కాశీయాత్ర చరిత్ర/పదునాలుగవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

యిక్కడికి సమీపము గనుక అక్కడ అయ్యే కస్తూరి అమ్ముతారు. అందులో కృత్రిమము బహుశ: జరుగుచున్నది. కుంకుమ పువ్వు అయ్యే కాశ్మీర దేశము దక్షిణదేశము కన్నా యీ దేశానికి సమీపముగా వున్నా మనదేశములో దొరికేపాటి మంచి విడి కుంకుమపువ్వు యిక్కడ దొరకదు. వస్తువులు అయ్యే దేశాలనుంచి అన్య దేశాలకు ప్రియమయిన దినుసులను తమ దేశములో వాడీకెలోకి తేకనే పంపించేటట్టు తోచుచున్నది. యీ దేశస్థులు యిక్కడి శీతము యేపాటి? నేపాళ దేశములో కలిగే చలికి సహస్రాంశములలో ఒక అంశ యిక్కడ లేదని చెప్పుతారు. సాల గ్రామాలు ఉత్పత్తి అయ్యే కొండ భూమి నేపాళ దేశములోనే వుండియున్నది. ఆ కొండ మీదుగా గండకీనది ప్రవహింపుచున్నది. ఆ నదిలో సాలగ్రామాలు యెత్తడము నర్మదా శోణభద్రా నదులవలె పట్నావద్ద కలిసే గండకీ నదిలో పట్టిన తావున సాలగ్రామాలు దొరకవు; ఆ కొండ ప్రదేశములోనే ఆ నదిలోనే సాలగ్రామాలు కలిగి వున్నవి.

                                         ------------

పదునాలుగవ ప్రకరణము

యీ హిందుస్తాన్ లో యింగిలీషు వారికి అధీనము కాకుండా యికను నిండా ప్రయత్నము మీద స్వాధీనము కావలసిన రాజ్యము రణజిత్తుశింగుదీ ఒకటేను. వాడి రాజ్యము హిందూస్తాన్ కు చివర కాశ్మీర ఖండమున్ను, లాహోరు అనే షహరున్ను, మూడు లక్షలమంది మార్బలము కలిగియున్నాడు. హయిదరాబాదు చట్టముగా యింగిలీషు వారిని ఉపసర్పించుకొని రాజ్యము చేయుచు నుండే వారు జోతీపురపు రాజు, జయపురపు రాజు, బిక్కనెరి (బికెనీరు!) రాజు, నేపాళపురాజు లక్కునో నబాబు, శింధ్యా, హోలుకరు, వీరు తప్ప మరి యెవరున్ను రాజ్యాధిపతి అని పేరు పెట్టి పిలవడానికి హిందూస్తాన్ లొ లేరు. హోలుకరు,వీరు తప్ప యెవరున్ను రాజ్యాధి పతి అని పేరు పెట్టి పిలవడానకు హిందూస్థాన్ లో లేరు. హోలుకరు గడిచి పోయిన వెనక రాజ్యము బహుశ: యింగిలీషువారి అధీనమయి హోలుకరు కొడుకు యింగిలీషువారి ఆజ్ఞాబద్ధుడుగా నున్నాడు . హోలుకరురాజధాని హిందోలి అనే షహరు. శింధ్యాపడిపోయిన వనక వాడికి వున్నలక్షమంది మార్బలము చేదరనియ్యకుండా పట్టుకొని దత్త పుత్రిడితొ హింసపడుతూ శింధ్యాబార్య కాలము గడుపుతూన్నది. ముందరి శింధ్యారాజధాని హుజనీపట్నము. యిప్పట్లో గవాలియ్యరులో దండు సమేతముగా అతని కుటుంబము వాసము చేస్తూవున్నది. లక్కునో నవాబు ధనము విస్తారముగావున్నా లక్షపౌజు వున్నా ప్రజలను హింస పెట్టుతూ* పేరుకు నవాబుగా వున్నాడు. జోతీపురము జయపురము బిక్కానెరి రాజులు మారువాడీలు గనుక యీశ్వరుడు వారికి యిచ్చిన సిర్జల భూములలో యున్నారు.

జ్వాలాముఖి యనేస్థలము రణజిత్తుశింగు రాజ్యములో వున్నది. ఆదేవిని అతడు బాగా ఆరాధింపు చున్నాడు. అతని రాజ్యములొ యిప్పటికిన్ని న్యాయము బాగా జరుగుతూ ప్రజలు బాగా పరిపాలింపబడుతూ యున్నారు. యీదేశము మొదలు కాశ్మీరములొగా సారా అనిన్ని, బరువు అనిన్ని మంచుగడ్డలు పడుచున్నవి. యింతమంచు నీభూమికి పెట్టిన ఈశ్వరుడు ఈ భూమినివాసుల క్షేమముకొరకు ఉష్ణోదకపు పూట కలిగిన గుండములు కొన్ని నిర్మించి ఉన్నాడు. అవియెక్కడ వంటే గయనుంచి జగన్నధానికి పొయ్యేమార్గములో బలుబలు అనేవూళ్ళో వొకటి; గయకు కొంతదూరములో రాజగృహీ అనేవూళ్ళో ఒకటి; మూంగేరి అనేముంగా చీరలు అయ్యే గంగవొడ్డుషహరుకు సమీపముగా సీతాగుండ మనేది వొకటి; హుజ్రి దేశములో తప్తమణికర్ణిక అనే గుండాము వొకటి; డాకాదేశములో బాలవాగుండ మనేది ఉదకము మీద జ్వాలలు లేస్తూవుండే గండము వొకటి; బదరీ నారాయణమువద్ద వుండేది వస్తువులను వేడిచేసే గుండము వొకటి, యీప్రకారము ఈశ్వరుడు సృస్టించి వున్నాడు. తప్రమణికర్ణికలో బియ్యము మూటకట్టి వేస్తే అన్నముగా పచనమవుచున్నదట. ఈ వుష్ణగుండముల వుదకము యావత్తు గంధకపు వాసన కలిగి వున్నట్టు విచారణమీద తెలిసినది. సదా జ్వాలలు


  • ఇది ఇంగ్లీషువారు వ్యాపెంప చేసిన వదంతి యని బిషప్ హెబరుగారు 1824లో స్వయముగా చూచి వ్రాసినారు. కలిగి వుండే జ్వాలాముఖి గుళ్ళోనున్ను ఆ ప్రకారమే గంధక పరిమళము సదా కలిగి వున్నట్టు తెలియవచ్చినైది. నాయిక్తితో విచారించగా పయి భూములలో శీతము కలుగ చేసిన ఈశ్వరుడు భూమి కింద వుష్ణంకు కలిగివుండే కొరకు గంధమము విస్తారముగా వుత్పత్తి చేసినాడనిన్ని, అగ్ని గంధములో పుట్టడము సహజము గనుకనున్ను యీ గంధకము కలిగిన ప్రదేశములలో పుట్టే వూటజలము సహజముగా ఉష్ణముగా వుండేటట్టు తోచుచున్నది. జ్వాలాముఖిప్రదేశములొ ఆరాధన నిమిత్తమయి గంధకద్వారా భూమిలో జ్వాలను ఈశ్వరుడు సదా కలగచేసినట్టు తొచుచ్ఫున్నది. జ్వాలాముఖి స్వారూపముగా వుండే మహామాయ రణజిత్తుశింగుకు ప్రత్యక్షముగా యిష్టసిద్ధులు చేయుచూ యున్నది.

