కాశీమజిలీకథలు/పండ్రెండవ భాగము/326వ మజిలీ

వికీసోర్స్ నుండి

నీ సమక్షమున కేతెంచి నీ యందు సుప్రతిష్టితములై యున్నవి. ఇట్టి నిన్నేమని స్తుతింపగలను ?


మ. ఘనదాన వ్రతతత్పరుండయినన్‌ గార్పణ్యమునంబూని యీ
     వినుతాజాండఘటంబు నీ గుణ లసద్విఖ్యాత మాణిక్య రా
     శిని నిండించి మహానిధానముగ వాసిన్‌గాంచియున్నాఁడ విం
     కను దా వెయ్యది నీ ప్రతాపము వెలుంగన్‌ జ్యోతియై భూవరా.

ఇట్లత్యద్భుతముగ వచించిన చిలుకపలుకుల కానృపసత్తముండలరుచు విస్మయస్మేరాననుండై సమీపవర్తులతో దాని వర్ణనా వైదుష్యమును మాటలపొందికను ప్రగల్ఫవచో వైచిత్ర్యమును బొగడుచు నా చిలుకంగాంచి యిట్లనియె. ఓహో విహం గమప్రవరా ! నీవెవ్వడవు ? ఏ జాతివాడవు ? వస్తువివేకహీనమై వర్ణశూన్యాస్పష్ట శబ్దోచ్చారణ మాత్రకమై యెసగు విహంగమజాతియందు బొడమినను నీ వెట్లుమనుష్య భాష చక్కగా బలుకనేర్చుకొంటివి. శుకజాతి విరుద్ధముగ శిఖవహించిన నీ రూప మక్కజము గొలుపుచున్నదిగదా ! నీ విప్పు డతిచాతుర్యముగ వచించిన స్తుతిపఠన మంతకన్న మిన్నగ వింతగొల్పుచున్నది. మరియును నిస్సంధిరంధ్రోదరంబగు నా చైతన్యమునం దెట్లు ప్రవేశించి పైకి రాగలిగితివి ? అందుండి నీవు పఠించిన పద్య పవృత్త మెట్టిది? వసంతశీలునకు దొరకని నీవు హాలికునిచే నెట్లు పట్టుబడితివని యడుగు నరేంద్రున కా చిలుకనిజవృత్తాంతమిట్లు చెప్పదొడంగెను.

326 వ మజిలీ

చిలుకకథ

దేవా ! అవధారు, సన్యాగిరి పరిసరమున జనసంచార శూన్యంబై మహా మహి దుర్లంబై యతి భయంకరమైన మహారణ్యమొకటి గలదు. అందొక విశాలన్య గ్రోధ తరుకోటరమున నివసించియున్న శుకకుటుంబినికి పిల్లలుపుట్టి చచ్చుచుండుటచే గల్గునెగులు మాన్ఫ నుత్తరవయసునందు నే నుద్భవించితిని. నేనండమునుండి బయట పడీన తోడనే యే హేతువ వలననే శుకజాతి విరుద్ధముగ నీ శిఖ నా తలపై నుదయిం చెను. అట్టి పింఛముతో జాతి విలక్షణముగనున్న నా స్వరూపమును దిలకించి నా జాతి పక్షులేగాక కన్నతల్లికూడ నన్ను పరిత్యజించెను. ఇట్లు పురాకృతకర్మదోషమున గల్గిన కష్టముల ననుభవింపుచు నా యరణ్యమునందే బడియున్న నన్ను శారదియను వనదేవత దయార్థ్రహృదయమై చేపట్టి ప్రతిదినమును నాహారాదికంబొసంగి పోషించు చుండ గ్రమమున నాకు రెక్కలు వచ్చి యెగురుటకు శక్తి గల్గెను. ఈ పింఛముకూడ నా వయసుతోడనే దినదినాభివృద్ధిగఁ బెరుగుచుండెను. పింఛము పెరుగుచున్న కొలది నా యంతఃకరణమున స్వయంప్రబోధ ముదయింపసాగెను. సమస్త వస్తుతత్వోప నిర్ణయము నందును సర్వ శాస్త్రములందును వివిధాశుకావ్య ప్రకల్పనా విశేషమందును నానా పురాణ కధోపకీర్తనా బైదగ్ద్య మాధుర్యమునందును విభ్రమాలాపగోష్టియందును మనుష్యజ్ఞానముగల నాకు గ్రమమున నతి ప్రాగల్బ్యము జనించెను.

