కవి జీవితములు/వెన్నెలకంటి వేంకటాచలము

వికీసోర్స్ నుండి

1150 సం. వఱకు నుండుననుటకు సంశయము లేదు. అతనిపుత్త్రుఁడు నన్నయ యను నతఁడు శా. స. 1150 మొదలు 1200 వఱకు నుండి యుండును. అతనికుమారుఁ డగుజక్కయకవి యేఁబదిసంవత్సరముల వాఁడే అయిన 1250 వఱకుగాని అంతకు నధికవయస్సువఱకు నుండిన శా. స. 1270 లేక 1300 వఱకుగాని యుండుటకు సందియముండదు. ఇది కృతిపతి యగు సిద్ధనకాల మై యుండినట్లుగా నీవఱకే మనము లెక్కించినారము ఆకారణమున నితఁ డెఱ్ఱప్రెగ్గడకుఁ గొంచెము దరువాతివాఁ డగుననుటకు సందియముండదు.

23.

వెన్నెలకంటి వేంకటాచలము

(కృష్ణవిలాసకవి)

ఇతఁడు నాఱువేలశాఖానియోగిబ్రాహ్మణుఁడు. హరితస గోత్రుఁడు. జగ్గనామాత్యునిపుత్త్రుఁడు. ఇతనివంశావళి వివరించుటకుఁబూర్వ మితనవలన వివరింపఁబడిన యాశ్వాసాంతగద్యమును వివరించెదను. ఎట్లన్నను :_

"ఇది శ్రీమదుమామహేశ్వర వరప్రసాదలబ్ధ శంకరభజనానంద ములుగు గురులింగారాధ్య పాదారవింద ధ్యానపరాయణ హరితసగోత్ర సుజనవిధేయ జగ్గనామాత్యపుత్త్ర వెన్నెలకంటి వేంకటాచల నామధేయ ప్రణీతం బైనకృష్ణవిలాసం బను మహాప్రబంధంబునందు"

ఆంధ్రగీర్వాణకవివర్ణనము.

ఈకవి యొకసీమలోఁ గొందఱఁ బ్రాచీన సంస్కృతకవులను మఱికొంద ఱాంధ్రకవులను గలిపి చెప్పియున్నాఁడు. ఇది యితరకవులలోఁ జూడఁదగుమార్గముకాదు. ఆపద్యమెట్లున్నదన :_

"సీ. కాళిదాసునిఁ దిక్కకవి నన్నపార్యుని, భారవి భవభూతి పాండుసు కవి
      మల్హ ణు బిల్హ ణు మాఘు మయూరుని, చోరుని నాచనసోము భీము
      పింగళిసూరన్న పెద్దనామాత్యుని, పొలుపొంద బమ్మెరపోతరాజు
      వంచేటిరంగన్న భాస్కరణమంత్రిని, వెల్లంకితాతప్ప మల్లుభట్టు

తే. మహిమమీఱంగ నాస్థానమంటపముల, సకలరాజులచేతను సన్ను తింపఁ
    బడినసుకవుల నందఱఁ బ్రస్తుతింతు, నింపుమీఱంగఁ గృతి రచియింపఁబూని."






`రంగ

</poem>

కవివంశావళి.

ఇట్లుగా వివరింపఁబడిన పైవంశమువారిలో (1) మొదలు (9) వఱకుఁ గలపురుషులచారిత్రము వివరింపవలసియున్నది. ఈవంశములోఁ గవులు పెక్కం డ్రుండుటంబట్టి వీరిచారిత్రమును, మీఁది కాలీనులచారిత్రమును ముఖ్యముగాఁ దెలియవలసిన దై యుండుఁగావున నే నీక్రింద దాని న్వివరించి చూపెదను.

1. వెన్నెలకంటిసూర్యుఁడు.