జ్వాలాముఖికి కొంత దూరములో రేవాలేశ్వర మనే తటాకములో అద్యాసి రెండు పెద్ద గుండ్లు పర్వతాకారముగా తేలుతూ లోకుల యారాధనలను అంగీకరింపుచు సంచరిస్తూ వుండేటట్టు నిశ్చయముగా తెలిసియున్నది. ఆ శిలల స్వభావము యెటువంటిదో తెలిసినదికాదు. కాలక్షేప నిమిత్తమయి సృష్టించిన యీ సృష్టిలో అటువంటి ఉదకము మీద తేలే శిలలు వుంటే యేమి వింత! అయితే దానికిన్ని హేతువు గర్భములో వున్నదని తొచుచున్నది.

నేపాళ దేశములో దేవప్రయాగ అనే వూరు వొకటి వున్నది. అందులో భగవత్పాదులవారు శ్రీరామమూర్తిని యంత్ర సహితముగా స్థాపించి కర్మకులుగా వుండే ద్రావిళ్ళు ఆ మూర్తిని ఆరాధన చేసేటట్ట్లు నియమించి ద్రావిళ్ళను కొందరిని అక్కడ వుంచినారు. ఆద్యాపి వారు అక్కడ వుండి పుట్టే ఆడబిడ్డలను యీ దేశములో నుంచి వచ్చే ద్రావిళ్ళకు స్థితులు వ్రాసియిచ్చి వివాహము చేసియిచ్చి అక్కడనే వుంచుకుంటూ వచ్చుచున్నారట. ఆటు జరగడమువల్ల ద్రావిడ దేశస్థుల యిండ్లు యిన్నూరుదాకా ఆ దేవప్రయాగలో యేర్పడి వున్నవి.

ద్రావిళ్ళ ప్రవేశము కావడములో యీ దేశములో యింతే కాకుండా మొన్నూరుయేండ్ల కిందట ద్రావిడి యయిన యొక వెలనాటి నాడు దేశములో భార్యను వదిలి బృందావనానికి వచ్చి వరక్తుడయి సన్యాసము తీసుకొన్నాడు. కొన్నిదినములకు పిమ్మట భార్య వెతుక్కొనుచు ఆ పురుషుని వద్దికి వచ్చి తన్ను పరిగ్రహించక పోయినంతలో ఆపె నిండా నిర్బంధపెట్టి కృష్ణమూర్తి ఆజ్ఞ అయితే నన్ను పరిగ్రహిస్తావా అని అడిగి నట్టున్ను, మంచిదని అతను కృష్ణమూర్తి యుపాసకు డయినందున చెప్పినట్టున్ను పిమ్మట కృష్ణమూర్తి ప్రత్య్హక్షమయి భార్యను స్వీకరించమని ఆజ్ఞ యిచ్చినట్టున్ను అటుపిమ్మట ఆ సన్యసించిన పురుషుడు భార్యను అంగీకరించి యేడుగురు కొడుకుల కన్నట్టున్ను ఆ యేడుగురున్ను యేడుపీఠాలను యేర్పరచుకొని వల్లభాచార్యులని పేరుపెట్టుకొని కృష్ణమూర్తి యుపాసకులై ద్వారక మొదలుగా యీ హిందూస్తాన్ లో వుండే బనయా అనే వైశ్వెజాతి వారికంతా ఆచారవ్యహారాదు ఉపదేశించి అటుయేర్పడ్డ శిష్యులకు తులసీ మణులు ధారణ చేసి అతిప్రబలులుగా వున్నారు. వారు ద్రావిడ దేశపు వెలనాటి వారితో సంబంధములు చేయుచూ వృద్ధిపొందినారు. ఆయేడు పీఠాలలో నాధద్వారములో ఒక పీఠము వున్నది. అది ముఖ్యపీఠమని చెప్పుకోవడము. దక్షిణదేశములో వారికి శిష్యులు కోటిమంది గుజరాతీ వాండ్లు ఆ యేడుపీఠస్థుల యొక్క వంశస్థులు హిందూదేశము యావత్తున్ను శిష్యయాత్ర చేస్తూవుంటారు.

యీ వల్లభాచార్య పీఠస్థులు గోపీకృష్ణోపాసకులు. వారికి బనయా జాతికాక ఇంకా అనేక శూద్రజాతివారు గూడా శిష్యులై యున్నారు. యీ వల్లభాచార్యుల పీఠముగాక హితహరి వంశాచార్యులని యీ దేశపు బ్ర్రాహ్మణుడు వొకరు రాధాకృష్ణోపాసన చేసి బృందావనములో వక పీఠమును యేర్పరచుకొని వారికి తులసీమణి ధారణచేసి ఆచారవ్యహారాలు నియమించి వున్నాడు. యీ పీఠస్థుని వంశస్థులకు ఏకాదశినాడు తాంబూల చర్వణము చేయడానికి శ్రీకృష్ణమూర్తి అనుజ్ఞ యిచ్చి వున్నాడని అపశక్యముగా అతని శిష్యజనులున్ను ఏకాదశినాదు ఆద్యాపి తాంబూల చర్వణము చేయుచూ వుంచున్నారు. హిందూస్తానులో ఏకాదశినాడు విష్ణుభక్తులు సకలవిధములయిన ధాన్యములు పరిత్యజించి కందమూలాదులు శింగాణి పిండిన్ని తిని వ్రతము ఆచరింపు చున్నారు.

