కాళిదాస చరిత్ర/కాలనిర్ణయము

వికీసోర్స్ నుండి

కాళిదాస చరిత్ర

కాలనిర్ణయము

    శ్లో॥ధన్వంతరిక్షపణకామరసింహశంకు
         భేతాళభట్టఘటకర్పర కాళిదా.సా:,
         ఖ్యాతో వరాహమిహిరో నృపతేస్సభాయాం
         రత్నాని వరరుచి ర్నవవిక్రమస్య.

అనియొక పురాతన శ్లోకముకలదు. దీని యర్ధ మేమనగా 1. ధన్వంతరి, 2. క్షపణకుఁడు, 3. అమరసింహుఁడు, 4. శంకుఁడు, 5. భేతాళభట్టు, 6. ఘటకర్పరుఁడు, 7. కాళిదాసు, 8. వరాహమిహిరుడు, 9. వరరుచి. ఈతొమ్మండుగురును విక్రమార్క మహారాజుయొక్క సభలో నవరత్నములని చెప్పఁబడుచు వచ్చిరి. ఇందు ధన్వంతరి వైధ్యశాస్త్ర పండితుడు. క్షపణకుఁడుఁ డేగ్రంథము రచియించెనో తెలియదు. అమరమని పేరుతో దేశమందంతట మిక్కిలి ప్రఖ్యాతిజెందిననామలింగానుశాసన మీయమరసింహుఁడు రచించినదే. శెంకుఁడెవరో తెలియదు. భేతాళభట్టు రచించిన గ్రంధములు కానఁబడవు. ఘటకర్పరుఁడుప్రాకృతభాషలోఁ గొన్ని గ్రంథములను రచించెనని చెప్పదగు ఇంక గాళిదాసునిమాట చెప్పనక్కఱలేదు. రఘువంశము, కుమారసంభవము, మేఘసందేశము నను మూడు కావ్యములందు, అభిజ్ఞానశాకుంతలము, విక్రమోర్వశీయము, మాళవికాగ్నిమిత్రము నను మూడు నాటకములను సంస్కృతములో రచించి మృతజీవుడయ్యను. వరాహమిహిరుడు జ్యోతిశ్శాస్త్రము నందు గొప్పపండితుడై బృహత్సంహిత, బృహజ్ఞాతకము నను రెండు మహాగ్రంధములను రచియించెను. వరరుచి వ్యాకరణశాస్త్రము వ్రాసెను. ఈతొమ్మండుగురు నిజముగా నవరత్నములే యనిచెప్పవచ్చును. ఈ నవరత్నహారములో నిజముగా గాళిదాసు నాయకమణి యని చెప్పవచ్చును. ఇతనికి వచ్చినంతపేరు మఱియెవ్వరికిని రాలేదు.శ్లోకములోనితడు విక్రమార్క సభయందున్నవాడని స్పష్టముగా జెప్పబడినను. ఆధారనగరము మేలిన భోజరాజునకును గాళిదాసునకును సంబధమెక్కున యుండినట్లు లోకములో ననేకకధలుకలవు. కాళిదాసు వంటి మహాకవి ప్రపంచమునలేడు. "ఉపమా కాళిదాసస్య" అనంగా నుపమాలంకారము కాళిదాసునదే యని యర్ధము. పోలికపోల్చిన గాళిదాసే పోల్చవలెను. ఆ విషయమున నాతడు నిరుపమానుదు. "కవికులగురువు కాలిదాసో విలాస" అని జయదేవ మహాత్ముడు చెప్పినాడు. అనగా గవితాకన్యకకు "కవికులగురువైన కాళిదాసే చక్కదనము" అని దీని యభిప్రాయము.

  శ్లో॥ పూరా కవినాంగణనా ప్రసంగే కనిస్టికాదిష్టిత కాలిదాసా,
       అద్యాపి తత్తుల్యకవేరభావాత్ అనామికా సార్ధవతి బభూవ॥

తాత్పర్యము: పూర్వకాలము కవులను లెక్కజూపుచు కాళిదాసునిపేరు కనిష్టముమీద (అనగ్సా జిటికెనవ్రేలిమీద) నిలచినది. అది మొదలుకొని నేటివఱకు వానితొ సమానుడైన కవీశ్వరుడు మరల జన్మించుటచేత జిటికెనవ్రేలి తరువాత వ్రేలికి ‘అనామిక యను పేరు కలిగునది.

