చందమామ పిల్లల మాసపత్రిక/సంపుటము 1/జూలై 1947/కీలు గుఱ్ఱము

వికీసోర్స్ నుండి

అనగా అనగా ఒక నవాబు. ఆ నవాబుకు ఒక్కడే కొడుకు; ఒక్కతే కూతురు. కొడుకు చాలసాహసి. మిన్ను విరిగి మీదపడ్డా జంకేవాడుకాదు. పేరి ఫిరోజిషా. కూతురు చక్కని చుక్క. పేరు జహనారా.

ఆ నవాబు ప్రతి సంవత్సరం మహా వైభవంగా పీర్లపండగ చేసేవాడు. ఆ ఉత్సవాలు చూడడానికి దేశ దేశాలనుంచి రాజకుమారులు, కవులు, గాయకులు, శిల్పులు వచ్చేవాళ్ళు. వచ్చి తమతమ విద్యలనుచూపి నవాబువద్ద బహుమతులు పొందుతుండేవాళ్ళు.

ఒకయేడు ఆ ఉత్సవాలకు ఓముసలి శిల్పి వచ్చాడు. ఇతర శిల్పులు ఆడే బొమ్మలు, పాడేబొమ్మలు, ఇంకా రక రకాల ప్రతిమలుతెస్తే, ముసలితాత ఒక కొయ్యబొమ్మ గుర్రాన్ని పట్టుకొచ్చాడు. తాతను చూడగానే తతిమ్మా శిల్పులకు ఎక్కడలేని నవ్వువచ్చింది.

" ఈ గుర్రాన్ని నువ్వే చేశావా తాతయ్యా," అని అడిగాడు ఒక శిల్పి.

"బలేగుర్రం తాతయ్యా, ఎంత కిస్తావు?" అని వెక్కిరించాడు మరొక శిల్పి.

"ఏమిగుర్ర మనుకున్నావేమిరా అది దేవతాగుర్రం," అన్నాడు మరొక శిల్పి.

"వాళ్లతో నీకెందుకుకాని దీన్ని ఎంతకిస్తావో నిజంగాచెప్పు తాతయ్యా," అన్నాడు నవ్వకుండా మరొక శిల్పి.

తాతకు కోపం వచ్చింది. "మీరు కొనలేరు, మీ అబ్బలు కొనలేరు. ఎందుకు

వచ్చినబాధ? పొండి, పొండి," అని కసిరాడు.

నవాబు శిల్పులు తెచ్చిన బొమ్మలు చూచి మంచివాటిని పుచ్చుకొని ఆయా శిల్పులకు తగిన బహుమానమిచ్చాడు. చివరికి ముసలితాత కొయ్యగుర్రం మిగిలింది. "ఏమిటి దీని విశేషం," అని అడిగాడు నవాబు.

"ఏలినవారు చిత్తగిస్తే మనవి చేస్తాను. ఇది వట్టి చూపులగుర్రంకాదు. కీలుగుర్రం. ఇది కనుమూసి కనుతెరిచే లోపల చుక్కల్ని చూసివస్తుంది ఆకాశం అంతు కనుక్కొస్తుంది," అన్నాడు ముదివగ్గు.

"టట్‌టట్! అంతా అబద్ధం. అలాంటిది భూలోకంలో ఉండదు," అన్నాడు నవాబు.

"ఏలినవారు అనుగ్రహిస్తే ఇప్పుడే చూపిస్తాను," అన్నాడు శిల్పి.

"ఇక్కడికి పదికోసుల దూరంలో చందనపర్వతం ఉంది. దానిమీద మసీదు. మసీదుకు పక్కన ఖర్జూరపుచెట్టు ఉంది. పోయి ఆ చెట్టు ఆకు పట్టుకురా చూస్తాను," అన్నాడు నవాబు.

ముసలి శిల్పి నవాబు అనుమతి పుచ్చుకొని గుర్రమెక్కి ఏదో బుడుపు లాగావున్న మీట నొక్కాడు. గుర్రం అగమేగాలమీద లేచింది. అది ఎప్పుడు వెళ్లి ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలీదు. నవాబు తెప్పరిల్లి చూచేసరికి ఖర్జూరపు ఆకు పుచ్చుకొని శిల్పి ఎదురుగా నుంచున్నాడు.

నవాబుకు ఎలాగైనా ఆగుర్రాన్ని సంపాయించా లనిపించింది. "నీకేమి కావాలన్నా కోరి పుచ్చుకో. నాకా కీలు గుర్రం మాత్రం యివ్వు," అన్నాడు. "అయితే మీకుమార్తెను నాకిచ్చి పెళ్ళిచెయ్యండి," అన్నాడు శిల్పి. అంతా తెల్లబోయారు. శిల్పి మూడుకాళ్లముసలి. అందులో పగలుచూస్తే రాత్రి కల్లోకి వస్తాడు. అలాంటివాడికి చూస్తూచూస్తూ, చక్కనిచుక్క, పదహారేళ్లబాలను ఎలా ఇవ్వటం? నవాబు ఆలోచించ సాగాడు.