బ్రాహ్మణులకు దక్షిణ దేశములో భట్లు, అయ్య అని పౌరుష నామధేయ్ములు స్వనామముతో కలిసివుండేటట్టు యీదేశములో బ్రాహ్మణులకు పాడె, దూబె, చౌబె, మిశిరి, తేల్వాడి, అని పౌరుషనామధేయాలు కలిగి వున్నవి. యీ పంచగౌడు లని పంచ ద్రావిళ్ళనిన్ని భేదము కలిగి వుండడమే వాటికి కారణముగా వున్నది. మిక్కిలి విచారించగా నా బుద్దికి తెలియ బడ్డది యేమంటే సుమారు వెయ్యున్నేనూరు సంవత్సరములకు ముందర హిందువులు వసించే హిందూస్తాన్ అనే యీ గంగా యమునల మధ్యేవుండే భూమి మ్లేచ్చ భూమి అయిన పార్షి దేశానికి సమీపము అయి వుండగా కాబూలు కనమగుండా సింధువనిన్ని హిందువనిన్ని ద్వినామక మయిన మహానదిని దాటి కలి సాంమ్రాజ్య ప్రేరణచేత మ్లేచ్చులు* డిల్లి అనే హస్తినాపురి ప్రవేశించి కర్మద్వారా బ్రాహ్మణులు అయివుండే వారికర్మములు సాగకుండా వారిని భ్రష్టులను చేశేకొరకై అనేక హింసలు చేసినందున యీ రాజ్యము యావత్తు మ్లేచ్చాక్రాంతమైనందున యీ దేశస్థులు కర్మమును నిండా పాటించను వయిపులేనివారైరి.

యిప్పట్లో దాక్షిణాత్యులయున హిందువులు స్వభాషతో యింగిలీషుమాటలు కలిసి మాట్లాడుతూ వచ్చేటట్టు యిక్కడ దొరతనము చేసేవారి తురకమాటలు సంస్కృతభాషతొ యీ డేశస్థులు కలిపి మాట్లాడుతూ తురకలవలెనే వస్త్రవాహనాద్యలంకారాలను అంగీకరించి ప్రవర్తిస్తూ వఛ్ఛేటట్టు తెలిసినది. అయినప్పటికిన్ని ముఖ్యమయిన వర్ణాశ్రమ ధర్మాదులు మాత్రము యిక్కడివారు వదిలినారు కారు.


  • మ్లేచ్చుల దండయాత్రలు: క్రీస్తుకు పూర్వము 300-200 శరాబ్దములలో మన దేశమునకు (గ్రీకులు) వయనులు, శాకులు వచ్చిరి. క్రీస్తు తరువాత కూడా యీచీ మొదలకు ఆశియా తెగలువచ్చిరి. క్రిస్థుశకము 5,6 శతాబ్దములలో, హూణులు, 8 వ శతాబ్ధములో అరబ్బీలు, తరువాత ఆఫ్ఘనులు పారశీకులును వచ్చిరి. వీరినందరిని మనవారు మ్లేచ్చులనిరి. యీబ్రహ్మాండమునందు నున్న బ్రాహ్మణమండలి ద్రావిళ్ళ నిన్ని, గౌడులనిన్ని రెండు తెగలుగా చీలి ఆ రెండు తెగలలో నున్ను అయిదేశి తెగలు యేర్పడి తుదకు పది తెగలుగా చీలినది. అందులో గౌడులకు సొంతమయిన భూమి సాత్విక ప్రధానముగా అనాదిగా వుండుటచేతనున్ను స్థూలదేహాలు పృధివీ భూతానుగుణముగా వుండేవి గనుకనున్ను అనాది సంప్రదాయ ప్రకారముద్వైతాద్వైతాలు శాస్త్రము చేత వాదింపబడుచునున్నా కర్మదృష్ట్యా ఉపాస్యదేవతలు భిన్నుములు గానున్నా యెదటివాడి ఉపాస్యదేవతను నిందించకుండా స్వంత తండ్రిని కాపాడి యితరుల తండ్రులను కొట్టక తిట్టకవుండి మర్యాద చేయుచు వుండేటట్టు తమ తమ అంత:కరణాను గుణముగా ఉపాసనములు చేయుచు అందరు అన్యోన్యముగా ప్రవర్తింపుచున్నారు.

స్వదేశము వదిలి కర్మము మీది శ్రద్ధ విస్తారము కలగ చేసుకొనుట చేత లేచి వచ్చిన దక్షిణ దేశస్థులయిన ద్రావిళ్ళు వింధ్య పర్వతాలకు దక్షిణదేశమునందు ప్రవేశించగానే ఆ దేశవాసులు అందరు అప్పట్లో శ్రుతి స్మృతి పురాణాదుల సంకేతాలకు నిండా లోబడని వారలై మూఢులుగా ఉన్నందున వింధ్య దక్షిణదేశమునకు యిక్కడినుంచి లేచి వచ్చినవారు చేతనయినంత మట్టుకు కృత్య సంకేత ప్రకారము వైశ్యజాతిని మాత్రము కల్పించ తలచి క్షత్రియ కృత్యానికి తగినవారు లేనందున ఆ వర్ణకల్పన వదిలి తాము బ్రాహ్మణులుగానున్ను తాము కల్పించినవారు వైశ్యులుగానున్ను యితరు లందరు శూద్రులుగానున్ను యేర్పాటుచేసి అలాగే ప్రవర్రింపుచూ వచ్చినారు. అందువల్లనే వైశ్యులు మేమంటే మేము వైశ్యులమనే వివాదము అద్యాపి దక్షిణదేశములో తీరకుండావున్నది. వింధ్యకు దక్షిణదేశ నివాసులు అందరున్నూ తత్పూర్వము శూద్రులకు శ్రుతి స్మృతి పురాణాదులగుండా నియమింపబడియుండే ఆచారాలు యెరగక నొక మూఢ ధోరణి అయిన తమ పూర్విక మార్గముగా ప్రవర్తింపుచు వున్నందున, ఇక్కడినుంచి లేచి వచ్చిన బ్రాహ్మణులు శూద్రులతొ తాము యీదేశములో ప్రవర్తింపుచూ వచ్చిన జాడ వదిలి తమ యెక్కువగౌరమును ఆపాదించుకొనే కొరకు వాండ్లను కొంత వెలిగా వుంచి తదనుగుణముగా ఉపస్మృతులు పురాణాదులు కల్పనచేసి అక్కడి భూపతులకు బోధించి తమకు తోచిన కర్మాదులను క్రమక్రమముగా ఆచారవ్యవహారాదుల మూలముగానున్ను బింబారాధనల ద్వారానున్ను ప్రబలపరచుచు వచ్చినారు.

