జీవశాస్త్ర సంగ్రహము/మొదటి ప్రకరణము

వికీసోర్స్ నుండి

మొదలయిన శాస్త్రములన్నియు జీవశాస్త్రమును సంబంధించినవియే. ఐనను సమస్త జీవకోట్లకును సర్వసామాన్యమైన విషయములను మాత్రము బోధించు భాగమునకు సంకేతముగా జీవశాస్త్రమను పదము ప్రయోగింపబడుచున్నది. జీవకోట్లు జంతువులుగా గాని వృక్షములుగా గాని ఏర్పడియున్నవి. కాననీశాస్త్రము జంతుసముదాయమునకును వృక్షసముదాయమునకును గల సామాన్య స్వభావములను, పరస్పర తారతమ్యములను బోధించు భాగముగా నేర్పడుచున్నది. జంతు సముదాయమునుగూర్చి బోధించు భాగము జంతుశాస్త్రము (Zoology) వృక్షసముదాయమునుగూర్చి బోధించుభాగము వృక్షశాస్త్రము (Botany). ఇప్పు డీ గ్రంథమునందు జంతుజాతి జీవులు కొన్నియును, వృక్షజాతిజీవులు కొన్నియును వాని తరగతులను బట్టి క్రమముగా నొకదానిప్రక్క నొకటి వర్ణింపబడుచు, ఆయాతరగతులకు గల సామాన్య గుణములును, వ్యత్యాసములును సూచింపబడును.


గను ఉండును. దాని మధ్యభాగము అనేక అణువుల (Granules) తోనిండి, పలుచగ సున్నము పూసిన అద్దమువలె కొంచెము అస్వచ్ఛముగ నుండును (1-వ పటము A-చూడుము). చుట్టునుండు అ,చు వర్ణరహితమై మిక్కిలి స్వచ్ఛముగా నుండును. మధ్యనుండు పదార్థమునకు అంత:పలలము (Endosarc) అని పేరు.(1-వ పటములో A-లో, అం. చూడుము). చుట్టునుండు స్వచ్ఛమైన పదార్థమునకు బహి:పలలము (Ectosarc) అనిపేరు. ( A-లో, బ). వికారిణిరూపమునందలి మార్పులు:- వికారిణిని పరీక్షించి చూచునప్పుడు దానిరూప మెల్లప్పుడు నిలుకడగ నొకటేవిధముగ నుండక ప్రతినిమిషమును మారుచుండునట్లు తెలియును. (A. B. లయొక్క ఆకారము చూడుము). అట్టి మార్పు గడియారములోని గంటల ముల్లుయొక్క చలనమును బోలియుండును. అది యెప్పటికప్పుడు స్పష్టముగ దెలియదు. కాని కొంతకొంతకాలము గడచిన పిమ్మట కొద్దికొద్ది భేదములను కనబరచుచు, తుదకు అరగంటసేపులో మొదటనున్న వికారిణి అదియేనో కాదో యను సందేహమును గలిగించునట్టిదిగ నుండును. దీనిరూపమునందు మార్పులు గలుగునప్పుడు బహి:పలల మేదో యొకచోట చిన్న మొటిమవలె నుబ్బును. (1. A-లో పా. చూడుము). పిమ్మట నది క్రమముగా పెరుగును. ఇట్లు పెరుగుచుండు మొటిమలోనికి అంత:పలలమున-నుండెడి యణువులుపారివచ్చును. తుద కీమొటిమ పెద్దదై అంత:
పలలమును, బహి:పలలమును గలిగి యొక పాయగా నేర్పడి వికారిణియొక్క యితరభాగముల బోలియుండును. ఇట్లు మొటిమలుగా పుట్టినపాయలే (B-లో పా చూడుము) వికారిణియొక్క పాదము లనబడును.

వికారిణియొక్క రూపమునందలి మార్పులకు దృష్టాంతముగ చిన్నదగు నొక మట్టిముద్దను గుప్పిట పట్టుకొమ్ము. దానిని గుప్పిట పట్టుకొని వ్రేళ్లనడుమనుండి కొంచెము మట్టి వెలుపలికి వచ్చునట్లు పిసుకుము. ఇట్లు చేయుటచే అనేక రూపభేదములు దానియందు పుట్టును. అట్లు చేయనప్పు డామట్టిముద్ద ఒకవైపున ఉబికి దానికి సమానముగా రెండవవైపున లోటుపడును. కాని దానియొక్క మొత్తపుపరిమాణము హెచ్చు కానేర దనుట స్పష్టము. అటులనే వికారిణి ఒకవైపున పెరుగునప్పుడు రెండవవైపున ముడుచుకొనుచుండును. అయినను మట్టిముద్దమార్పునకును, వికారిణిమార్పులకును, ముఖ్యభేద మేమన, మట్టిముద్దయొక్క మార్పులకు వెలుపలిదగు మనచేతి ఒత్తుడుబలిమి కారణము. అట్టి వెలుపలియొత్తుడు వికారిణి కేమియును లేదు. వికారిణిమార్పులకు, దాని సహజమైన అంతశ్శక్తియే కారణమై యున్నది. ఇట్టి స్వతస్సిద్ధమైన చలనమును జూచినతోడనే, వికారిణి సజీవముకాని అజీవపదార్థము కాదని ఊహింపవచ్చును.

మూలపదార్థము-జీవస్థానము.

