కాశీమజిలీకథలు/ఏడవ భాగము/119వ మజిలీ

వికీసోర్స్ నుండి

అని యెఱింగించువఱకు వేళయతిక్రమించుటయు అప్పుడు చాలించి యవ్వలి కథ తదనంత రావసధంబున నిట్లని చెప్పదొడంగెను.

119 వ మజిలీ కథ

హరిదాసుకథ

చామరికా? యేమనియెదవు? వానితోఁ గొంతసేపు మాట్లాడుట సంభవించినది కాదేమి? అయ్యో? మాతాతయున్నప్పుడే రావలయునా? తేజోవతి యాసుందరుని వరించినమాట వాస్తవమేనా? వానిజూచినది మొదలు నాహృదయము తరళముమైనదేమి? వీఁడు జయసింహుడేనా? స్వరభేదమున్నదని తేజోవతి చెప్పినమాట సత్యము కారాదా? నేనుగూడ వీని వరింపవచ్చునా? తేజోవతి యొప్పుకొనదు కాఁబోలు ఆహా ! దానియదృప్టము అని వెఱ్ఱిదానివలె మాట్లాడుచున్న చంపకం జూచి నవ్వుచుఁ జామరిక నిట్లనియె.

సఖీ ! నేనప్పుడే నీ మొగము జూచి అనుమానము జెందితిని. మాధవీలత రసాలముపైఁ బ్రాకుట వింతగాదు. రూపంబునఁ గాక పరాక్రమమునఁ గూడ అనన్య సామాన్యుఁడని అతండు పట్టిన ప్రతిజ్ఞ వలనఁ దెలియఁబడుచున్నది.

మీతాతవచ్చి పద్మావతితో ముచ్చటించిన విషయములు నీవు వినియుండలేదు. వానిం జూచినది మొదలు నీమనసు మనసులో లేదు శత్రువుకు సహాయమువచ్చిన వీరుఁ డెవ్వఁడో యెఱుంగుదువా యని పద్మావతినిఁ తర్కించి యడిగిరి. ఆమె నా కేమియుం దెలియదని చెప్పినది. వాని వృత్తాంతము దెలిసికొని వచ్చుటకు గూఢ చారులఁబం పెనఁట శత్రుమర్మములం దెలిసికొని పోరుట విజయసూచకము గదా ? వాని కులశీలాదుల దెలిసికొని పిమ్మట స్వయముగా మీతాత యుద్ధమునకుఁ బోవునఁట. జయసింహుని మాట ఆయనకుఁ జెప్పలేదు. శత్రువుల జయించిన పిమ్మట నీయభిలాష వెల్లడింపవచ్చును. అంత దనుక దెలియనీయకుము. మఱియు నాయుద్ద విషయమై మీ తాత నేఁడొక సభ జేయునఁట. అందు జయసింహునిమాట యేమైన వచ్చునేమా తెలిసికొనివచ్చెద, నీవూరక పిచ్చిమాటలాడకుము వేళయైనది. చోటు దొరకదు. పోయివచ్చెదనని చామరిక రాజపుత్రికనోదార్చి రాజసభకు బోయి స్రీలు వసించు తావున నిలువంబడి యా విషయముల‌ వినుచుండెను.

రాజసభలో, బ్రహస్తచోదితుండై మర్మజ్ఞుండను వేగులవాఁడు లేచి నమస్కరించి యిట్లనియె.

విభీషణమవారాజా ! మేము దేవరవారి యానతి శత్రుదేశముల కరిగి మారు భూముల నందందు సంచరించితిమి. పాతాళంబు నా విషయము నవసవగాఁదెలిసి నది. అప్పుడు నేను మర్కట రూపము ధరించి తలాతలంబున కరిగితిని. బలిచక్రవర్తి కొన్ని యేండ్ల నుండి యోగంబవలంబించి బాహ్యప్రచారశూన్యుండగుటంజేసి రసాతలంబు నంగల రక్కసులు తలాతలమునకు నిరాటంకముగా రాకపోకలు జరిగించుచున్నారు. తలాతలముఖద్వారమున బలిచక్రవర్తి భటులనేకులు కాచి యుండు వారలు ఇప్పుడొక్కఁడైన నందులేడు. నేను నిర్భయముగా నా గుమ్మము గడచి లోనికిఁ బోయితిని? నేను తలాతల మెప్పుడును జూచియుండలేదు. చీకటిగా నుండునని వాడుకయేకాని పాతాళముకన్న నెక్కుడు తేజముతో నొప్పుచున్నది.