వింధ్యకు నుత్తర దేశవాసులయిన బ్రాహ్మణులు అందరున్ను ఋషులని అద్యాపి బ్రాహ్మణుల సంధ్యావందనములలో గంగా యమునల నడుమనున్న ఋషులకు సమస్కార మని వచిస్తూవున్నారు. దక్షిణదేశములో తత్పూర్వము బ్రాహ్మణులు లేనందున యీ దేశము నుంచి వచ్చిన బ్రాహ్మణులను నాక్షాదృషులనే తాత్పర్యముతో దక్షిణదేశములోని భూపతులు వీరు చెప్పినట్టువిని, ఆలయాదులు వాటి ఆరాధనలు, బ్రాహ్మణ గౌరవము, వారిపోషణ, మొదలయినవి సకలవిధాల చేస్తూ వచ్చినారు. అప్పట్లో యీ బ్రాహ్మణులు వింధ్యకు దక్షిణ దేశానికి రావడము సూర్యుడు భూమికి దిగివచినట్టు అక్కడి భూపతులకు తోచినది గనుక యీ బ్రాహ్మణులు తమ దేశము వదిలిపోకుండా వుండేకొరకు అపారమైన భూస్థిరులు యిచ్చినారని నాకు తోచశాడుతున్నది. యిప్పట్లో అక్కడి బ్రాహ్మణులు అనుభవించే భూస్థితులవంటివి యేకాలమందున్ను యీదేశపు బ్రాహ్మణులు యిక్కడ అనుభవించినది లేదు గనుక యీ హేతువు పై వూహకు నిండా అకరముగా వున్నది.

యీ ప్రకారము కర్మశ్రద్ధ మితిని మింఛేటట్టు చేసేకొద్దిన్ని క్రమక్రమముగా తమలోతమకే యీకర్మము చేసుటచేత నేను యెక్కువంటే ఆ కర్మము నీవు చేయతగవు గనుక నీవే తక్కువ యని వివాదము పుట్టి వివాద పురస్సరముగా ద్వేషము జనించి నీవు చూడగా నేను బోజనము చేయరా దనిన్ని నీవు తాకిన పాత్ర నేను కడగక వాడుకో ననిన్ని, నీ యుపాస్య దేవత మీద ఫలాని ఫలాని దోషాలు వున్న వనిన్ని, నా యుపాస్యదేవత గుడికి నీవు రాకూడ దనిన్ని, నీయుపాస్యదేవత గుడి నీడలోకి కూడా కూడా నేను రా ననిన్ని వాదింపుచు తమ్మున గురుభావనగా ఆరాధింపుచూ వుండే అక్కడి దేశస్థులకు కూడా వారిలో వారికి అలాటి ద్వేష బుద్ధిని పుట్టించి పుండ్రాలు వస్త్ర ధారణలు కూడా వీదు ఫలాని దేవతోపాసకుడు, వీడు ఫలాని కర్మము చేసేవాడని గురుతు వుండే కొరకు సంపూర్ణముగా భేదించే టట్టు ఛెసినారు. అది మొదలు దిన దినానికి శైవ వైష్ణవులున్ను తదంతర్భూతులున్ను యితరులున్ను ద్వేషములకు అంతము లేకుండా యిప్పటికిన్ని వివాద పడుతూ వున్నారు.

హిందూస్తాన్ లో ప్రవేశించిన తురకలు క్రమ క్రమశ: వింధ్య దక్షిణచేశములో కూడా పిమ్మట ప్రవేశించినా యిక్కడ హిందువుల సహవాసము తత్పూర్వము తమకు నిండా కలిగి వున్నందుచేతనున్ను హిందువుల మత సంకేత బలాబలాలను చక్కగా తెలుసు కొని వున్నందు చెతనున్ను తమ మతోద్ధారకుడైన మహమ్మదు తనువు ధరించిన తమ మతము శ్రేష్టమని లోకులకు బోధపడే కొరకు తమ మతములో ఒకణ్ని కలుపుకొని తురక చేస్తే పుణ్యమనిన్ని తమ మతముకాని వాని మొగము చూడరా దనిన్ని ఖురానులో వ్రాసిన మాటను నమ్మి మూఢభక్తి కలిగిన తురక భూపతులు యిక్కడ అదిలో తురకల చేసే కొరకు హిందువులను హింస పెట్టినట్టు దక్షిణ దేశములో పిమ్మట వారు హింసించిన వారు కారు. రాజ్యకాంక్ష కలిగిన బుద్ధి ఆ విషయములో వారికి సాత్వికాన్ని సంపాదించి యిచ్చినది.

వెనక వెంబడిగానే నడితి వెరేనున్ను తత్వము వేరేగానున్ను వుండే హిందువుల బహిరంగ కృత్యములు చూచి వీండ్లు వెర్రివాండ్లు తెలియక రాళ్ళు రప్పలు నదులు కొండలు యివి మొదలైన వాటిని దేవుండ్లనుగా యెంచి చెడిపోతారనే పశ్చాత్తాపబుద్ధి మాత్రమే కలిగిన అతి దూరములోవుండే సాత్వికగుణప్రధాను లయిన యింగిలీషు జాతి వాండ్లు హిందుదేశానికి భూపతులయినందున వారివల్ల కర్మాదులు యేహ్యపడ్డా ప్రబలవిరోధము మాత్రములేక తమ తమ కర్మాదులు తమ తమ యిష్టాల్నుసారముగా సారినమట్టుకు గడుపుకొంటూ యిప్పుడు దాక్షిణాత్యులు అక్కడ వున్నారని తోచుచున్నది.

పయిన వ్రాసిన ప్రకారము గంగా యమునా తీరవాసులయిన బ్రాహ్మణులలో కొన్ని తెగలు వింధ్య దక్షిణదేశములో ప్రవేశించిన వెనక నొక తెగ కృష్ణాగూదావరీ నదుల సమీపప్రాంతమందున చేరి నందున దేశభాష అక్కడ ఆంధ్రమ యినందున ఆంధ్రమయినందున ఆంధ్రులయినారనిన్ని రెండోతెగ కావేరీ తామ్రపర్ణీనదుల సమీపములో చేరినందున ఆ దేశభాష రీత్యా వారు ద్రావిళ్ళు అయినారనిన్ని మూడోతెగ గోదావరి యుత్పత్తికి సమీపముభూమి అయిన నాసికా త్రియంబకము మొదలయిన భూమెచేరినందున దేశభాషరీత్యా వారు కొంకణులని మహారాష్ట్రులని రెండు నామములు గల దేశస్థులైనారనిన్ని నాలుగో తెగవారు కావేరి యుత్పత్తికి సమీపస్థళమయిన కర్ణాటకులైనారనిన్ని తోచుచున్నది.