వికారిణియందలి తాటిముంజెవలె మిలమిలలాడు పదార్థ మునకే మూలపదార్థ (Protoplasm) మని పేరు. వికారిణిని నీలిమందు మొదలగురంగులలో వేసితిమా అది చచ్చును. అప్పుడు దానిని సూక్ష్మదర్శినియందు పరీక్షింపగా దాని నిర్మాణమును గూర్చికొన్ని సంగతులను మనము తెలిసికొనవచ్చును. ఏవనగా, మూలపదార్థమున కంతటికిని సమానముగా రంగు పట్టక, అంత:పలలమునందలి అణువుల కెక్కునరంగు పట్టుట చేత నది బహి:పలలమునకంటె నల్లగా కనిపించును. మరియు అంత:పలలమధ్యమున నొకగుండ్రనిభాగము తక్కినచోట్లకంటె నెక్కువరంగుగలదై స్ఫుటముగా కనిపించును. (A.B.లలో జీ.చూడుము). దీనికి జీవస్థాన (Nucleus) మని పేరు. ఇది ప్రాణియొక్క జీవమునకు ముఖ్యాధారమైన భాగము. కాన దీని కీపేరు కలిగెను.

చిన్న వస్తువులను అనేక రెట్లు పెంచి చూపెడి సూక్ష్మదర్శనితో శోధింపగా జీవస్థానములోగూడ అన్ని భాగములకు నేకరీతిని రంగు పట్టునట్లు తెలియగలదు. సామాన్యముగా జీవస్థానముచుట్టు నత్యల్పమైన పొర యొకటి కన్పట్టును. ఇది జీవస్థాన కవచము (Nucleu Membrane) కొన్ని జీవస్థానములందు మిక్కిలి హెచ్చు రంగు గల మధ్యభాగము స్పష్టముగా తెలియు చుండును. (A-లో జీ.గ.చూడుము) దీనికి జీవస్థానగర్భ (Nucleolus) మని పేరు.

సంకోచనావకాశము.

సజీవమగు వికారిణిని సూక్ష్మదర్శనిగుండ పరీక్షించునప్పుడు ---జెప్పిన జీవస్థానము గాక బహి:పలలములో నిర్మల మైన అవకాశ మొకటి చక్రాకారముగ కనబడును.(A. B.లలో నం.అ.చూడుము). అది కొంతకాలమునకు తటాలున ముడుచుకొని అదృశ్యమై తిరిగి క్రమక్రమముగ తెరవబడి ఎప్పటివలె కనిపించును. ఇట్లు సంకోచవికాసముల నొందుటనుబట్టి దీనికి సంకోచనావకాశము (Contractile Vacuole) అనగా ముడుచుకొను స్వభావము గల అవకాశము అనిపేరు. ఇది వికసించునప్పుడు నీటివంటి ద్రవపదార్థముతో నిండియుండును.

సారాంశములు:- వికారిణి తాటిముంజెముక్కను బోలి మిలమిలలాడుచుండు మూలపదార్థములయొక్క చిన్న సముదాయము. ఆమూలపదార్థములో అంతటంతట మారుచుండు పాయలు పాదములుగా నేర్పడుచుండును (1-వ పటములో A, Bలలోపా). ఇవియే యొక చోటనుండి మరియొక చోటికిబోవునప్పుడు వికారిణి ఉపయోగించుకొను పాదములు. వికారిణిలోని చుట్టునుండు భాగము బహి:పలలము. మధ్యనుండుభాగము అంత:పలలము. అంత:పలలములో జీవస్థానమును, బహి:పలలములో సంకోచనావకాశమును గలవు. జీవస్థానముచుట్టును కవచమువంటి పొరయొకటిగలదు. జీవస్థానపు మధ్యమున జీవస్థానగర్భముండును. సంకోచనావకాశములో ద్రవపదార్థమంతటంతట జేరుచుండును.

కణమనగా నేమి?

జీవస్థానము గల మూలపదార్థపు సముదాయమునకు జీవశాస్త్రమునందు కణము (Cell) అని పేరు. వికారిణి మూలపదా ర్థపు సముదాయమే. ఇందు జీవస్థానము గలదు. కాన వికారిణి యొకకణము.

వికారిణియొక్క వ్యాపారములు.

ఇంతవరకు వికారిణియొక్క అవయవనిర్మాణము (Structure)ను గూర్చి సంగ్రహముగా జెప్పబడినది. వికారిణియొక్క వ్యాపారములను (Functions) గూర్చి ముందు వివరింపబోవు చున్నాము.

1. చలనము.