నవాబుకొడుకు ఫిరోజిషా అన్నాడు:- "నీవు గారడీచేశావో లేక, ఆ గుర్రానికే ఆశక్తివుందో తెలీదు. అసలు ఇతరులు ఎక్కితే పోదేమో, నిజం తేల్చుకోకుండా ఎలాతీసుకోవటం? నేను పరీక్షిస్తా." అని,

ఫిరోజిషా ఎకాయెకివెళ్ళిని కీలుగుర్రమెక్కి మీటనొక్కాడు. అది రివ్వునలేచి, చూస్తుండగానే మబ్బులోకి మాయమైంది. నవాబు, అతని బలగం తెల్లబోయి చూస్తున్నారు. ఇంత సాహసం జరుగుతుందని ఎవరూ అనుకోలేరు. ఫిరీజిషా తిరిగి వస్తాడని ఎదురుచూస్తూ కూచున్నారు. మధ్యాహ్నమైంది. ఆచూకిలేదు. సాయంత్రమైంది, అయిపులేదు, ప్రొద్దుగూకింది. ఆనవాలు లేదు. నవాబుకు పట్టరాని కోపం వచ్చింది. శిల్పి ఆ గుర్రాన్ని తేకపోతే తనకొడుకు యిలా అయ్యేవాడు కాదుగా. "వీణ్ణి తీసి కెళ్ళి జైలులో పడెయ్యండి, తరువాత చూదాము," అన్నాడు. నవాబు శిల్పిని తీసికెళ్ళి భటులు జైల్లో తోశారు.

ఇక ఫిరోజిషా ఆ కీలుగుర్రంమీద వాయువేగంతో పైకిలేచాడు. ఆవేగానికి అతనికి భయం కలిగింది. తాను ఎంత ఎత్తున ఉన్నానోనని క్రిందికి చూచాడు, మనుషులు కనిపించలా. చెట్లు కనిపించలా. తనకోట కనిపించలా. చందనగిరి

మాత్రం చిన్నిపుట్టలాగ కనిపించింది. దానితో అతనికళ్ళు తిరిగాయి. గుర్రం జూలు గటిగా పట్టుకొన్నాడు. అది ఆక్కుండా పైకిపోతూవుంది.

ఫిరోజిషాకు పెద్దలు తలుపుకొచ్చారు. అల్లారుముద్దుగా పెంచిన తండ్రి జ్ఞాపకం వచ్చాడు. రోజూ తనతో ఆడుతూ పాడుతూ వుండే చెల్లెలు జ్ఞాపకం వచ్చింది. స్నేహితులు జ్ఞాపకం వచ్చారు. అతనికి భయం మరీ ఎక్కువైంది. కళ్ళు మరీ గట్టిగా మూసుకొన్నాడు. గుర్రం వాయువేగ మనోవేగంతో పోతూనే వుంది.

ఇలా కొంతసేపు పోగాపోగా ఫిరోజిషాకు జడుపు తగ్గింది. గుర్రాన్ని క్రిందికిదించటం ఎలాగా అని ఆలోచించాడు. ఎక్కడో దానికి మరొకమీట ఉండితీరాలను కొన్నాడు. జూలులో వెదికాడు; కనిపించలా. జీనుప్రక్కన ఉన్న చీలలు తిప్పి చూచాడు; లాభం లేకపోయింది. చివరికి విసుగెత్తి దాని రెండు చెవులు పట్టుకొన్నాడు. గుర్రం వేగం తగి మెల్లగా క్రిందికి దిగ సాగింది. అప్పటికి అతని ప్రాణాలు కుదటపడ్డాయి.

గుర్రపుచెవులు రెండు ఇంకా గట్టిగా వెనకకులాగాడు. చర్రున అది కిందికి దిగసాగింది. అలా దిగిదిగి చివరికి ఒక ఏడు అంతస్థుల మేడమీద వాలింది. అప్పటికి బాగా ప్రొద్దుపోయింది. పట్టణ మంతా మాటుమణిగివుంది.

పిరోజిషా మెట్లు దిగి ఏడో అంతస్థు లోపలికి వెళ్ళాడు. అతనికి సంగీతం వినిపించింది. ఆ శబ్దాన్నిబట్టి వెళ్ళాడు. మరకత మాణిక్యాలతో ధగధగ మెరుస్తూ వుంది, ఒక పెద్దగది. లోపలి కెళ్లాడు. అక్కడ ఒక హంసతూలికా తల్పంమీద రాజకుమార్తె పండుకొని ఉన్నది. ఆమె చుట్టూ చెలికత్తెలు పండుకొని నిద్రపోతున్నారు. ఫిరీజిషా తనకళ్ళను తాను నమ్మలేకపోయాడు. కలగంటున్నానేమో ననుకొన్నాడు. తనవొల్లు తాను గిచ్చు కొన్నాడు. బాధ తెలుస్తూ నే వుంది. అప్పు డదంతా నిజమని అనుకున్నాడు.

