవరకు జన్మలగ్నమునూ, జన్మకుండలిలో గ్రహములు ఏయే పాదములలో ఉన్నదీ, క్రొత్త గ్రహములు ఎక్కడున్నదీ, జాతకుని జనన సమయములో ఏ దశయున్నదీ తెలుసుకోగలిగాము. ఇప్పుడు పన్నెండు గ్రహములు ఏ లగ్నములోయున్నవో, ఏ లగ్నములను తమ చేతులతో తాకుచున్నారో క్రింద తెలుసుకొందాము. అలా వ్రాసుకొని చూచుకోవడము వలన గ్రహములు స్వయముగా ఉన్న స్థానములు ఏవో, దూరమునుండి ఏ గ్రహములను తాకుచున్నవో తెలుసుకొందాము. ఏ జాతకునికైనా జనన లగ్నకుండలి ముఖ్యము. పుట్టినరోజు పన్నెండు స్థానములలోనున్న గ్రహములు జీవితాంతము ఆ స్థానములనుబట్టి వ్యవహరించుచుండును. పన్నెండు గ్రహములలో ఎనిమిది గ్రహములు ముందుకు తిరుగుచుండగా, నాలుగు గ్రహములు వెనక్కు అపసవ్యముగా తిరుగుతూ తన బాధ్యతను నిర్వర్తించుచున్నవి. జనన సమయములో వేరువేరు జాగాలలోనున్న పన్నెండు గ్రహములు తర్వాత వాటి వేగమునుబట్టి అవి వేరువేరు స్థానములలో తిరుగుచున్ననూ జాతకుడు పుట్టిన సమయములో తమకు అప్పగింపబడిన విధి విధానమును మరువక దానిప్రకారమే నడుచుకొనుచూ, కాలగమనములో (గ్రహ గమనములో) ఏ స్థానములోనికి పోయినా అక్కడున్న ఫలితమును అందివ్వాలని చూచుచుండును. మంచి గ్రహములు మంచిస్థానములలోనికి పోయినప్పుడు అక్కడున్న మంచి ఫలితములను అందివ్వాలని చూచుచుందురు. మంచి గ్రహములు చెడు స్థానములలోనికి పోయినప్పుడు అక్కడున్న చెడు ఫలితములను ఏమాత్రము జాతకునికి ఇవ్వరు. అలాగే చెడు గ్రహములు చెడు స్థానములలోనికి పోయినప్పుడు అక్కడున్న చెడు ఫలితములను ఇచ్చి కష్టపెట్టుటకు ప్రయత్నించుచుండును. ఒకవేళ చెడు గ్రహములు మంచి స్థానములలోనికి పోయినప్పుడు అక్కడున్న మంచిని ముట్టుకోరు ఎటుతిరిగి జాతకుని కష్టపెట్టుటే వారిపని, కనుక మంచి స్థానములో నున్నప్పుడు కూడా వారు మంచి చేయరు. జాతకుని జన్మ కర్మమునుబట్టి గ్రహములు మంచి గ్రహములుగా, చెడు గ్రహములుగా విభజింపబడి యున్నారు. కావున వారి కర్తవ్యము ప్రకారము వారి పనులను తూచ తప్పక చేయుచున్నారు. ఎంతో బాధ్యతాయుతముగా పనిని చేయుచున్న గ్రహములు, ఎటువంటి కర్మనైనా తమ ద్వారానే వచ్చునట్లు తమ ద్వారానే అనుభవించునట్లు చేయుచున్నారు.

కర్మ విషయములో మొత్తము బాధ్యతంతా పన్నెండు గ్రహముల మీదనే ఉండునట్లు ప్రకృతి నియమించినది. ప్రకృతిని ఆదేశించినవాడు దేవుడుకాగా, ఎక్కడా దేవుని పాత్రలేకుండా, దేవుడు ఏ పనినీ చేయకుండా ప్రపంచము మొత్తమును ప్రకృతి శాసించి నడుపుచున్నది. సృష్ఠి ఆదిలోనే ఆదేశింపబడిన ప్రకృతి, తాను అన్నిటికీ ఆదేశమిచ్చి నడిపించుచున్నది. ఇవన్నియు ప్రతి నిత్యమూ ఒకరికొకరు చెప్పుకొను విషయములు కావు. సృష్ఠ్యాదిలో చెప్పబడినట్లే క్రమము తప్పకుండా అన్నీ ఆచరించుచున్నవి. కర్మ విధానమంతా పన్నెండు గ్రహముల ద్వారానే జరగాలి. కర్మను మనిషి కపాలములో చేర్చుటకుగానీ, ఆ కర్మ ప్రారబ్ధముగా బయటకు వచ్చినప్పుడు దానిని అనుభవింపజేయుటకుగానీ, కర్మవిషయములో అన్ని పనులనూ పన్నెండు గ్రహములు చేయవలసిందేనని తెలియుచున్నది. కర్మవిధానము ప్రకారము కర్మను అనుభవింపచేయు గ్రహచారముగాయున్నవి. ద్వాదశ గ్రహములే. జ్ఞానము వలన దహింపబడు కర్మను తొలగించునవిగాగానీ, జ్ఞానదూషణవలన పుట్టుకొచ్చు క్రొత్తకర్మను అనుభవించునట్లు చేయుటకు గానీ దశాచారరూపములో కూడా పన్నెండు గ్రహములే కలవు. ప్రపంచ విధి విధానము ప్రకారము జనన సమయమునుబట్టి ఆ జన్మలో కష్ట సుఖములను అందించు మొత్తము విధానమును గ్రహచారము అని అంటున్నారు. అలాగే దైవ విధానమునుబట్టి ప్రస్తుత జన్మలోనున్న కష్టములను (కర్మలను) లేకుండా చేయడముగానీ, లేని కర్మలను తగిలించ డముగానీ, చేయు మొత్తము కార్య విధానమును దశాచారము అని అంటున్నారు. ప్రపంచ జ్ఞానము ప్రకారము ప్రారబ్ధకర్మలలోగల చిన్న కర్మను తీసివేయుటగానీ లేని దానిని తగిలించుట గానీ ఏమాత్రము చేయని ద్వాదశ గ్రహములు దైవవిధానములో అదే జన్మలో తీసివేయడము, తగిలించడము కూడా జరుగుచున్నది. ఇటువంటి కార్యముల కొరకు దశలు, దశాచారములని ప్రత్యేక విభాగమున్నదని చెప్పుకొన్నాము. దశాచారములో మంచి చెడు దశలు, జ్ఞాన అజ్ఞానములనుబట్టి కర్మను సవరించుటకు తయారు చేయబడినవి. గ్రహచారము ప్రకారము మంచి ఫలితములు వచ్చునప్పుడు, మంచి కర్మ అమలు జరుగుచున్నప్పుడు, మంచి కర్మను అమలు చేయునవి పన్నెండు గ్రహములలోని ఆరు గ్రహములు. ఆరు గ్రహములు ఒక గుంపుగా మరొక ఆరు గ్రహములు మరొక గుంపుగా ఏర్పడి తాము జీవితాంతము చెడుగా ఎవరు ప్రవర్తించాలి (పాపమును ఎవరు పంచాలి) యనీ, అట్లే మంచిగా పుణ్యమును ఎవరు అందివ్వాలని మనిషి పుట్టినప్పుడే అతను పుట్టిన కాలమునుబట్టి నిర్ణయించుకొని జీవితాంతము అలాగే ప్రవర్తించుచుందురు. అదంతయు గ్రహచారము అనుకొన్నాము.

