కాశీమజిలీకథలు/ఆరవ భాగము/94వ మజిలీ

వికీసోర్స్ నుండి

నెట్లు పోవలయునని యాలోచించుచుండఁగా నిరువురు కూలివాండ్రు వచ్చి అయ్యా మేము‌ పేదవాండ్రము మూటలు మోచికొని మీ వెంబడి వత్తుము. బత్తెము పెట్టినఁ జాలని యడిగిరి.

ఆ మాటలు సత్యములని నమ్మి వారిరువురు మాకు మూటలు లేవు. దారిఁ జూపినంజాలు. మీకుఁ దగిన పారితోషిక మిత్తునని చెప్పిరి. అందులకు వాండ్రంగీకరించి యతివినయముఁ జూపుచు ముందు నడచుచు గంటకములు నేరుచు నేర్పరి తనంబున గొంతదూరముఁ దీసికొనిపోయి యొక మహారణ్యములోఁ బ్రవేశ పెట్టిరి. లీలావతి పురుషవేషముతో నడుము బిగియించి కరంబునఁ గరవాలము గ్రాల సింహగమనంబున వారి వెంట నడచుచుండెను. అమ్మహారణ్యంబున నొకలోయలోఁ గొందరు కోయవాండ్రెదురై నిలునిలుండని వారినదలించిరి. అప్పుడు లీలావతి ముందు నిలిచి మమ్మేటికి నాటంక పెట్టిరి? మీ యభిప్రాయమేమన వాండ్రు మీ యొద్ద సొమ్ములున్నవి. అందుఁబెట్టి పొండని పలికిరి. ఆ కలికి తమవెంట వచ్చిన కూలివాండ్రు వారితో మాటాడుటఁ జూచి కోపావేశముతో నా యిరువుర శిరములు ముందుగ నరికి లేళ్ళగమికురుకు సింగంబు చందంబున నా యాటవికులపైఁబడి నరకుటయు యధాయధలై యా యధము లందరుఁ బారిపోయిరి . అమె పౌరుషముఁ జూచి యా వర్తకుడు వెరఁగుపడుచు వెనువెంటఁ దిరుగంజొచ్చెను. అట్లడ్డువచ్చిన మ్రుచ్చులనెల్ల , గడతేర్చి యాపడఁతి. తెరవుగానక నలుమూలలు సూచుచు గమ్యస్థానము గురించి విచారించుచుండెను.

అని వచియించిన మణిసిద్దుండు తత్కధాశేష మనంతకావసధమ్మున నిట్లు చెప్పదొడంగెను.

తొంబదినాలుగవ మజిలి.

భోజకుమారుని కథ

రాజపుత్రా ! వత్సరాజు మీ తండ్రి నా చప్పినసు చేయుట శంగినతం ట్లు సంర సంతులు, నకలు రవూ.౮4 ౫ గగటిసునల్ల కందిన చురపటు ప రోధన షా. వవపడ ముం. నడుం మప మంతిలళ్యరు.ంఎ ిపగసము. సమయము నేది సిన్నందు రిపింటంనం ఇ సీ పిసతం డి యనుభంంపం*లడా 1 సబల విరోధము కలుగఁజేసి దేశమునఁ గలతలు పుట్టించెదను. కర్తవ్య దెలియజేసెద. గూఢముగా నలకాపురంబునకుఁ జనుమని బుద్దిసాగరుండు భోజకుమారున కుపదేశించుటియుఁ దదనుమతి ననుసరించి యా రాజపుత్రుఁడు తురగారూడుండై నాటి వేకువజామున ననుచరులతోఁగూడ నొక యడవి మార్గంబునంబడి నడువఁ దొడంగెను.

అల్లంత ప్రొద్దెక్కువరకుఁ దురగమునుఁ జురుకుగా నడిపించి యా రాకుమారుఁడు చండభాను కిరణంబులు సోకి చరణంబులు తరుచ్ఛాయాచరణంబు నభిలషింప ననుచరులలో నోరి ! అలకాపురమునకు మార్గము మీరెఱుంగుదురా ? ఎంత దూరమున్నది ? పోయినకొలది యరణ్యగమ్యముగాఁ గనంబడుచున్న దేమి ? ఒకచోటఁ గొంతసేపు విశ్రమించి యేగవలయును. నాకీ పయనము చాల బడిలికగా నున్నది. హుటాహుటి నడలచేఁ బెద్దదూరము వచ్చితిమని పలికిన నాకింకిరు లిట్ల నిరి.

రాజపుత్రా ! మమ్మల కాపురముఁ గ్రొత్త దారిం దీసికొని పొమ్మని ప్రధాని నియమించెను. ఈ త్రోవ తరచు జనులు నడచుచున్నది, కాదు. పది దినములకుగాని మన మలకాపురముఁ జేరలేము. ఆహార పదార్థములు తెచ్చితిమి. నీరుగల తావున నిలిచి భుజింతురుగాక. విశ్రాంతి వహించియే పోవచ్చును. తొందర యేల? మీ రతిసుకుమారులు గదా? అని పలుకుచు నొక చెట్టునీడ నా బోజుని విశ్రమింపఁజేసి ప్రాంతభాగముల కరిగి జలముఁదెచ్చి యుచితాహారమున నతనిం దృప్తుఁగావించిరి. అతండు విశ్రాంతిఁజెందిన పిమ్మటఁ గ్రమ్మర బయలుదేరి రాత్రికే కొండపల్లి నైనఁ జేరవలయునని తలంచిరి కాని యట్టికొట్టిక యెద్దియునాఁడు గనంబడినదికాదు. చీకటి పడకమున్ను యొక పొదరిల్లు బాగుఁజేసి పల్ల వశయ్యఁ గల్పించి రాజపుత్రునందుఁ బరుండజేసి పరిచారకు లిరువురు నాయుధ‌ హస్తులై కాచికొని యుండిరి.

బోజుండారాత్రియెల్లఁ బినతండ్రి కావించిన దుర్నయమును గురించి విచారించుచు నెట్టకేల దె‌ల్లవార్చెను. సూర్యోదయంబుఁ గాల్యకరణీయంబులు తీర్చికొని బయలుదేరిరి. ఆ మార్గమొక కొండలోయకు దీసికొని పోయినది. మార్గముఁ దప్పితిమని యా సేవకులనుకొని తొట్రుపడఁజొచ్చిరి. ఒక కొండ కాల్వదరిని మధ్యాహ్న కృత్యంబులు నిర్వ ర్తింపం జేసిరి. నాటి సాయంకాలమున కాయడవి దాటక పోయితిమేని క్రూర సత్వంబులవలన ప్రమాదము గలుగక మానదని తలంచుచు వెంటనే బయలుదేరి యతివేగముగాఁ బయనము సాగించుచుండిరి. కొంతదూరము పోయినంత నొకవటపాదపంబు శాఖాసమూహముచే నలుదెసల నావరించి దిక్పతుల నగరంబుల కరుగ నమరించిన రాజమార్గమోయన విరాజిల్లుచున్నది. శీతలసాంద్రచ్ఛా యాభిరామంబగు నా భుజముక్రింద భోజుండనుచరులతోఁ గూడఁ గొంతసేపు విశ్రమించి పయనంబునకైఁ దొందరఁ జేయుచున్న కింకరులతో నతం డిట్లనియె.

