కాశీమజిలీకథలు/ఆరవ భాగము/63వ మజిలీ

వికీసోర్స్ నుండి

అని యెరింగించు వరకు వేళ యతిక్రమించుటయు మణిసిద్ధుం డవ్వలి కథ తదనంతరా వనిధంబున నిట్లని చెప్పఁదొడంగెను.

అరువది మూడవ మజిలీ.

ఆహా ! ఈజగంబెంత మోహక్రాంతమై యున్నదో ? భగవంతు డైంద్రజాలికుండై తృణము మేరువునుగాను మేరువును తృణముగాను జేయుచుండును. అది యెరుంగక జనుండు స్వతంత్రుండువోలె నెల్ల కార్యములకుఁ బూనుకొను చుండును. అంతకన్న యవివేకము లేదు. వచ్చునది వలదన్నను రాకమానదు రానిది యెంతప్రయత్నముఁ జేసినను రానేరదు. అట్టి నిశ్చయముగలవానికి విచారము గలుగదు. వగపు బొడమదు దుఃఖము జనింపదు. అది లేకయేకదా నే నిన్నిదినములు పడరానియిడుముల బడుచుంటిని. నా రాజ్యం బన్యాధీనముకానిధి నారూపించియుండ నే నాపగలనా ? అక్కటా ! సంపద్విహీనునిఁ జూచి మిత్రులును జులకనగాఁ జూతురు గదా? రాజ్యనష్టానంతరమున సహాయులగుదురను తలంపుతో నాప్తులని నమ్మి నిజం బెరింగించిన యాభూపతు నెంత దేలికగా మాటాడిరి. కానిమ్ము. అప్పుడే నా రాజ్యము పోయినదాయేమి ? స్వయం ప్రభాదేవి యాలయములోని యతీశ్వరుఁ డభయ ప్రదాన మిచ్చియుండలేదా? అనుడి యేలఁదప్పును. అని తలంచుచు నింద్రమిత్రుఁ డొకనాఁడు సాయంకాల మశ్వారూఢుండై రత్నగిరి ప్రాంతము మీఁదుగాఁ దన పట్టణమునకు వచ్చుచుండెను.

అప్పు డిరువురుదూత లమాత్య ప్రేషితులై వడివడి పరువిడి వచ్చుచు నా రాజమార్తాండుని జోహారుచేసి దేవా ! ఆరత్నహారము రాజపుత్రికమెడలో వచ్చి చేరినది. అమాత్యులు మీకిట్లు విన్నపము సేయుమని రని చెప్పినతోడనే యా భూపతి యపరిమితా నందముతో గుఱ్ఱము డిగ్గనురికి యెట్టెటూ ! మరలఁ జెప్పుడు. మీరన్నమాట సత్యమగుంగాకయని యడిగిన నా కింకరు లిట్లనిరి. రేడా ! మేము దేవరయానతి దేశములెల్ల దిరిగి తిరిగి పురముల కరిగి యరిగి పల్లెలు చుచిచూచి తెరవుల నరసి యరసి యొకనాఁడు జాడలమీద నుజ్జయినిలో నా గణికల నిరువురం బట్టుకొని యామండన మిమ్మని యడిగితిమి. వారిహార మప్పుడే మమ్మతిమని బొంకిరి. ఆమాటలఁ బాటింపక సంకెలలువైచి యాపంకజముఖుల నిరువురను మనవీటికిఁ దీపికొని వచ్చితిమి. స్వామీ అది యేమి మాయయో తెలియదు. మేమెంత బ్రతిమిలాడినను మందలించినను కొట్టినను యాగుట్టు సెప్పక యెట్లుతెచ్చిరో తెలియదు అమండనము భర్తృదారికకిచ్చి వేసిరి. రాచపట్టి వలన ముట్టినట్లు యుత్తరముఁ దీసికొనివచ్చిరి. ఆమె వారిందండింప వలదనికూడ వ్రాసినదట, ఇదిగో యాపత్రికయనిరేని చేతికిచ్చిరి. దానిం జదువుకొని యాభూభర్త యుబ్బుచు నోహో ! ఆ మహానుభావుండు సెప్పినట్లు జరిగినది. తత్ప్రభావ మంచిత్యముగదా ! ప్రాంతమునకు వచ్చితిమి గావున నాయోగిపుంగవుని గాంచి నమస్కరించి కృతజ్ఞతఁ జూపికొంటయ కర్జము అని నిశ్చయించి వారి జాడ నరసిరమ్మని యా కింకరుల నంపెను. వారు పోయివచ్చి దేవా ? అయ్యోగి యోగినితోఁగూడ మంటపముపైఁ గూర్చుండి జపముఁ జేసికొనుచున్నాఁడు. తమరాక నివేందించిన సంతోషముతో రావచ్చునని సెలవిచ్చినాఁడు అనిచెప్పిన నప్పుడమిరేఁడు పాదచారియై వినీతవేషముతో నొక్క రుఁడ యక్కడకుఁజని యతని పాదములకు నమస్కరించెను.