ఒక మనిషికి పుణ్యకర్మ అమలు జరుగునప్పుడు, పుణ్యము ప్రకారము మంచి సుఖములు అందునప్పుడు అతను దేవుని విధానములో ప్రవేశించి జ్ఞానదూషణ చేశాడనుకొనుము. అప్పుడు దశాచారములోని చెడు గ్రహము అతడు చేసిన దూషణకు ప్రతిగా వచ్చిన పాపమును స్వీకరించి తన దశలో వానిని ఆ పాపముచేత హింసించును. జ్ఞానదూషణ చేసిన వ్యక్తికి అమలు జరుగు పాపమును ఏ యోగులూ క్షమించలేరు, ఏ జ్ఞానమూ దానిని దహించదు. దానిని తప్పక అనుభవించు క్షమించబడని పాపము అంటాము. గ్రహచారములో గల కర్మను యోగులైనవారు క్షమించవచ్చును. జ్ఞానము ప్రారబ్ధకర్మను కాల్చగలదు. ప్రతి మనిషికీ గ్రహచారము సర్వసాధారణము. అదంతయు మనిషి చేసుకొన్న ప్రారబ్ధకర్మనుబట్టియుండును. దానిలో ఒకమారు పుట్టుక సమయములో నిర్ణయింపబడిన కర్మను ప్రపంచ విధానము లో ఏ ప్రక్రియ మార్చలేదు. ఎటువంటి వాడుగానీ, దానినుండి తప్పించు కొనుటకు వీలులేదని చెప్పుకొన్నాము. అయితే దశలు మాత్రము ప్రపంచ విధానములో ఏమీ ఉపయోగపడవు. అవి దైవవిధానములోని సృష్ఠించబడు పాపములకు, పాప నిర్మూలనమునకు తయారు చేయబడినవని తెలియ వలెను. ఒక విధముగా మానవునికిది ఒకవైపు శాపములాంటిది, మరొకవైపు వరములాంటిది. జ్ఞానదూషణ దైవదూషణ చేసినవానికి శాపములాంటిదని చెప్పవచ్చును. అలాగే దైవజ్ఞానము పొందినవానికి వరములాంటిదని చెప్పవచ్చును. ఈ రెండు విధానములున్న దశలను ఎలా కనుగొవాలి అను విషయుమును తర్వాత చెప్పుకొందాము. ఇప్పుడు జన్మ లగ్న కుండలి లోని గ్రహములకు ఇరుగిల్లు పొరుగిల్లు ఏవిగలవో ప్రక్క పటము చూస్తాము.

ఇక్కడ పైన చూపించిన జన్మలగ్నకుండలిలో పన్నెండు గ్రహలను మొత్తము ముఫ్పై స్థలములలో చూపడము జరిగినది. పదునెనిమిది (18) చోట్లనున్న గ్రహములకు చుట్టూ గుండ్రని గుర్తు పెట్టడము జరిగినది. మిగత పన్నెండు (12) గ్రహములకు గుండ్రని గుర్తులేదు. గుండ్రని గుర్తులేనివి జన్మ సమయములో ఆయా స్థలములోనున్నవని తెలియువలెను. తులలో కుజుడు, వృశ్చికములో శుక్ర బుధులు, ధనస్సులో సూర్య గురు రాహు చిత్రగ్రహములు, వృషభములో శని, మిథునములో భూమి చంద్ర కేతు మిత్రగ్రహములు జనన సమయములో ఉన్నట్లు గుర్తించాము. గుండ్రని గుర్తులోపలనున్న గ్రహములు అక్కడ లేకున్నా తమ చేతుల ద్వారా ఆ లగ్నములను తాకినట్లు లెక్కించుకోవలెను. గ్రహములు చేతులనుంచినా అక్కడున్నట్లే లెక్కించబడుచున్నవి. ఈ జాతకుని జన్మలగ్న కుండలిలో కన్యాలగ్నము జన్మలగ్నమని తెలిసిపోయినది. ఆత్మల వరుస ప్రకారము 2:1 అను సూత్రము ప్రకారము కన్యాలగ్న జాతకునికి శుభగ్రహము అశుభగ్రహములు తెలిసిపోవుచున్నవి. శుభ అనగా పుణ్యమును పాలించు మిత్రత్వముగల గ్రహములనీ, అశుభ అనగా పాపమును పాలించు శత్రుత్వగ్రహములని చెప్పవచ్చును. కన్యా లగ్నమునకు శుభ, అశుభగ్రహములు ఇలా గలవు చూడండి.