ఇది మహారణ్యము. ఇందు మనుష్య సంచారము లేదు. ఇంతలోఁదెరపి ఇందు మన సత్వమునకు మిగిలిన సత్వంబు లుండవచ్చును. నేటి రాత్రి యీధాత్రీజము శాఖాంతరమున వసించి గడుపవలయును. ఇకఁబై నము సాగింపవలదని నియమించిన నాకింకరులంగీకరించి విశాలమగు నొక శాఖాంతరాళమున శయ్య నమరించి యతండు పండుకొని నిద్రించుచుండ నిరువురు మేల్కొ ని కాచుచుండిరి. అట్టి సమయమున మీద కొమ్మలసందున నేదియో యద్భుతమైన వెలుంగుగనంబడినది. ఆ కాంతి చూచి యా భటులలో నొకఁడు.-

ఒకఁడు --- ఓరీ! ఆ కాంతి చూచితివా ? ఇందు! గొరవిదయ్యము లున్నవి సుమీ?

రెండవవాడు -- అమ్మయ్యో? ఆమాట నాకేల చెప్పితివి ? నాకు దయ్యమనిన గడు భయము. నే నటు చూడలేను. అది యేమి చేయుచున్నది?

ఒకడు - ఆహా ! నీవెంత పిరికివాడవు? ఈ కత్తి చేతిలో నుండగా నా దయ్యము మనల నేమి చేయగలదు ?

రెండవవాడు -- కత్తులతో వానినేమి చేయగలము ? వానికి రూపము లేదు. కనంబడకుండ వచ్చి మీదబడి ప్రాణములు లాగునని చెప్పుదురు.

ఒకడు -- ఆలాగునా ? ఆ మాట నే నెఱుగను అయ్యో? ఇది మీదబడి మనల జంపును గాబోలు ?

రెండవవాడు - ఇదిగో ? నాకప్పుడే యావేశ మగుచున్నది. ఒడలు వణకు చున్నది చూడుము.

ఒకడు - అక్కటా ! బుద్ధిసాగరుఁ డీరాజపుత్రుని బదిలముగా మేనమామ యిల్లుఁ జేర్చితిమేని మంచికానుక లిప్పింతునని చెప్పుటచే నాస పడి వచ్చితిమి. చచ్చిన తరువాత నీకానుక కేమి చేయుదుము ? ముంజుడా! పాపాత్ముడా? నీ మూలముననే యీ యిక్కట్టు మాకు సంప్రాప్తించును.‌

రెండవవాఁడు - తమ్ముడా నాకు నోటినుండి మాట రాకున్నది. ఆ దయ్యము మీదఁబడి కుత్తుకఁ బట్టుకొన్నది. నీవు బ్రతికియింటి కింబోయితివేని నా భార్యాపుత్రుల గాపాడుచుండవలయుం జుమీ?

ఒకఁడు - ఆ వెలుగు నిక్కడనే యున్నది. అప్పుడే మీదఁబడినదని చెప్పుచుంటివేల? నీకంటె నేనే కొంచెము ధైర్యవంతుఁడఁగదా? ఈ రాజపుత్రుని లేపుదునా ?

రెండవవాఁడు - (గద్గదస్వరముతో) లేపు. లేపు. ఏది యేని బ్రతీకారముఁ జేయగలఁ డేమో?

ఒకఁడు - రాజపుత్రా ! రాజపుత్రా ! (అని వికృతస్వరముతో బిలుచు చున్నాడు) భోజుఁడు - (అదరిపడి లేచి) ఏమిరా ? నన్ను మంచిస్వప్నాంతరమున లేపితిరి. ఆకల మంగళాభిముఖమైనది గదా.

రెండవవాఁడు - మీకు మంగళాభిముఖముగానే యున్నది. మా కమంగళాభి ముఖ మగుచున్నది. చూడుము.

భోజుఁడు - అట్లు వికృతముగా మాట్లాడుచున్నావేమి ? ఏమి యుపద్రవము వచ్చినది ?

ఒకఁడు - కొరవిదయ్యము కొరవిదయ్యము.

భోజుఁడు - ఎక్కడ ? ఎక్కడ ?

ఓకఁడు - అదిగో? ఆ కొమ్మలసందున.

భోజుఁడు - (చూచి వెరఁగుపాటుతో) మూర్ఖులారా ? అది కొరవిదయ్యమని యెట్లు నిశ్చయించితిరి ?

ఒకఁడు - కానిచో నా కాంతి యెట్లు వచ్చినది ?

భోజుఁడు - ఆ తేజము కడు మనోహరముగా నున్నది. కొరవిదయ్యము కాదు.

ఒకఁడు - అప్పుడే వీని కంఠముఁ బట్టుకొన్నదని వీఁడు మొర్రపెట్టు చున్నాఁడే ?

భోజుఁడు - భ్రాంతి యట్లు చేయును. వెరవకుఁడు. అది పిశాచిము కాదు.

రెండవవాఁడు - అమ్మయ్యా ! ఇప్పుడు నాకుఁ గొంచెము మాట వచ్చుచున్నది.

ఒకఁడు - చెడుగా, ఇందాక దయ్యము నా పని పట్టుచున్నదని పిల్లల నా కప్పగించితివి కాదా ! ఇంతలో నెక్కడికిఁ బోయినదిరా ?

రెండవవాఁడు - రాజపుత్రుఁ డది దయ్యము కాదని చెప్పువరకు నా శరీరము నే నెరుఁగను. అది యేమో నాకుఁదెలియదు. నీవు మాత్రము వెరవ లేదేమి?

అని వారిద్దరు పంతము లాడుకొనుచుండ నవ్వుచు భోజుఁడు మూర్ఖులారా ? పిశాచ మనునది యొకటిలేదు. అది భీతివలనను బ్రాంతివలనసు బాధించు చున్నట్లు కనబడును. ఇందుల కొక యితి హాసకముగల దాకర్ణింపుఁడు !

సులోచనకథ

కాళిందీనదీతీరంబునఁ బుంజికయను గ్రామంబునఁ బ్రజ్ఞావంతుఁడను బ్రాహ్మణుఁడు సులోచన యను భార్యతో గాపురముఁ జేయుచుండెను. విద్యాగంధ రహితుఁడైన యతనిపేరు నేతిబీరకాయవలె నిరర్థకమై యున్నది. అతనిభార్య సులోచన మనోహర రూపసంపన్న యగుట జూచివారి కా దాంపత్యము వికటముగా నున్నదని తోచక మానదు. సులోచన భర్తయందనురాగము లేనిదైనను నక్కపట మొరులకుఁదెలియనీయక విథిలేక నతినితోఁ గాపురము చేయుచుండెను.

ఒకనాఁడు ప్రొద్దుట నా ముద్దులగుమ్మ బిందె తీసికొని నీటికై యేటి కరిగినది. అప్పుడు మిగుల భాగ్యవంతుడును రూపసంపన్నుఁడగు నొకవర్తకుఁ డెందేనిం బోవుచు దంతధావనమునకై తానెక్కి వచ్చిన గుఱ్ఱమును దీరమున నిలిపి‌ రేవులోనికిం బోయెను. అప్పుడు దైవికముగా సులోచన యొక్కరితయే యా రేవులో నున్నది. ఆ చిన్నదాని రూపమా సా‌ర్ధవాహుని హృదయము నాకర్షించినది. ఆ సొగసుగానిం జూచి యా చిగురుబోణి డెందము వికారము నొందినది.