ఉరగ లోకమునందుగల రత్నములన్నియు దొంగిలించి రక్కసులు తలాతలంబున దాచికొనిరి. వజ్రకంఠుఁడు దానిని బాలింపుచుండెను. ఇఁక చెప్పనేల రాక్షసకృత్యము లన్నియు అందేయున్నవి. దయా సత్యశౌచముల పేరులక్కడి వారికిఁ దెలియవు. పచ్చిమాంసము తీసి రక్తము త్రావుచుందురు. ఆకలియైనప్పుడు తండ్రులను బిడ్డలను గూడఁ దెలియక భక్షించుచుందురఁట. అట్టి దుష్టలోకమున నెట్లో యొక యోగి వసియించి యుండెను. అతండొక మంటపము మీఁదఁ గూర్చుండి జపము జేసికొనుచుండును. వాని జోలికెవ్వరును బోరు వజ్రకంఠుఁడా యోగిమాట శిరసావహించును ఆ యోగికిఁగల భూతదయ యెవ్వరికిని లేదఁట. తన ప్రాణము గవ్వగానైనఁ జూడడఁట. పెక్కుసారులు రక్కసులు వానిం భక్షింపఁ దీసికొని పోయిరఁట. తినమని తన శరీరమిచ్చెనఁట. కాగిన యినుపకమ్మివలె నుండుటచే వాని దాకియాకితవులే సమసిరఁట.

అందున్న వారందరు నా యోగిమాటజవదాటరు. కౄరులైనను అందలి వారి నయ్యోగి పుత్రులుగాఁ జూచుచుండును. అతం డాహారమెప్పుడు గుడుచునో తెలియదు. ఎప్పుడును, కన్నులుమూసికొని జపము జేసికొనుచుండును. ఆ యోగి మహిమ సామాన్యముగాదు. కొన్ని నెలల క్రిందట చక్కని యొక మనుష్య కుమారుఁ డాతలాతలమునఁ బట్టణ వీధిలో నొడలు కట్టఁబడి పడియుండెను. వానింజూచి రక్కసులు సంభ్రమముతో మూఁగి నరమాంసము లభించెనని యుబ్బుచు వాని కట్టులు విప్పి పట్టుకొని నాదినాది అని‌ పలువురు పెనుగులాడఁ దొడంగిరి.

అప్పుడా కుమారుఁడు తెలివివచ్చి హస్తపాదములు విదిళించి వారినెల్ల ముష్టి ఘాతములఁ బారఁదోలెను. మఱికొందఱు వీరులు ఖడ్గపాణులై వానిమీఁదఁబడి యేయఁ బూనిరి. కాని వారి యాయుధముల లాగికొని వానితో వారినెల్ల బరిమార్చెను. అప్పుడు బెబ్బులిం గనిన మేకలవలె రక్కసులు వీధులంబడి పారిపోవఁదొడంగిరి. వజ్ర కంఠుండు వానిరాకవిని పెక్కండ్ర దానవీరుల వానిఁ గట్టి తీసుకొని రండని పంపుటయు వాండ్రు గాండ్రుమని యార్చుచు నావీరుని పైఁబడి యగ్నింబడిన మిడుతలవలె మ్రగ్గిపోయిరి.

కృపాణపాణియై కృతాంతుని చందమున సుర విరోధుల మడియింపుచు వీధుల గ్రమ్మరుచున్న యా వీరపురుషుని నెదుర్కొన నాలోకములో నొక్కరుఁడు సమర్దుఁడు లేకపోయెను. అప్పుడు వజ్ర కంఠుఁడు విచారించి యాయోగి పాదంబులంబడి మహాత్మ ! ఈ మానుషయువకుం డెవ్వడో తెలియకున్నది శ్రీవిష్ణుండు మమ్ముఁ బరిభవింప నీరూపమున జనుదెంచెనేమో తెలియదు. సామాన్య మానవునకింత బలముగలుగునా? నిన్ను శరణుజొచ్చితిమి. రక్షించి వాని యుపద్రవము తప్పింపుమని ప్రార్దించిన నయ్యోగి యిట్లనియె.