భూమి మీద మనిషి జనన సమయమునుబట్టి, కాలచక్రములో సూర్యుని కదలికనుబట్టి జన్మ లగ్నమైన తమ స్థానము తెలిసిపోవుచున్నది. కుండలిలోని పన్నెండు స్థానములలో జన్మలగ్నము ఏదైతే అది శరీర స్థానమైనప్పుడు అక్కడినుండి చివరిది పన్నెండవది వ్యయం స్థానమగు చున్నది. పన్నెండు లగ్నములలో మంచి చెడు గ్రహములుండగా, పన్నెండు రాశులలో అనగా కర్మచక్ర స్థానములలో పాపపుణ్యముల కర్మలుండును. పుణ్య కోణములను 1,5,9 స్థానములలో మనిషి పుణ్యముండగా, పాపకోణములనబడు 3,7,11 స్థానములలో పాపముండును. మూడు స్థానములలో పుణ్యము, మూడు స్థానములలో పాపము ఉండగా, మిగిలిన ఆరు స్థానములలో పాపపుణ్య మిశ్రమము ఉండును. కర్మచక్రములోని పాప పుణ్యరాశుల మీద గ్రహములు కిరణములను ప్రసరింపజేయుచూ కాలచక్రములో తిరుగుచున్నవి. అలా తిరుగుచూ జనన సమయములో వారు ఏ లగ్నములలో ఉన్నారో క్రింది పటములో తెలుసుకొందాము.

గుండ్రని గుర్తుతో గుర్తించిన గ్రహములు ఆ స్థానములో లేకున్నా మిగత స్థానములలో ఉండి అక్కడినుండి తమ హస్తములను ఉంచి ఈ రాశులలోని కర్మలను గ్రహిస్తాయని తెలియవలెను. గుండ్రని గుర్తులేని గ్రహములు జనన సమయములో మనము గుర్తించిన లగ్నములలో ఉండి అక్కడే పనిని చేయుచున్నవని తెలియుచున్నది.

జాతకము అన్ని విధముల అర్థమగుటకు జాతకలగ్నమును గుర్తించుకొని చూచాము. జన్మలగ్న కుండలిలో గుర్తించుకోవలసినది ఏమీ లేదు. అందువలన గ్రహచారమునకు సంబంధించిన జనన లగ్నము పూర్తి తెలిసిపోయినది. గ్రహచారములో ఫలితములెట్లున్నాయి, భవిష్యత్తు ఎలా ఉంటుంది అను విషయమును దశాచారమును గుర్తించిన తర్వాత చూస్తాము. ఇప్పుడు ఈ జాతకుని దశాచారమును ఎలా వ్రాసుకోవాలో తెలుసుకొందాము. జన్మదిన నక్షత్ర పరిమాణమును తెలుసుకొనుటకు ముందుదిన నక్షత్రమును ఆధారము చేసుకొని చూడవలెను. జాతకుడు పుట్టినది పౌర్ణమి బుధవారము రాత్రి 1-30 గంటలకు అయినందున, ఆ దినము మృగశిర రాత్రి 6-53 నిమిషములకే అయిపోయిన దానివలన, తర్వాత వెంటనే ఆరుద్ర నక్షత్రము ప్రారంభమై జాతకుడు పుట్టిన సమయములో ఆరుద్ర ఉండుట వలన ముందుదిన నక్షత్రము మృగశిర అగుచున్నది. ఆరుద్ర నక్షత్రము యొక్క పూర్తి కాలమును తెలియుటకు మృగశిరను ఎలా ఉపయోగించుకొంటున్నామో క్రింద చూడండి. ప్రతి నక్షత్రము యొక్క పూర్తి పరిమాణము 60.00 గడియలు. అయితే దానిలో కొద్దిగ ఎక్కువగానీ, కొద్దిగా తక్కువ గానీ నక్షత్రములు గడచుచుండును. పంచాంగములో తొమ్మిది గ్రహములలో ఎనిమిది గ్రహముల గమనములను, నక్షత్ర ప్రవేశములను వ్రాసియుందురు అయితే ఒక్క చంద్రున్ని గురించి వ్రాసియుండరు. పంచాంగము ప్రకారము ఏ గ్రహము ఎక్కడున్నది, ఏ లగ్నములో, ఏ నక్షత్రములోయున్నది తెలియవచ్చును. చంద్రుడు ఏ నక్షత్రములో ఉన్నదీ, ఏ లగ్నములో ఉన్నది తెలియాలంటే మనమే స్వయముగా గణితమును ఉపయోగించి తెలియవచ్చును. గణితమును ఎలా చేయాలో ప్రక్కపేజీలో వ్రాసి చూపిస్తాము దాని ప్రకారము ఎవరైనా చేసుకోవచ్చును.

