కాశీ మజిలీ కథలు/31వ మజిలీ/శూద్రక మహారాజు కథ

వికీసోర్స్ నుండి

కాశీమజిలీ కథలు


ఉత్తరఖండానుబంధము. 31 వ మజిలీ.


కాదంబరి.


శూద్రకమహారాజుకథ.

గీ. పుడమిఁగలిభయమునఁ బ్రోగుపడిన కృత యు
    గంబనఁగ సర్వధర్మ ప్రకాశమగుచు
    సారవేత్రవతీనదీతీరమందు
    విదిశయను రాజధాని సంపదలఁబొదలు.

అప్పట్టణంబున కధినాయకుండై శూద్రకుండను రాజు సకల నృపశిరస్సంధానితశాసనుండై ఱెండవ పాకశాసనుండువోలె భూమండలమంతయు నేకాతపత్రముగఁ బాలించుచుండెను.

అన్నరవరుం డనవరతదానజలార్ద్రీకృతకరుండై దిగ్గజంబువోలెఁ బ్రతిదివసోపజాయమానోదయుండై ప్రభాకరుని చందమున నొప్పుచు సర్వశాస్త్రములకు దర్పణమనియుఁ గళల కుత్పత్తిస్థానమనియు సుగుణములకుఁ గులభవనమనియు మిత్రమండలమున కుదయశైలమనియు రసికులకాశ్రయుఁడనియు ధనుర్ధరులకుఁ బ్రత్యాదేశమనియుఁ బొగడ్త కెక్కెను. మఱియు, దృఢముష్టినిష్పీడనంబునంబయలు వెడలిన జలధారయుంబోలె నాభూపాలు కేలంగ్రాలు కరవాలంబు కరికటతటగళిత మదజలాసారదుర్దినములగు సంగరసమయములయందు వీరభటకవచ సహస్రాంధకార మధ్యవర్తినియైయున్న జయలక్ష్మి నభిసారికవోలెఁ బెక్కుసారులతనిచెంతకుఁ దీసికొనివచ్చినది.

అయ్యవనీపతి కువలయభరంబు వలయంబువోలె నవలీలనిజ భుజాగ్రంబున భరించుచుఁ బలుమారు నీతిశాస్త్రములెల్ల నవలోకించి బుద్ధిబలముచే బృహస్పతి నై నంబరిహసించుచుఁ బ్రబుద్ధులనివాడుక జెందిన కులక్రమాగతులగు మంత్రులు సేవింప సమానవయోవిద్యా విభూషితులు ప్రేమానురక్తహృదయులు నసమసమరక్రీడాభిరతులు నగు రాజసుతులతోఁ గూడికొని క్రీడించుచుఁ బ్రధమవయస్సు సుఖముగా వెళ్ళించెను.

సీ. అతులస్వరంబు లుప్పతిలంగ వీణగై
                 కొనిపాడు హాయిగాఁ గొంతసేపు
    మహితప్రబంధనిర్మాణ క్రియారత
                 స్వాంతుఁడై యలరారుఁ గొంతసేపు
     దర్శనాగతతసోధనజనారాధనా
                 కుతుకాత్ముఁడై యుండుఁ గొంతసేపు
     చర్చించు సకలశాస్త్రప్రసంగంబులఁ
                 గోవిదావళిఁగూడి కొంతసేపు

గీ. కోర్కెచిత్తరువులు వ్రాయుఁ గొంతసేపు
    గురుపురాణము లాలించుఁ గొంతసేపు
    జంతుసంతతినాడించుఁ గొంతసేపు
    అంగనాభోగవిముఖుఁడై యనుదినంబు.

మిగుల సుందరుఁడగు నానృపనందనుండుఁఁ ప్రధమవయస్సున స్త్రీజనమును దృణముగాఁ జూచుచు సంతానార్ధులగు మంత్రులచే బోధింపఁబడియు సురతసుఖంబు నందలి విరోధంబునంబోలె దార సంగ్రహం బనుమతింపఁ డయ్యెను.

ఒకనాఁడు ప్రొద్దుట నప్పడమి రేడాస్థానమంటప మలంకరించి యున్నసమయంబున నంగనాజనవిరుద్థముగ వామకక్షమునఁ గౌక్షేయకమిడికొని సన్నిహితపన్నగం బగు చందనలతవోలె భీషణరమణీయమగు నాకారముతో బ్రతీహారి యరుదెంచి జానుకరకమలంబులు పుడమిసోక మ్రొక్కుచు నిట్లనియె.