వికారిణియొక్క వ్యాపారములలో మొదటిది నడచుట. వికారిణి యెట్లు నడచును? ఇది తన శరీరములోని యొకప్రక్క నొకపాయను పాదముగా పెంచుకొని మరియొక ప్రక్కను అంతభాగమునే అనురూపముగ ముడుచుకొనుటవలన జలగవలె నడవనోపును. అనగా దీనిపాయ లొక్కచో వికసించుచుండిన వేరొకచో సంకోచించుచుండును. కనుక వికారిణికి సంకోచనశక్తి (Contractility) గలదని చెప్పవచ్చును. ఈశక్తి రెండువిధములుగ నుండవచ్చును. మొదటిది వికారిణి యొక్క ఇచ్ఛానుసారము గలుగునది. ఇది స్వేచ్ఛాసంకోచనము (Automatic Movement) అనబడును. ఇట్టి స్వేచ్ఛాసంకోచనము గల దగుటచేతనే వికారిణి తన ఇష్టమువచ్చిన వైపునకు ప్రాకి పోగలదు. రెండవది ప్రేరితసంకోచనము (Irritability)అనబడును. ఇది బాహ్యకారణముల పురికొల్పుటచే కలుగును


వికారిణిని ఒక పుల్లతో తాకిన యెడల .......... తెలిసికొని తక్షణము తన శరీరమును ముడుచుకొనును. ఇట్టిజ్ఙానము గల దగుట చేతనే వికారిణి ఆహారాదిపదార్థముల తాకుడుచేత పురికొల్పబడి, తన పాదములను చాచుచు ముడుచుచు వానిని పట్టుటకు ప్రయత్నించును.

ఒకానొకప్పుడు వికారిణి నిశ్చలనము నొంది పాదముల నన్నిటిని ముడుచుకొని గుండ్రని బొట్టువలె మారును. (1-వ పటములో F.చూడుము). పిమ్మట దానిచుట్టును దళమైన గుల్లవంటి కవచ మేర్పడును. ఈ యావరణము ఏపదార్థముల కూడికో విశదముగ తెలియకున్నను, మూలపదార్థము కాదనియు, కొమ్ము, డెక్క, వెండ్రుక మొదలైన వస్తువులలోఫ్ నున్న నత్రజనసంబంధమైన (Nitrogenous) పదార్థములచే నేర్పడినదనియు కనుగొనబడినది. కొంతకాల మట్లు విశ్రమించిన పిదప పైని కట్టిన గుల్లను పగులగొట్టుకొని వికారిణి బయటపడి తిరిగి కదలిక మొదలగు స్వభావములను వెనుకటికంటె హెచ్చుగ గలిగిన దగును.

2. పోషణము.

వ్యాపారములలో రెండవది ఆహారము తినుట. వికారిణి అటు నిటు తిరుగుటలో తనకంటె చిన్నవియగు జీవజంతువులను స్పృశించునప్పుడు, వానిచుట్టును తన మూలపదార్థమును పాయలుగా విడదీసి చాచి ముట్టడించి తుదకు మట్టిముద్దలో పొదిగిన గోలిగుండ్లవలె, తన మూలపదార్థపు మధ్యమున వాని నిముడ్చుకొనును. ఈ యాహార పదార్థముతో కొంత నీటినిగూడ తప్పక నిముడ్చుకొనును. ఈ రెండును మూలపదా ర్థము మధ్య కొంతస్థలము నాక్రమించుకొనును. (1-వ పటములో Bలో ఆ.అ.చూడుము). ఆ స్థలమునకు ఆహారావకాశము (Food Vacuole) అని పేరు. ఈ ప్రకార మిముడ్చుకొనబడిన జీవులయొక్క మూలపదార్థము వికారిణియొక్క మూలపదార్థమునుండి స్రవించునట్టి యేదో జీర్ణ రసముయొక్క శక్తిచే క్రమక్రమముగ జీర్ణమై కరగి వికారిణియొక్క మూలపదార్థములో ఏకీభవించును. తుదకా యాహార పదార్థముపై నుండు గుల్లచిప్ప మొదలగు జీర్ణముకాని వస్తువులు తప్ప మిగిలినదంతయు నరిగిపోవును. పిమ్మట వికారిణి నెమ్మదిగ బ్రాకునప్పుడు జీర్ణముకాని యా వట్టిగుల్లను తన వెనుక విడిచిపోవును. ఈప్రకారము సజీవులగు చిన్న జంతువులను ఉన్నవి యున్నట్లుగా మ్రింగి, తనకు కావలసిన పదార్థములను జీర్ణము చేసికొని పనికిరాని అజీర్ణ పదార్థములను విసర్జించును. ఇట్లు చేయుచుండు వికారిణికి మనవలె తినుటకు నోరుగాని, జీర్ణించుకొనుట కుదరముగాని, విసర్జించుట కాసనముగాని లేదుసుమీ!

3. వృద్ధి.

వ్యాపారములలో మూడవది పెరుగుట. వికారిణి మ్రింగిన ఆహార పదార్థము జీర్ణమై మూలపదార్థములో లీనమగునని వ్రాసియున్నాము. అట్లు మూలపదార్థములో నూతనపదార్థములు సదా లీనమగుటచేత వికారిణియొక్క పరిమాణము హెచ్చగుచుండును. ఇదియే పెరుగుట. ఈ పెంపు రెండువిధముల గలుగవచ్చును. అందు మొదటి దెట్లగునన:- ఒక గులక రాతి గుట్టమధ్య నెడ తెగక ఒక్కొక చిన్న రాతి నిము డ్చుచువచ్చిన ఆ గుట్ట యెట్లు క్రమక్రమముగా పెద్దది యగునో అట్లే వికారిణియొక్క మూలపదార్థము నందలి అణువులకు మధ్య నుండెడి యెడములయందు క్రొత్తమూలపదార్థపు అణువులు చేరుటవలన వికారిణి పెరుగు చుండును. దీనికి అంతర్వృద్ధి (Intus-susception) అని పేరు.