ఇరువుర చూపులను ద్రాళ్ళుఁ జేసి కందర్పుఁడు వారి చిత్తములకు ముడివైచెను. లజ్ఞాభయ సంభ్రమములతో నిద్ధరుఁ దొట్రుపాటుఁ జెందిరి. అప్పుడు వర్తకుఁడు సాహసించి చిగురబోణీ ? నీ వెవ్వని భార్యవు ? నీ పేరేమి? నీ తల్లిదండ్రు లెవరు ? కుసుమకోమలివైన నిన్నిట్టు కష్ట పెట్టుచున్న నీ మగఁ డెంత కఠినుఁడోకదాదా? నేనయైనచో నీ వంటి యందకత్తెను బూవులలోఁ బెట్టుకొని కాపాడక పోవుదునా ? యని పలికిన నగ్గరితసిగ్గు విడిచి లేతనవ్వుతో మేము బ్రాహ్మణులము. నా వల్లభుడు మంగళసూత్రమును గట్టుటచే దేహమునకే వల్లభుడు. మనోవల్లభుడు కాడు. పురాకృత మనుభవింపకఁ దీరదుగదా ? నాకును మీవంటిభర్త దొరికిన నెట్టి వేషమైన వేయగలనని పలికినది. ఆ వర్తకుఁడు బోటీ ? స్వకృతముల నిందింపక పూర్వకృతములని ప్రజ్ఞాహీనులు చెప్పుచుందురు. ఇప్పుడు నీవు నా వెంటరమ్ము. నీ పూర్వకృత మేమి చేయునో చూతము. తెలియక దైవముమీదఁ ద్రోయుచుందురు. మందమతులు సుఖపడ నేరకఁ బ్రారబ్ధమని పలుకుదురు. అట్టివాని నే నేమియు విశ్వసింపను. నన్ను నీవుఁ బెండ్లియాడిన రాజభోగములందఁ గలవు. నీ పూర్వకృతమంతయు బటాపంచలై పోఁగలదు. అందులకు సమ్మతింపక పోవుటయే పూర్వకృతమని చెప్పిన నప్పఁడఁతి యిట్లని‌యె.

అందులకు నా కేమియు సందియము లేదు. ఇప్పుడు చెప్పిన మాటలు తరువాత నిలవవు. నీ కిష్టమైన నీ భార్యకిష్టమగునా ? నా కేల యాసఁ జూపెదవు. నీ దారిని నీవు బొమ్మని యుత్తరముఁ జెప్పిస నతండు తలోదరీ ? నా భార్య చని పోయినది. క్రమ్మరఁ బెండ్లియాడుటకుఁ దగిన కన్య నరయుటకే పోయితిని. ఎందునుం దగినయువతి దొరికినది కాదు. ఈ గంగ సాక్షిగానిన్ను భార్యగాఁ గైకొని నీ వలనం గలిగిన సంతతికే నా యైశ్వర్యమంతయు నిచ్చెద. నా వెంట రమ్మని పలికిన నక్కలికి యుబ్బుచు ననుమోదించినది.

అప్పుడా యొప్పులకుప్పను వర్తకుఁడు తన గుఱ్ఱముపైఁ గూర్చుండఁ బెట్టికొని తనదేశంబునకుఁ బోయెను. మర్యాదకులోబడక స్రీలు విజృభించిరేని నాపు వాఁడెవ్వఁడు ? వా రేగినగడియ కెవ్వఁడో వచ్చి రేవులో బిందెనుమాత్రము జూచి యెవ్వతెయో నీటిలోఁబడి మునిఁగినదని కేకలు వైచెను. ఆ కేకలు విని పెక్కండ్రు ప్రోగుపడిరి.. ఎవ్వరెవ్వరని యడలుచు నిండ్లలోనుండి కొందరు పరుగిడివచ్చిరి. బిందె యెవ్వరిదని పరీక్షించి చూడఁ దొడంగిరి. గృహములయం దాడువాండ్రను వెదకుచుఁ జీరుచు గ్రామస్థులందరు తొందరగాఁ దిరుగుచుండిరి. అప్పుడు బ్రజ్ఞావంతుం డింటను భార్యంగానకఁ బరితపించుచు నేటిదరి కరిగి బిందెం జూచి తనేదే యని తెలిసికొని యురముఁ బాదికొనుచుఁ దనభార్య యిందుఁ బడినది వెదకుఁడని యాప్తులతో మొరవెట్టుకొనియెను. కొందరు గెడలఁబూని నీటిలో దిగి వెదకిరి. ఏ జాడయు దొరికినదికాదు.

రత్నమువంటి వాల్గంటి యట్టి నిర్భాగ్యునికిఁ దక్కునా యనువారును వీనితోఁ గాపురము చేయనేరక బలవంతమున నందుఁదిగిన దేమోయను వారును మంచిగుణవంతు రాలనువారును బ్రజలు గుంపులుగాఁ గూడికొని యా చిన్నదానిం గురించి చెప్పుకొనఁ దొడంగిరి. పిమ్మటఁ బ్రజ్ఞావంతుని బంధువులు వచ్చి విరక్తివచనంబు లుపదేశించి శోకము వాయఁజేసిరి. కొన్నిదినములకుఁ బ్రజ్ఞావంతుఁడు మరియొక కన్నెకం బెండ్లియాడెను. ఆ చిన్నది వేగమే కాపురమునకు వచ్చినది. ఆ యిల్లాలు చూలాలై యొకనాఁడు లేకి వచ్చినంతఁ బొరిగింటి యామె వచ్చి అయ్యో ? నీ సవతి బలవన్మరణము నొంది పిశాచమైనది. దాని భయంబున గర్భవతులు యమునకుఁ బోవుటకు వెరచుచున్నారు. పెక్కండ్రంబట్టికొని పీడించుచున్నది. గర్భములు చెడఁ గొట్టుచున్నది. ఇంటఁ బెద్దవారలెవ్వరును లేరు. సోదెకుఁ బోయి యేమి కావలయునో యడిగి మీదుఁ గట్టుము. ఈ జ్వరము గాలిలక్షణముకాని మరియొకటి కాదని చెప్పినది.

ఆ మాట విని రాధిక మేను ఝల్లుమన నీ వన్నమాట నిజమే. మొన్న నెండవేళ నీటికిఁ బోయితిని. అప్పుడేదియో యావేశించినట్లయినది. నా భర్త నా మాట వినిపించుకొనఁడు. ఇరుగువారు పొరుగువారే నాకుఁ దల్లిదండ్రులు. శకునమునకుఁ బొమ్మని చెప్పుడని బ్రతిమాలి కొనినది. అంతలోఁ బ్రజ్ఞావంతుఁడు వీధి నుండి యింటికి వచ్చెను అతనిం జూచి రాధిక వెక్కి వెక్కి యేడువఁ దొడంగినది. ఏమి యేమని యడుగుటయుఁ బొరుగింటియాపె యాతని నాక్షేపించుచు, దొలిచూలు పడుచు నింటికడ నొంటిగా నుంచుట నీకుఁ దగునా ? ఒక్కరితయ మొన్న నీటి కరి గినదట. గాలిసోకి లేకి వచ్చినది. సోదెకుఁ బోయిరక్షరేకుఁ గట్టింపుము లేకున్న గర్భమునకు మోసము రాగలదని చెప్పినది.