దానవోత్తమా? ఆ వీరుఁడెవ్వడో నేనెఱుంగను. నామాట బాటించెనేని మీకుపకారము గావించెదను వాని నాయొద్దకనుపుఁడని చెప్పిన నారాక్షసరాజు ఆలోచించి కొందఱుగ్రవ్యాదులవాని నెదుర్కొన బంపెను. ఆదనుజులు వోయి పోరరమ్మని చీరి మీఁదఁబడవా రామఠముదారిం బారిపోయిరి.

ఆవీరుండు దారిలో మఠములో జపము జేసికొనుచున్న మహాయోగిం జూచి వెరగుపడుచు నోహో? మాలపల్లెలో హోమధేనువు వలె నిందీయోగి యెట్లు వసించెను. వీని యాకారము మహాసుభావత సూచించెడి. వీరితో సంభాషించి కృతార్థుండ నయ్యెదనని తలంచి యతఁడు మంటపములోనికిఁ బోయి యాయుధముల నేలబెట్టి సాష్టాంగ మెరగి యెదుర నిలువంబడియెను.

అప్పుడు యోగి వానిం జేరరమ్మని వీపుపై జేయివైచి దీవించుదు వత్సా! నీవెవ్వనికుమారుఁడవు ఇక్కడి కెట్లువచ్చితివి ఊరక‌ నీరక్కసుల బరిమార్చుచుంటి వేమిటికి? జీవహింస మహాపాతకముగదా? భూతదయవలదా? స్వార్థపరుని భూతములు శాసించును. శస్త్రధారణమున కిదియా ఫలము భీరువులఁ దరుముట వీర ధర్మమే? నీవాలించితివేని మంచిమాట లుపదేశించెద. హింసక్రియ నుపసంహరింపు మని పలికిన విని‌ అతండు చెవుల కమృతము శోకినట్లు మురియుచు నిట్లనియె.

మహాత్మా ! నీయుపదేశమున నాయుధముల విడిచితి. వీండ్రునన్ను బాధించుటచే నింత సేయవలసివచ్చెను నేనిక్కడి కెట్లు వచ్చితినో తెలియదు. నాతండ్రిపేరు నేనెఱుంగను. మాతల్లిదండ్రు లేదియు నాకు నామకరణము చేయలేదు. హరిదాసుండని పిలువఁబడుచుందును. ఇది యేదేశము? ఈక్రూరులనడుమ నీవెట్లుంటివి? అక్కటా? వీరిచర్యలు కడువిపరీతములు కావా? వీండ్రఁజాచిన నీకక్కటిక మెట్లు కలిగినదో తెలియదు. నీవు సహజదయాశాలివగుట తెల్లమైనది మీరాపకున్న నీలోక మంతయు నాలుగు దినములలో శూన్యము జేయక పోవుదునా? నీకతంబున నీక్రూరుల కెల్ల నభయహస్త మిచ్చితిని వెరపుడిగి సంచరింపుమని చెప్పుడు ఇఁక దారుణకృత్యములు విడిచి వర్తింపుమనుఁడు విడువకున్న మడియఁజేయక మానను. నేను మీకడ వసించెద మంచిమాటల నుపదేశింపుఁడని ప్రార్థించెను.

ఆయోగి హరిదాసుని మిక్కిలి మెచ్చుకొనుచు వత్సా ! నీవు జీవులకు సర్వోత్కృష్టమైన ప్రాణదానం బొసంగితివి. కావున నీకు నే దాసుండనైతిని. భూతదయకలవాఁడే నాఁకు జుట్టము దేహములు క్షణభంగురములు నీటిబుడ్గ వోలెఁ బ్రతిక్షణ వినాశియగు నీ దేహ సుఖమునకై జీవహింస జేయవచ్చునా? వీండ్రు క్రూరులగుట నిజమే. సృష్టి వైచిత్రము కడువిపరీతముకాదా ! గోవుల సాధువులఁ జేసి వ్యాఘ్రంబుల ఘాతకంబుల జేసినట్లే భగవంతుఁడు అసురుల ఖలులం గావించెను. అది భగవంతుని తప్పుగాక వారిదికాదు. వృశ్చికపుచ్ఛంబు విషపూరితము కాకున్న నది కుట్టినను బాధ యేమియున్నది. సహజ గుణంబులు మానుప నెవ్వరితరము? లోక ప్రకృతి తెలిసి వర్తింపవలయు నని యుపదేశము చేయుచుండ నాహరిదాసు కొన్ని దినములా యోగివద్ద వసించి శిశ్రూషజేయుచుండెనఁట.