ఇతనింగూర్చి వివరించుచో నీకవి విక్రమార్క చరిత్రములో నితనివర్ణనయున్న పద్యమునే విక్రమార్క చరిత్రములోని దని వివరించె. ఆపద్య మెట్లున్నదన :_

"ఉ. వెన్నెలకంటిసూరయ వివేకవదాన్యుఁడు వేదశాస్త్రసం
      పన్నుఁడు రెడ్డివేమనరపాలునిచేత మహాగ్రహారముల్
      గొన్నకవీంద్రకుంజరుఁ డకుంఠితతేజుఁడు పెద్దతండ్రి యౌ
      జన్నయసిద్ధధీమణికి సంతతదానకళావినోదికిన్."

ఇట్లున్నదీనింబట్టి విక్రమార్కచరిత్రముఁ గృతినందిన జన్నయ పెద్దనమంత్రి కితఁడు పెద్దతండ్రియైనట్లుగాఁ దేలినది. ఇతఁడు గొప్పకవి యనియు నితఁడు రెడ్డివేమరాజువలన మహాగ్రహారాదుల నందె నని తేలినది. దీనిలో వివరింపఁబడిన రెడ్డివేమన యెవ రనుదాని నాలోచింప వలసియున్నది. అపేరు గలప్రభువులు రెడ్లలోఁ బెక్కం డ్రుండుటంజేసి ఆవివరము దీనిలోఁదేలదు. ఇతనింగూర్చి విష్ణుపురాణములో వివరించి యున్న పద్యముంగూడ నిట వివరించి అనంతర మితనివృత్తాంత మరయుటకుఁ గోరెదను. ఆపద్య మెట్లున్న దనఁగా :_

"ఉ. ఈ నిఖిలంబు మెచ్చ నమరేశ్వరదేవుఁడు చూడఁ గృష్ణవే
      ణీనది సాక్షిగాఁ ననికి నిల్చినరావుతుఁ గేసభూవిభుం
      గానకుఁ దోలి వెన్నడచి కాచినవేమయయన్న వోతభూ
      జూనికి సత్ప్రబంధము లొసంగినవెన్నెలకంటివారిలోన్,"

2. జన్నయసిద్ధయ.

ఇతఁడు విక్రమార్కచరిత్రముఁ గృతినందినవాఁడు ఇతనింగూర్చి యీ వేంకటాచలకవి యీక్రిందివిధంబునఁ జెప్పుచున్నాడు. ఎట్లన :_

"గీ. విక్రమార్కచరిత వేడ్కతో నందిన, సిద్ధిరాజు జగత్ప్రసిద్ధరాజు
     అతని పెద్దతండ్రి యైనసూరపరాజు, పరమశైవశాస్త్రపారగుండు."

3. వెన్నెలకంటి సూరనకవి.

ఇతఁడు పై సూరపరాజకవికిఁ బౌత్త్రుఁడు. అనగాఁ బుత్రునిపుత్త్రుఁడు. ఈవిషయమై కవిచరిత్రము కొంత సంశయించి ఇతఁడు సూర్యుని మనుమనిమనుమఁ డని వ్రాసినట్లుండుటచేత నీతనివివరముం దెల్పు పద్యముఁగూడ నిట వివరించెదను. ఎట్లన్నను :_

"చ. సురచిరసద్గుణాఢ్యుఁ డగుసూరసుధీమణిసంభవుండు శ్రీ
      హరిపదసేవకుం డమరనార్యుఁడు పుత్త్రులఁగాంచె మువ్వురన్
      స్థిరతరసత్కవిత్వ శుభశీలుఁడు సూరపమంత్రి చంద్రశే
      ఖరబుధవర్యు ధీవినయకర్ముఁడు తిర్మలమంత్రిసత్తమున్."

ఈసూరకవింగూర్చి 'యాదవసేనము' అనుగ్రంథములోఁ గొంత వివరింపఁబడియున్నట్లుగాఁ గాన్పించు. ఆగ్రంథము మనకు లభ్యముకాలేదు కాని వేంకటాచలపతికవి ఆగ్రంథములోని యొకపద్యమునుమాత్రము వివరించెను. ఎట్లన్నను :_

"క. వీరలుమువ్వురిలోపల, సూరప విఖ్యాతయశుఁడు సుకవిస్తుతుఁడై
     అరయ విష్ణుపురాణము, ధీ తఁ దెనిఁగించె నధికతేజ మెలర్పన్."