ఇంతవరకు జాతకుని యొక్క గ్రహచారములో చంద్రుడు ఎక్కడున్నాడో, ఏ నక్షత్ర పాదములోయున్నాడో గణితము ద్వారా తెలియ గలిగాము. చివరకు చంద్రుడు మిథునలగ్నములో ఆరుద్ర రెండవ పాదములో ఉన్నట్లు తెలిసినది. జాతకుడు పుట్టిన సమయములో సూర్యుడు ఎక్కడున్నాడని తెలియుటకు గత పేజీలలో చెప్పుకొన్నాము. సూర్యోదయము మొదలు జాతకుడు పుట్టిన సమయము వరకు లెక్కించి సూర్యున్ని తెలియ గలిగి అతడున్న లగ్న కిరణములనుబట్టి జాతకుని జన్మ లగ్నమును తెలియ గల్గుచున్నాము. గ్రహచార విధానములో జన్మ లగ్నము ఎంత ప్రాధాన్యత కల్గియున్నదో, అలాగే గ్రహచార విధానములో చంద్రుని ద్వారా తెలియ బడు ప్రారంభ దశ ఏదో తెలియడము కూడా ముఖ్యమైనదే. ప్రారంభం దశను తెలియగలిగితే దానికి అనుబంధముగాయున్న దశలను వరుసగా తెలియగలము. ప్రస్తుత జన్మలో ఏ దశ, ఎక్కడి నుండి ప్రారంభమగుచున్నదో తెలియగల్గితే గతజన్మలో చనిపోయినది ఫలానా దశలో ఫలాన కాలములో అని చెప్పవచ్చును. ఇక్కడ కొందరికి అనుమానము రావచ్చును. ఈ జన్మలోనిదే సరిగా తెలియలేకున్నాము. అటువంటప్పుడు గతజన్మలోని మరణ విషయమును తెలియవచ్చుననుమాట ఎంతవరకు సత్యమని అడుగ వచ్చును. దానికి మేము చెప్పునదేమనగా! ఒక ప్రయాణికుడు కాలినడకన దూరప్రయాణము చేయుచూ మధ్యలో చిన్న ఊర్లను అక్కడక్కడ పెద్దఊర్లను దాటుచూ పోవుచున్నాడనుకొనుము. అతడు పగలంతా ప్రయాణము చేసి రాత్రిపూట ఒకచోట ఆగి ఉదయము తిరిగి అక్కడినుండి బయలుదేరి పోయెడివాడు. వాని విషయములో వాడు రాత్రి ఎక్కడైతే ఆగాడో, తిరిగి ఉదయము అక్కడినుండే బయలుదేరునని చెప్పడములో సత్యమున్నట్లే, ఒక వ్యక్తి పొడవాటి జీవిత ప్రయాణములో రాత్రివలెనున్న మరణము వచ్చినప్పుడు ఏ సమయములో చనిపోయాడో వాడు తిరిగి అదే సమయము లోనే జన్మించి తన జీవిత ప్రయాణమును సాగించుచున్నాడని చెప్పడము సత్యమేయగును. ఒకడు గతజన్మలో ఒక దశలో ఏ సంవత్సరము, ఏ నెల, ఏ దినము, ఏ గంటలో చనిపోయాడో అదే దశలో అదే సంవత్సరము, అదే నెల, అదే దినము, అదే గంటలో అదే సమయమున జన్మించుచున్నాడని తెలియుచున్నది. గతజన్మ సత్యమని తెలిసినవానికి గతజన్మ దశాభుక్తి కూడా సత్యమని తెలియును. గతజన్మలో దశాభుక్తిని తెలియుటకు ప్రస్తుత జన్మలో ఏ దశలో ప్రారంభమగుచున్నదో తెలియాలి. అట్లు తెలియుటకు ప్రయత్నిద్దాము.

జగన్‌ అను వ్యక్తి జనన సమయములో చంద్రున్ని గురించి తెలుసు కొనుటకు వేసిన గణితములో చంద్రుడున్న ఆరుద్ర నక్షత్రము యొక్క పూర్తి పరిమాణమును గడియలలో 56-23గా ఉన్నట్లు తెలుసుకొన్నాము. అట్లే జనన సమయమునకు గడచిన ఆరుద్ర యొక్క పరిమాణము గడియలలో 16-57గా ఉన్నట్లు తెలుసుకొన్నాము. ఆరుద్ర నక్షత్రమునుబట్టి దశ విభజన నక్షత్రములలో ఆరుద్ర నక్షత్రము పూర్తి నాలుగు పాదములు కుజ దశను గుర్తు చేయుచున్నవి. అందువలన ఈ జాతకుడు కుజదశలో పుట్టాడు అని తెలిసిపోయినది. కుజదశలో జాతకుడు పుట్టినప్పుడు ఆ దశ ఎంతవరకు మిగిలియున్నది. ఎంతవరకు గతజన్మలో అయిపోయినది తెలియవలెను. అట్లు తెలియుటకు జనన సమయములో గడచిన ఆరుద్ర కాలమును కుజదశతో గుణించి వచ్చిన సంఖ్యను పూర్తి ఆరుద్ర పరిమాణము తో భాగించగా ఎన్ని సంవత్సరములు గతజన్మలో గడచినది తెలిసిపోవును. అట్లు భాగించినప్పుడు మిగిలిన శేషమును పన్నెండు నెలలతో హెచ్చించి నక్షత్ర పరిమాణముతో భాగించగా ఎన్ని నెలలు గత జన్మలో గడచిపోయినది తెలియును. అప్పుడు కూడా మిగిలిన శేషమును 30 దినముల చేత హెచ్చించి ఆరుద్ర నక్షత్ర పరిమాణముతో భాగించగా గతజన్మలో ఎన్ని దినములు గడచినది తెలియవచ్చును. అలాగే అప్పుడు కూడా మిగిలిన శేషమును 24 గంటలతో హెచ్చించి వచ్చిన సంఖ్యను నక్షత్ర పరిమాణముతో భాగించగా గతజన్మలో ఎన్ని గంటలు ఈ దశ అయిపోయినది తెలియ గలదు. అదే విధముగా నిమిషముల వరకు, చివరకు సెకండ్ల వరకు గత జన్మ భుక్తిని తెలియవచ్చును. కుజదశ మొత్తము ఏడు (7) సంవత్సరము లుండగా అందులో ఎన్ని సంవత్సరములు, ఎన్ని నెలలు, ఎన్ని దినములు, ఎన్ని నిమిషములు వెనుక జన్మలో కుజదశ అయిపోయినది తెలియగల్గి మిగిలిన కాలమును ప్రస్తుత జన్మలో అనుభవించవలసియున్నదని చెప్ప వచ్చును. ఈ విధముగా జాతకములో ముఖ్యమైన దశా కాలమును తెలియవచ్చును. ఇప్పుడు ఆ గణితమును గురించి కొంత తెలుసు కొందాము.