దేవా ! కుపితుండగు దేవేంద్రుని హుంకారంబున నేలంబడిన త్రిశంకుని రాజ్యలక్ష్మియోయన దక్షిణదేశమునుండి మాతంగకన్యక యోర్తు పంజరముతో నొకచిలుకను దీసికొనివచ్చి ద్వారదేశమునఁ నిలువంబడి దేవరతో నిట్లు విజ్ఞాపన చేయుచున్నది. భువనతలంబున గల రత్నములకెల్లఁ గల్లోలినీ వల్లభుండువోలె దేవరయే యేకభాజన మని తలంచి యాశ్చర్యభూతమగు నీవిహంగమరత్నము నేలికపాద మూలమును జేర్చు తలంపుతో నరుదెంచితిని. దర్శనసుఖంబను భవింపఁగోరుచున్న దాన.

అని తత్సందేశ మెఱింగించిన ప్రతిహారి వచనంబులు విని యాభూనేత కుతూహలోపేతుఁడై యాసన్నవర్తులగు మిత్రులమోము లుపలక్షించుచు దీనందప్పేమియున్నది, ప్రవేశపెట్టుడని యాజ్ఞాపించుటయు నాప్రతీహారి సత్వరమ యఱిగి యమ్మాతంగ కుమారిం దీసికొని వచ్చినది.

ముదిమిచేఁ బండిన శిరముగలిగి నేత్రకోణము లెఱ్ఱని జీరలతో నొప్పుచుండ జవ్వనముడిగినను బరిశ్రమ గలుగుటచే శిధిలముకాని మేని బింకముతోఁదెల్లనివస్త్రములు ధరించి వృదమాతంగుఁడొకఁడు ముందు నడుచుచుండఁ బైడిశలాకలచే రచింపఁబడినను జిలుకరెక్కల కాంతులచే మరకతమయమైనది వోలెఁ బచ్చవడియున్న పంజరమును జేతంబూని కాకపక్షంబులు చలింపనొక చండాల బాలకుఁడు తోడరానసురాపహృతంబగు నమృతంబు వేల్పులకిడ నవధరించిన మధుసూదనుని మోహినీరూపమును బురడించుచు మీగాళ్లదనుక మేలిముసుగు వైచికొనుటచే సంచరించు నింద్రనీలపుబొమ్మవలెనొప్పుచు సంతతము వెన్నుని యురమందు వసించుటఁ దదీయశ్యామప్రభాసంక్రమణంబున నల్లబడిన మహాలక్ష్మియుంబోలె బలరాముని హలాపకర్షణ భయంబునఁ బారివచ్చిన యమున చాడ్పునఁ గుపితహరనయన దహ్యమానుండగు మదనుని ధూమమున మలినీకృతయగు రతిననుకరించుచు నచిరోపారూఢ యౌవనయై వచ్చుచున్న యామాతంగ కన్యక నిముషలోచనుండై యారాజమహేంద్రు డీక్షించి విస్మయా వేశితహృదయుఁడై యిట్లు తలంచెను.

అన్నన్నా ! తగనిచోట హాటకగర్భున కక్కజమగు రూపు గల్పించు ప్రయత్న మేమిటికిఁ గలుగవలయును. అక్కటా ! నిరతి శయసౌందర్యవిశేషంబునం బొలుపొందు నియ్యిందువదనను ముట్టరాని నికృష్టకులంబునం బుట్టించెగదా ? మాతంగజాతిస్పర్శభయంబున ప్రష్ట ముట్టకయే యిప్పూబోణిని నిర్మించెనని తలంచెదను. కానిచోఁ దదీయకరతలస్పర్శ క్లేశితములగు నంగముల కింత వింత కాంతియు లావణ్యము గలిగియుండునా ! ఇసిరో ! సరసిజభవుండెప్పుడు నసదృశ సంయోగమునే చేయుచుండును గదా ? అతిమనోహరాకృతిగల యీనాతి క్రూరజాతియం దుదయుంచుటచే నిందిత సురతయై యసుర సంపదవలె నభోగ్యమైయున్నదని నా డెందము మిక్కిలి పరితాపము జెందుచున్నది.