అతండు భయపడుచు అత్తా ! నీవు నాకు సహాయము రావలయును. ఇట్టి గొడవ లేమియు నాకుఁ దెలియవని కోరిన నామె యంగీకరించిసది అప్పుడే యీ యిరువురు సోదె చెప్పు దాని యింటికిం ‌ సాంబ్రాణిని పొగవైచి రాధికకు జ్వర మేమిటికి వచ్చెనో పెద్దలో పేరంటాండ్రో కనంబడి కావలసినవాని నడిగి పెట్టించుకొనుడు ఊరక గెర్భిణీ స్త్రీని బాధింపకుడు. అని పలుకుచు నామె శకున మడిగినది. ఆ సోది కత్తెయు నాపె మాటలు గ్రహించి యావేశములో తాను సులోచననియు సవతి యౌన్నత్యము చూడలేక పట్టికొంటిననియు గర్భము చెడగొట్టెద ననియు దనకు దిగతుడువు వెట్టి పుట్టెడు పట్టికి దనపేరు పెట్టినచో దొలుగుదు ననియు నేమేమో వాక్రుచ్చిసది. అప్పుడు ప్రజ్ఞావంతుడు కన్నీరు గార్చుచు దన భార్య నిజముగా వచ్చి యెదుర నిలిచినట్లు భావించుచు దా నా పై విషయమై పడిన దుఃఖమును ప్రకటించుచు గోరినదానికి నిబ్బడిగా నిత్తునని చెప్పి ప్రార్థించెను. దైవజ్ఞము వారికిం జెప్పవలసిన విధు లన్నియు జెప్పినది

ఇంటికి వచ్చి ప్రజ్ఞావంతుడు రాధికతో నా వృత్తాంత మంతయు జెప్పి మీదు గట్టి తీర్పవలసిన క్రియలన్నియు దీర్చెను. దైవికముగా నా రాధిక ప్రసవమైన వెంటనే యా శిశువు సమసినది. అప్పుడు రాధిక మిక్కిలి దుఃఖించుచు సవతిం దిట్టుచు సవతిబంధువుల నెత్తిపొడుచు నవ్విషయమై మగనితో దగవులాడ దొడంగినది. అప్పు డప్పుడు సులోచన రాధిక కావేశమై రాధికను బ్రతకనీయను. నా లోకమునకు దీసికొనిపోయెదనని ప్రేలించుచుండెను. జపములు చేయించి హోమములు గావించి రక్షరేకులు గట్టించి ప్రజ్ఞావంతుడు భార్య విషయమై పెక్కు చిక్కులు పడుచుండెను.

రాధిక కమ్మర గర్భవతియైనది. అప్పుడా ప్రజ్ఞావంతుడు మంత్ర శాస్త్రజ్ఞుల సన్యాసుల బైరాగులు నాశ్రయించి రక్షరేకులు విభూతులు నెన్నియేని బెట్టించెను. చివరకు రాధికకు గర్భస్రావమైనది. సులోచన రాధిక కావేశమై సంతతము విడువక ప్రేలింపుచుండెను. ఎక్కడికి బోయి శకునమడిగినను సులోచనయే గద్దెకు వచ్చి తాను రాధికను బ్రతుకు నీయనని చెప్పుచుండును. రాధికకు నిద్రాహారములు తగ్గినవి. రక్తమాంసములు కృశించినవి. అవయవము లన్నియు రక్షరేకులతో నిండియున్నవి తుద కెక్కడనో సోదెలో సులోచన గనంబడి సేతుస్నానము జేసినంగాని విడువనని చెప్పినది. ఆ మాట విని ప్రజ్ఞావంతుండు కొంతసొమ్మప్పు దీసికొని భార్యతో గూడ సేతు యాత్రలకు బయలుదేరి పోవుచు నొకనాడు సాయంకాలమునకుఁ గుంభకోణము జేరెను. ఆ రాత్రి సత్రములో భుజించి పండుకొనిరి. దొంగ లెవ్వరో వారి మూట దొంగిలించుకొని పోయిరి‌. మరునాఁడు లేచి చూచుకొని ప్రజ్ఞావంతుండు తన యవస్థ యంతయుం దలంచుకొని దుఃఖించుచు నందున్న వారితోఁ జెప్పికొనియెను. ఈ యూరవిత్తకర్మయగు వర్తకుఁడు గలఁడు. అతఁడు మిగుల ధర్మాత్ముఁడు. యాత్రాపరులకు ధనసహాయముఁ జేయుచుండును. అతని భార్య గడుఁ దయావతి. వారియొద్దకుఁ బోయి నీయిక్కట్టు చెప్పుకొనుము. రామేశ్వరమునకు రాకపోకలకైన సొమ్మియ్యఁ గలడని కొంద రతని కుపదేశించిరి.

అప్పుడు ప్రజ్ఞావంతుఁడు తన భార్యను వెంటఁ బెట్టుకొని యా భాగ్యవంతుని యింటికరిగెను. అతని యిల్లు దేవేంద్ర భవనమువలె నొప్పుచున్నది. చావడిలోఁ దాను గూర్చుండి పెరటిదారిని భార్యను లోనికిఁబంపి యావర్తకుని భార్యతో మన యవస్థఁ దెలిపి సహాయము చేయుమని యడుగుమని చెప్పెను.

రాధికయు మెల్లన లోనికిఁబోయి అమ్మగారెక్కడ నున్నారని పరిజనుల నడుగుటయు మేడక్రింద గదిలో భర్తతో నేదియో నంభాషించు చున్నదని చెప్పిరి అల్లన నాగది ప్రాంతమునకుఁ బోయినది. రాధికకు జిన్నఁ మెత్తయిన బంగారము లేదు. పాదములకును దండలకు మెడకును వ్రేళ్ళకును రాగి రేకులును రక్షరేకులును తాటియాకు చుట్టలును తాయెత్తులును విస్తారముగా నున్నవి. ఆమె వేషముఁ జూచి వర్తకునిపత్ని వెరగు పడుచు దాపునకుఁబిలిచి అమ్మా! నీ వెవ్వతవు? ఇక్కడి కేమిటికి వచ్చితివి. మేనంతయు రక్ష రేకులు కట్టికొంటివేల? నీ వృత్తాంతముఁ జెప్పుమని యడిగిన రాధిక యిట్లనియె.

తల్లీ ! మాది యుత్తరదేశము పుంజికయను నగ్రహారము మా కాపురము. నా భర్తకు నేను ద్వితీయ భార్యను. సులోచనయని నాసవతి యమునలోఁ బడిమృతినొంది పిశాచమై నన్ను మిగుల ‌ బాధించుచున్నది. రెండు కానుపులు మాపినది. అన్న మరుగ నీయదు. నిద్ర పోనీయదు. మాసొమ్మంతయు మాంత్రికులకును దాంత్రికులకును సరిపోయినది. చివరకు రామేశ్వరమున కరిగి సేతుస్నానముఁ జేసెనేని విడిచి పోవుదునని మొన్న నొకసోదెలో గనంబడి చెప్పినది. అందులకై రుణము చేసి యా యాత్రకుఁ బోవుచున్నారము. నిన్నరాత్రి సత్రములో మా మూట దొంగలెత్తుకొని పోయిరి. చేతఁ గాసైనలేదు. మీరు కడుపుణ్యాత్ములని వింటిమి. మమ్ము రామేశ్వరముఁ బంపిరేని మీకుకోటియజ్ఞములు చేసిన సుకృతమును బొందుదురు. పేదవాండ్రకుఁ జేసిన సహాయము కోటిగుణితము. ఇన్నియోషధులు ధరించినను పిశాచబాధ తగ్గినది కాదు. మమ్ము రక్షింపుఁడని యనేక స్తోత్రములు చేసినది.