రెండవవిధమైన పెంపు-అప్పుడప్పుడు గోడకు వేయుచున్న సున్నపుపూతలు పొరలుపొరలుగా నొక దానిపై నొకటి చేరి, గోడ యెట్లు దళస రెక్కుచున్నదో అదేప్రకార మీ రెండవవిధమైన పెంపు సమకూరును. ఇట్టి పెంపు వికారిణికిగూడ నొక్కొక సమయమందు గలదని కొందరి యభిప్రాయము. ఎప్పుడన-వికారిణి యొకానొకప్పుడు నిశ్చలనమునొంది తనచుట్టును గూడుకట్టుకొనునని చెప్పియున్నాము. వికారిణియొక్క మూలపదార్థమునుండి స్రవించెడి పదార్థ మొకటి దానిచుట్టు నొక పలుచనిపొరగా నేర్పడును. మూలపదార్థమునుండి యాపదార్థ మెడతెగక స్రవించుచు అట్టి పొరయొక్క లోతట్టున జేరి పొరలుపొరలుగా నేర్పడుచుండును. ఈప్రకారమే నత్తగుల్లలు ముత్యపు చిప్పలు మొదలగు నీటి జంతువులపైని దళమును రమ్యమునైన గుల్ల లేర్పడుచున్నవి. ఇట్టివృద్ధికి పటలవృద్ధి (Accretion) అని పేరు.

వికారిణి అంగుళములో నూరవవంతుకంటె ఏల పెరుగదు!

వికారిణి ప్రాయికముగా అంగుళములో నూరవవంతుకంటె పెద్దదిగ నుండదని చెప్పియున్నాము. పై పరిచ్ఛేదము (Para) లో వికారిణికి క్రొత్త మూలపదార్థము సదా చేరుచుండుటవలన క్రమముగా అది పెరుగుచుండునని చెప్పియుంటిమి. ఇట్లెడతెగక పెరుగుచుండెడి వికారిణి కొంత నిర్ణీతపరిమాణమువరకు పెరుగును గాని అంతకంటె నెన్నడును పెద్దది కాదు. దీనికి కారణ ముండవలెను. మన మేదయినను పనిచేసినప్పుడు మన శరీరమునందలి మాంసపుకండలు మొదలగు పదార్థములు ప్రాణవాయువుతో గూడి బొగ్గుపులుసుగాలి రూపమున మన దేహమునుండి వెడలిపోవుటచే మన శరీరముయొక్క తూనిక తగ్గును. దీపము వెలుగుకొలది చమురు తగ్గిపోవుటయు నిట్టిదే. వికారిణి విషయములో జరుగునదిగూడ నింతయే. అది యాహారము నిమిత్తముగాని, చలనము నిమిత్తముగాని యొక పాదమును చాచుటయు, మరియొక దాని ముడుచుటయు దానికి కొంతపని యనదగు. ఈ పనివలన దాని మూలపదార్థములో కొంతభాగము ప్రాణవాయువుతో మిళితమగును. వికారిణి తినునట్టి ఆహారమునుండి పక్వమై చేరుచు జమయగు మూలపదార్థము అది చేయు పనులవలన ఖర్చుపడు మూలపదార్థముకంటె మించినయెడల వికారిణి పెరుగును. జమయగు మూలపదార్థముకంటె ఖర్చుపడు మూలపదార్థము హెచ్చగునెడల వికారిణి క్రమక్రమముగ క్షీణించును. జమయగునదియు ఖర్చగునదియు సమానమైనయెడల వృద్ధిగాని క్షయముగాని లేక యథాప్రకారముగ నుండును. మూలపదార్థ మీ క్రింది పదార్థముల సమ్మిశ్రణముచే నైనదని రసవాదశాస్త్రజ్ఞులు చెప్పుచున్నారు. ఇది మాంసకృత్తు (Proteid) అను పదార్థముచే నయినది. ఈ మాంసకృత్తును విభజించిచూడ దానియందు 1.బొగ్గు (కర్బనము-Carbon). 2.ప్రాణవాయువు (ఆమ్లజనము-Oxygen). 3.జలవాయువు (ఉజ్జనము-Hydrogen). 4.నత్రజనము (Nitrogen). 5.గంధకము (Sulphur). 6.స్పురము (Phosphorus). 7.సున్నము (Lime) మొదలగు పదార్థములు కనబడును. కాని ఈశాస్త్రవేత్తలకు పైని చెప్పబడిన పదార్థసమ్మేళనముచే నిప్పటివరకు మూలపదార్థమును సృజించుటకు సాధ్యము కాకున్నది.

మలమూత్రోత్సర్జనము.

వికారిణియొక్క వ్యాపారములలో నాల్గవది మలమూత్రములను విసర్జించుట. వికారిణికి మలమూత్రద్వారములు లేవుగదా, ఇది ఎట్లు వానిని విసర్జించును? వికారిణికి విసర్జించువస్తువులు మూడువిధములుగ నుండవచ్చును. 1. స్థూలములు (Solids). 2.ద్రవములు (Liquids). 3.వాయువులు (Gases).

1. స్థూలములు - వికారిణికి మ్రింగిన ప్రాణులయొక్క పైగుల్ల. మొదలుగా గల అజీర్ణ పదార్థముల నది ఎట్లు విసర్జించునో చెప్పియుంటిమి. వీనినే మలమని చెప్పవచ్చును.

