గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 7/జూలై 1928/గ్రంథాలయముల పలుకుబడి - అమెరికా దేశము

వికీసోర్స్ నుండి

పడి యుండినచో పని తృప్తికరముగా జరుగదు. కాని అట్టి వార్షికవిరాళములు బంధకములై యుండగూడదు.

-సూరి వేంకట నరసింహశాస్త్రి

గ్రంథాలయముల పలుకుబడి - అమెరికా దేశము

(డాక్టరు సుధీంద్రబోసుగారు)

అమెరికా దేశమందు పట్టణములయందేగాక పల్లెలయందు గూడ కలిసి పదునెనిమిది వేల గ్రంథాలయములు గలవు. ఈగ్రంథాలయములు ప్రభుత్వము వారిచేతను, వ్యక్తులవలననుగూడ నిర్వహింపబడుచున్నవి. మనదేశమందు మసీదులు, చెర్చిలు, దేవాలయములు కలసి ఎన్నిగలవో, అమెరికా దేశమం దన్నిగ్రంథాలయములు గలవు. అందుచేత వానికొరకై ఖర్చుపడుద్రవ్యము అసంఖ్యాకమైయున్నది.

మనదేశమందు గ్రంథాలయముల యుపయోగము కొలదిజనులకుమాత్రమే ప్రత్యేకింపబడి యున్నది. అమెరికా దేశమందలి గ్రంథాలయోద్యమమును గూర్చి చదువుకొనుటకై, ఐరోపా దేశమునుండి అనేకమందిని పంపుచున్నారు. మనదేశమునుండి ఎంతమందిని పంపినారు? అమెరికాదేశమందలి గ్రంథాలయము జనులందరియొక్క యుపయోగము నిమిత్తమును ఏర్పడినది. అందుచేత నిరోధములేమియు లేకుండ ఆదేశమందలి గ్రంథాలయములు జనులందరికిని అందుబాటులో నుండును. మానవుని విజ్ఞానమునకు ఆవశ్యకములైన శాస్త్ర గ్రంథములు, చరిత్ర గ్రంథములు మొదలగు అన్ని శాఖల గ్రంథములును వానియందు దొరకును. చదువరికి కావలసిన సదుపాయము లన్నింటిని గ్రంథాలయములు చేయుచుండును.

ఆదేశ గ్రంథాలయము లన్నింటియందును చదువుకొనుటకు ప్రత్యేకగదు లుండును. పరిశోధన చేయువారు ప్రత్యేకముగా పరి శ్రమచేయుటకుగాను ఏర్పాటులు చేయుదురు. అట్టివారికి ఒక్కసారి ఇరువదియైదు పుస్తకములవరకు ఎరు విచ్చెదరు.

ఆదేశమందు గ్రుడ్డివారికిగూడ ప్రత్యేక గ్రంథాలయములున్నవి. వారికి గదులను ప్రత్యేకించి, ఉబ్బెత్తు అక్షరములుగలిగిన గ్రంథములను వానియం దుంచెదరు. ప్రభుత్వమువారిచే నిర్వహింపబడుచు ఆదేశమందెల్ల అగ్రస్థానమును, ప్రపంచమందెల్ల మూడవ స్థానమును వహించియున్నట్టి కాంగ్రెసు జాతీయగ్రంథాలయమునందు ఆంధ్రులగు చదువరులకు పుస్తకములను ఇంటికిగూడ ఎరు విచ్చెదరు.

పట్టణ గ్రంథాలయములందును, పల్లె గ్రంథాలయములందును గూడ విద్యార్థికి వారమునకు 6 లేక 7 గ్రంథములను ఎరు విచ్చెదరు. గడువుకాలమునకు ఆగ్రంథములను తిరిగి ఇయ్యనియెడల రెండు లేక మూడుకాసులకు మించని జుల్మానాను విధించెదరు.

ఆదేశ గ్రంథాలయములందు పుస్తకములు పోవుట మిక్కిలి అరుదు. పుస్తకములు చదువరులు ఎత్తుకొని పోయెదరేమో యని గ్రంథాలయాధిపతులు అనుమానగ్రస్థులై యుండరు. అట్టి అనుమానముతో జూచుటవలన గ్రంథాలయములయందున్న "అమూల్యాఇశ్వర్యమును" చదువరులు ఉపయోగింప ఉత్సాహవంతులై యుండ రని వారి తలంపు.

ఆదేశగ్రంథాలయములు సాధారణముగా ఉదయము 8 గంటలుమొదలు రాత్రి 10 గంటలవరకు తెరచి యుంచబడును. శలవు దినములందు మాత్రము మధ్యాహ్నము 2 గంటలు మొదలు రాత్రి 10 గంటల వరకు తెరచెదరు.

గ్రంథాలయ మనగా గ్రంథములను సేకరించి యుంచుస్థానము గాదు; గ్రంథములను పాతిపెట్టు స్థలముగాదు; మిక్కిలి తెలివితేటలతో జనులకు గ్రంథములను ఉచితముగా పంచి యిచ్చు స్థలమునకే గ్రంథాలయ మని పేరు. తనతేజమును వ్యాపింపజేయునట్టిజ్ఞానజ్యోతి యేగ్రంథాలయము. అంతేగాని దుమ్ము కొట్టుకొనియున్న గ్రంథసంపుటములను భద్రపరచునట్టిది కాదు.