ఆ వర్తకుని భార్య పక్కున నవ్వుచు భర్తంజేరి యీ వింతత వింటిరా? ఏ3 బ్టుకా 'సెయెట్లు పీడించుచున్న డిం మో చూచితి:-] యని నటి ఆ ంార్తటని రావ వర్తకండు వతకతో నీ నర్ట యెందున్నవాఁడు? ఇటకుఁ దీసికొని రమ్మని చెప్పెను. రాధిక పోయి ప్రజ్ఞావంతు నచ్చటికిఁ దీసికొని వచ్చెను. ఆ వర్తకుఁడు దంపతుల పీఠములపైఁ గూర్చుండ నియోగించెను. వర్తకుఁడడుగఁ బ్రజ్ఞావంతుండు తన వృత్తాంత మంతయు నెరింగించెను. అప్పుడు వర్తకునిభార్య నగలన్ని‌యుఁ దీసివైచి ప్రజ్ఞావంతు నెదుటకు వచ్చి నమస్కరింపుచు నే నెవ్వతెనో యెరుఁగుదురా? యని యడుగుటయు నా బ్రాహ్మణుఁ డెగదిగాఁజూచి తెల్లతెల్ల పోవుచు నేమియుం బలుకుటకు మాటరాక దిక్కులు చూచు చుండెను.

అప్పుడు వర్తకుఁడు బ్రాహ్మణుఁడా! వెరవకుము. ఎరింగినఁ జెప్పుము తప్పులేదు. అని పలికిన విని ప్రజ్ఞావంతుఁడు ఈమె నా భార్య సులోచనలాగే యున్నదని జడియుచుఁ జెప్పెను. వర్తకుఁడు నవ్వుచు సులోచనయా? సులోచన లాగున్నదియా? చెప్పుమని తర్కించి మరిమరి యడిగిన సులోచనయే యని మెల్లగాఁ జెప్పెను.

సరిసరి. మంచివాడవే. మాటవరసకుఁ జూడుమనిన నీ భార్యయేయని చెప్పుచున్నావే. నీ భార్య పిశాచమైనదికాదా? ఇక్కడికెట్లు వచ్చినదని యడిగినఁ బ్రజ్ఞావంతుఁ డేమియు మాటాడ నేరక భ్రాంతుండై చూచుచుండెను. అప్పుడామె బ్రాహ్మణుఁడా? నేను నీ భార్య సులోచననే. లలాటలిఖిత దోషంబున నా వర్తకుఁడు దారిం బోవుచు రేవులోఁ దారసిల్లుటయు వెంటంబడి వచ్చితిని. నే నిట్టియైశ్వర్య మనుభవించు చున్నను మనసున నాకళంకము భాధించుచునే యున్నది. ప్రారబ్ధమెంత వారి కిని ననుభవింపక తీరదు మీరు కనంబడిరి చాలా సంతోష మైనది. నన్ను నరకమునకుఁ బోవకుండ దీవింపుఁడు. మీకుఁ గావలసినంత ద్రవ్య మిప్పించెదసు. ఈమెకు శరీరమున బుట్టనరోగమును బిశాచమనియుఁ బ్రయోగమనియు భ్రాంతిపడి వెర్రిచికిత్సలం జేయచున్నావు. సోదెకత్తెయలు వచ్చిన వారి యభిప్రాయముల ననుసరించి చెప్పుచుందురు. నేనును బ్రతికి యుంటిగదా యీమె నెట్లు పట్టుకొంటివి? ఇప్పటికైన నీ భ్రాంతి వదిలినదియా? పుడమి నాడు వాండ్ర కందరికి నీ వెర్రియున్నది. నిజానిజంబులు విమర్శింపక వీరు ప్రయోగము సేసిరనియు వాండ్రు దయ్యములై బాధించుచుండిరనియు నిందించుచు నూరక వాచాదోషముల పాలగుచుందురు. ఇఁక మీ రెక్కడికిని బోవలదు. ఇక్కడనే యుండుఁడు. మీ భార్యకు మందు లిప్పించి రోగము మానిపింపఁ జేసెదనని తన వృత్తాంత మంతయుంజెప్పినది. ప్రజ్ఞావంతుఁడు విభ్రాంతుఁడై చూచుచుండెను. రాధికయు విస్మయముఁ జెందుచు అక్కా! నిన్ను నిందించినందులకు నాతప్పు మన్నింపుము. ఎక్కడికిఁ బోయినను నీ సవతి బాధించుచున్నదనియే చెప్పు చుండువారు. ఇసిరో పిశాచ మనునదిలేదు కాబోలు? భ్రాంతియే యట్లు బాధించుచున్నదియా యని పలికినది. అప్పుడు విత్తవర్మ ప్రజ్ఞావంతునికి నపరాధముఁ జెప్పుకొని యొకదివ్య సౌధము వసింప నిచ్చెను. రాధికకు భ్రాంతి వదలినంతఁబది దినములకే యారోగమంతయు వదలినది భార్యమూలమునఁ బ్రజ్ఞావంతుఁడును రాధికయు రాజబోగము లనుభవింపుచుండిరి. కావునఁబిశాచ భ్రాంతి మనోజన్యముఁ దృఢచిత్తుని బాధింప నేరదు అ తేజము పిశాచముకాదు. మీకు వెరపు గలిగినఁ బండుకొనుఁడు. నేనుఁ గాచికొని యుండెదను. అనిచెప్పి వాండ్రు నిద్రించుచుండ రాజపుత్రుండు ఖడ్గపాణియై యా తేజముగురించి వితర్కించుచు మేల్కొనియుండెను అంతలోఁ దెల్లవారినది అప్పుడు బోజుం డాతేజము గనంబడిన కొమ్మ దాపునకుం బోయి విమర్శించి చూచెను. జటాపటలపరివేష్టి శిరస్కుండై యొక కొమ్మనంటి తలక్రిందుగాఁ దపము జేయుచున్న యొక తపస్వి యతనికిఁ గన్నులపండువఁ గావించెను. కర కమలంబులు జోడించి నమస్కరింపుచు నోహో? తపఃప్రభావంబున నీ తాపసోత్తముని దేహంబున దివ్యతేజంబు బయలు వెడలినది. ఈ తేజంబుఁ జూచి మత్కింకరులు కొఱవిదయ్యములని శంకించుకొనిరి. ఈ ముముక్షువు నాతో మాట్టాడి న నావంటియుత్తముఁ డెందును లేడు నేను మిగుల ధన్యుఁడనని తలంచుచున్నంతలో నాజటివరుండు కన్నులం దెరచి యంతర్దృష్టి మాని యందు నిలువంబడి యెదుర వినమ్రుఁడై యున్న బోజకుమారుం జూచి యోహో? నీవెవ్వఁడవు. ఈ దుర్గమ కాలతారమున కేల వచ్చితివి? నీ వృత్తాంతం మెరింగింపుమని యడిగిన బోజుం డిట్లనియె.