ఆ యోగి లేవనెత్తి రాజా ! నీభక్తికి మెచ్చితిమి. నీవు వచ్చిన కార్యము సెప్పుమని యడిగెను. రాజు స్వామీ ! నా కేకోరకయునులేదు వెనుక దేవతదర్శనమునకు వచ్చితిని. అప్పుడు పలుకుట కవసరమైనది కాదు మీరు సెలవిచ్చిన విషయములన్నియు తప్పక జరిగినవి. ఆ వార్తఁ దమ కెరిగించి పోవలయునని వచ్చితిని. ఈ దాసునియం దెప్పుడును గృపాదృష్టి వ్యాపింపఁ జేయుచుండవలెనని ప్రార్ధించెను.

అప్పు డయ్యోగి రాజా ! మే మంతయు నెరింగియే చెప్పితిమి నీవింటికింబోయి సుఖముండు. మదియే పదివేలని పల్కుటయు వినమృఁడై రాజు రత్నములతోఁ గూర్పబడిన రుద్రాక్షమాలిక యొకటి యాఋషి మెడలోవైచి నమస్కరించి యవ్వలకుం బోయెను. సంతోషముఖములతో నభిముఖముగా వచ్చిన యమాత్యులతో ముచ్చటించుచు యింద్రమిత్రుండు నగరుఁబ్రవేశించెను. అందు భార్యతోఁ దాను బడిన యిడుమలన్నియుఁ చెప్పికొనుచు నప్పుడమి యొడయఁడు పడతీ ! నీవీతొడవు దొరకిన వెనుక చిరంజీవినియొద్ద కరిగితివా ? ఇది ఎట్లువచ్చినదని చెప్పినది? పెండ్లిమాట యేమనుచున్నది. యడిగిన రాజపత్ని యిట్లనియె. నాధా ! నేనప్పుడే యమ్మాయియొద్ద కరిగితిని. ఆమణిహారమును కంఠమున ధరించియున్నది. వీణావతియే తెచ్చియిచ్చినదని చెప్పుచున్నది. పరిణయము విషయమై యిప్పుడు కొంచెముచిత్తవృత్తి మారినదనితోచుచున్నది. అదివినుచుండ హేమా ! నీ వయస్యకు నీకు నిరూపించిన రాజపుత్రునిఁ బెండ్లి సేయుటకు నిశ్చయించితిమి. ఆమాటమీరు వింటి రాయని పలికితిని. హేమ స్వయంప్రభ మొగముఁజూచినది. అదియు నించుక సిగ్గుతో నా నిమిత్తమిఁక పరిణయ ప్రయత్నముఁజేయ నవసరములేదు. మీ నిర్బంధమున నే కన్నెరికము వదల్చుకొంటిని. అని పలుకుటయు పరిహాసవచనముగాఁ దలంచి హేమ నడిగితిని. అదియు దాని మొగముఁ జూచుచుఁ జిరునగవుతో భర్తృదారిక బొంకులాడునదియాయని చెప్పినది. పో పొండు. మీబాసలు మీకకాక యొరులకు తెలియవని పలుకుచు నింటికి వచ్చితిని. పెండ్లియాడ కేమిచేయును. సంబంధము నిశ్చయింపుడు. వేర వెదుకనేల? భూరిశ్రవునికొడుకు సహదేవునకే యిచ్చునట్లు శుభలేఖలు వ్రాయింపుడు అని చెప్పినది అతండందులకు కనుమోదించి యప్పుడు సిద్ధాంతుల రప్పించి ముహూర్తముల నిరూపించి శ్రుతశీలసంపన్నలగు బ్రాహ్మణుల నలువుర శుభలేఖలతో నాభూరిశ్రవు నొద్ద కనిపి పట్టణమంతయు నలంకరింప నాజ్ఞ యిచ్చెను.