నిండా విచారించగా ఘూర్జరులు మాత్రము ఎప్పుడున్ను హిందుస్తాన్ లోనుంచి యెత్తిపోయిన బ్రాహ్మణులతో చేరినావారు కారు. వారు ఎల్లప్పుడున్ను ఘూర్జర దేశములోని కాపురస్తులే నని తోచబడుచున్నది. అయితే వారిని పంచద్రావిళ్ళతో కలిపి వాడడము ఎందువల్లనంటే వారున్ను ద్రావిళ్ళరీతిగా వింధ్య దక్షిణదేశ నివాసులయి వున్నందుననున్ను హిందూస్తాన్ లో అయిదు తెగలుగా అయిదు దేశాలలో బ్రాహ్మణులు వృధక్కు వృధక్కుగా భాగింపబడి వున్నందున యీ పంచగౌడులకు ప్రతిగా పంచగ్రావిళ్ళు అనుకోవడానకు ఘూర్జరులను కూడా కూర్చి వాడుకుంటూ వచ్చేటట్టు తోచబడుచున్నది. అందుకు ప్రబలమయిన కారణము యేమంటే యీ దేశములోపుట్టిన గయావళీలు మొదలైన స్థలవాసులు ఘూర్జరులు వినాగా వుండే నాలుకు తెగల ద్రావిళ్ళు అన్నశ్రాద్ధముచేస్తే బ్ర్రాహ్మణార్ధముచేసి వారి పాకములో భోజనము చేస్తారు గాని ఘూర్జర బ్రాహ్మణులు చేసే శ్రాద్ధాలలో భ్రాహ్మణార్ధము నిమిత్తమైవారి పాకములో భోజనము చేయడము లేదు. ఘూర్జరుల చేత చటకశ్రాద్ధము చేయించి శీదా లనే స్యయంపాకము గయావళీలు పుచ్చుకుంటున్నారు. అందువల నున్ను యీ ఆచారములనే అద్యాపి దక్షిణ దేశమందున్ను కడమ నాలుగు తెగల ద్రావిడ బ్ర్రాహ్మణులున్ను పాటిస్తూ వుండడము చేతనున్ను కావేరి తామ్రపర్ణి తీరాల యందు మాత్రము ఘూర్జర బ్రాహ్మణులు నిండా కర్మకులుగా నడవపట్టి ఒక మాత్రముగా వారితో భోజన ప్రతిభోజనాలు కల్గివుండుట చేతనున్ను భగవత్పారుల వారు దిగ్యిజయము చేసినప్పుడు ఘూర్జర దేశములోనే నివాసులుగా వున్నట్టు శంకర విజయములో కని వుండుట చేతనున్ను బ్రాహణ మండలి పృధక్కు కాకమునుపే యీ మండలిలో చేరక ఘూర్జరులు ప్రత్యేకముగా స్వదేశ నివాసము యెప్పుడు ఒకటే రీతుగా ఛెస్తూవుండే టట్టు తోచుచున్నది.

యీ ప్రకారము యిప్పుడు తెలివచ్చి వుండే పంచగౌడులు పంచద్రావిళ్ళు అనే పదితెగల బ్రాహ్మణులు గాక పరశురామ నిర్మితమైన కేరళదేశాస్థులు, చిత్పావనులు, కరాడీలు, అనేమూడు తెగలవారు వున్నారు. యీ మూడు తెగలలో పునా శ్రీమంతుడు చిత్పావన బ్రాహ్మణుడై సార్వభౌముడై బహుకాలము ప్రవర్తించి నందున కొంకణస్థులలో నాశికాత్రయంబక నివాసులైన బ్రాహ్మణులకు కనకాభిషేకాలుచేసి, ఆ తెగతొ పూరాగా తాను తన జాలాన్ని కలిపి కరాడీలను కూడా కలిసినారు. యిప్పుడు మహారాష్ట్రులకున్ను వారికిన్ని యెంత మాత్రమున్ను భేదములేకుండా వుభయులు వొకరితో వొకరు కలిసి యున్నారు. యీ తెగలు గాక కేరళ దేశస్థులు తమ దేశములొ పూజ్యులుగా, యితర బ్రాహ్మణులతో నిండా కలియక నున్ను కలియ కూడకనున్ను నంబురు (నంబూద్రీ) లనిపించుకొని తమంతట తాము వుండి వున్నారు.

గయలో బ్రహ్మ కల్పిత బ్రాహ్మణులనే వొక తెగవారు గయావళీలుగా వున్నారు. కాశిలో గంగా పుత్రులని వొక తెగవారు గయావళీలుగా వుండి వున్నారు. యిదిన్నిగాక శాకద్వీప బ్రాహ్మణులని వొక తెగవారు హిందూస్థాన్ దేశములో వాసము చేస్తూ యిప్పటికిన్ని వున్నారు. వారి వృత్తాంత మెమంటే శ్రీకృష్ణులు ద్వారకలో విరాజమానులయి వుండగా సాంబుడనే అతని కొమారుడికి పెద్దరోగము ప్రాప్తించి నట్ట్లున్ను చికిత్స నిమిత్తమై వైనతేయుడు శాకద్వీపమునుంచి వొక బ్రాహ్మణుని తెచ్చినట్టున్ను వాని వంశస్థులు తామని ఆ తెగవారు అద్యాపి యీ దేశములొ చికిత్స చేస్తూ నెగడి వున్నారు. పైన వ్రాసిన తెగలుగాక యీ హిందూస్తాన్ లో విశ్వరర్మకు రంభకున్ను శాపము తగిలి భూలోకములో మానుషజన్మము కలిగి ఉభయులున్ను దాంపత్యము పొసగి సంతు కలిగినట్టున్ను వారికి కలిగిన సంతు విశ్వకర్మ కల్పిత బ్రాహ్మణులని వారి శిల్పిపనులు చేస్తూ యిప్పటికిన్ని నెగడి వున్నారు.