మళ్ళీ ఒకసారి రాజకుమార్తె వంక చూచాడు. చుక్కలమధ్య చంద్రుడిలాగా వుంది. బంగారపుజుట్టు, తళతళా మెరుస్తూవుంది. మెల్లగా వెళ్ళి ఆ జుట్టు మెల్లగా తాకాడు. రాజపుత్రి కళ్ళువిప్పి అతన్ని చూచింది.

ఫిరోజిషా ఆమెను ప్రక్కకు తీసుకెళ్లి తన కధంతా చెప్పాడు. తనతో పర్షియాకువచ్చి తన్ను పెండ్లాడ వలసిందని ప్రార్థించాడు. వంగరాజపుత్రికూడా అతన్ని ప్రేమించింది. రెండోవారికి చెప్పకుండా అతనివెంట బయలుదేరింది. ఇద్దరూ కీలుగుర్రమెక్కి పర్షియాలో తమ పట్టణంముందు వాలారు.

మేళతాళాలు, బాజాభజంత్రీలు లేకుండా కొత్తపెండ్లికూతురును అంత:పురానికి తీసుకొనివెళ్ళటానికి ఫిరోజిషా మనస్సు ఒప్పలేదు. రాజపుత్రికకు ఇప్పుడేవస్తాననిచెప్పి ఆమెను, గుర్రాన్ని అక్కడి తోటలోని బంగళాలో దింపి ఒక్కడే ఇంటికి వచ్చాడు.

నవాబు సంతోషానికి మేరలేక పోయింది. వెంటనే శిల్పిని విడుదల చేయించాడు. రాజపుత్రిని తీసుకురావటానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈసంగతంతా శిల్పి విన్నాడు. గుప్పుడు చప్పుడుకాకుండా రాజకుమారి దగ్గరకు వెళ్ళి, "మిమ్ము ఈ గుర్రంమీద అంత:పురానికి తీసికొనిరమ్మాన్నారు," అన్నాడు. ఆమె నమ్మి కీలుగుర్రమెక్కి అతని
వెనుక కూర్చుంది. శిల్పి మీట నొక్కాడు. గుర్రం రివ్వున లేచి పోయింది.

మేళతాళాలతో రాజపుత్రికి ఎదురుకోలు ఇవ్వడానికి వచ్చిన పరివారం జరిగినమోసం తెలుసుకొన్నది. ఈవార్తవిని ఫిరోజిషా దిగాలుపడ్డాడు. రాజపుత్రి లేక, తానుబ్రతకడం కల్ల అనుకొన్నాడు. ఎలాగైనా ఆమెను తీసుకురావాలని కాలినడకను బయలుదేరాడు.

శిల్పి ఎక్కినగుర్రం పోయిపోయి గ్రీసు దేశంలో ఒక మైదానంమీద దిగింది. రాజకుమారి శిల్పిచేసిన మోసం తెలుసుకొని ఏడువ సాగింది. ఆ ఏడుపు వేటకువచ్చిన గ్రీసురాజు చెవులబడ్డది. అతడు చప్పునవచ్చి జరిగిన మోసం రాజపుత్రివల్ల విని శిల్పితల నరికివేశాడు.

గ్రీసురాజుకూడా వంగరాజు పుత్రిమీద ప్రేమ ఏర్పడింది. ఇది ఏమాత్రం ఆమెకు ఇష్టంలేదు. రాజు బలాత్కారంనుంచి తప్పుకోటానికి పిచ్చిఎత్తినట్లు నటించసాగింది. దగ్గరకు వచ్చేవాళ్ళను రక్కేది, పీకేది. రాజు ఎంతో చిన్నపోయాడు. ఆమెపిచ్చి కుదర్చటానికి ఎందరో వైద్యుల్ని పిలిపించాడు. ఎన్నో మందులిప్పించాడు. లాభంలేకపోయింది. నిజమైన పిచ్చి అయితేగా అసలు కుదరటానికి?

ఇక్కడ యిలా జరుగుతూవుండగా అక్కడ పర్షియాలో కాలినడకను బయలుదేరిన ఫిరోజిషా ఊళ్ళుదాటాడు. ఉకాలు దాటాడు. చీమలు దూరని చిట్టడవీ, కాకులు దూరని కారడవీ దాటాడు. ఎక్కడా తన రాజపుత్రిజాడ తెలియలేదు. ఏరులు

దాటాడు, నదులుదాటాడు, గుట్టలెక్కాడు, మిట్టలెక్కాడు, చివరికి గ్రీసురాజు పట్టణం చేరుకొన్నాడు. అక్కడ రాజపుత్రి సంగతి విన్నాడు.