మహాత్మా ! నేను ధారానగరాధీశ్వరుండైన సింధులభూపాలుని కుమారుండ. నాపేరు బోజుఁ డందురు. నా బాల్యంబున మా రాజ్యంబు మాతండ్రి ముంజుఁడను తన తమ్ముని యధీనముఁ జేసి స్వర్గస్థుం డయ్యెను. మా పినతండ్రి రాజ్యలోభంబున నన్ను జంపుమని యడవికిఁ బుత్తెంచెను. సదయహృదయులై కింకరులు నన్నుఁ జంపక యెక్కడికేని బోయి బ్రతుకుమని విడిచివైచిరి. జీవులకు జీవితాశకన్నా ప్రియమైనది మరియొకటి లేదుగదా? నేను నగరము విడిచి ప్రాణభయంబున నెందేనిం బారి పోవుచు మార్గముఁ దప్పి యీమహారణ్యములలోఁ బడితిని. ఒకొక్కప్పుడు కీడు మేలునకే కారణమగునని చెప్పిన యార్యోక్తి సత్యమైన దగును. మా పిన తండ్రి కావించిన యపకారము నా కుపకారమైనది. ఇందు దేవర దర్శనమైనది. నా పురా కృత దురితములన్నియు బటాపంచలైనవి. సుకృతములు ఫలించినవి. ఏఁ నిఁక నెక్కడికిం బోఁజాలను. మీ పాదముల నాశ్రయించుకొని యుండెదను. ముక్తి మార్గముపదేశింపుము. ----------- మహర్షులవలె వృక్షశాఖ నవలంబించి తపముఁ జేయుచున్నమీ నామాక్షరముల వినఁ గుతూహలమగుచున్నది. గోప్యము -----యెరిగింపుడని యత్యంత వినయ భయభక్తులతో నడిగిన నాజడధారి యిట్లనియె.

రాజపుత్రా ! నీ యాకార చిహ్నంబులు నీ సుగుణ గౌరవములఁ ------------------- చెప్పినట్లు నీవు మహావైభవముతోఁ బుడమి బాలింపగలవు. నీకుఁ దపంబున కిది యవసరముగాదు. నాపేరు సర్పటి యండ్రు. మోక్షేచ్చ నిందుఁ దపం బొనరించుచున్నాఁడ. నాకు నీయం దనుగ్రహము గలిగినది. నీ వినయమునకు మెచ్చుకొంటిని. నీకు ధూమవేదియను “సిద్ధి” నుపదేశింతు. నొక యోషధి దీపము పై వైచితివేని యా వెలుగు తగిలిన లోహంబు లన్నియుఁ గాంచనములగును. మరియు నీ సిద్ధివలన లోకవిఖ్యాతి వడయుదువు అని పలుకుచు నా సిద్ద ప్రపరుండా సిద్ధి నతని కుపదేశించి తపఃప్రభావసంజనితములై న పదార్థములచే భోజుం దృప్తుం జేసి పొమ్మని యానతిచ్చి యత్తాపనుండు వెండియుఁ దపంబు జేయఁ దొండగెను.

భోజుండును గ్రమ్మర భూజము మూలమున కరుదెంచి యత్తేజమ్మొక మోషధీ విశేష మని కింకరుల కెరింగించి తురగారూఢుండై వారితోఁగూడ బయలు వెడలి వడిగాఁబోవుచు నా సిద్ధివలన లోకంబున దరిద్రులు లేకుండఁ జేయుదునని సంకల్పించుంచుండెను. అట్లు గొంతదూరము పోయి మార్గాన్వేషణము గావింపుచున్న సమయంబున నొకకొండ దాపున మమ్మీయడవివాండ్రు చంపుచున్నారు. పుణ్యాత్ము లెవరైన వచ్చి రక్షింపరే ? యని యొక యార్తనాదము వినంబడినది. ఆ ధ్వని విని భోజకుమారుండ తిరయంబున హయంబు నా దెసకు నడిపించుచుఁ గింకరులతోఁ గూడ ముహూర్తకాలములో నావిపన్నుల యొద్ద కరిగెను.

అందొక కొండదేవత గుడి యెదుటనొక పురుషుని స్త్రీని మెడకు నింబ పల్లవములఁ గట్టి బలి యిచ్చుటకుఁ గొండవాండ్రు ప్రయత్నించుచుండిరి. పురుషుఁడు గిలగిలఁ గొట్టుకొనుచుఁ గేకలు వైచుచుండెను. స్త్రీ దుర్గకు సాష్టాంగ మొరిఁగి మోడ్పు చేతులతో వివశయై పడియుండెను. అట్టి సమయమున నాయుధహస్తులై యరుదెంచిన యా వీరపురుషుల మువ్వురం గాంచి యయ్యాటవికులు వెఱచి తలయొక దెసకుం బారిపోయిరి. అప్పుడు భోజకుమారుండు. కింకరులచే నా పురుషుని కట్లు విప్పించి యోయీ ? మీ రెవ్వరు? ఈ మహారణ్యమున కేమిటికి వచ్చితిరి ? అ చిన్నది నీకేమి గావలయును ? మీ వృత్తాంతముఁ జెప్పుమని యడిగిని నతండు నిటలతటఘటితాంజలి పుటుండై యిట్లనియె.

మహాత్మా ! మీరు శమనలోకాతిధులమైన మమ్ము వెనుకకు లాగికొని వచ్చితిరి. ప్రాణదానముఁ గావించిరి. నా కాపురము ధారానగరము. నేనొక వర్తకుఁడను. నా చిన్నది యెవ్వతియో నాకుఁ దెలియదు. రాచకుమార్తెయని యూహించుచున్నాను. పురుషవేషమువైచికొని యశ్వారూఢయై యెక్కడికో పోవుచు మార్గమధ్యమునఁ జోరులఁ బెక్కండ్రఁ బరిమార్చి నా యిక్కట్లఁ బాపినది. నేనామెను బురుషుఁడనియె తలంచితిని. ఇరువురము గలసి వచ్చుచున్నప్పుడామె మా నగరప్రభువగు భోజకుమారుని వృత్తాంత మడుగుచు నాయన పినతండ్రిచేఁ జంపఁబడెనను వార్తవిని మిక్కిలి పరితపించనది. ఆయన కెద్దియో బంధుత్వము గలిగి యున్నదని తలంపవచ్చును. ఒక పల్లెలో నామె గుఱ్ఱమును దొంగలు తీసికొనిపోయిరి. అప్పుడు మేము పాదచారులమై పోవుచుండఁ గొండవాండ్రు కొందరడ్డమై మమ్ము బెదరించిరి. వారి నెల్లన్ నీ వారి జాక్షికౌక్షేయకదార కాహుతిఁ గావించినది.

అప్పుడీయడవివాండ్రెల్ల నాలోచించికొని మాకూ దెలియకుండ వెను వెంట వచ్చి యామె చేతనున్న కత్తిలాగికొనిరి. పిమ్మట నూర్గురు వచ్చి ముట్టడించి మమ్ముఁ బట్టికొని కట్టి యీ కొండదేవతకు బలియిచ్చుటకుఁ దీసికొనివచ్చిరి. అప్పుడీమె యాఁడదని తెలిసినది. ఈమె చేత గటారియే యున్నచో నెందరు వచ్చినను లక్ష్య పెట్టకపోవునని తమ వృత్తాంత మంతయు నా వర్తకుఁ డెరిఁగించెను.