ఇట్లుగా వేంకటాచలకవి విష్ణుపురాణకర్తపై యితరగ్రంథకర్తల యభిప్రాయముం దెలిపి యిఁక తన యభిప్రాయముగా నీక్రిందిపద్యము వివరించె. ఎట్లన్నను :_

"సీ. సూరప కాంతిచే సూర్యప్రకాశుండు, వేదాదివిద్యల వెలసినాఁడు
      విష్ణుపురాణంబు వేడుకఁ దెనుగించి, విమలయశంబున వెలసినాఁడు
      రావూరిబసవన్నరమణతో నిచ్చిన, యల మొగుళ్లూరగ్రహారమందె
      వెలుగోటితిమ్మభూవిభునిచేఁగొనియెఁదా, నాందోళికాఛత్ర మగుపదవిని

తే. కవితపుట్టిల్లు వెన్నెలకంటియిల్లు, ననెడుపౌరుషనామధేయంబు నిలిపె
    సరసగుణములు గలిగినసాధుసుకవి, మాననీయుఁడు సూరనామాత్యవరుఁడు."

ఇట్లుగా వివరింపఁబడి యుండుటచేత నీసూరనకవి రావూరి బసవరెడ్డి సభలోనేకాక వెలుగోటి తిమ్మభూపాలుని సభలోఁగూడ నుండి అతనివలన ఛత్రచామరాందోళికాది మహాగౌరవముల నందినట్లు తేలినది. ఈతిమ్మభూపాలుంగూర్చి న్యూయలుదొర కొంత వివరించె. అది వేంకటగిరివారివంశవృక్షములోనిదియై యున్నది. వెలుగోటివారనునది వేంకటగిరిసంస్థానికు లగువెలమలయింటి పేరై యున్నది. వారిలోఁ దిమ్మానాయఁ డనునతఁడు వెలుగోటివారిలో మూలపురుషుఁడు మొదలు లెక్కిం పఁగా నేడవపురుషుఁ డగుచున్నాఁడు. ఇతనికాలముమాత్ర మాగ్రంథములో వివరింపఁబడలేదు. కాని యితనికిఁ బూర్వులుగా నున్నవారిలోఁ గొందఱయొక్కయుఁ, బరమందున్న వారిలోఁ గొందఱ యొక్కయుఁ గాలములు వివరింపఁబడుటచేత నీతిమ్మానాయనికాలముఁ గొంత మనము దగ్గఱగాఁ దేవచ్చును. అదెట్లున్నదనఁగా :_

Vol. II Lists of Antiquities Page 241

Singama Naidu

(A bold warrior ; was protected by pratapa Rudra II.)

|

Anapota Naidu

won a battle in Sarwari year A D 1300.

|

Pedasingama Naidu ------- Dharma Naidu

--------------------------------|

-----------------------------------Timma Naidu

దీనిని దెనుఁగులో జూపెదను.

సింగమనాయఁడు.

(ఇతఁడు రెండవప్రతాపరుద్రునివలన సంరక్షించఁబడెను.)

|

అనపోతనాయఁడు

(ఇతఁడు క్రీ. శ. 1300 లతో సరియగు శార్వరి సం. లో నొకగొప్పయుద్ధమున గెలిచెను.)