మఱియొకనాఁడు హరిదాసు దాపునలేనప్పుడు వజ్రకంఠుఁడు యోగియొద్దకు వచ్చి పాదంబులంబడి మహాత్మా ! మీదయ వలన మేము తలాతలంబున నిర్భయులమై సుఖించుచుంటిమి. నీతియందు శుక్రాచార్యుండు నీ కెనగాడు. ఇప్పుడు మాకుఁ బ్రాణసంకటమైన యుపద్రవ మొండు సంభవించినది. అది తప్పించుకొన మాకుశక్యముకాదు. నీవు మమ్ము రక్షించెదనని యభయహస్తమిచ్చు దనుక నీపాదము విడువనని మిక్కిలి దీనుఁడై ప్రార్ధించెను.

కృపాళుండగు నాయోగి వానిమాటలు విని జాలిపడి రాక్షససత్తమా? లెమ్ము లెమ్ము నీకువచ్చిన యుపద్రవమేదియో యెఱింగింపుము. తెలిపితివేని తీర్చెదనని పలికిన స్వామీ? మీపనివారుకారు మీరు తలంచుకొనిన నింద్రుఁడు వచ్చి దాస్యము చేయఁగలఁడు మీరు మాకు నభయదాన మొసంగితినని శపథము చేసినం జాలు మా కార్యమైనట్లు తలంతునని కన్నీరు గార్చుచుఁ వాక్రుచ్చిన మెత్తని మనసుగల వాఁడగుట నావిరాగి యందుల కంగీకరించి శపథము గావించెను.

అప్పుడు వాఁడు పాదములనుండి లేచి స్వామీ ! వినుండు ఇప్పుడు నాబంధువులు శత్రువులతోఁ బోరాటము గావింపుచు నోడి పోవుచున్నారు నన్నుసహాయము రమ్మని కోరిరి. శత్రువులు బలవంతులగుట నేను దోడుపడినను వారిం జెనక జాలను. ఇప్పుడు పేక్షించితినేని బగతు రిచ్చటికిఁగూడవచ్చి మారాజ్యము లాగికొందురు. కావున నీయాపద మీరు దాటింపవలయును. మీశిష్యుఁడైన హరిదాసుం బంపితిరేని వాఁడు శత్రువులఁ బీచమడంపఁగలడు. వీఁడు అసహాయశూరుండు మీమాట జవదాటువాడు కాడు మేమెల్ల మీయానతి వానికి వశవర్తులమై యుంటిమిగదా? యీ సహాయము చేయుఁడనని వేడిన నాయోగి యించుక యాలోచించి సరియే మీరుపొండు వానికిం జెప్పి నాయోపిన యుపకారము గావించెదనని యూరడించి వారినంపెను. సహజకృపాపారీణులు పరహృదయ కాపట్యముల లెక్క సేయరుగదా?

హరిదాసు తనచెంతకు వచ్చినతోడనే యోగి వానిం జేరబిలిచి వత్సా! నీవు నేఁడు నాకొక యుపకారము గావింపవలసివచ్చినది నీవు స్వార్థపరుండవు కావు. పరోపకార పారీణుఁడని యెంచి యీమాట జెప్పుటకు సాహసించితిని అప్పని నీమది కొప్పమియగునేమోయని వెరచుచున్న వాఁడనని సందియమందుచుండ నాహరిదాసు ఇట్లనియె.

స్వామీనిన్ను గురువనియుఁదండ్రియనియు నొడయండవనియుఁ దలంచి మీ సేవజేయుచుంటిని మీకుఁ శిష్యుఁడ ఇట్లు చేయుమని నాకు విధింపక నాకుఁ బని చెప్పుటకు సందేహపడుచుంటి రేమటికి?

గీ. అగ్గిబడమన్నఁ బడియెద నంబురాళి
    మునుఁగుమన్నను మునిఁగెద మోహముడిగి
    తోడువిడిచెద నెట్టిబంధువులనైన
    యోగినత్తమ? నీవాజ్ఞ యొసఁగెదేని.

మహాత్మా ! తొల్లిదండ్రి నానతి బరశురాముండు తల్లిని జంపెను. శ్రీరాముండు సంసిద్ధంబైన రాజ్యలక్ష్మిని విడిచి అడవులం జరించెను. గురునాజ్ఞనుదండకాదిమహర్షులు ప్రాణంబులర్పించుటకు సిద్ధపడిరి నీతివిదులై న సేవకుల యజమానులమాట నెట్టి యకార్యకరణంబులనైనగావించిరి. కావున మీరు నావిషయమై సంశయింపవలదు. సత్వరమ కావించి మీదయకు, బాత్రుండయ్యెదనని శపధముజేసెను.