అనియతండు తలంచుచుండ నక్కన్యారత్నము మ్రోలకువచ్చి యించుకవంగి ప్రోడవలె నమస్కరించి యమ్మణికుట్టిమంబుననోరగా గూరుచున్నంత నావృద్ధ మాతంగుఁడు పంజరములోనుండగనే చిలుకను చేతితోనంటి సవరించుచు గొంచెము దాపునకువచ్చి ఱేనికిం జూపుచు నిట్లనియె. దేవా ! యీ చిలుక సకలశాస్త్రార్థములు గుర్తెఱుంగును. రాజనీతియందును పురాణకధాలాపమునందును దీనికి మంచి నై పుణ్యముగలదు. కావ్యనాటకాలంకార గ్రంథములు జదువుటయే కాక స్వయముగా రచింపఁగలదు. వీణావేణుమురజప్రభృతి వాద్య విశేషముల సారమిదియే చెప్పవలయును. చిత్రకర్మయందు ద్యూత వ్యాపారమునందును గజతురగ స్త్రీలక్షణ జ్ఞానమందును దీనిని మించిన వారు లేరు. ప్రణయకలహకుపితులగు కాముకులం దేర్చు నేర్పు దీనికే కలదు. పెక్కు లేల ? యాపతత్రిప్రవరంబు సకలభూతల రత్న భూతమని చెప్పనొప్పును. దీనిపేరు వై శంపాయనము. సర్వరత్నములకు జలనిధి వోలె దేవర ముఖ్యభాజనమనితలంచి మా భర్తృదారిక యీచిలుకను మీపాదమూలమునకుఁ దీసికొని వచ్చినది. దీనిం దయతోఁ బరిగ్రహింపుఁ డని పలుకుచు నాపంజర మానృపకుంజరుని ముందర నిడి యావృద్ధుం డించుక యెడమగాఁ బోయెను.

అప్పు డప్పతంగ పుంగవము రాజాభిముఖముగా నిలువంబడి కుడిచరణమెత్తి మిక్కిలి స్పష్టములగు వర్ణస్వరములచే సంస్కరింపఁ బడిన వాక్కులతో జయశబ్దపూర్వకముగా నీపద్యముఁ జదివినది.

గీ. అనఘ ! భవదరి నృపవధూస్తన యుగంబు
    చిత్తగత శోకదహనంబు చెంత నిలిచి
    యశ్రుజలపూరమునఁ దీర్థమాడి మరి వి
    గతమహా హారమై ప్రతిస్థితిదనర్చు.

ఆచిలుక పలుకులు విని యానృపతిలకుండు వెఱఁగు జెందుచు ______________________________________________________________________

శ్లో || స్తనయుగమశ్రుస్నాతం సమీపతరవర్తిహృదయశోకాగ్నె ! సంతసముతోఁ జెంతనున్న కుమారపాలితుం డను వృద్ధమంత్రింజూచి ఆర్యా ! యాచిలుక పలుకులయందలి స్పష్టతయు మాథుర్యమును వింటివా ? ఇది వర్ణమాత్రానుస్వారస్వర సంకరము గాకుండ నభి వ్యక్తముగాఁ బలుకుటయే మొదటిఁ జిత్రము. మఱియు మనుజుండు వోలె బుద్ధిపూర్వకమగు ప్రవృత్తితో నభిమతవిషయమై కుడి చరణమెత్తి జయశబ్దపూర్వకముగా నతిపరిస్ఫూటాక్షరముగా పద్యము జదువుటఁ గడుంగడు నబ్బురము గలుగఁజేయుచున్నది. తరుచు పక్షులును, బశువులును నిద్రాహారమైధునభయసంజ్ఞామాత్రవేదులు గదా ?

అని పలుకుటయు గుమారపాలితుఁ డించుక నవ్వుచు దేవా ! ఇది యేమిచిత్రము. శుకశారికాప్రభృతి విహంగమ విశేషములు మనుష్యులచేఁ జెప్పబడిన మాటలం బల్కుచుండుట దేవర యెఱుంగనిదియా ? పూర్వము చిలుకులు మనుజులువలె బలుకుచుండునవి. అగ్ని శాపంబునం జేసి శుకవచనము లపరిస్ఫుటములైనవి.

అని యతండు సమాధానము జెప్పుచుండఁగనే ఛండకిరణుం డంబరతల మధ్యవర్తి యయ్యెనని తెలుపు భేరినినాదముతోఁ గూడ మాథ్యాహ్నిక శంఖధ్వని బయలు వెడలినది.