|

పెద్దసింగమనాయఁడు --------- ధర్మానాయఁడు

--------------------------------|

-----------------------------------తిమ్మానాయఁడు

ఇట్లుగా నున్న పైసింగమనాయనికాలమునకుఁ గొంత తెలిసినది. ఎట్లనఁగా రెండవప్రతాపరుద్రుఁ డతని సంరక్షించియుండుటచేత నతని కాలము శా. స 1245 +78 - 1323 క్రీ. శకమువఱకు నగుటచేతను సింగమనాయఁడు గూడ క్రీ. స. 1323 వాఁడే కాఁగలడు. అతనికుమారుఁ డగుననపోతమనాయఁడు క్రీ. శ. 1300 శార్వరిలో నొక యుద్ధము జయించియుండె నని యుండుటచేత పై సింగమనాయఁడు క్రీ. శ. 1300 లకుఁ బూర్వమే అనగాఁ బ్రతాపరుద్రుఁడు మృతినందుటకుఁ బూర్వమే సుమారు ముప్పదిసంవత్సరములకు ముందు గతించి యుండవచ్చు నని తేలును. ఈకాలవిషయమై న్యూయలుదొర సంశయపడి యది అసందర్భమని దీనిని మఱి యఱువదిసంవత్సరములకుఁ బైన వచ్చు క్రీ. శ. 1360 గా సవరించెను. దీనికిఁ గారణము పై రెండవ ప్రతాపరుద్రుఁడు క్రీ. శ. 1323 లో గతించియుండుటం జేసియే అయి యున్నది.అట్లుగా నూహింప నవసరము లేదు. ప్రతాపరుద్రుఁడు డెబ్బదియాఱుసంవత్సరములు రాజ్యముచేసినట్లుండఁగా నతనికాలములోని వారందఱు డెబ్బదియాఱేండ్లవఱకు నుందు రని యూహించుట సయుక్తికముకాదు. ఇట్లుగా క్రీ. శ. 1300 లను 1360 గా సవరించుటయే చూచెనుగాని న్యూయలుదొర యీయన పోతనాయనితమ్ముఁ డగు మాదనాయని కాలముం జూచియుండలేదు. ఈసవరింపునకు వెనుకనే మాదనాయని పేరుక్రింద నీక్రిందివాక్యముల వివరించె. ఎట్లన్నను :_

"Mada Naidu (Mada additions to the Srisailam Temple) Killed Anapota Reddi, a relative of Ana Vema Reddi of Konda Veedu (A. D. 1339-1369 A. D.)"

అనఁగా నీమాదానీఁడు కొండవీటిసీమకుఁ బ్రభుఁ డగుననవేమారెడ్డికి బంధువుఁ డగుననపోతారెడ్డిని సంహరించె ననియు నామాదానాయనికాలము క్రీ. శ. 1339 మొదలు క్రీ. శ. 1369 వఱకున్నట్లు వ్రాసె. కావున మాదానాయనికిఁ బూర్వమధికారముచేసిన యతనియన్న యగుననపోతానాయఁడు క్రీ. శ. 1300 లలోఁ గాని అంతకుఁ బూర్వముగా ని యుండక మాదానాయనిరాజ్యాంతమగు క్రీ. శ. 1360 నాఁటికి నుండునా ? కావున క్రీ. శ. 1300 అను పాఠమే సరియై యున్నది. అతని రాజ్యకాల మది మొదలు క్రీ. శ. 1337 వఱకు నుండియుండును. అనవోతమనాయనికొడుకు పెద్దసింగమనాయఁడును, ధర్మానాయఁడును గొంతకాలము రాజ్యముచేసినట్లుగా నితరగ్రంథములలోఁ గాన్పించు. ఆధర్మానాయనికొడుకు తిమ్మానాయఁడు. వీరిలో నిర్వురుగూడ రాజ్యముచేసిన నొక్కొక్కరికి బదేనువత్సరముల చొప్పున ముప్పదివత్సరములుచెప్పఁగా క్రీ. శ. 1340 + 30 = 1370 మొదలు అనఁగా శా. స. 1292 మొదలు నీ తిమ్మానాయనికాలము కాఁ గలదు. అతనికాలములో నున్న వెన్నెలకంటిసూరనయుఁ గొంచె మెచ్చుతగ్గుగా శా. స. 1300 గల కాలమువాడనితేలును.

(4) చంద్రశేఖరుఁడు.

"సీ. పరగఁ గ్రద్దలూరు బాలజోస్యులు వేడఁ, జంద్రశేఖరయ్య జగతిలోన
      దత్తవృత్తిఁగొనియెఁదగఁబ్రసిద్ధికినెక్కి, మొదలిపేర నతఁడు బొదలుచుండె."