( అంత నచట యుద్యానవనంబులో :-)

క. నలుపయ్యెఁ జూచుకంబులు
   తెలుపయ్యె న్మొగము మేనితేజముతోడన్
   వలమయ్యె నడు మడంగెదు
   వశు లానృపసూతి గర్భవతియై యొప్పన్.

అట్టి లక్షణంబులఁ బరీక్షించి యంబుజాక్షులు గుజగుజలాడుచుండఁ దెలిసికొని హేమ స్వయంప్రభ కెఱింగించినది. పాలిండ్లుబిగువగుటయు, నొడలు బఱువగుటయు, భోజనము వెగటగుటయుఁ గనిపెట్టి యప్పలుకులు సత్యములని యొప్పుకొని రాజపుత్రిక యప్పుడే యొక పరిచారికం దల్లిని దీసికొనిరమ్మని పంపినది ? రాజపత్ని యవ్వాచకమువిని యత్యాతురముతో నుద్యానవనంబునకు వచ్చినది. ఇప్పుడు స్వయంప్రభ యొకగద్దియపైఁ గూర్చుండి తలవంచుకొని వెక్కి వెక్కి యేడ్చుచుండెను. హేమ ప్రక్కను నిలువంబడి యేదియో చెప్పుచున్నది. అట్టి నందనంగాంచి రాజపత్ని యదిరిపడుచు దరికరిగి పట్టీ ! నీవిట్లు విచారించుటకుఁ గతంబేమి? నీ వెన్నడును గంటఁ దడివెట్టి యెరుంగవుగదా? మణిహారము పోయినను నిన్నించుకయు నిందించితి కామే? నా హృదయము బేధించుచున్నది. నీ చింతాకారణము వడిగాఁ జెప్పుమని యెంత యడిగినను నక్కలికి వెక్కి వెక్కి యేడ్చుటయే గాని యేమియు సమాధానముఁ జెప్పినది కాదు. తలయెత్తి చూచినది కాదు.

అప్పుడు రాజపత్ని హేమంజూచి యిందలి కారణము నీకు దెలియక పోదు. వడిగా నుడువుఁ మనుటయు నత్తరళాక్షి అమ్మా ! మఱియేమియు నుపద్రవము లేదు స్వయంప్రభ స్వతంత్రించి చేసినపనికై చింతించుచున్నదని చెప్పినది.

రాజ :- అది యెట్టిదో వివరముగాఁ జెప్పుము?

హేమ :-- మొన్న మీతో మనవి చేయలేదా? ఆ మాటయే నిజము మీరు పరిహాస వచనములని త్రోసివేసితిరి.

రాజ :- ఏమీ ! నాబిడ్డ భర్తను వరించినదా?

హేమ :- దుష్యంతుఁడు శకుంతలను వరించినట్లే గాంధర్వ విధానంబున వరించినది.

రాజ :- అట్టివాఁడు లభించెనా?

హేమ :- అంతకన్న నధికుండే.

రాజ :- ఏమి యావింత? రవ్వంతయైనను దెలియ నిచ్చిరికారేమి?

హేమ : - అందులకే పశ్చాత్తాపముఁ జెందుచుంటిమి

రాజ : - వాని పేరెద్దియో చెప్పుము?

హేమ : - అద్వైత శివానందయోగి.