2. ద్రవములు - వికారిణి తన ఆహారముతోపాటు ఆహారాశయములో కొంత నీటినిగూడ నిముడ్చుకొనునని వ్రాసియుం టిమి. ఆ నీరును, వికారిణి పని చేయునప్పుడు దాని మూలపదార్థమునందలి జలవాయువు (ఉజ్జనము-Hydrogen) ప్రాణవాయువుతో కలియుటచే నేర్పడునట్టి నీరునుగూడ సంకోచనావకాశములోనికి జేరి, అది సంకుచించునప్పుడు వికారిణినుండి విసర్జింపబడు చుండును. ఇదియే మూత్రవిసర్జనమని చెప్పవచ్చును.

3. వాయువులు - వికారిణి చుట్టు నెల్లప్పుడు నీరుండును. ఆ నీటియందు ప్రాణవాయువు (ఆమ్లజనము) గలదు. ఇది వికారిణియొక్క మూలపదార్థములోని అణువుల నడిమి సందులలోనికి వ్యాపించును. అట్లు వ్యాపించు ప్రాణవాయువు వికారిణియొక్క మూలపదార్థముతో సంగమించి బొగ్గుపులుసు గాలి (కర్బనికామ్లము-CO2) యు, నీరు (H2O) ను, నత్రజన సంబంధమైన (Nitrogenous) పదార్థములును అగును. ఇందు బొగ్గుపులుసుగాలి వికారిణియొక్క ఉపరితలముననుండి నీటిలోనికి వెడలిపోవును. ఇవ్విధమున నీటిలో లీనమైయున్న ప్రాణవాయువును పీల్చుటయు, తిరిగి నీటిలోనికి బొగ్గుపులుసు గాలిని విడుచుటయే ఉచ్ఛ్వాసనిశ్వాసము (Respiration) లని చెప్పవచ్చును. మనకును వికారిణికిని ఈ విషయమున భేదమేమన, మనము ప్రాణవాయువును మనచుట్టు నుండు గాలినుండి పీల్చుదుము. తిరిగి బొగ్గుపులుసుగాలిని గాలిలోనికే విడుతుము. వికారిణి యున్ననో దాని నావరించియుండు నీటినుండి ప్రాణవాయువును తీసికొని తిరిగి నీటిలోనికే బొగ్గుపులుసుగాలిని విడుచును. ఇదిగాక ఇట్టి శ్వాసక్రియనుఇ నెరవేర్చు నిమిత్తమై ఊపిరితిత్తు లనబడు ప్రత్యేకకోశములు మనకు గలవు. వికారిణియొక్క శరీరమంతయును తన యితరవ్యాపారములతో పాటు ఊపిరితిత్తులు చేయు పనినిగూడ జేయుచుండును.

5. సంతానవృద్ధి-ద్విఖండనము

వికారిణియొక్క వ్యాపారములలో నైదవది పిల్లలను పెట్టుట (Reproduction). ఒకానొకప్పుడు వికారిణికి నివాసస్థానమైన గుంట లెండిపోవచ్చును. అట్టిసమయములందు వికారిణులు అనేకములుగ నశించిపోవును. లేక యవి తమకంటె పెద్దవియగు జంతువుల కెర కావచ్చును. ఇట్లు వికారిణిజాతికి సర్వకాలములయందును నాశము కలుగుచునే యుండవచ్చును. ఈ రెండువిధముల మృతినొందు వికారిణుల సంఖ్య తిరిగి ఏదో ఒకవిధమున పూర్తికానియెడల అవి కాలక్రమమున సృష్టినుండి నశించిపోవలసి వచ్చును. ఇట్టి నాశమును తొలగించుటకై వికారిణులు సంతానవృద్ధి జెందు చుండవలెను.

వికారిణియొక్క సంతానవృద్ధి మిక్కిలి సులభమైనది. ఎట్లన, మొట్టమొదట దాని జీవస్థానము రెండుగా చీలును. (1-వ పటములో C.చూడుము). అంతట నా వికారిణికి పొడుగుగ సాగును. అట్లు సాగునప్పుడు రెండు జీవస్థానపు ముక్క లిరుప్రక్కలకు బోవును. (D. చూడుము). అట్లు సాగిన వికారిణియొక్క ఉపరితలమున రెండు జీవస్థానముల మధ్య నురి పోసినట్లుగా నొక బీట కలుగును. క్రమముగా నా బీట పెద్దదయి తల్లివికారిణిని రెండు పిల్లవికారిణులుగా ద్రుంచును. (E.చూడుము). ఈ రెండుపిల్లలును అప్పటినుండియు స్వతంత్ర జీవనము చేయును. ఇట్టి సంతానవృద్ధికి ద్విఖండన మనిపేరు. ద్విఖండన మనగా రెండుగా విభజింపబడుట.