అట్టి నన్ను శారదాదేవి తిలకించి వత్సా ! ఇంక నీవు యధేచ్ఛగ విహరింప వచ్చును. మద్వచనః ప్రభావమున నీ కగమ్య విషయ ప్రచారమందును నరంధ్రసంధి స్థాన ప్రవేశమునకు నత్యంత సామర్థ్యము కలుగగలదని వరములిచ్చి చిత్రశిఖుడను మంచిపేరుపెట్టి స్వతంత్ర్య విహారమునకు నన్ను విడచి యంతర్హితురాలయ్యెను. అట్లు జాతి విలక్షణముగ బించము వహించియున్న నన్ను చూచిన‌ మాత్రముననే శతృత్వము వహించి యితర శుకశకుంత సంతతులు బ్రహరించుచుండ స్వజాతి సంగాత సౌఖ్యమెరుగక యేకాకినై నాడు మొదలు నేనావనాంతర మందున్న సర్వ వృక్ష కోటరాంతరముల నివసించుచు కాలమొకరీతి గడపుచుంటి. సకలతత్వ నిర్ణయం బొనర్పందందు వివేకము గల్గియున్న నన్ను క్షణమైనను స్వజాతి సుఖసంగమాభి లాష విడువదయ్యె. ఒకనాటీ ప్రాతఃకాలమున శరత్సమయ సంజాత సంతోషాతిరేక ముతో నంతరిక్షమున నెగురు చనతిసంకులముగ నెచ్చటికో బోవుచున్న చిలుకల పిండుంగాంచి దాని వెనువెంట గొంతదూరమరిగితిని. అందు ముందేగు చిలుకలు వెనుకకు దిరిగి నన్నుజూచి పట్టరాని యీశున నాపైబడి యుచ్చండచంచువుల కోటిచే బొడచి నన్ను జంప బ్రయత్నించుచుండ నతిభీతి బరువెత్తి సంధిరంధ్ర శూన్యమైన యా చైత్రగర్భమును శారరవప్రభావమున బ్రవేశించి ప్రాణముల దక్కించు కొంటిని‌. అట్లొనగూడిన మహాపదలవలన మిగుల వెతనొందుచు సమగ్ర గుణవిర్భావ మూలకమగు మదీయ శిఖోన్మేషముగూడ నాపదకు గారణమయ్యెగదా యని తలంచుచు నట్టి పద్యములందుండి పఠించితిని.