(5) వెన్నెలకంటివెంకయ్య.

ఈ వెంకయ్య యనునతఁడు వేజెళ్లనఱ్ఱా జనుసంస్థానీకునికడ మంత్రిగా నున్నట్లు క్రిందిపద్యములవలన గాన్పించు. ఎట్లన్నను :_

"సీ. ఘనులు నేగుడిలోపల గంగరాజు, అతనిపుత్త్రుఁడు వెంకన యనినవాడు
      సరసుఁ డైనట్టివేజెళ్లసర్వఘనుని, మంత్రి యై యొప్పెరాజసన్మానమునను.

సీ. వేజెళ్లసఱ్ఱాజు విభవాదిపత్యంబు, పూనినసర్వజ్ఞపుణ్యమూర్తి
    పోలుపొంద నా కృష్ణభూపాలుబాలుని, దొరఁజేసికొనికార్యమఱసినడిపె
    శ్రీరంగరాయలచే నొప్పుఁగొని తెవ్వి, పంచవన్నెలడాలు పరగఁజేసె
    కొండవీటిసరద్దు గుడ్లూరిదనుకను, ఏలించెఁ గృష్ణభూపాలునెమ్మి

తే. సకలప్రజ్ఞానదక్షుఁడైజనులఁబ్రోచె, రాజసన్మానములచేతఁదేజమలరె
    బంధుజనముల సకలసంపదలదనిపె' మహితయశుఁడగు వెంగనమంత్రియపుడు."

ఇపుడు వేజెళ్ల నఱ్రాజనునతఁ డెవ్వరనియు నతనికాల మెప్పుడనియు విచారించవలసినదిగా నున్నది. ఈనడుమనే నావలన పైవేజెళ్లవా రనుతెట్టుసంస్థానీకుల వంశచారిత్ర మీగ్రామములో నున్న పైవేజెళ్లవారి ద్వారమున సంపాదింపఁబడిన వంశావళీగ్రంథము పట్టాలనుబట్టి సంగ్రహింపఁబడినది. దానివలన పై వృత్తాంతము కొంత తేలుచున్నది. కావున నీసమయములో నవసర మగువృత్తాంతము నీక్రింద వివరించెదను.

వేజెళ్ల వారివంశావళి.

పోలంరాజు.

|

పాపరాజు (శా. స. 1371-1416)

|

కసవరాజు (శా. స. 1416-1444)


పైవారిలోఁ బ్రస్తుతములో మనకుఁ గావలసినవారిపేరులు కాలమును గైకొందము. వా రెవ్వరనఁగా నఱ్ఱాజు నతని యన్న యగునయ్యపరాజును. వీరి కాలము శా. స. 1416 మొదలు 1444 వఱకు నిరువది యెనిమిది సంవత్సరములై యున్నది. వంశావళీసంగ్రహములో వీరివృత్తాంత మీక్రిందివిధంబుగా నున్నది. ఎట్లన్నను :_

"అయ్యపరాజు హైద్రాబాదునకుఁ బోయి అక్కడి నుండి పూర్వము 'కొడగు చక్రవర్తి' అనురెడ్డికి జాగీరుగా నడుచుచున్న గుడ్లూరు సీమకు జాగీరు తెచ్చుకొని తన తమ్ముఁడు సర్వరాజును హైద్రాబాదులో నుంచి తాను సోమరాజుపల్లె యనుగ్రామములోఁ గోట కట్టుకొని జాగీ రనుభవించెను." అని యిట్లున్న వేజెళ్లవారి వంశావళిలో నఱ్ఱా జనునామము గలవాఁ డతఁ డొక్కఁడేగాని యితరులు లేరు. ఈనఱ్ఱాజుకడ నీవెంగన్న మంత్రి యై యుండుటయేగాక యితనియన్న యగు నయ్యపరాజు మనుమఁ డగుకృష్ణభూపాలుఁడు బాలుఁ డై యుండ నతని దొరను చేసుకొని కార్యము నడిపిన వాఁడనియుఁ బై పద్యములో నున్నది. ఈపట్టున వంశావళీగ్రంథ మెట్లున్నదో చూచెదము. అందులో నీక్రిందివిధంబుగా నున్నది. దాని వివర మెట్లనిన :_