ఈ విషయమున మన వికారిణికిని, హెచ్చు జాతి జంతువులకును గల భేద మాలోచింతము. ఒకపిల్లి కొంతకాలమున కొకసారి పిల్లలు పెట్టును. ఆపిల్లలు పరిమాణమునందు తప్ప తక్కిన సర్వవిషయములయందును తల్లిని బోలియుండును. తల్లిపిల్లి ఈప్రకారము కొన్ని సంవత్సరములవరకు పిల్లలను పెట్టిపెట్టి తుదకు ముసలిదై మృతినొందును. తల్లివికారిణి తనను బోలియుండు రెండు పిల్ల వికారిణులుగా చీలును. ఇట్లు చీలునప్పుడు తల్లికి స్వతంత్రాస్తిత్వ ముండదు. అనగా తల్లి వికారిణి వేరుగా లేదు. తల్లి యే తన రెండుపిల్లలుగా మారినది. పై నుదాహరించిన పిల్లి విషయములో తల్లిపిల్లియును, పిల్ల పిల్లులును వెవ్వేరుగా నేర్పడుచున్నవి. మరియు తల్లిపిల్లి కొంతకాలమునకు చచ్చును. తల్లివికారిణికి ఎన్నడును చావు లేదు. ఏలయన, తల్లియొక్క రెండుసగములును తనబిడ్డలుగా నేర్పడి వృద్ధిబొందుచుండుటచేత ఆపిల్లలరూపమున తల్లి చిరంజీవియై యుండును.

సంయోగము:- పై జెప్పిన సంతానవృద్ధి జూడ వికారిణికి స్వాభావిక మరణము లేదని చెప్పవచ్చును. ఇట్లు ద్విఖండనవిధాన ముచే కొంత కాలమువరకు వికారిణులు వృద్ధిబొందుచు, ఒకానొకప్పుడు రెండు వికారిణు లొకదానిప్రక్క నొకటి చేరి తుదకొకవికారిణిలో రెండవది ఐక్యమగును. ఇట్లు మిళితమగుటకు సంయోగ (Conjugation) మని పేరు. ఇట్లైక్యమగుటవలన గలుగు సంయుక్త వికారిణి, ఐక్యమగుటకు పూర్వమందున్న రెండు వికారిణులకంటె చురుకుగా మేయును, చలించును, సంతానవృద్ధి నొందును. కాబట్టి సంయోగము రెండవవిధమైన సంతానవృద్ధి యని చెప్పనగు.

మూడవవిధానమును గలదు. వికారిణిని కొన్ని ముక్కలుగా విభజించిన యెడల ఆ ముక్కలలో జీవస్థానముగల ఒక్కొక్క ముక్కయు పెరిగి సర్వవిషయములను తల్లినిబోలియుండును. జీవస్థానమునందలి భాగము ఈషన్మాత్రమైనను లేనిముక్క చచ్చును. జీవస్థానము జీవులయొక్క ప్రాణసంబంధమైన ధర్మములను నడుపుటయందు ముఖ్యమైనది గావుననే దీనికి ఇట్టిపేరు గలిగెను.

6. మరణము:- వికారిణియొక్క వ్యాపారములలో నారవది చచ్చుట. వికారిణికి ఉనికిపట్టయిన గుంట లెండిపోవునప్పు డది చచ్చునని చెప్పియుంటిమి. అట్లు చచ్చినప్పుడు దానిమూలపదార్థము కుళ్లి ప్రాణవాయువుతో గలసి బొగ్గుపులుసుగాలియును, నీరును, నత్రజనసంబంధమైన పదార్థములును అగును.

సంగ్రహము-వికారిణియొక్క వ్యాపారము లారు:

1. చలనము (Motion)

2. పోషణము లేక ఆహారము తినుట (Nutrition) 3. వృద్ధి (Growth)

4. మలమూత్రోత్సర్జనము (Excretion)

5. సంతానవృద్ధి (Reproduction)

6. మరణము (Death)

పైని వివరింపబడిన ఆరువ్యాపారములుగల వికారిణికిని మనకును ఆయావ్యాపారముల నిర్వహించుటలో గల భేదములను సంగ్రహించి చూతము. వికారిణి ఒక చోటనుండి మరియొక చోటునకు కదలునుగాని దానికి కాళ్లుగాని చేతులుగాని లేవు. వికారిణి ఆహారమును తినును కాని దానికి నోరుగాని కడుపుగాని లేదు. మనవలె వికారిణియు పెరుగును. అట్టిపెంపులో మనకును దానికిని హెచ్చు భేదమున్నట్టు కానరాదు. మనవలె నది మలమూత్రాదుల విడుచును. కాని దాని కట్టివ్యాపారముల నెరవేర్చు అవయవము లెవ్వియును ప్రత్యేకముగా లేవు. మనవలె వికారిణికిని బిడ్డలుపుట్టును. కాని వికారిణులలో భార్యభర్తల వివక్షత లేదు. రెండుజంతువులు సంయోగము నొందునుగాని అట్లు కూడునట్టి జంతువులలో ఆడది యేదో మగది యేదో చెప్పుటకు వీలుపడదు. ఇదికాక వృక్షజాతులలో కొన్నిటి యొక్క కొమ్మలను నరికి తిరిగి పాతిన నెట్లు మొక్కలు మొలచునో అట్లే వికారిణినికూడ ముక్కలక్రింద నరికినయెడల ఆముక్కలనుండి పిల్లవికారిణులు పుట్టుకొనివచ్చును. ఈవిషయమున మాత్రము వికారిణి చెట్లను బోలియున్నది. మిగిలిన అన్ని విషయములయందును వికారిణి జంతువులనే బోలియున్నదని తోచగలదు. వికారిణి మనవలె ననేక వ్యాపారముల నెరవేర్చ గలదై యున్నను దానికి కరచరణాద్య వయవములు లేవు. ఇట్లు అవయవరహితమైన నిర్మాణముగలదగుట చేతనే యిది ప్రాణులలో మొట్ట మొదటిదిగ నెన్నదగియున్నది.