ఆధ్వని విని యమ్మహారాజు స్నానసమయమయ్యెనని తటాలున సింహాసనమునుండి లేచి రాజలోకమెల్ల సంభ్రమోత్సేకముతో గద్దియలు విడిచి వినయవినమితో త్తమాంగులై నిలువంబడిన శిరఃకంపమున వారికిఁ బోవుట కనుజ్ఞ నిచ్చుచు నచ్చండాల కన్యకతో మేము వచ్చినందాక నిందుండు మని నియమించి యచ్చిలుకను లోపలకుఁ దీసికొనిపోయి స్నానపానాశనాదివిధులం దీర్పుమని తాంబూలకరండ వాహినికిం జెప్పి సముచిత మిత్రలోకము సేవింప నభ్యంతరమందిరమున కరిగెను. అందు స్నానసంధ్యావందన దేవపూజాది నిత్యక్రియాకలాపములు నిర్వర్తించుకొని రాజబంధువులతోఁగూడ నభిమతరసాస్వాదంబున బ్రీతుండగుచు భోజనముగావించి ప్రతీహారిమార్గ మెఱింగింప మనోహరాలంకారమండితంబైన విశ్రమమంటపమునకుఁ బోయి శయనతలంబునఁ గూర్చుండి తాంబూలము వైచికొనుచు నాప్తవర్గంబు చుట్టునుం బరివేష్టించి వినోదకథలచే చిత్తము రంజింపఁ జేయుచుండ నిండు వేడుకలతోనుండి యాభూమండలాఖండలుఁడు వైశంపాయనమును దీసికొనిరమ్మని ప్రతిహారి కాజ్ఞాపించుటయు నదివోయి యత్యంత శీఘ్రముగా నాజిలుక పంజరము దెచ్చి రాజుమ్రోలబెట్టెను. అప్పు డా భూపతి చిలుకంజూచి పతంగపుంగవా ! అభిమతభోజనంబున దృప్తుండవైతివే ? యని యడిగిన నదిదేవా ! సమదకోకిలలోచనరుచిం బురడించు జంబూఫలంబు లెన్నేని యాస్వాదించితిని. హరినఖరభిన్న మాతంగకుంభార్ద్రంబులగు ముక్తాఫలంబులం బోలిన దాడిమీబీజంబుల రుచి యేమనవచ్చును ? అన్నన్నా ! నళినీదళంబులు వోలె హరితములగు ద్రాక్షఫలముల మాధుర్య మెప్పటికైన మరువవచ్చునా ? అయ్యారే ! ప్రాచీనములగు నుసిరికకాయల పస యనుభవించి తీరవలయును. పెక్కేల భవదంతఃపురకాంతలు స్వయముగాఁ గరతలములచే నాకుఁ దినిపించినవన్నియు నమృతాయమానంబులై యున్న వని పెద్దగాఁ బొగడెను.

ఆమాట లాక్షేపించుచు నాక్షితిపతి పక్షీంద్రమా ! యది యట్లుండనిమ్ము. నీవేదేశమునం జనించితివి ? నీ తలిదండ్రు లెవ్వరు ? నీకు వేదశాస్త్రపరిచయ మెట్లుకలిగినది ? ఇతరవిద్యావిశేషము లెట్లు గ్రహించితివి ? జన్మాంతరానుస్మరణమా ! లేక వరప్రదానమా ? అదియునుంగాక శుకరూపము దాల్చి ప్రచ్ఛన్నముగాఁ దిరుగుచున్న యొకానొక దివ్యుఁడవా ? నీకెన్ని యేండ్లున్నవి ? యింతకు ముందు నీ వెందుంటివి ?

నీకీ పంజరబంధము చండాలకన్యకాహస్తప్రాప్తియు నెట్లు కలిగినది. నీవృత్తాంతము విన మిక్కిలి కుతూహల మగుచున్నది. యెఱింగించెదవే యని యడిగిన నాపతంగప్రవరమాత్మగతంబున నించుక ధ్యానించి యిట్లనియె.

చిలుక కథ.

దేవా ! నాయుదంతము కడు పెద్దది. వినుటకు దేవర కిష్టమేని వక్కాణించెద నాకర్ణింపుఁడు. వింధ్యారణ్యాంతర్భాగం బగు దండకారణ్యమునఁ బ్రసిద్ధిజెందియున్న పంచవటీతీరమున కనతిదూరములో నున్న పంపాసరోవరము పశ్చిమభాగంబున శ్రీరామశరప్రభంజితములగు సప్తతాళముల ప్రక్క నొక్క వృద్ధశాల్మలీ వృక్షము గలదు.

అ త్తరువరంబు మూలంబు దిక్కరి కరంబులంబోని జరదజగరంబుచేఁ జుట్టుకొనఁబడి యాలవాలము గట్టఁబడినట్లొప్పుచు శాఖా సమూహములచేఁ దిగంతముల నావరించి విలయవేళాతాండవ ప్రసారిత భుజుండగు శంకరు ననుకరించుచు సాగరజలంబులం గ్రోలి యిటు నటు సంచరించుచుఁ బక్షులవలె శాఖాంతరములయం దణఁగియున్న మేఘంబులచేతఁ గూడ నావరింపబడని యగ్రభాగముగలదై రవితురంగముల కవరోధము గలుగఁజేయుటచే నలయిక జెందిన యవ్వారు నంబుల ముఖములనుండి వెల్వడు ఫేనపుంజమో యనఁబడు సితతూలికామాలికలచే నగ్రశాఖలు ప్రకాశింప నాకల్పస్థాయియగు నున్నత స్కంధముతో నొప్పుచు నబ్బూరుగు మేరువువలెఁ బ్రఖ్యాతిఁజెంది యున్నది.