"పై అయ్యపరాజపుత్రులు పెదనర్సరాజు చిననర్సరాజు అనువారలు. వీరిలో చిన్ననర్సరాజు తనయన్నతో శఠించి తూర్పు విజయనగర సీమకు లేచిపోయెను. పెద్ద నర్సరాజు తండ్రి అనంతరము వ్యవహారములోఁ బ్రవేశించి చంద్రగిరి, తిరుపతి మొహరాలలోఁ (యుద్ధములలో) గష్టపడి, పూర్వము తమకు నడిచే అమరము, చీమకుర్తి గ్రామాదులును, జాగీరుగా నడిచే గుడ్లూరుతాలూకాయును, ఇదిగాక పాకల, జలదంకి మొదలగు కొన్ని సముతులును, జాగీరులుగాను, అంబారీ, డంకా, నౌబతు, గడియారము మొదలగు బిరుదు నిషానులును బహుమతిగొని, సర్కారు నౌకరీలో హాజరు బాషీ చేయుచుండె. ఇట్లుండ నీయనబావమఱఁది యగుమందపాటి మూర్తిరాజనునతఁడు పై అయ్యపరాజుకడ సర్దారుఁడై యుండి ప్రభుత్వ మాక్రమించుకొనవలయు నని దివాణములో పితూరీచేసి భీమవర మనుగ్రామములోఁ బెద్ద నర్సరాజు చిన్ననర్సరాజు చిన్నవారితోఁగూడఁ గోటలోనుండగా ఫౌంజును తెచ్చి కోటచుట్టుకొని పెద్దనర్సరాజును నష్ట పెట్టెను. ఈపెద్ద నర్సరాజు 36 సంవత్సరములు రాజ్యము చేసెను.

కృష్ణమరాజుచరిత్రము.

అనంతరము పెద్దనర్సరాజు కుమారుఁడగు కృష్ణమరా జనునతఁడుమూఁడుసంవత్సరములయీడుగల బాలుఁడై యుండుటంబట్టి అతనిమంత్రి వర్గము కందుకూరిలో లష్కరుతోఁగూడ నుండిన ఫౌంజుదారుని దర్శించిరి. అప్పుడు ఫౌంజుదారుఁడు కృష్ణమరాజు బాలుఁ డనుకారణముచేతను గుడ్లూరు పరగణామాత్ర మతనికిచ్చి దానికి (700) నేడువందలవరాలు పేష్కషు నిర్ణయించి తతిమ్మా పర్గాణాలు సర్కారులో దాఖలు చేసుకొనియె. అంతట కృష్ణమరాజు భీమవరము మకాము చాలించుకొని గుడ్లూరిలోఁ గోటకట్టించుకొని పైతాలూకా అనుభవించుచు (42 సం.) నలుబదిరెండేండ్లు ప్రభుత్వము చేసెను."