ఆ వృత్తాంతము విని భోజుం డాశ్చర్యమందుచు నయ్యిందువదన గట్టిన చీరను విలోకింపుచున్నంత నక్కాంతారత్నము కన్నులు మూసికొని హా! భోజనరేంద్రా ? నేనుగూడ వచ్చి యింద్ర లోకములో నిన్నుఁ గలసికొనియెద. నన్నుఁ గురించి యించుకఁ దాళుము. అని పలవరించుటయు నతండు నౌరా ! ఇత్తలోదరి నన్నిట్లు స్మరించుటకుఁ గతఁబేమొకో ? నా పరిచయ మెచ్చట గలిగినది. తలంచికొన నెన్నఁడును నీ యన్ను మిన్నం గన్నది విన్నదియుఁ గూడ జ్ఞాపకము లేదు. ఈమె వలననే నిజముగాఁ దెలిసికొనియెదంగాక యని నిశ్చయించి యామెం బ్రబోధింపుమని యా వర్తకుని నియమించెను.

రత్న పాలుండు అమ్మా ! లెమ్ము లెమ్ము మనయిక్కట్టు లన్నియు నీ పుణ్యాత్ముడు వచ్చి విచ్చిన్నముఁ గావించెను. శత్రువులు కాందిశీకులైరని లేపిన నాపికవాణి యల్లన లేచి యెదురు నవమదనుండో యననొప్పుచున్న భోజకుమారుం గాంచి లజ్జభయ సంభ్రమములతో నించుకతొలగి తల వంచుకొనియీతం డెవ్వఁడొకో యని యాలోచించు చున్న సమయంబున బోజుం నిట్లనియె

సాధ్వీ ! నీతల్లిదండ్రు లెవ్వరు? నీ పేరేమి? ఎందుబోవుచుంటివి ? బోజుని స్మరించితి వతఁడు నీ కేమికావలయును? నీ వృత్తాంత మెరింగించి మా సందియములఁ బోకార్చుమని పలికిన నక్కలికి యొక్కింత చింతించియపాంగవిలోకనముల నతనిం జూచుచు నతనిరూప మెప్పుడో చూచినట్లు తలంచుచు నిట్లనియె

మహాత్మా ! ఆపత్కాలంబున వచ్చి ప్రాణదానముఁ గావించిన నీ వంటి యాప్తుండు మా కెవ్వరును లేరు నీ యొద్ద నిక్కము దాచిన పాతకము గదా? నేను బాహ్లీకుఁని కూఁతుర నా పేరు లీలావతి యండ్రు. మా తండ్రి నాకు వివాహ ప్రయత్నముఁ జేయుచుఁ బుడమియందు సుందరమునఁ బేరు పొందిన నృపనందుల చిత్ర ఫలకము లన్నియుఁ దెప్పించి నాకుఁ జూపెను. ఎవ్వరిని వరింపక నేను ధారానగరా ధీశ్వరుండగు బోజుకుమారుని వరించితిని. మా తండ్రి న న్నానరదాధనందనున కిచ్చి వివాహముఁ జేయుటకు నిశ్చయించి శభలేఖలు వ్రాయునంతలో నాయన పిన తండ్రి రాజ్యలోభంబున నతనిం జంపించెనని వార్తవచ్చినది. అప్పుడు మా తండ్రి మరియొక రాచపట్టి కిచ్చుటకు నిశ్చయించెను. నా వార్త విని నేనొరు లెరుఁగకుండఁ బురుష వేషముతో బురముదాటిఁ తురగ యానంబున బయలుదేరి వచ్చితిని. మనోహరుండు స్వర్గస్థుఁ డయ్యెనని యెరింగినను నా మనం బాపురి కరుగుటకు లాగికొని వచ్చినది. నా సంకల్పముఁ దలంచికొనిన నాకే వింత యగుచున్నది. ఈ వర్తకుఁడు చెప్పిన మాటల వినుటచే నతండు బ్రతికియున్నాడేయో యనునాస జనించినది. మార్గము దప్పి మేమీ యరణ్యములోఁ బడితిమి. ఆటవికులఁ గొందరఁ జంపుటచేఁ బగఁ బూని పెక్కండ్రు వచ్చి మమ్మమ్మవారికి బలి యియ్య నిశ్చయించిరి. ఇంతలో దేవర వచ్చి విడిపించితిరి. ఇమ్మహారణ్య మధ్యమునకు హటాత్తుగా నరుదెంచి మాకుఁ బ్రాణము లొసంగిన దేవర కులశీల నామంబులు వినఁగోరుచుంటిమి. మీ బేరు రతనంపు పేరు వలె సంతతయు నెడఁద నిడుకొని యానందింతుమని యుక్త యుక్తముగాఁ బలికిన విని బోజుండు, ఆహా ! యేమి యీ వింత? నా చిత్రపట మీ కలికి తండ్రియొద్ద కనిపినవా రెవ్వరు ? బుద్ధి సాగరుఁడు కావలయును. అన్నన్నా ! ఈ చిన్నది యెంత సాహసముఁ జేసినది. నా నిమిత్తమెట్టి చిక్కులంబడినది. బళిరా! దైవనియోగము. ఈ యోషామణిని బట్టమహిషినిగా జేసికొననేని నరకముపాలై పోవకుందునా ? ఇట్టి పతివ్రత భార్యయయ్యెనేని మదీయ వంశ మంతయుఁ బవిత్రమగునని తలంచుచు నతండు మరియు నిట్లనియె.

తరుణీ ! మా కాపురము ధారాపురమే. భోజకుమారుని వార్త నేనును విని యుంటిని. పినతండ్రిచేఁ జంపింపఁబడెనని చెప్పుకొనిరి. అట్టి వానిం బెండ్లి యాడక మాటలచే నిశ్చయింపఁబడిన నీకు మరియొకనిం బెండ్లి యాడుట దోషము కాదు. మీ తండ్రిమాట యతిక్రమించి వచ్చుటయే దోషము అని చెప్పిన విని యప్పడఁతి యిట్లనియె.

ఆర్యా ? మనోవాక్కాయ కర్మంబులలో మనస్సే ప్రధానమని పెద్దలు చెప్పుదురు. మనసుచే నిశ్చయింపఁబడిన వరుని విడిచి మరియొకనిం బెండ్లి యాడుట తప్పని సావిత్రి చరిత్రమే చెప్పుచున్నది. మీది ధారానగరమంటిరి. బోజకుమారుండు నిక్కముగాఁ జంపఁబడెనా ? ప్రధానులు వరొక తెరవేదియు నాలోచింపలేదా ? అతం డట్టి యక్రమ కార్యముఁ జేయుచుండ సామంతులేల యూరకొనిరి ? పిమ్మట నా ముంజుండు పశ్చాత్తాపముఁ జెందెనని వింటిమే? తరువాత నేమి జరిగినదియో మీకుఁ దెలియదా ? యని యడిగిన నతండు చిరునగవుతో నేను మొదటి వార్త మాత్రమే వింటిని. పిమ్మట నేమయ్యెనో నాకుఁ దెలియదు. కృత కార్యానంతరము పశ్చాత్తాపము వలనం బ్రయోజన మేమి? యని యుత్తర మిచ్చెను. అప్పుడా వర్తకుఁడు అయ్యా ! తమ కాపురము ధారానగరమా ? మీ పేరేమిటి ? ఎవ్వని కుమారులు ? ఎక్కడికిఁ బోవుచున్నారని యడిగిన నతండు వినిపించుకొనక వేరెద్దియో ప్రస్తావముఁ దెచ్చెను. అప్పుడు లీలావతి వర్త కుఁడా ! వారి యబిఖ్య దాచినను నభిఖ్య దాగదుగదా ? ఎవరైన మనకేమి ? మన ప్రాణములఁ గాపాడిరి కావున మనకుఁ బ్రాణబంధువులు. మ‌న మాయనకు సేవకులము. వారెక్కడికిఁ బోయిన మన మక్కడికిఁ బోవుదుము. ఆయనకు మనల నొకదారికిఁ జేర్పక తీరదు అని యతఁడే బోజకుమారుడని నిశ్చయించి యా సుందరి వాక్రుచ్చినది.