గ్రంథాలయములను జనులు ఉపయోగించుటకు గాను తగిన యభిరుచు గలుగునటుల ఆదేశ గ్రంథాలయాధిపతులు అనేకవిధములైన ఆకర్షణములను జూపెదరు; వారు ప్రకటించెదరు; పత్రికలను పంచిపెట్టెదరు; పలువిధములైన ప్రచారమును గావించెదరు. చిల్లర దుకాణములందు కొనునట్టివారిని ఆకర్షించుటకై, వారు కొనువస్తువులను చుట్టబెట్టుటకు గాను అట్టి ప్రకటనపత్రికలను ఉంచెదరు. సంచార గ్రంథాలయ పేటికలను పంపెదరు. అప్పు డప్పుడు గ్రంథముల నంపు శాఖల నేర్పరచెదరు.

ఆదేశమందు "ఫిలడెల్ఫియా" గ్రంథాలయములందు గ్రంథములను టెలిఫోను వార్తలమూలమున తెప్పించుకొనవచ్చును. రెండు వేలమైళ్ల దూరమునుండి యైన తెప్పించుకొన వచ్చును. అక్కడ గ్రంథాలయములయందు ఉత్తరములు వ్రాసికొనుటకు ప్రత్యేకమైన గదులు గలవు. చివరకు చుట్టలు కాల్చుకొనుటకు గూడ ప్రత్యేకమైన యేర్పాటులు గలవు.

ఐరోపాదేశమందు పదిసంవత్సరములకు తక్కువ వయస్సుగల బాలురు గ్రంథాలయముల నుపయోగింపరాదు. కాని అమెరికా దేశమందు పిల్లలను నిషేధింపలేదు. ఆదేశ గ్రంథాలయములందు పిల్లలకు ప్రత్యేకముగ "బాలశాఖలు" గలవు. గ్రంథ భాండాగారి వారికి అప్పు డప్పుడు కథలు - పురాణగాధలు - ప్రసిద్ధపురుషుల వీరకార్యములు - మొదలైనవానిని జెప్పుచుండును. అట్టివానిని చెప్పునప్పుడు ఆగాధలను సగముజెప్పి ఆపివేసి, కొన్నిపుస్తకములను వారియెదుట బెట్టి, ఆగాధలయొక్క మిగిలినభాగములను ఆపుస్తకములనుండి ఎవరికి వారు చదువుకొనునటుల జేయును.

గ్రంథాలయములపని ప్రత్యేకమొక శాస్త్రము. ఈపనియందు తరిబీతు చేయునట్టి పాఠశాలలు అనేకము లాదేశమందుగలవు. ఈ పేజి వ్రాయబడియున్నది. ఈ పేజి వ్రాయబడియున్నది. మనదేశ చరిత్రయం దీ సందిగ్ధ తరుణమందు గావలసినది గ్రంథాలయముల మూలమున జ్ఞానజ్యోతియొక్క ప్రకాశము.

దాసు త్రివిక్రమరావు గారు

అఖిలభారత ధర్మగ్రంథాలయ సంఘమునకు సంయుక్త కార్యదర్శియగు దాసు త్రివిక్రమరావు ఎల్. ఎల్. బి. బార్ - ఎట్- లా గారు హాలండుదేశమున జరుగబోవు అంతర్జాతీయ యువక మహాసభకు ఆంధ్రదేశ పక్షమున ప్రతినిధిగా పోయియున్నారు. ఆసందర్భమున వారిని అభినందించుటకు గాను బెజవాడయందు అఖిలభారత గ్రంథాలయ సంఘముయొక్కయు - ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘముయొక్కయు - బెజవాడ యందున్న రామమోహనధర్మగ్రంథాలయము, దుర్గామల్లేశ్వర ఆంధ్రగ్రంథాలయము, కార్మిక గ్రంథాలయముల యొక్కయు ఆదరణక్రింద సభ సమావేశ మయ్యెను. ఫలాహారములైనపిమ్మట ఆంధ్రవిశ్వవిద్యాలయ వైసుఛాన్సిలరు కట్టమంచి రామలింగారెడ్డిగారి అధ్యక్షతక్రింద గొప్పసభ సమావేశమైనది. అధ్యక్షులు శ్రీత్రివిక్రమరావుగారిని అభినందించుచు వారి వైదుష్యమును దేశసేవాపరతంత్రతను, స్వార్థ పరిత్యాగమును, నిర్మాణదీక్షతను, సర్వతోముఖవిజ్ఞానమును ప్రశంసించిరి. జరుగనున్న మహాసభకు ప్రతినిధిగా యుండి భారతవర్షముయొక్క సందేశమును అచట ప్రకటించి మాతృదేశమునకు నానాజాతీయ సభ్యతయందు అర్హస్థానమును సంపాదించుటకు తగిన సమర్ధత త్రివిక్రమరావుగారికి అన్నివిధముల యున్నదని రెడ్డిగారు కొనియాడిరి. శ్రీ సూరి వెంకటనరసింహశాస్త్రిగారిచే చదువబడిన వినతిపత్రమును శ్రీ త్రివిక్రమరావుగారు అందుకొని, ఆమూలమున అఖిలభారతగ్రంథాలయ సంఘమువారును స్థానిక గ్రంథాలయ సంఘములవారును తమ కిచ్చిన గౌరవమువలన తానువిస్మితుడ నైతిననియు, అందులో తననుగూర్చి చెప్పబడిన యంశములకు తాను అర్హురుగా యుండునటుల కృషిచేయుటయే తన జీవితపర