యోగి వానిమాటలు మెచ్చుకొనుచు వత్సా! నీకు ధండన మనినఁబండువుగదా? ఈరక్కసుల మిత్రులకు శత్రువులఁ వలన నుపద్రవము వచ్చినఁదట దానివారించి వీరికి జయము గలిగింప వలయునిదియే నేచెప్పుపని యనుటయు హరిదాసు ఓహో! యింతమాత్రమునకే నన్నింతగాఁ బలికితిరి నాకు వీరెవ్వరు సహాయము రానక్కర లేదు. వారిం బేర్కొనమనుఁడు ఇప్పుడే వశవర్తులం గావించెదనని పలికెను.

యోగి వజ్రకంఠుని రప్పించి అతనిచేయి హరిదాసు చేతిలోఁబెట్టి ఈతని నీవు మిత్రునిగా భావింపుము అత్తెరంగు వీఁడెఱింగించును. వీనితోఁబోయి ధర్మవిజయము గైకొనిరమ్మని నియమించెను. హరిదాసు వజ్రకంఠునందు నిష్టములేనివాఁడైనను గురునాజ్ఞఁ జేసి అంగీకరించి నీశత్రులెందున్నారు చెప్పుమని యడిగిన నారక్కసుండు వీరోత్తమా! పాతాళమున నా మిత్రులకును శత్రువులకుఁ బెద్దయుద్ధము జరుగఁబోవుచున్నది. మేము మిత్రులకుఁ సహాయము పోవుచున్నారము. మీ సహాయంబునఁ దప్పక విజయము మాకుఁ గలుగఁ గలదని చెప్పెను.

పాతాళంబున మీకు మిత్రులెవ్వరు శత్రులెవ్వరని అడిగిన హరిదాసునకు వాపొలనుడిండు ఆర్యా ! వినుండు కాకోదర చక్రవర్తులైన తక్షకకర్కోటక కులస్థులగు నురగపతులు మాకు మిత్రులు తత్కులకాతుండగు నేలాపుత్రుండు వాసుకి కులజుండగు కౌరవ్యునిపై, గత్తిగట్టి వారినగర‌ మిప్పుడు ముట్టడింపఁ బ్రయత్నించుచునాఁడు. లంకాధిపతియగు విభీషణుఁడు వారికిఁ జుట్టమగుట సహాయము రాకమానఁడు. నీసహాయము లేకున్న మేమును నురగులును వారిని జయింపజాలము. అందులకే మిమ్ముఁ గోరుకొంటిమి. మీరే సర్వ సేనాధిపతులై యద్దము నడిపింపవలయునని చెప్పెను.

అప్పుడా హరిదాసు కన్నులు మూసికొని యించుక ధ్యానించి యెద్దియో విచారము హృదయంబునం దోప అల్లన కన్నులు విప్పి చూచుచుఁ గౌరవ్యునకుఁ నేలాపుత్రునకుఁ విరోధమేటికిఁ గలిగినదని యడిగిన వాడట్లనియె.

ఆర్యా ! అంతయు జెప్పవలయునా? వినుండు. ఇప్పుడు కాకున్నఁ బిమ్మట యైనం దెలియకమానదు కౌరవ్యునికూతురు తేజోవతి మిక్కిలి చక్కనిదఁట దాని నెక్కడనో చూచి యెలాపుత్రుని కొడుకు పారిజాతుఁడు బాల్యచాపల్యంబునఁదన్నుఁ బెండ్లియాడుమని యొక దాదిచే వర్తమానము బంపినఁ దానంతకు మున్నెవ్వరినో వరించి యున్నాననిచెప్పుము బారిజాతుని దాసీపుత్రికచే దుర్భాషలాడించినదఁట ఆకారణమున వారికిని వీరికిని గ్రమంబున వైరంబు బెరిగినది. ఇప్పుడిరువురు యుద్ధసన్నద్దులైయున్నారు. విభీషణుఁడు సంధికి నేలాపుత్రునకు రాయభారము పంపియున్నాడు. మనవారు జడియుచున్నారు ఇప్పుడు మనము పోయి వారి కుత్సాహము గలిగింపవలయునని యా వృత్తాంతమంతయుం జెప్పుటయు నతఁడొక్కింతతడవు నిశ్చేష్టితుండై కొంతవడికిఁ దెలిసి పదుఁడు పదుఁడు లెండు లెండని పలుకుచు నప్పుడే రాక్షసబలంబులతోఁగూడఁ బాతాళమునకు వచ్చెనఁట ఇవియే నేను దెలిసికొని వచ్చిన విశేషములుఁ ఆవీరుఁడే మనవారినెల్ల గాందిశీకులఁ గావించెను. ఆయోగి చాల మంచివాఁడు మీరు వోయి యాయనను నాశ్రయించితిరేని హరిదాసు యుద్ధ--------- గావించును. అప్పుడు మనము సులభముగా శత్రువుల జయింతుమని యావేగులవాఁడు చెప్పెను.