గయలో వుండే డాక్టరు జాన్ డేవిడు సన్ దొర ప్రపంచసృష్టి సంబంధము లయిన మాటలు నాతో ఆడుతూవుండగా హిందూదేశములో వుండే బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలనె భేదము యీశ్వ నిర్ణయమా? లేక్ మానుష సంకేతమా? అని ప్రశ్నవేసినాడు. బహుదూరము వాదము జరిగి మానుష నిర్ణయమని తెలియచేసినాను. పిమ్మటనున్ను బహుశా విచారించగా అదే తాత్పర్యమునాకు బోధ అయినది. అందుకు హేతువులు యేమంటే వొక పురుషుడు ప్రజల వుత్పత్యర్ధమున్నూ తద్వారా మానుషానందానుభవార్ధమున్ను స్త్రీని పరిగ్రంచి ప్రజావృద్ధి చేసినట్టు యీశ్వరుడు సృష్టించిన అనేక బ్రహ్మండాలలో అనేకకోటి పిండాండాలు అంతర్భూతములై వున్నవి. ప్రతిపిండాండానికిన్ని బ్రహ్మాండానికికలిగిన సకలగుణాలు చేష్టలు మొదలయినవి వేర్పడివున్నవి. అందుకు దృష్టాంత మేమంటే పృధివ్యప్తేజోవాయ్వాకాశాలు ప్రతి బ్రహ్మాండానికికలిగివున్నట్టు అంతర్భూతములుగా వుండే అనేక పిండాండాలకు కలిగివున్నవి. ప్రతి పిండాండానికిన్ని అనేక సూక్ష్మ పిండాండాలు అంతర్భూతములై వున్నవి. అందుకు దృష్టాంతమేమంటే ప్రతి దేహములోనున్ను అనేక క్రిమికీటాదులు ఉత్పత్తి అయి నశింపుచు వుండడము సిద్ధము గనుక యీఅర్ధమున్ను సత్యమే గదా! ఒక అద్దానికి యెదురుగా మరివొక నిలువుటద్దము కట్టి నడమ మనిషి నిలిచి చూస్తే వొకటిలో నొకటిగా తన ప్రతి బింబాలు అసంఖ్యేయముగా ఉత్పత్తి అయ్యేటట్టు దీపదీపికా న్యాయముగా అనేక అనుష్యులున్ను జంతువులున్ను పరంపరగా యీశ్వర భాతిచేత సృష్టములై స్థితిని బొంది లయమవుచు నున్నవి.

ఇట్లు సృజింపబడిన యనేక బ్రహ్మాండములలో మనము వసించే బ్రహ్మాండము న్నొక్కటే. యిందులో యీ భూమియొక్క కొలత యింగిలీషు వారి యొక్క వూహ ప్రకారమున్ను మన గోళశాస్త్ర ప్రకారమున్ను చచ్చొకము సుమారు యిరువైకొట్లమయిలు లున్నవి. వీటిలో ఉదకమయముగా నుండే భూమి 13 కోట్లు మయిళ్ళు పోగా మనుష్య వాసముగా నుండే భూమి నాలుగు కోట్ల మయిళ్ళు. యిందులో వశింఛే మనుష్యమండలి డెబ్బదికోట్లు. యిందులో దక్షిణోత్తరాలలో కన్యాకుమరి మొదలు కాశ్మీరము వవకున్ను తూర్పు పడమరలలో సింధునది మొదలు బ్రహ్మపుత్రి నదివరకున్ను వాసము చెసే హిందు దేశల్పు జనులను మొత్తముగా చెరిసగముగా లెక్కచూచినా ముప్పదియైదు కోట్లకు యెక్కువవుండరు. వర్ణాశమ నియమము కలిగిన కర్మభూమి పయిన వ్రాశిన యల్ల సరిహద్దుకు లోపల నున్నది గాని యీ బ్రఖాండములో మరియెక్కడనున్ను లేదు.

పైన వ్రాసిన చత్రురశ్ర,మ భూమిలో నుండే మానిషమండలికి మాత్రమే వర్ణాశ్రమ ధర్మములు కలిగియున్నవి గాని మిగిలిన సగం భూమిలోనున్ను వారికి వృత్తులచేతనున్ను కృత్యములఛేతనున్ను మనుష్యతారతమ్య జ్ఞానమేగాని వృత్తికృత్యములతోకూడా హిందూదేశ మర్యాద ప్రకారము రక్త పరంపర నిమిత్తము లేదు. యీ కర్మభూమిలోనున్ను రక్త పరంపరే స్వతంత్రముగా వర్ణాశ్రమాలను కాపాడనేరదు. కృత్యమున్ను వృత్తిన్ని పుట్టుకతొకూడా మిళిగమై యుండవలసి యున్నది గదా! యిందుకు ఆకరమేమంటే "జన్మనా జాయతే శూద్ర: కర్మణా యాయతే ద్విజ:" అనే వచనమే ఆకరము. యీశ్వరుడు ఆదిలో యీ వర్ణాశ్రమ ధర్మములతో మనుష్య సృష్టిని చేసి యుంటే బ్రహ్మాండమందంతటా యీవర్ణాశ్రమ ధర్మములు యీ రీతిగానే గలిగియుండ వచ్చునే! అయితే ఈ బ్రహ్మాండములలో మానుష సృష్టి పయినవ్రాసిన చతురశ్రమమైన కర్మభూమి మొదలుగా ఆరంభింపబడినది. అందుకు అకర మేమంటే యింగిలీషు వారి బైబిలులో యేడం (Adam)అనే కూటస్థురాలున్ను యీ ప్రదేశములో పుట్టినట్టు చెప్పియున్నది గనుకనున్ను మన పురాణాలు అందుకు ఏకవాక్యతపడుతున్నవి గనుకనున్ను మన పురాణాలు అందుకు ఏకవాక్యతపడుతున్నవి గనుకన్ను మానుష సృష్టికి ఆరంభము మొట్టమొదట హిందుదేశములో నుంఛేనని నిశ్చయించ వలసినది. పిమ్మట పరంపరగా దీప దీపికా న్యాయముగా బ్రంహ్మాండమంతా మానుష మండలితొ నిబిడీకృత మవుతూ వచ్చుచున్నది.

అటు సృష్ట్రికి అది మనుష్యులు యీ ప్రదేశములొ వసించినందు చేతనున్ను వారు సచ్చిదానంద స్వరూపుడైన యీశ్వరునికి యధోచితిముగా సమానులుగా వుండవలసినవారు గనుకనున్ను తద్వారా వారు స్వేచ్చామరణము గలవారుగా వుండవలసినవారు గనుకనున్ను అటువంటి మహాత్ములు యీశ్వరుని చిద్విలాసము చూచి బహు కాలము ఆనందింపుచు వుండడానకు కోరి చిరకాలము జీవింపుచు వుండవచ్చును గనుక నున్ను వారి యీ భూమిలో సృష్టులయినవారి పరంపరలను చూచి, నాలుగు ముఖ్యమయిన పనులకుగాను మానుష కోటిని నాలుగు వర్ణములుగా నియమించి, యీ నియమింపబడిన వారి పరంపరే ఆ యా వర్ణాశ్రమకృత్యములు చేయుచు వుండతగినవి కాని వొక వర్ణమువాడు మరియొక్క వర్ణము కృత్యములు చేయకూడదనిన్ని ఒక వేళ చేస్తే భ్రష్టులవుతారనిన్ని శిక్షకూడా విధించి ఆయా వర్ణాశ్రమాలలో నున్నవారు వర్ణానుసారముగా చేయ వలసిన పనులు తెలియడానకు పూర్వికులు శృతి స్మృతులు చేసి యిచ్చి నారనిన్ని తేట పడుచున్నది. అందుకు ఆకరము యజుర్వేదములో భరద్వాజమహామునివల్ల శృతులు మానుష మండలిలో ప్రచురము చాయబడ్డవని వున్నది. అష్టాదశ స్మృతులున్ను వాటి వాటి నామాంకితాలవల్లనే మంవాదులయిన యిక్కడ మనుష్యులఛేత వర్ణాశ్రమ ధర్మాలను నియమించి తెలియ వ్రాయబడిన పుస్తకము లని తేట పడుచున్నవి.