ఇంతవరకు పన్నెండు గ్రహముల దశలను చెప్పుకొన్నాము. పన్నెండు గ్రహముల దశలన్నిటిని కలిపితే మొత్తము 120 సంవత్సరములు అగుచున్నవి. ఒక మనిషి యొక్క సంపూర్ణ ఆయుష్షు 120 సంవత్సరములని పూర్వము పెద్దలు దీనినిబట్టే చెప్పెడివారు. ఇక్కడ పూర్తి వివరము కొరకు పన్నెండు దశలను వ్రాసి చూపించాము. కానీ ప్రతి మనిషి 120 సంవత్సరములు బ్రతుకడని అందరికీ తెలుసు. 120 సంవత్సరములు బ్రతుకకూడదను నియమము ఏమీ లేదు. కావున 120 సంవత్సరములు బ్రతికేవారు కూడా యున్నారు. స్థూల శరీరములతో ఎవరూ బ్రతికిలేకున్నా సూక్ష్మముగా, సూక్ష్మ శరీరముతో ఎందరో 120 సంవత్సరములకంటే ఎక్కువ బ్రతుకుచున్నవారు కూడా కలరు. ఇక్కడ పన్నెండు దశలను వ్రాసినంత మాత్రమున ఈ జాతకుడు కూడా 100 సంవత్సరముల పైన బ్రతుకునని కూడా చెప్పలేము. దశల విషయమును గురించి చెప్పితే ప్రతి దశకు అంతర్థశలని కూడా కలవు. కుజ దశలో అంతర్దశలు తెలియుటకు ఒక సూత్రము కలదు. దానిప్రకారము మొదట కుజదశా సంఖ్యను తెలియవలసిన దశా సంవత్సర సంఖ్యచే గుణించగా వచ్చిన మొత్తమును 3 చే గుణించాలి. తర్వాత వచ్చిన మొత్తమును 30 సంఖ్యచే భాగించాలి. అప్పుడు భాగించగా వచ్చిన సంఖ్యను నెలలుగా, మిగిలిన శేషమును దినములుగా వ్రాసుకోవాలి.

ఇప్పటికి కుజదశలో పన్నెండు అంతర్దశలు తెలిసిపోయినవి. వాటిని వరుసగా వ్రాసి చూస్తాము.

జాతకుడు పుట్టినప్పుడు ఏ అంతర్దశ జరుగుచున్నదో తెలియాలంటే గడచిన కుజదశలో ఒక్కొక్క అంతర్దశ తీసివేస్తూ రాగా చివరిగా మిగిలినది అప్పటి అంతర్దశయని తెలియవలెను.

ఈ విధముగ జాతకునికున్న మహా దశలలో అంతర్దశలను గుర్తించు కోవచ్చును. ఏ దశలోనైనా అంతర్దశలు తెలియు సూత్రమును ముందే చెప్పాము. ఉన్నదశను మరొక దశాసంవత్సరములతో గుణించి, వచ్చిన మొత్తమును 3 చే గుణించి, తర్వాత వచ్చిన మొత్తమును 30 చే భాగించగా అంతర్ధశలు తెలియును. ప్రతి జాతకమునకు దశలను మరియు అంతర్థశలను వ్రాసి ఇవ్వడము జరుగుచున్నది. నేడు చాలామంది జ్యోతిష్యులైనవారు గ్రహచార ఫలమున్నట్లే దశల ఫలితము కూడా ఉండునని తలచి వాటిని గురించి చెప్పుచుందురు. అయితే గ్రహచారములో ఉన్నట్లు దశాచారములో ఉండదని అందరికీ తెలియజేయుచున్నాము. గ్రహచారములో గ్రహముల ఆధీనములోని కర్మలు ఆచరణకు వచ్చుచున్నవి. అందువలన గ్రహముల వలన వచ్చు ఆచరణలను గ్రహచారము అని అంటున్నాము. గ్రహచారము అను పదమును విడదీసి చూచితే గ్రహము+ ఆచరణ=గ్రహాచరణ అనవచ్చును. అట్లే దశ+ఆచారము=దశాచారము అని అనవచ్చును. గ్రహచారములో గ్రహముల ఆచరణ తప్ప ఏమీలేదని తెలియవలెను.