షరా:- జీవస్థానముగాని సంకోచనావకాశముగాని లేకయే, తక్కిన సమస్తాంశములయందును వికారిణిని బోలియుండు ప్రాణులును కొన్ని గలవు. వీనిని ప్రాణులలో ఆద్యములుగను, నిజముగ అవయవరహితమైనవిగను గ్రహింపదగును. ఈప్రాణులు వికారిణికి పూర్వావస్థ యని చెప్పదగును. జీవసృష్టి యీ ప్రాణులతో ప్రారంభమై యుండవచ్చును. చిరకాలమునకు ఈజాతి ప్రాణులు జీవస్థానమును, సంకోచనావకాశమును పొందిన వగుటచే వికారిణిరూపముగ పరిణమించి యుండవచ్చునని కొందరు శాస్త్రజ్ఞు లూహించుచున్నారు. మరికొందరు జీవస్థానము లేనిదే యేకణమును జీవింప నేరదనియు, ప్రస్తుతము మనము ఉపయోగించెడు సూక్ష్మదర్శనులతో పరీక్షించునప్పుడు కొన్ని కణములందు జీవస్థానమును మనము కనిపెట్ట లేకున్నను, ఇంతకంటె హెచ్చుదృశ్శక్తి గల యంత్రములచే ముందుముందు దానిని తెలిసికొన గలుగుదు మనియు అభిప్రాయపడుచున్నారు.

వికారిణియొక్క నివాసమునకు తగినస్థితిగతులు.

శీతోష్ణపరిమాణము (Temperature)15°C -20°C భాగము (డిగ్రీ-Degree) లలో నుండు నీళ్లలో వికారిణి సమాన్యముగా నివసించును. ఆనీళ్లను క్రమముగా కాచినయెడల కొన్నిభాగ ములవరకు దానికి చురుకుదన మధిక మగును. తరువాత ఆ చురుకుదనము పోయి మాంద్యముగలుగును. 30°C-35°C భాగములవరకు వేడిఎక్కించువరకు వికారిణి నిశ్చలము నొందును. కాని తిరిగి యానీళ్లను చల్లార్చినయెడల దానికి చలనము గలుగును. వేడి 40°C భాగములవరకు హెచ్చించినప్పుడు వికారిణి యొక్క మూలపదార్థము గట్టిపడుటచే నది మరణము నొందును. దీనికే తాపకాఠిన్యము (Heat rigor) అని పేరు. అది నివసించు 15°C-20°C భాగములయందుండు నీటిని క్రమముగా చల్లార్చినయెడల దాని చలనము మొదలగునవి క్రమముగ తగ్గుచు 0°C మెట్టువరకు దిగునప్పటి కది నిశ్చలనము నొందును. అయినను చలిచే గలుగు నిశ్చలనము తత్కాలమునకు గలుగునదే కాని స్థిరమైనది గాదు. ఏలయనగా నట్టి నీటిని క్రమముగా కాచినప్పు డీ నిశ్చలనము నొందిన వికారిణి తిరిగి చురుకుదనముగల దగును.

మన రక్తమునందలి కణములు (Blood Coruscles)

మనశరీరమునందు సహితము వికారిణిని బోలియుండుజీవులు కోటానుకోట్లు గలవని వ్రాసినచో చదువరులకు చిత్రముగ దోచవచ్చును.

మన రక్తమునం దొక బిందువును సూక్ష్మదర్శనిలో పరీక్షించినపక్షమున కణములని చెప్పబడెడు అణురూపములైన గుండ్రని ఘనపదార్థము లపారముగా గానబడును. ఒక్కొకకణము యొక్క పరిమాణము అంగుళములో 2,500 వంతు ఉండును. ఇవి జలముకంటె కొంచెము చిక్కగ నుండు రసియను నొకానొక ద్రవపదార్థములో క్రిక్కిరిసిన ట్లుండును. ఇవి యొక చుక్క (Minim) నెత్తురులో 30 కోట్లు ఉండునని లెక్కింపబడినది. ఈ కణములలో రెండుజాతులు గలవు. అం దొకజాతివి ఎర్రగను, గుండ్రముగను ఉండును. ఇవి దొంతులుగా పేర్చబడిన బేడకాసులవలె నొక దాని

నొకటి చేరుకొనియుండి రక్తములో మహావేగమున కొట్టుకొని పోవుచుండును. (క్రిందిపటములో ఎ. అనుచో చూచిన వానిరూపము తేటపడగలదు). నెత్తురుయొక్క యెర్రదనమంతయు వీనివలననే గలుగును.ఇవి కాక జాగ్రత్తగా పరీక్షించి చూచునెడల నెర్రకణముల (Red Corpuscles) మధ్య మధ్య ఇంచుమించుగా అయిదేసి వందల కొక్కటి చొప్పున వానికంటె పెద్దవిగానుండు తెల్లకణములు (White Corpuscles) కానబడును. (పటములో తె. చూడుము).