మూల స్మృతులు 12 స్కృతులున్ను ఆజ్ఞలను విధించి నట్టు విషయాదులను నిరూపించి చెప్పుతూ వచ్చును గాని ఫలాని ఋషి మతము యిది, అందుమీద నామతము ఇది, అని మూలస్మృతులు చెప్పవు. అటు ఋషులు మతాలు వుదాహరించి చెప్పే వంతా ఉపస్మృతియని శానా దూరము వలసినది. ఇందులొ యేదేది మూల స్కృతియని శానా దూరము గయలో జడ్జీగా వుండే జార్జి ఐ. మారీసు దొరగారి సన్నిధానమందు నాకున్ను యిక్కడి పండితులు కున్ను వివాదము పడి ఒక నిశ్చయానకు వచ్చినాము గనుక ఆమూల స్కృతుల పేళ్ళు యీ అడుగున వ్రాయుచున్నాను. నెం.23, స్వాయం భువమను స్కృతి 1. బృహస్పతి స్మృతి 2. వశిష్టస్మృతి 3. కశ్యప స్మృతి 4. భారద్వాజస్మృతి 5. గౌతమస్మృతి 6. యాజ్ఞవల్క్య స్మృతి 7. భృగుస్మృతి 8. నారద స్మృతి 9. కపిల స్మృతి 10. పరాశరస్మృతి 11. వ్యాసస్మృతి 12. కాత్యాయన స్మృతి 13. ఆపస్తంబ స్మృతి 14. అశ్వలాయనస్మృతి 15. కణ్వస్మృతి 16. అత్రిస్మృతి 17. హరీత స్మృతి 18. యివి మూల స్మృతులు అనడానకు యెవరు సందేహపడనేరరు. కాశిలో యీ వివాదము పొశిగివున్నట్టయితే కుంఫిణీవారి పాఠక శాలలోనున్ను యింకా అనేకులవద్ద నున్ను గ్రంధగ్రహము బాహుళ్యముగా వున్నది గనుక వయిపు (వీలు) అయునన్ని మూల స్మృతులు సంపాదింతును.

ఇటీవల మారీసుదొర బహురసికుడును బహు శోధకుడున్ను గనుక సహగమనము స్త్రీలకు కూడదని లార్డు బెంటిక్కుగారు విధించి యిటీవల యేర్పరచినారు గదా, మీలో స్త్రీలు పురుషుడు చనిపోతే అగత్యముగా సహగమనము చెయ్యవలసినదేనా? చేయక పోతే ప్రత్యనాయమా? అని ప్రశ్నచేసినాడు. మను పరాశరులు అదిస్మత్రలు; వారి స్మృతులలొ పురుష దేహాసంతరము విధవస్త్రీలు నడవలసిన విధులను విధించి వ్రాశినారుగాని సహగమనము చేయ వలసిన దని విధిగా మూలస్మృతులలొ వ్రాయలేదు; నేను బహుదినాలుగా యీ సంగతిని విచారింపు చున్నాను; ఉపస్మృతులలో యీ విషయానకు అనేక ఆకరము లున్నవిగాని మూల స్మృతులలో లేదని చెప్పినంతలో యిక్కడి కోటపండితులు తద్వ్యరింతముగా చెప్పి తుదను మూలస్మృతులలో సహగమనానికి ఆకరము లేదని ఒప్పుకున్నారు.

యీ స్మృతులు కల్పించిన వారి పేళ్ళనున్ను ఋగ్యజు స్వామాలను భూమిలో ప్రచురము చేసిన భారద్వాజుల పేరున్ను సావధానముగా యోచిస్తే వారు యీ కర్మభూమిలో వుత్పత్తి అయినవారు మాత్రమేగాక ఆయా 18 ఋషుల జననమును జనన కాలమున్ను పురాణాదులవల్ల వూహించి చూడగా సృష్టికి బహు కాలమునకు వెనక వారు జననమయిన వారుగా అగుపడుతున్నారు. అప్పటికి వర్ణాశ్రమ ధర్మాలు సృష్టిక్ ఆదిన కలిగినవిన్ని కారు. యీశ్వర నిర్ణల్యమున్ను కాదు. అయితే భారద్వాజులేమి స్వాయంభువమను నేమి, పరాశరులేమి, గౌగము లేమి, కశ్వపు లేమి, యింకా యితర స్మత్రలేమి వీరిని మనుష్య మాత్రులుగా చెప్పకూడదు; బ్రహ్మజ్ఞానము కలవారు గనుక సచ్చిదానంద స్వరూపులుగానే చెప్పవలసినది.