అవ్విషయ మతండు గ్రహించి రత్నపాలా ! మనము సాయంతనము కాకమున్న యీ యడవిదాటి పోవలయును. ఇత్తరుణికిఁ దురగమెక్కు పాటవము గలదుగదా ? మనము మగవారము నడువఁ గలము నా గుఱ్ఱము నీమె నెక్కుమనుమని పలికిన నక్కలికి యందుల కియ్యకొనినదికాదు. అందరు పాదచారులై పోవఁ దొడంగిరి. కింకరుడొకడు గుఱ్ఱమును వెంటఁ దీసికొని వచ్చుచుండెను. సాయంకాలము కాకమున్న వెనుకటిపల్లి కరిగిరి అందలివారు వీరింగాంచి తమ్ముబఁట్టు కొనుటకై వచ్చిరని తలంచి యూరువిడిచి పారిపోయిరి. లీలావతియెక్కి వచ్చిన వెక్కిరింత యందేయున్నది. ఆ రేయి వారందు వసించిరి. మరునాడుదయ కాలంబున బోజుం డయ్యం బోజముఖితో బోటీ ! మేము వేరొక చోటికిఁ బోవుచుంటిమి. నీ వీ గుఱ్ఱమెక్కి మీ పుట్టినింటి కరుగుము. తోడు పంపెద నన నవ్వనిత వినతాననయై జనమనోహరా ! శరణాగతుల విడిచిపోవుట యుచితమా ? పుట్టినింటి కరుగుదాన నైతినేని దొలుతనే యిల్లు వెడలక పోవుదును, నాకు మీతోడిదగతి. మిమ్మే భగవంతునిగాఁ జూచుకొందు. కపటము విడిచి మాట్లాడుడని కోరినది. అతఁడు నవ్వుచుఁ బువ్వుబోణీ ! నీ మాటలు వింతలుగా నున్నవి. చలచిత్తురాలవా యేమి? బోజకుమారుని గురించి బయలుదేరితినని చెప్పితివి ఇప్పుడు నీ వేగతియని నాతోఁ బలికితి వేమిటికి? స్త్రీ చాపల్య మిదియేనా? అని యెక సక్కెము లాడెను. అ య్యువతి దేవా! మీరు ధారానగర వాస్తవ్యులుగదా ? మీకును వారికిని సంబంధము గలిగి యుండకపోదు. మీరే వారని తలంచి యనుసరించి తిరుగుచుంటినని యేమేమో యుపన్యసించెను. ఆ సతీమణి యుక్తివచనములకు సంతసించుచు బోజుండు అంబోజముఖీ? నీవు నా నిమిత్తముఁ గడునిడుమలఁ గుడిచితివి. ఇఁక నిన్ను బరితపింపఁ జేయుట పాడిగాదు. నేనే బోజుండ నీవు గ్రహించి యుంటివని తెలిసికొంటి. నిన్నుఁ బట్టమహిషిగా స్వీకరింతు. నీ విప్పు డింటికిఁ బొమ్ము. నేను మా మేనమామగారి యింటి కరుగుచుంటినని చెప్పినఁ యొక సన్యాసి మా తల్లితోఁ జెప్పుచుండ వింటిని. అట్టి లక్షణములన్నియు మీ యందుఁ గలిగి యన్నవని లోకులవలన నెరింగి మీరు నాకు భర్త లగుదురని నిశ్చయముతో మా తండ్రి నిశ్చయించిన వరుని నిరసించి యిల్లు వెడలి వచ్చితిని. మంత్రులు మిమ్మెట్లో దాటింతురని‌ నాకు ధృడమైన నమ్మకము గలిగియున్నది. అందులకే భువనేశ్వరీదేవి యరణ్యమున కరుగుటకు. నిశ్చయించుకొంటి. నేటికి నా నోములు పూర్తి యయినవి. తపంబు పలియించినది. మిమ్ము విడచి యిక యరనిమిషము మరియొకచోట వసియింపను. నన్నుఁగూడ మీ తోడ దీసికొనిపొండు. అని కోరికొనుటయు నతం డంగీకరించెను. ఇరువురు చెరియొక గుఱ్ఱమెక్కి. పరిజనులతో గూడ నలకాపురాధిముఖులై యరిగిరి.

అని మణిసిద్ధుండు వెండియు నిట్లు చెప్పఁ దొడంగెను.

తొంబది యైదవ మజిలీ

చంద్రముఖి కథ

అమ్మా ! అదికలకాదు. నిక్కువమె. నా కన్నులార నా సన్యాసిం గంటి. వాఁడు నాఁడు మనయింటికి భిక్షకు‌ వచ్చి నన్నుఁ బెండ్లి యాడుమని కోరిన నీచుఁడే. నేను భటులచేఁ ద్రోయించితి‌నని యప్పు డుగ్గడించెను. ఆ పాపుఁడు నన్ను నిర్భందించుచుండ నెప్వఁడో పుణ్యాత్ముఁ డొకఁడు విగ్రహము చాటుననుండి వచ్చి క‌త్తిచే వాని కుత్తిక నరికివైచెను. ఆ సుందరుని మోము చందమామ యనియె భ్రమఁ జెందితిని. అప్పు డెవ్వఁడో వేల్పువచ్చి నీ కేమి కావలయునని యడిగిన నా సేమముకోరి మీకన్నెమిన్న నింటికిఁ బంపుమని యతండు ప్రార్థించెను. కన్ను దెఱచిచూడ మనయింటిలో నుంటి. ఇంతయు రెండు గడియలలో జరిగినది. నన్ను రక్షించువాని మొగము చిత్త రువు వ్రాయఁగలను. వాని‌ పోలిక యంతయు మనంబునం బట్టియున్నది. అని కేయూరపురంబునఁ జిత్రాంగదుని కూఁతురు చంద్రముఖి యను చిన్నది ముచ్చటించుటయు దల్లి యిట్ల నియె‌ పుత్రీ ! నీ వింత ----దాన వేమే ? కొన్ని కలలు యదార్దముగా జరిగి‌నట్లే యుండును. కలలోఁ జూచిన వారిని చిత్రపటంబున వ్రాయవచ్చును. అదియొక' యక్కజముకాదు. స్వప్నఫలమును గురించి విచారింపవలసియున్నది. కలలోఁ బరివ్రాజకుండు కనంబడ రాదండ్రు. ఎట్ల యిన నెవ్వరోవచ్చి విడిపించిరని చెప్పితివి కావునఁ జివురకు మంచదియే అని చెప్పి‌నఁ దల్లి నాక్షేపించుచు జంద్రముఖి అమ్మా ! నిజముగా జరిగినదని చెప్పుచుండ ఫలము‌ లాలోచించెద వేమిటికి ? నే నా గుడిలోఁ జూచిన వాని వెదకి తెప్పించెదవేని వానిఁ బెండ్లి యాడెద. లేకున్న నిట్లెయుండెదనని పలికినది.

ఆమె నవ్వుచు నీ మాట వినినంత బాణునికూఁతురు ఉషాకన్య జ్ఞాపకము