పిమ్మట మరియొక వేగులవాఁడు ఎదుటకువచ్చి మహారాజా ! తమయానతి నేను గూఢచారినై పాతాళలోకమంతయుఁ దిరిగితిని. జయసింహునిగురించి వితర్కించితిని వినుండు జయసింహుని తేజోవతివరించి తన్నవమానపరచెను కోపముతోఁ బారిజాతుండు కొందఱ రాక్షసుల సహాయంబున నొకనాడు నిద్రించుచుండ జయసింహుని బట్టుకొని యొడలెల్ల గట్టి యొక పాడునూతిలోఁ బడవైచి చంపించెనని తెలిసినది. హర హరా"? యెంత ఘోరకృత్యయు గావించెనో వింటిరా? అట్టివానిఁ బుత్రమిత్ర కళత్ర యుక్తముగా నాశనముజేయక తీరదని చెప్పి యవ్వలకుఁ బోయెను. అని యెఱింగించిరి.

120 వ మజిలీ

కలభాషిణికథ

ఆహా ! నాపురాకృత భాగధేయము ఫలించినది చంపక చామరికతోఁ జెప్పిన మాటలు వినుటచే నేను గృతార్థుండనైతిని నన్ను జూచి జయసింహుడు తేజోవతి భ్రమపడినది జయసింహుండు నా పోలికగా నున్నవాఁడుకాబోలు. అతండు మదీయ సోదరుఁడు కాడుగద. అట్టిభాగ్యము నాకు భట్టునా? నన్నీ లంకాపురమునకుఁ దీసికొనివచ్చిన భగవంతుని యె త్తికోలు ఎవ్వనికిఁ దెలియును. ఎట్లయినను నేను బాతాళలోకమున కరుగవలయుంగదా? విభీషణుఁడు నేఁటి రాత్రియే దండయాత్ర వెడలుటకు నిశ్చయించుకొనియెను. వారితోఁ భోయెదంగాక. అంతదనుక మఱియొకచోట నుండ నేల? చంపక యంతఃపురమునకుఁబోయి వారి సంభాషణ మాలింపుచుఁ గర్ణపర్వము గావించుకొనియెదను. అని తలంచి వీరసింహుఁడు ద్వారపాలురఁ దప్పించుకొనుచుఁ జంకక యంతఃపురమున కరిగెను.

అప్పుడు శుద్ధాంతమంతయు హల్లకల్లోలముగా నుండెను. హా! జయసింహా హాపురుషసింహా? సింహకిశోరములభాతి నురుగులనడుమఁ బ్రకాశించుచుందువు. నీకీ మృత్యువు విధియెట్లు విధించెనురా? దుర్మతీ? పారిజాతా? వానిం జపించినంతనే నిన్ను వరింతుననుకొంటివిరా? నాకుఁగూడ వానితోడిద గతియనియెఱుంగవు. అమ్మా ! ఇఁక బ్రాణములతోఁ బనిలేదు సఖీ! చంపకా! నాబ్రతుకు నేఁటితోఁ దీరినది దుఃఖింపుచుండ జంపక తేజోవతీ! యారడిల్లుము. ఆమాట సత్యమో యసత్యమో విచారింపక నక్కరలేదా? నిన్న మన యంతః పురమునకు వచ్చినవాఁడు జయసింహుఁ డననాయని యోదార్చిన నామె యిట్లనియె.

సఖీ! రూపసాదృశ్య మున్నది కాని స్వరభేదము గలుగుటం బట్టి మొదటనే సందేహించితిని. అతండు జయసింహుఁడుకాఁడు. నాలుగు నెలలనుండియుఁ గనం