ఆ చైతగర్భముం బ్రవేశింపజాలక చిలుకపిండు నన్ను విడిచి యధేచ్ఛగ‌ బోయెను. వానివలన నా కట్టి బాధ కల్గినను వాని జూడకుండ నేనుండజాలక మిగుల వెతనందుచు నది యెంతదూరమందున్నదో చూడవలయునని బయటకేతెంచి యా చైత్యశిఖర మధిష్టించితిని. ఆ శుకసమాజము దృష్టిగోచరమగుటచే దిగులొంది అయ్యో! తిరుగ నా జాతిపక్షుల నెన్నడు జూడగల్గుదునో యని చింతించుచు క్రింద విమల మణిపీఠకుట్టిమప్రదేశమున ప్రతిఫలితమైన నా రూపమును దిలకించి మందబుద్ధినై నా జాతిచిలుక యొకటి యందు వ్రాలియున్నదని భ్రమసి తటాలున క్రిందకు గంతువైచి దాని ననుసరించి తిరుగుచుండ వసంతశీలుడు పట్టుకొనబోవ వానికి జిక్కక పారిపోతిని. ఆతండు నన్ను వెంటాడుచుండ గొంతదూరమరిగి యాకలిచే బాధపడుచు నొకవరి పొలమును సమీపించి యందు వరిగింజల గొరికి తినదివురుచు నాకలిపాటున వివశతం జెందియున్న నేను భయంకరంబైన పామర కరగ్రహాపదంబడితిని. పిమ్మట నెన్నడు నెరుంగని పంజరబంధమున దగల్కొంటిని. కాని దైవయోగమున పామరుడను యమ దూతవలన బట్టువడినను తుదకు భాగ్యవశమున నీ సమక్షమునకుగొనిరాబడితిని శారదీ ప్రముఖ వనదేవతాప్రకరము ప్రతిదినమును నే మానవ నాయకుని నాశీర్వదించుచుండ నే నాలకించి యుంటినో యట్టి రాజేంద్రు నన్యతుల్యాకృతిని దూరమునుండి చూచిన తోడనే నేను గ్రహింపగల్గితిని. ప్రమోదరసమిశ్రితమగు భవదీయదర్శనామృతము నాస్వాదించి నాయాత్మస్వస్థతం బొందినది.

ఆకాశమందు వాయుపథమున సంచరించు ననుబోంట్ల కిట్టి యసమక్లేశాను భవము బురాతనకర్మ పరిణామమున గాక యితరంబున నెట్లు గలుగును? సహజముగ‌ నీడజంబులు విశ్రంభశీలములు. అట్టిజాతిని బొడమినను నే నొకనికి పట్టువడి భూమీం ద్రుని వశమగుట విచిత్రముగదా! కావున నో రాజచంద్రమా! పురాకృత కర్మాను గుణముగ బవర్తించు నీలోకమున మంచిచెడ్డల కెందును నెవ్వడును గ ర్తగానేరడు.


గీ. ఆత్మయనుపదార్థంబు శుభాశుభాతి
    మయముగావున దానిని నియతిఁ దెచ్చి
    యంతరాతముల నెంత యణచిపెట్టి
    యున్నసుఖదుఃఖముల నందె యుండి గాంచు

కావుననే మదీయపురాకృత శుభకర్మపరిణామమూలమున నశేష నరలోక తిలకుండవై, వివేకచూడామణి వగు భవదీయదివ్యదర్శనలాభం బిపుడు నాకొనగూడ గలిగె నని‌ నతివిన్నాణముగా వచించి యూఱకుండెను.

ఆ పలుకల కా మహీజాని మిగుల ముదమందుచు నాచిలుక నుద్దేశించి యిట్లనియె. ఓహో శుకశ్రేష్ఠమా! స్వజాతిపక్షుల నెడబాసి, స్వేచ్ఛాసంచార నిరోధముగ పంజరబంధమునం బడి‌ యిష్ట పదార్థమునుగాక పరులిడిన యాహారమాత్రమునెగాంచి యేపతత్రి మాత్రమాత్రతం జెందకుండును? నీ వితరపక్షులవంటిదానవు గావు గదా? కేవలము నీవు పురాకృతదుష్కృతమువలననే పక్షిజాతి బుట్టితివి. అయినను సకల విజ్ఞానసంపదయందు మనుష్యులను, మరుత్తులనుగూడ నతిక్రమించు విన్నాణ మంది యుంటివి. కావుననే నీవింతవంత నందుచుంటివి. ఇక విచారింపకుము. నీకోర్కె లన్ని యును సమయానుసరణిని దీర్చి నీకు సుఖము జేకూర్పగలను. నాసమీపమునకు గొని వచ్చువఱకును బిడాలాదికమువలన నాపద గలుగుకుండ నీ పంజరనివాసమే సమంజస ముగా నుండునని యతిమృదుమధురభాషణముల నాఱేడు చిత్రసిఖుని చిత్తమును సంతోషాయత్తముగ నొనరించివసంతశీలున కా చిలుక నప్పగించి వాని కిట్లనియె.