పయిన వ్రాసిన ప్రకారము వర్ణాశ్రమ ధర్మాలు వారు నియమించినంతలో యేతత్సంకేతానికి ఆ దినము లోబడ్డవారి రకత పరంపర గలవారే ఆ ధర్మాలను ఆచరించవలసినది గాని యితరులు ఆచరించకూడదని అప్పటి సంకేత ప్రకారము నియమము యేర్పడ్డది గనుక క్రీస్తు మతస్థులవలనున్ను చూచినవారికంతా బోధించి నిర్బంద పెట్టి యీ హిందూమతములో కలుపుకోవడానకు హిందువులకు నిమిత్తము లేకుండా పోవడము మాత్రమే కాకుండా ఆ ప్రకారము నియమించబడ్డ ధర్మాలుతప్పి నడిచిన వారినంతా యీ హిందు సమూహములోనుంచి తోశి అటు ప్రార్థింఛే క్రీస్తు మహమ్మదు మతస్థులతో చేరేటట్టుగా ప్రేరేపణ చేయడమవుచున్నది. ముఖ్యముగా వర్ణాశ్రమ ధర్మాలు చేసినంతలో వర్ణాశ్రమములు సిద్ధి అయ్యేటట్టుగా శాస్త్రాలు యేర్పడివుండడము మాత్రమే కాకుండ ఆదినం కేతానికి లోబడ్డ వారి పరంపర వంటివారే ఆ కర్మాదులు చేయవలసినది గాని యితరులు ఆకర్మాదులు చేసినంతలో ఆ వర్ణాశ్రమములు చిద్ధించక పోవలసినదని కూడా వెంబడిగా ఒక విధి శాస్త్రాలలో యేర్పడి వుండవలసిన దేమని యోచించిగా భారద్వాజులు మనకోసరము భూమిలో ప్రచురము చేసిన మూడు శృతులున్ను మన్వాదులు తదనుసారముగా చేసిన స్కృతులున్ను 'గజోమిధ్యా పలాయనం మిధ్యా' అని అడివి యేనుగ బ్రహ్మజ్ఞాని తరిమితే తప్పించు కోవడానికి పరిగెత్తుతూ 'జగన్మిధ్యా బ్రహ్మసత్య ' మనే అద్వైత వచన ప్రకారము నా పరుగు అబద్ధము, తరమే యేనుగ అబద్ధము, బ్రహ్మమనే అస్తువఒకటే సత్యము అని ద్వైతులు నవ్వేటట్టుగా అద్వైతి అనుకున్నట్టు ఒక్కటే వస్తువని అంతస్తులోనమ్మి ఆవస్తువే యిన్నిగా వున్నదనే నిశ్చయముతో పయికి కనపడే అనేక వస్తువుల స్వరూపాలను మనోవికాలుగా భావించి అయినప్పటికిన్ని దేహబుద్ధి వుండేవరకు వాటికి తారతమ్యములు విచారించి తారతమ్యమయిన పనులు చేయవలసినది గనుక యీరీతిని నడవడానికి సాంప్రతాయకము తెలిసినవారే నడుతురుగాని నూతనస్తులు ఒకటి అనుకుంటూ ఒకటి చేయడము ప్రయాస గనుక చేసిన సంకేతము వదవక చేడిపొవనే తాత్పర్యముచేత పూర్వికులు అదినం కేతానికి లోబడ్డవారి వంశస్థులే యీ నర్ణాశ్రమధర్మాలు జరపవలనని నిశ్చయము చేసినారని నాకు తోచుచున్నది.

పయినవ్రాసిన మూల స్కృతులు 12 గాక మరికొన్ని స్మృతులుగూడా మూలస్మృతులని వివాదాస్పదములుగా వున్నవి. ఋగ్యజుస్సామాలుగాక అధర్వణమున్ను వొక ప్రత్యేకమయిన వేద మని వివాదముగా వున్నది. బ్రాహ్మణమండలి పయినవ్రాసిన ప్రకారము భిన్నులయి ఒక తెగ దక్షిణదేశ నివాసులయిన వనక దేశకాలాలకు అనుగుణముగా దక్షిణానికి సాగివచ్చిన మండలిలోని పండితులు నూరారులు ఉపస్కృతులు వ్యాస: వశిష్ట: నారద: అని ఆకరాలు వ్రాసి వారి వారికి సమ్మతి అయినట్టు వుపస్కృతులు యేర్పరచినారు. దక్షిణదేశములో మూల స్మృతుల సంగ్రహించడము విస్తారము లేనందున యెల్లాజియ్యము, నిర్ణయసింధు మొదలయిన ఉపస్కృతులే సంభవించే విషయాల పరిష్కాతము నిమిత్తము యెత్తిచూచుచున్నారుగాని మూల స్కృతుల జ్ఞాపాకమే మరచినారు. ఉత్తరదేశములొ పండితమండలి బహుశ: దక్షిణదేశానికి లేచిపోయు నందుననున్ను మూలస్మృతి సంగ్రహమును తాము విపత్తులచేత చేసి వుండనందున నున్ను యిటు వెనక పుట్టిన మితాక్షరము సరస్వతీ విలాపము మొదలయిన కొన్ని వుపస్కృతులె హిందుస్తాన్ లో ప్రచురముగా వాదుతారుగాని దక్షిణదేశమువలె యిక్కడ వున్న స్మృతుల పరంపర అనర్గళ పరంపర అనర్గళ ప్రవాహమై వుండ షట్చాస్త్రముల వల్ల ఆదినుంచి వివాదస్పదములుగా వుండే ద్వైతాద్వైతమతాలు రెండుగాక విశిష్టాద్వైతమతము ఒకటి అతి ప్రసిద్ధమయి దక్షిణదేశములో యిప్పుడు వెగడియున్నది. అటు ఒకటే ఆశ్చర్యకరమయిన యుక్తులతో నేగడి విదిన్ని గాక ఆరుకాటి రాయజి* సర్వాధికారము చేయుచు వుండగా సాకారాద్వైతమని ఒక మతము వుద్ధరించి ప్రబలము చేయ తలచినాడు. పాండిత్య కుశలతలు అది శృతిస్కృతులనే వృక్షముయొక్క క్షేమాన్ని వతకకుండా వేళ్ళను భేదించడమేవృక్షమునకు బలక మని దక్షిణ దేశస్థులు మూలభేదము చేయుచువచ్చు చున్నారు. వారి తాత్పర్యానికి వ్యతిరిక్తముగా వృక్షము బలహీన దశను క్రమ క్రమశ: పొందుచున్నది.

అయినప్పటికి యీ సర్వోత్తమ మయిన కర్మభూమి కర్మ ద్వారా బ్రంహ్మానుసంధానము చేసే మార్గమును యేర్పచిన పూర్వీకుల తప: ప్రభావము అమితము గనుక జరిగిన అచాతుర్యాలకు విశ్వేశ్వరుడు మ్లేచ్చులవల్ల తగుపాటి శిక్ష కొంతకాలము హిందూదేశపు కర్మకులకు కలగచేసి యిప్పుడు సాత్వికగుణ ప్రధానులయిన యింగిలీషువారిని బహు దూరము నుంచి అనాయాసముగా యీ కర్మ భూమికి దెచ్చి యిక్కడి సార్వభౌమత్వము వారికి కలగ చేసినాడు. యిఖమీదటనున్ను ఆ కరుణా కటాక్షముతొనే మన అపరాధాలు క్షమచేశి ఆదిని వుద్ధరింపబడ్డ శృతి స్కృతి చోదితమయిన కర్మములున్ను తజ్జనితమయిన బ్రంహ్మానుసంధానమున్ను నిష్కల్మషముగా కాలాంతరములో సిద్ధించ వలశినది.


  • చెన్నరాజధానిని ఇంగిలీషు వారక్రమించే నాటికి ఈ సముద్రతీరపు భూమిని చాలవరకు కర్నాటక మనే వారు. ఆ కర్ణాటక నవాబునకే ఆర్కాటు నవాబు అనిపేరు. వాలాజా నవాబు కింద శిరస్తాదారు రాయరేడ్డిరావుగారు చాలా బలవంతుడుగా వుండేవాడు. ఇతడు 1809 లో చనిపోయినాడు.