ఫిరోజిషా వైద్యుని వేషంతో రాజు దగ్గరకు వెళ్లి "నాకు భూత వైద్యం తెలుసు. రాజపుత్రి పిచ్చి కుదురుస్తా" నన్నాడు. రాజు సంతోషించి అతన్ని అంత:పురానికి తీసుకువెళ్లడు. కొత్త వైద్యుణి చూడగానే రాజకుమారికి పిచ్చి కొంచెం తగ్గిపోయింది.

"రాజా, ఈ అమ్మాయికి ఒక కీలు గుర్రంమూలాన ఈవ్యాధి కలిగింది ఈమెను ఆగుర్రంమీద ఎక్కించిచుట్టూ గుగ్గిల ధూపం వెయ్యాలి. మంత్రాలు చదవాలి. అప్పుడుగాని ఈవ్యాధి పూర్తిగ పోదు. పదియేళ్ళు గడువిస్తే కీలు గుర్రం చేస్తాను," అన్నాడు ఫిరోజిషా. "ఈ భాగ్యానికి పది సంవత్సరా లెందుకు. మనదగ్గర ఒక కీలుగుర్రం ఉన్నది. దానితో చికిత్స చెయ్యి," అన్నాడురాజు.

ఫిరోజిషా పాచిక పారింది. రాజ కుమారిని కీలుగుర్రం ఎక్కించి చుట్టూ దట్టంగా గుగ్గిలం ధూపం వేయించాడు. ఆ పొగతెరలో తానుకూడా కీలుగుర్రం పై ఎక్కాడు. మీట నొక్కాడు. వాయు వేగంతో కీలుగుర్రం ఆకాశంలోకి ఎగిరి పోయింది.

ఫిరోజిషా బెంగాలు రాకుమారితో క్షేమంగా ఇంటికివచ్చిచేరాడు. వారిద్దరికీ వైభవంగా పెండ్లి జరిగింది. పెండ్లి నాటిరాత్రి బెంగాలురాకుమారి కీలుగుర్రాన్ని తగలబెట్టించింది. దానితో వాళ్ళకష్టాలు తీరిపోయాయి. హాయిగా రాజ్యం ఏలుకుంటూ నూరేళ్ళు బ్రతికారు.

అవసరాల రామకృషారావు, తుని.

అనగా అనగా ఓ వూర్లో వక పొట్టి పిచిక వుండేది. అదేం చేసిందీ, ఊరల్లా తిరిగి ఉలవగింజ, చేనల్లా తిరిగి సెనగ్గింజ, పెరడల్లా తిరిగి పెసరగింజ, ఇల్లాంటివి ఎన్నోగింజలు పోగు చేసుకొని కొట్టి కొట్టి కొండంత రొట్టిచేసుకుంది. చేసుకుని, చింత చెట్టుమీద కూర్చుని, ఆపిచిక ఆ రొట్టెను ఎగరేసుకుంటూ, ఎగరేసుకుంటూ, తింటూ ఉంటే, చీమతలకాయంత ముక్క చెట్టుతొర్రలో పడిపోయింది.

అప్పుడా పిచిక ఏం చేసిందీ వడ్రంగి దగ్గరికి వెళ్లి, "వడ్రంగీ, వడ్రంగీ, అతి కష్టపడి కొండంత రొట్టెచేసుకుని తింటూంటే చీమ తలకాయంతముక్క చెట్టు తొర్రలో పడిపోయిందోయ్! చెట్టుకొట్టి అది తీసి పెట్టాలోయ్," అంది.

వడ్రంగి 'చీమ తలకాయంత ముక్కకై చెట్టు కొట్టాలా? అని పక పక నవ్వాడు.

అప్పుడా పిచిక కెంతో కోపంవచ్చి తిన్నగా రాజు దగ్గిరకివెళ్ళి, "రాజుగారూ, రాజుగారూ! అతి కష్టపడి కొండంత రొట్టి చేసుకొని తింటూంటే చీమ తలకాయంతముక్క చెట్టుతొర్రలో పడిపోయింది. తీసిపెట్టమని వడ్రంగి నడిగితే తీయనన్నాడు. వడ్రంగిని దండించు రాజా," అంది.

రాజుకూడా నవ్వి, 'ఇంత చిన్నపనికి వడ్రంగిని దండించాలా? దండించనుపో అన్నాడు రాజు.

'అమ్మా వీడిపని ఇలా వుందా!' అని ఆ పిచిక వెంటనే లేళ్లదగ్గిరకి వెళ్లి జరిగింది చెప్పి, "చెట్టు కొట్ట