దశాచారము అను పేరు విభజించి చూస్తే దశ+ఆచారము అని తెలియుచున్నది. దశ అంటే పదియని అందరికీ తెలుసు. ఆచారము అనగా చేయునది అని అర్థము. గ్రహచారములో ఉన్నట్లు దశాచారములో కూడా ఆచారము కలదు. అయితే అక్కడ గ్రహము అనగా గ్రహించుకొనున దనీ, కర్మను గ్రహించుకొనుచున్నదనీ చెప్పుకొన్నాము. గ్రహములు చేసే పనినిబట్టి గ్రహచారము అనడములో తప్పులేదు. వారు గ్రహించుకొన్న కర్మను ఆచరింపజేయుచున్న పన్నెండును, పన్నెండు గ్రహములుగా చెప్పు కోవడము సరిjైున మాటగానేయున్నది. అయితే ఇక్కడ దశాచారము వద్దనే పూర్తి వివరము కనిపించడము లేదు. దశాచారము అంటే పది పనులనీ లేక పది రకాల పనులనీ అర్థము కదా! అందులో గొప్ప తనమేమున్నదని కొందరు అడుగవచ్చును. దానికి మా సమాధానము ఏమనగా! భగవద్గీతలో శ్రీకృష్ణుడు విశ్వరూపమును చూపినప్పుడు ఆ విశ్వరూపమును చూచిన అర్జునుడు ఆశ్చర్యపడి భగవంతుడైన శ్రీకృష్ణున్ని దేవునిగా గుర్తించి అప్పుడు అర్జునుడు తన మాటలలో ఒకమాట చెప్పాడు. ఆ మాట దేవుడిట్లున్నాడని చెప్పినట్లున్నది. అర్జునుడు ఆ దినము మనకొరకు చెప్పకున్నా ఆయన లోపల భావమును వ్యక్తపరచినప్పుడు మనకు అందులో దేవుని జ్ఞానము అర్థమగుచున్నది. భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగమందు 40వ శ్లోకమున ఇలా కలదు. ‘‘మ్రొక్కువాడ ముందు, మ్రొక్కువాడ వెన్క,

మ్రొక్కువాడ సర్వ దిక్కులందు’’ అని చెప్పడము జరిగినది. ఈ వాక్యములు అందరికీ అర్థమగునవే. ఇందులో రహస్యమేమీ లేదు. అయినా మనము సర్వసాధారణ అర్థముగల మాటగా చెప్పుకొన్నా ప్రత్యేకమైన విశేషత కలదు. ఆ విశేషత ఏమనగా! రెండవ వాక్యములో ‘‘మ్రొక్కువాడ సర్వదిక్కులందు’’ అని అన్నప్పుడు మొత్తము ఎనిమిది దిక్కులయందు మ్రొక్కుచున్నానని అర్థము కదా! ఎనిమిది దిక్కులలోనే ముందు వెనుక రెండు దిక్కులుకలవని మరువకూడదు. అయితే మొదటి వాక్యములో ‘‘మ్రొక్కువాడ ముందు, మ్రొక్కువాడ వెన్క’’ సర్వదిక్కులైన ఎనిమిది దిక్కులు కాక ముందు వెనుక అనునవి ప్రత్యేకముగా ఉన్నాయా అని అనుమానము వచ్చును. ఈ మాటలు సర్వసాధారణములే అని వదలి వేస్తే విశేషత ఏమీ ఉండదు. ఈ మాటను గురించి ప్రత్యేకముగా యోచించితే యోచింపజేయు ఆత్మ ఒక మాటను చెప్పుచున్నది. తలదించి చూస్తే కనిపించునది క్రింద, తల ఎత్తి చూస్తే కనిపించునది పైన, క్రిందిది ఎల్లవేళల కనిపించుచున్నది కావున దానిని ముందుది అన్నారు. అదే పనిగా తల ఎత్తి చూస్తే గానీ కనిపించని పై భాగమును వెన్క అన్నారు. దేవుడు సర్వదిక్కులైన అష్టదిక్కులయందే కాదు పైన క్రింద కూడా ఉన్నాడు కాబట్టి, సర్వదిక్కులకేకాక ముందు (క్రింద) వెనుక (పైన) మ్రొక్కుచున్నానని అర్జునుడు చెప్పడము జరిగినది. ఆ దినము అర్జునుడు జ్ఞానము కలిగి ఆ మాట చెప్పలేదు. ప్రత్యక్షముగా కనిపించు దానినిబట్టి చెప్పాడు. ప్రత్యక్షముగా కనిపించు దేవుడు అష్టదిక్కులందేకాక, పైన క్రింద కూడా కనిపించాడు. కావున అర్జునుడు అలా చెప్పియుంటాడని అనుకొందాము. ఇప్పుడు చుట్టూయున్నవి ఎనిమిది దిక్కులైతే పైన ఒకటి, క్రింద ఒకటి అని రెండిటినీ కలుపుకొంటే మొత్తము పది దిశలు అగుచున్నవి. దేవుడు మనకు కనిపించకపోయినా, తెలియకపోయినా పది దిశలయందు సర్వత్రా వ్యాపించి యున్నాడు. అందువలన దేవున్ని గుప్తముగా దశ అన్నారు. దేవుడు చేయు పనినిగానీ, దేవునివలన జరుగు పనినిగానీ అర్థముతో ఉండునట్లు దశ+ఆచారము = దశాచారము అని అన్నారు. దశ అనగా పదివైపులగల దేవుడని ఆచారము అనగా పని అని తెలియుచున్నది.