పాలపుంగవా ! నీవీ చిత్రశిఖుని నుద్యానమణిమండపమున నుంచి ప్రతిదినమును

స్వయముగ నాహారపానీయములనొసంగి రక్షించుచుండును. వినోదకథాప్రసంగ సమయముల నెల్లప్పుడును మాయానతిని వీనిని మాసమక్షమునకు గొనివచ్చుచుండు మని వసంతశీలున కనుజ్ఞ యొసంగెను. ఇంతలో మాధ్యాహ్నిక సమయసూచకముగ శంఖము మ్రోగెను

ఆ నినద మాలించియుచితవేదియగు నారాజేంద్రుండువసంతశీలున దగిన రీతిని బహూకరించి రత్నపంజర మందున్న చిత్రశిఖుని వాని కప్పగించిపోవ ననుజ్ఞ యొసంగెను. మరియును సన్నిధానవర్తులగు రాజపుత్రకుల నెల్ల వీడ్కొల్పి స్నానాది మాధ్యాహ్నికకృత్యముల నిర్వర్తింప సింహాసనమునుండి లేచెను. అట్లులేచి రెండడు గులు ముందునకరిగినతోడనే యాధాత్రీశునకు బ్రణమిల్లి వానియనుజ్ఞగైకొనిపోవ నొకరినొకరు త్రోసికొని ముందున కేతెంచు సామంతరాజుల గాత్రసంఘుట్టనమున వారికిరీటమాణిక్యములు నేలరాలి రత్నాకరతీరమున నలలతో దృళ్శిపడు రత్న సంచయముభాతి భాసిల్లెను. ఆయలజడిం దెగిన తదీయహారాద్యాభరణములనుండి పడిన ముత్యములు స్వాంత్యంభోధరవిముక్తజలబిందువుల కైవడి డంబుమీరెను. ఇటు నటు నటించు గుటిలాలక సమూహముల కింకిణీక్వణత్కార కలంకలంబనంగ నగరమున తరువాత లేచిన జనుల కోలాహలములీల జెలువొందెను. సమర్థవశమున విలాసినీజనము లాస్థానమణిస్తంభముల నూతగొనియుండ దదీయప్రతిబింబముల నెపమున నమ్మండ పశ్రీలు సమాలింగన మొనర్చి వారి నాదరించున ట్లొప్పెను.

ఇ ట్లతి వైభవమున నారాజమార్తాండుండు వేత్రహస్తు లిరు వేడల బరా బరులు సేయ వందిమాగధులు ముందు జయజయనినాద మొనరింప నాస్థానమండపము నుండి వెడలివచ్చి స్నానాది యధార్హ కృత్యములం దీర్చుకొని భుజించినపిదప లీలా తల్పమున విశ్రమించి సుహృజ్జనులతో నిష్టగోప్టి సలుపుచు మఱల జిలుకందెప్పించి దానితో నాదినము వినోదముగ గడపెను. ఇట్లే. ప్రతిదినమును చ్శి చిత్రశిఖుని సరసవచ నముల వినుచు నాభూమీశుండు సుఖమున గాలము బుచ్చుచుండెను.


327 వ మజిలీ

పుండరీకుని మృగవనవిహారము


మఱొక్కదినమున బుండరీక రాజేంద్రుడు విలాసమణిభపనమున మంత్రి సామంతపురోహితులతో నిష్టగోష్టివినోదముల బ్రొద్దుపుచ్చుచు గట్టెదుట మణిపంజర మందున్న చిత్రశిఖుని దరలితారవిందసఖములగు దృష్టులం దిలకించి యిట్లనియె సఖా ! బుద్ధి విశేషమున బరిహసితబృహసృతియనదగు నీవిభూతివర్ధనామాత్యుని ప్రజ్ఞా మూలమున నరాతివంశాకురములెల్ల బెకలింప బడినవి. సద్గుణ గణాకర్షి తంబై