రాజ :- (ఉదరముపైఁ జేయిడుకొని) గిరిదర నాలయములో నున్న సన్యాసియా యేమి ? హేమ : - ఔను. ఆతఁడే !

రాజ :- ఔరా ! చక్రవర్తి కడుపునంబుట్టి నాపట్టి చివరకు సన్యాసిం జేపట్టెనా ? నాబిడ్డ కెన్ని పాట్లు వచ్చినవి. (అని విచారించెను)

హేమ :-- అతండు సన్యాసియని నిరసింపరాదు. రూపంబునను బ్రాయంబునను గంతు వసంతాదుల మించియున్న వాఁడు మీరు చూడలేదు. కావున నట్లను చున్నారు.

రాజ :- అది మొదటినుండియు సన్యాసులలోఁ గలియవలయు ననియే పల్కుచున్నది. ఆ పలుకే నిజము చేసినది. పోనిమ్ము. చింత యేమిటికి?

మీకు దౌహిత్రుఁడు కలుగఁగలడు. అట్టి లక్షణములు గనంబడుచున్నవి. అందులకే యీచిన్నది వగచుచున్నది.

రాజ :- (సంతోష విశాదములతో బక్కున నవ్వుచ్చు) వెర్రిపట్టీ ! నీ చర్యలు విన నవ్వు వచ్చుచున్నదిగదా ! అయ్యో ! నీచరితమువిని లోకులు పరిహసింపక మానరు.

అనుటయు నామాటవిని యత్తరుణీమణియుఁ బెద్దగానేడువ దొడంగినది. రాజపత్ని తత్పరివేదనము విని సహింపనేరక గడ్డముబట్టుకొని కన్నీరుఁ దుడుచుచు పట్టీ ! మాటవరుస కట్లంటినిగాని నీకువచ్చిన కొదువ యేమియునులేదు. అగస్త్యునిఁ బెండ్లి యాడిన లోపాముద్రపలె నీవును నమ్మహర్షితో సుఖింతువుగాక ! నీవు విచారింపకుము. గర్భవతి వైతివి. మా కుల ముద్ధరింపఁగలవు ఇంతకన్నఁ గావలసిన దేమి? ఈ మాటవిని మీతండ్రియుం గోపింపరు సంతసముతో నల్లునిందెచ్చికొని యింటం బెట్టికొనియెదము. అని పెద్దతడపుబ్రతిమాడి యా బాలిక మనోవ్యధఁ గొంత జల్లార్పఁ జేసి హేమా! నీ వీపనికి సహకారివై యుందువు. ఆ తపస్వి యా గిరి దుర్గమున నుండ నేల? ఇంటికిం దీసికొనిరమ్ము. రాజ్యభోగము లనుభవింపఁగలడని పలికినది.

ఆమాట విని హేమ అమ్మా ! అమ్మహర్షి యమ్మరునాడే యిక్కడనుండి యెక్కడికో పోయెను. అని చెప్పుటయు జాలుజాలు ! బొంకులాడెద వేమిటికి? ఈ నడుమ పుడమిరేడు రెండుసారు లచ్చటికిం బోయి చూచి వచ్చెను. వారికి రుద్రాక్షమాలఁగూడ కానుక నిచ్చిరి. పోపొమ్ము. మరలఁజూచిరమ్మని పలుకుచు పుత్రి నోదార్చి రాజపత్ని తనయంతఃపురమున కరిగినది. ఆమె రాక వేచియున్న యింద్రమిత్రుడు సంతోషముతో భార్యం జూచి ప్రేయసీ ! మనము పంపిన బ్రాహ్మణులు ప్రత్యుత్తరమును దీసికొనివచ్చిరి. భూరిశ్రవుఁడు సంతసించుచు మనము నిరూపించిన సుముహూర్తమునకు వత్తుమని వ్రాసియున్నాఁడు. ఇఁక మనము పెండ్లి ప్రయత్నములు చేయవచ్చును. పలుకుచుండ నించుక చింతించుచు కన్నీరు దుడిచికొని యప్పల్లవపాణి యిట్లనియె.