దశాచారము భగవద్గీతలో జ్ఞానయోగమున 37వ శ్లోకమందు చెప్పిన సారాంశము ప్రకారము కర్మను తీసివేయనూ గలదు. అలాగే దైవాసుర సంపద్విభాగ యోగమున గల 19వ శ్లోకమున చెప్పిన సారాంశము ప్రకారము కర్మను తగిలించనూగలదు. అందువలన దశాచారములో కర్మ తీసివేయబడుతుంది మరియు కర్మ కలుపబడుతుందని చెప్పాము. ఈ విధానము దశాచారములో మాత్రము కలదు. గ్రహచారములో ఏ విధానము చేతగానీ పాతకర్మ తీసివేయబడదు. అట్లే క్రొత్త కర్మ కలుపబడదు. దశాచారములో మాత్రము కర్మను లేకుండ చేసుకొను అవకాశమును దేవుడు కల్పించాడు. ఇక్కడ ఉదాహరణగా ఒక విషయమును చెప్పెదను జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మీకు జగన్‌ అను ఒక వ్యక్తి జాఫతకమును గురించి వివరిస్తూ వస్తున్నాము. అతని జాతకము కొన్ని విషయములు తప్ప అన్ని విషయములలోనూ గొప్పగాయున్నదని చెప్పుచున్నాము. అయితే ఆయన ఆయుష్షు విషయములో ఒక లోపమున్నదని చెప్పవచ్చును. అదేమనగా! శత్రుగ్రహము లేక అశుభ గ్రహము లేక పాపగ్రహము అని చెప్పబడు కుజ గ్రహము ఈ జాతకములో సరిగ్గా రెండవ స్థానమున కలదు. రెండవ స్థానములో ఉండడమేకాక తనకు ఎదురుగానున్న ఎనిమిదవ స్థానమును తనకున్న నాలుగు చేతులలో ఒక దానిచేత తాకుచున్నది. తనచేత అక్కడున్న దానిని గ్రహించి మనిషికి అందివ్వగల పనిని కూడా చేయుచున్నది. ఎనిమిదవ స్థానము ఆయుష్షుకు సంబంధించిన స్థానము అంటాము. ఆయుష్షుకు సంబంధించిన ఎనిమిదవ స్థానములో శత్రుగ్రహమైన కుజ గ్రహము ఉండడముగానీ, అక్కడ చేయిపెట్టి చూడడముగానీ ఉంటే ఆయుస్థానము బాగా లేదనియే చెప్పాలి. ఇటువంటి జాతకమునే ఒక దానిని క్రిందగల పటములో చూపుతాను చూడండి.

ఇప్పుడు మీరు చూసిన జాతకములో ఎనిమిదవ స్థానమునకు ఎదురుగానున్న రెండవ స్థానములో కుజగ్రహమున్నట్లు గుర్తించాము.

ఈ జాతకుని కుండలిలో అదే రెండవ స్థానమందే, అదే

కుజగ్రహమే ఉంచడమును మీరు చూడవచ్చును.

కుజగ్రహము ఎక్కడున్నా, దానికి ఆ స్థానములలో ఉపయోగపడు చేయికాక మిగత మూడు చేతులుండును. ఆ మూడు చేతులలోని ఒక చేయిని కుజగ్రహమున్న చోటనుండి నాల్గవ స్థానములోనికి, రెండవ చేయి ఏడవ స్థానములోనికి, మూడవ చేయిని ఎనిమిదవ స్థానములోనికి ఉంచి అక్కడగల వాటిని తీసుకొని జాతకునికి అందివ్వగలదు. ఆయువు స్థానము కుండలిలో ఎనిమిదవ స్థానముకాగా, ఆయువుకు అధిపతి శని గ్రహము. ఇప్పుడు చూసిన జాతక లగ్నములో ఐదవ స్థానములో శని ఉండడము వలన రెండవ స్థానమున కుజుడు ఉండుట వలన కుజుడు తన చేతితో తనకు నాల్గవ స్థానములోనున్న శనిని తాకి శనివద్దయున్న జాతకుని ఆయుష్షును హరించుటకు అవకాశము గలదు. ఆయుష్షు శనిది. ఆయుష్షు స్థానము ఎనిమిదవ స్థానము. ఎనిమిదవ స్థానమును స్వయముగా కుజగ్రహము రెండవ స్థానమునుండి ఆక్రమించుకొన్నది. ఆయుష్షుకారకుడైన శనిని కూడా తన చేతి తాకిడితో దాడిచేసి శనివద్దయున్న ఆయుష్షును లాగుకొనుటకు సిద్ధముగాయున్నది. అంతేకాక తమ గుంపు నాయకుడైన గురువుతోగానీ, మిగత తమ గుంపు గ్రహములతో కలిసినప్పుడు జాతకుని ఆయుష్షును లాగుకొనుట చేయవచ్చును. జాతకుని ఆయువును లాగుకొనునప్పుడు అనగా జాతకున్ని చంపివేయునప్పుడు కుజ గ్రహము ఆధీనములోనున్న ఆయుధములనుగానీ, కౄర మృగములనుగానీ ఉపయోగించవచ్చును. ఆయుధములలో ఉత్తమ శ్రేణికి సంబంధించినవి బాంబులు, తుపాకులుకాగా, మధ్యమ శ్రేణికి సంబంధించినవి అనేక రకముల పదునైన కత్తులుకాగా, తక్కువ శ్రేణికి సంబంధించిన కోరలుగల మృగములు ఆయుధములుకాగా తన ఆధీనములోనున్న ఏదో ఒక శ్రేణి ఆయుధముల చేత మనిషిని చంపును. అని ఆ జాతకము నుండి మనము తెలుసుకోవచ్చును.