తెల్లకణములు

ఇవి మిక్కిలి విచిత్రములైనవి; వీనిని చూచుతోడనే వికారిణి జ్ఞప్తికివచ్చును. ఇవియు స్వచ్ఛమును వర్ణరహితము నైనమూల పదార్థ సముదాయములే. వికారిణివలెనే యవియును తరుచుగ పాయలు చాచుచు వానిని ముడుచుకొనుచు నానారూపముల బొందుచుండును. ఇవి రక్తములో బడి దొర్లుచు కొట్టుకొనిపోవు నప్పుడు ఆకారముమారి యొకప్పుడు గుండ్రముగాను, ఒకప్పుడు కోలగాను, ఒకప్పుడు కోనములు గలవిగాను, ఒకప్పుడు అడ్డముగాను, ఒకప్పుడు నిలువుగాను, ఒకప్పుడు మరల గుండ్రముగాను ఉండును. ఒకానొక తెల్లకణము పది నిమిషములలో జెందు ఆకారభేదములను ఈ క్రిందిపటము

కనబరచును. వీనిలోకొన్నిటి యందు జీవస్థానము గుండ్రముగను, మరి కొన్నిటియందు పలువిధములుగను ఉండును. ఈకణములను తొగురుచెక్క (Log-Wood) మొదలగురంగులలో కొన్నినిమిషము లూరనిచ్చి పరీక్షించిన వాని నిర్మాణము స్పష్టముగ తెలియగలదు. జీవస్థానము చక్కగరంగుపట్టి విశదముగ తెలియుచుండును. ఈకణములందు సంకోచనావకాశముండదు. ఈవిషయమున తప్ప తక్కిన అంశములలో దాదపుగా నన్నిటియందును, వికారిణినిగూర్చి చెప్పిన వర్ణన తెల్ల కణములకును వర్తించును.

తెల్లకణముల వ్యాపారములు:- వీని కనేక వ్యాపారములు గలవు. అందు రెంటినిమాత్ర మిందు పేర్కొనెదము. 1. మనము తిను కొవ్వుగలపదార్థములు జీర్ణము కాగా నేర్పడిన అణువులను, తమ పాయల సహాయమున తమ శరీరములో నిముడ్చుకొని, వానిని మోసుకొనుచు, నీ తెల్లకణములు రక్తప్రవాహముగుండ దొర్లుచు పోయి మన శరీరమునందలి సమస్తభాగములకు కావలసిన పుష్టిని ఇచ్చుచుండును.

2. మనము తిను ఆహారమూలమునగాని మన శరీరమునం దెక్కడయినను పడిన కాటుమూలమునగాని మన దేహమునందు ప్రవేశించి విషూచి మొదలగు వ్యాధులను కలిగించునట్టి మన శత్రువు లనదగు సూక్ష్మజీవులతో జగడమాడి వానిని మ్రింగివేసి, వానివలన మన కుపద్రవము గలుగకుండ తమకు సాధ్యమైనంతవర కివి కాపాడుచుండును. ఈసూక్ష్మజీవులగూర్చి రెండవ ప్రకరణములో మనము జదువగలము.

ఎర్రకణములు

వికారిణి పాయలనన్నిటిని ముడుచుకొని యొకబొట్టువలె నైనదని భావింపుము. ఈయెర్రకణము లట్టిరూపమును బోలియున్నవని చెప్పవచ్చును. మానవుల యెర్రకణములందు సామాన్యముగా జీవస్థానములేకపోయినను, కప్ప మొదలగు జంతువుల నెత్తురునందలి యెర్రకణములో పెద్ద జీవస్థాన మొకటి పొటకరించుకొని యుండునట్టు స్పష్టముగ కనబడును. రక్తనష్టము గల్గించు కొన్నిరోగముల యందు మానవుల రక్తమునందలి యెర్రకణములందు సహితము జీవస్థానము లుండును. ఎర్రకణముల వ్యాపారములు:- ఎర్రకణముల మూల పదార్థమునందు రక్తగోళక (Haemoglobin) మను ఎర్రని రంగుగల అతి సూక్ష్మములైన రేణువు లనేకము లుండును. ఈ ఎర్ర కణములు మన ఊపిరితిత్తులయందలి తల వెండ్రుకలకంటె సన్ననైన రక్తనాళములలో ప్రవహించునప్పుడు అవి యానాళముల పలుచని పొరలగుండ ప్రాణవాయువును పీల్చి మిక్కిలి యెరుపెక్కి కన్ను చెదర జేయునంతటి కెంపురంగు గల వగును. ఈ ప్రాణవాయువును వహించి ఎర్రకణములు మన శరీరమునందలి సమస్తభాగములకు రక్తప్రవాహమున కొట్టుకొనిపోవును. ఇచ్చట నివి తాము తెచ్చిన ప్రాణవాయువును ఆయాయవయవముల కొప్పగించి వానినుండి బొగ్గుపులుసు గాలిని చేకొని యందుచే కొంచెము నలుపెక్కిన వగును. అంతట నివి తిరిగి ప్రాణవాయువును పీల్చు నిమిత్తమై ఊపిరితిత్తులలోనికి బోయి యచ్చట బొగ్గుపులుసు గాలిని విడిచి ప్రాణవాయువును సంగ్రహించుకొని వచ్చి మరల నాయాయవయవములకిచ్చును. కాబట్టి యీయెర్రకణము లూపిరితిత్తుల నుండి ప్రాణవాయువును అవయవములకు జేర్చునట్టియు, అవయవములయందలి బొగ్గుపులుసు గాలిని ఊపిరితిత్తులమార్గమున వెలిబుచ్చునట్టియు సేవకులని చెప్పవచ్చును.