ప్రాణేశ్వరా! మనము వైభవములకు బెట్టి పుట్టలేదు. మన కన్నులు మంచివికావు. మన ప్రయత్నములు నిరర్ధకరములు. వినుండు కడుపునఁ బుట్టినది గావున నేమనుటకు నోరాడదు. గాని స్వయంప్రభ స్వతంత్రురాలై కులపాలికా ధర్మముల విడనాడినది. తోచినంతయుం గావించినది. చెప్పినంతయుం జేసినది. నాడు చెప్పినమాట పరిహాసమను కొంటిని. యధార్ధమేనట. అని యా కథ యంతయు నామూలచూడముగా వక్కాణించినది.

మేదినీకాంతుఁ డావృత్తాంతము విని స్వాంతమునఁ జింతయు, వగపును, విషాదము, ప్రమోదము, పశ్చాత్తాపము లోనగు గుణంబులన్నియు నొక్కసారి జనింపఁ దెంపుసేయనేరక పీఠమున కొఱగి పెద్ద తడువు ధ్యానించి తనకుఁ దాన సమాధానపరచికొని భార్యకిట్లనియె. సాధ్వీ ! కర్మసూత్రగ్రంధితంబైన జంతువు దానివిడిచి పోవుటకు శక్యంబగునా? అది యెట్లు లాగిన నట్లు పోవలసినదే. మన మేమిచేయుఁ గలము? పొనిమ్ము. అతండు మహానుభావుడని యానందింతము. దౌహిత్రులాభంబు గలుగునని మురియుదము. అని చెప్పుచుండ రాజపత్ని యది యట్లుండె, భూరిశ్రవునికి వార్త నంపితిమిగదా యతనికేమని చెప్పవలయును? ఈ యపకీర్తి మన యావజ్జీవము బాధించునుగదా? అందులకేమి చింతించితికాని యడిగిన నతం డాలోచించి ప్రస్తుతము ముహూర్త మాపితిమనియు వెండియుం దెలియఁ జేయుదనుక రావలదనియు వ్రాయింతుమని చెప్పి యట్ల గావించెను.

రాజపత్ని యర్థసంతోషముతో నాధా ! ఆయోగి పూర్వజన్మంబున నెక్కుడు పుణ్యంబు గావించుటంబట్టి నాపట్టి చేపట్టినది. ఇఁక చెట్టునీడల వసియింపనేల? మీరు పోయి సబహుమానముగా మనయింటికిం దీసికొనిరండు. లేనిచో సరివారు పరిహసింతురని బోధించిన ---నకనాధుండేమిచేయుటకుం దోచక విధిలేక యమ్మరునాఁడు తగు పరివారము సేవింప మేళతాళములతో నగ్గిరిపరిసరమున కరిగి యయ్యతికి నమస్కరించుచు స్వామీ! మిమ్ము నాకూఁతురు భర్తగా వరించిన దఁట. మీరిందుండనేల? వీటిలోనికి రండు. ఉద్యానవనము తపోవన మగుంగాక యని కోరిన నతండు రాజా! నీ కట్టియభిప్రాయముండిన ద్రోసివేయనేల? ఇదిగో? వచ్చుచున్నాఁడ నని లేచి తన్నిర్దిష్టంబగు నందలమెక్కి యధిక వైభవముతో నగరుఁ బ్రవేశించెను.

అని యెరింగించి వేళయతిక్రమించుటయు మణిసిద్ధుఁ డవ్వలి కథ తదనంతరోవసధంబున నిట్లని చెప్పం దొడంగెను.

అరువది నాలుగవ మజిలీ

చ. అలరుచుఁ బెండ్లియన్న విని యాజ్యము వోసినక పోతుంది
    రలుక వహించి మండెడునృపాత్మజ నోజఁ దనంతవచ్చి స
    కౌనంగఁ జేసి తప్పుగా ? వెరులను త్వరత్వ
    తృణ నియమ ప్రభావములు మాకు వంది మత్రమా.

అని పరిహాసమాడిన మిత్రునితో