జాతకలగ్నములో అన్ని విషయములు బాగున్నా ఒక ఆయుష్షు విషయములో మేము చెప్పిన లోపములున్నవి. జాతక లగ్నములో తులా లగ్నము శరీర స్థానమైన మొదటి స్థానమైనది. తులా లగ్నమును అనుసరించి అన్ని విషయములు అన్ని విధముల బాగున్నాయి. ఒక్క ఆయుస్థానమొకటి బాగాలేదు, ఆ స్థానమును తాకినవాడు బాగాలేడు. ఈ జాతకము పుట్టినది 20వ తేదీ, ఆగష్టు, 1944వ సంవత్సరము. ఈయన దేశానికి ప్రధానిగా యున్న రాజీవ్‌గాంధీ. జాఫతకములో అనుమానములున్నట్లు 21 మే నెల, 1991వ సంవత్సరము తమిళనాడులో బాంబు ప్రేలుడు వలన చనిపోవడము జరిగినది. కుజగ్రహము ఎక్కడ చూచితే అక్కడ రక్తసిక్త మగును. అదే విధముగా ఘోర ప్రమాదమును కుజగ్రహమే చేసినది. ఆ దినము గురువు కుజునితో కలియుట వలన కుజునికి ఎక్కువ బలమైనది. కుజ గురువులు కర్కాటకములో కలియుట వలన, గురుగ్రహము తన ఐదింటి హస్తములను జాతకుని తన భాగమైన తులాలగ్నమును తాకుట వలన ప్రమాదములో శరీరము గుర్తించలేనంతగా ఛిద్రమైపోయినది. ఈ విధముగా కుజగ్రహము యొక్క కౄరత్వమును మేము ముందే ఊహించినా ఊహించినట్లే చివరకు జరిగిపోయినది.

అత్యంత ఉన్నత స్థానమైన సుప్రీమ్‌కోర్టు ఒక జడ్జిమెంట్‌ను విడుదల చేసిన తర్వాత ఆ జడ్జిమెంట్‌ను ఆధారము చేసుకొని అటువంటి కేసులను మిగతా కోర్టులలో వాదించడముగానీ, తీర్పు చెప్పడముగానీ జరుగుచున్నది. అలాగే దేశ ప్రధానిగా యున్న రాజీవ్‌గాంధీ జాతకమును మరణమును చూచిన తర్వాత అది ఒక సుప్రీమ్‌ జడ్జిమెంట్‌లాగా దానిని ఆధారము చేసుకొని అటువంటి జాతకములను గురించి చెప్పుకోవడము మంచిదే. ఎందుకనగా గ్రహచారములో ఎట్లుంటే అట్లే జరుగును. కావున జగన్‌ అను వ్యక్తి జాతకము అన్ని విధముల బాగున్నది. అయితే ఒక్క ఆయువు విషయములో మాత్రము రాజీవ్‌గాంధీ గారికున్నట్లే రెండవ స్థానము కుజ గ్రహముండడము విశేషము. రాజీవ్‌ జాతకములో కుజుడు శనిని తాకి చూచినట్లే, జగన్‌ జాతకములో కూడా కుజుడు శనిని తన చేతితో తాకుచున్నాడు. అంతేకాక తన గుంపు నాయకుడైన గురువుతో కుజుడు కలిసి ఎనిమిదవ స్థానములో ఉన్నారు. ఇట్లు అనేక ఆయువుకు సంబంధించి జగన్‌ జాతకములో రాజీవ్‌ జాతకములోని పోలికలు కలవు. ఇంచుమించు ఒకే స్థాయిని సూచించు కుజగ్రహ దోషములు ఉండుట వలన, ఈ జాతకునికి కూడ రాజీవ్‌గాంధీ పోలికలను, ఆయువు విషయములను చెప్పవచ్చును. ఒక్క ఆయువు విషయములో భయమును కల్గించు కారణములు కన్పించునప్పుడు వాటిని తప్పించుకొనుటకు భగవద్గీతలో జ్ఞానయోగమున 37వ శ్లోకము చెప్పినట్లు ఒక్క జ్ఞానము వలననే సాధ్యమగును. జ్ఞానములేనివాడు కర్మలను అనుభవింపక తప్పదు.

నేడు జ్యోతిష్యము శాస్త్రముకాదు అను వాదనను త్రోసిపుచ్చి జ్యోతిష్యము ఆరు శాస్త్రములలో ఒక శాస్త్రమని నిరూపించి చెప్పుటకు జ్యోతిష్యగ్రంథమును వ్రాశాము. మా జ్యోతిష్యమునకు ఉదాహరణగా జగన్‌ అను వ్యక్తి జాతకమును వ్రాస్తూ అందులోని ఆయుష్షు లోపమును చూపించడము జరిగినది. అతని (జగన్‌) జాతకమునకు ఉదాహరణగా ఏకంగా రాజీవ్‌గాంధీగారి జాతకమును చూపవలసివచ్చినది. జ్యోతిష్యము శాస్త్రమని చెప్పుటకు జ్యోతిష్యము ప్రకారము మేము ఐదు సంవత్సరముల ముందే అంచనా వేసుకొన్నట్లు రాజీవ్‌గాంధీ మరణము జరిగిపోయినది. అందువలన అదే స్థాయి ప్రమాదమును చూపుచున్న జాతకుడు జగన్‌ దైవజ్ఞానమును పొందితే అతని దశాచారములో ఆ కర్మ తప్పిపోవుటకు అవకాశము గలదు. లేకపోతే ఘోర ప్రమాదమును చవిచూడవలసి వస్తుంది.