ఈవిధముగా సమస్తకవులు, సమస్త పండితులు మెచ్చుకొనదగినట్టి మహా కవిత్వముగల మహాకవి కాళిదాసుయొకక్క చరిత్రముమనకు తెలియకపోవుట మిక్కిలి విచారకరము. దేశచరిత్రలు మనలోలేకపోవుటచేత నిటువంటి ప్రసిద్ద మహాకవుల వృత్తాంతములు మనకు తెలియకపోవుట సంభవించెను. కాళిదాసుని గురించి యిప్పుడు చెప్పుకొనుచున్న కధలు, వ్రాయబడుచున్న కధలు, కేవలము పుక్కిటిపురాణములే కాని నిజమైనవికావు. కాని, యవి మనోహరములుగ నుండుటచే జనసామాన్యమిచేత నాదరింపబడుచున్నవి. అందుచేత జనులు చెప్పుకొనుచున్న కధలనుబట్టి కాళిదాసచరిత్రము వ్రాయవలయును.

కాళిదాసుడు విక్రమార్కుని సభలోని వాడైన పక్షమున విక్రమార్కశకము క్రీస్తునకుముందు 56వ సంవత్సరమున ప్రారంభమైనది గనుక కాళిదాసు డిప్పటీకి రెండువేల క్రిందటివాడై యుండవలెను. కొందఱు పండితులు గుప్తవశమునందలి ప్రధమ చక్రవర్తియైన చంద్రగుప్తవిక్రమాదిత్యుని యాస్థానము నందు గాళిదాసుడు కవియై యుండెనని వ్రాయుచున్నారు. అట్లైన నతడు క్రీసుతరువాత 350 వ సంవత్సర ప్రాంతముల నుండవలెను. అనగా నిప్పటికి1600సంవత్సరములక్రింద నుండియుండవలయును.లోకులు చెప్పుకొనునట్లు కాళిదాసుడు భోజరాజు నాస్థానముననే యుండిన పక్షమున భోజరాజు క్రీస్తుతరువాత 1000 సం॥రము మొదలుకొని రమారమి 1050 వఱకు మాళవదేశమును బరిపాలించెను. గావున గాళిదాసమహాకవి యిప్పటి కించుమించుగా 900 ఏండ్ల కింద నుండియుండవలెను. ఇద్దరు కాళిదాసు లొన్నారని కొందఱు పండితుల యభిప్రాయము. అట్లయిన విక్రమార్కుని యాస్థానమున నౌకరు భోజుని యాస్థానమున నౌకరు నుండిరేమో? అతని కాలనిర్ణయము సరిగా నింతవఱకు జేయబడలేదు. ఇతడు గౌడదేశస్థు డనియు, కౌండిన్యసగోత్రుడనియు గొందఱనుచున్నారు. ఇట్లనుట కాధారము లేమియు గానబడవు.

మతము

కాళిదాసుడు

శివ భక్తుడు

ఇందుకు నిదర్శనము లనేకములు కలవు. కుమార సంభవమును శైవకావ్యము నితడు రచియించెను. అందు శివుడు పార్వతిని వివాహమాడుటయు, నామవలన గుమారస్వామిని గనుటయు, నతనిచేత ద్రిలోకకఠకుడై-ఇంద్రాదిదేవతలను హింసించిన తారకాసురుని జంపించుటయు, మొదలగు వృత్తాంత మతిమనోహరముగా వర్ణింపబడియున్నది. ఇదిగాక యమ్మహాకవి తాను రచించిన రఘువంశ కావ్యమునందు

   శ్లో॥వాగర్ధావిన సంవృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయె
       జగతు పితరౌవందే పార్వతీ పరమేశ్వరా.

తా॥ మాటయు దానినిర్ణయము నెట్లు కలిసియుండునో యట్లు కలసియున్నట్టియు, దల్లిదండ్రు లైనట్తియు పార్వతీ పరమేశ్వరులను వాక్యార్ధ సిద్ధికొఱకు నమస్కరించుచున్నాడను.

అని మొట్టమొదట నిష్టదేవతా ప్రార్ధనము జేయుచున్నాడు. నాటకరాజమని జగత్పసిద్దిజెందిన యభిజ్ఞానశాకుంతల నాటకమునందు గాళిదాసుడు నాందీరూపకమైన యీ క్రింది శ్లోకముచేత శివునే స్తుతించియున్నాడు.