ఇ ట్లుండుటంబట్టి పైకథను వేంకటాచలకవి యీవంశావళీగ్రంథముల ననుసరించియే చెప్పెనని స్పష్టమే. కృష్ణమరాజు బాలుఁడుగా నుం డఁగా నతని దొరనుచేసి ఫౌంజుదారుని కడకుం గొంపోయి తిరుగ నతనికి బ్రభుత్వమును స్థిరపఱిచినవాఁ డీవెన్నెలకంటి వెంగనమంత్రియే. ఆ కారణమున నతనిపుత్త్రులేవురును వేజెళ్లవారి మంత్రులే అని వివరింపఁబడియున్నది. ఆవివరము ముందు వివరించెదను. ఈ వెంగయ్య మంత్రివృత్తాంతములో నింకొక్కటికూడ వ్రాయవలసియున్నది. అది యెద్దియనగా శ్రీరంగరాయలమెప్పు గొని పంచవన్నె లడాలు తెచ్చెనని. ఈవృత్తాంతమును పర్యాలోచించుటకుఁ బూర్వముకృష్ణంరాజు రాజ్యకాలము మఱి యొకపరి చూచుకోవలసియున్నది. అది శా. స. 1480 మొదలు 1522 వఱకై యున్నది. ఇఁక విజయనగరరాష్ట్రమున కధికారమున వహించిన సదాశివరాయని మంత్రులుగా మొదటఁ బ్రవేశించి అనంతర మారాజ్యమునకు రాజులయిన తిరుమలదేవ శ్రీరంగరాజులు శా. స. 1474 మొదలు శా. స. 1507 వఱకును వ్యవహరించినట్లు శాసనములవలనఁ గాన్పించు. ఆకాలములో నీవెంగమంత్రి శ్రీరంగరాజును మెప్పించి అతని వలనఁ బైపంచవన్నెలడాలును సంపాదించి తనప్రభుఁడు కృష్ణంరాజున కిచ్చినట్లు కాన్పించు. ఈకృష్ణమరాజు రాజ్యము కొండవీడు మొదలు గుడ్లూరివఱకును వ్యాపించి యున్నట్లుగాఁ బైపద్యములోనే యున్నది. అదే గుడ్లూరుపరగణా అనివంశావళిలోఁ జెప్పంబడియె. 6-7-8 గుర్తులుగలవారలు పై వెంగమంత్రిపుత్త్రులు. వీరిలో నాఱవగుర్తుగల వెంకన్న అందఱలోఁ జిన్నవాఁడు. అతఁడు పైభీమవరగ్రామములోనే యుండె నని యుండుటచేతఁ దక్కినవారు గుడ్లూరునకుఁ దమప్రభువు పోయినవెంటనే తామును బోయిరనియు, నీ వెంకన్న మాత్ర మట్లుగాఁ బోక తమతొల్లింటి గ్రామములోనే యున్నట్లును దేలుచున్నది. ఆపద్య మెట్లున్నదనఁగా :+

"గీ. సకలప్రజ్ఞావిచక్షణ శాలియైన, వేంకటయసాటివారిని వినఁగలేము
     దానశీలుఁడు నిరతాన్న దానపరుఁడు పరఁగ నతఁ డుండె నాభీమవరమునందు."

ఇతని మూఁడవయన్నయగు (7. గుర్తుగల) రంగప్పవర్ణనము.

"క. రంగప్ప రూపసంపద, రంగప్పఁడు బుద్ధి నమరరాట్ప్రతిముండౌ
     సంగరవిజయుఁ డుదారుఁడు, రంగుగ నాగోలకొండరాజలు మెచ్చన్."

ఈరంగప్పకు రెండవయన్నయగు (8. గుర్తుగల) రామన్న వర్ణన మీక్రిందివిధంబున నున్నది. ఎట్లన :_

"సీ. రామన్న మర్యాదరామన్న వేఁజెళ్ళ, నారాయణేంద్రుఁడు గారవమునఁ
      జనువీయ నాయనసంస్థానకర్తయై, పాలించుఁ బ్రజల సంపదలఁ బొదల
      గోలకొండవజీర్ణఁ గూడి దుర్గాలపై, ముత్తికహత్తించి మొత్తి మొత్తి
      కడుమన్నె సరదార్ల వడిచెడఁగాఁ గొట్టి, రాజుచే మెచ్చులు రమణ నందె.

తే. పొదిలె లింగప్పతోఁ గూడి భూము లెల్లఁ, గొట్టి విప్రుల కన్నంబు బెట్టి మించెఁ
    గలియుగంబున వెన్నెలకంటిరామ, మంత్రికిని నీడు లే రని మహికి నెక్కె."

దీనిలో నీరామనమంత్రి విశేషము యుద్ధములు చేసినట్లుగా నున్నది. అట్టి యవసర మతనిప్రభుం డగునారాయణరాజు చారిత్రములో వచ్చియున్నదేమో దానిం జూచుటయేకాక యీనారాయణరాజు వ్యవహార మెన్ని వత్సరములో యెప్పటినుండి యెప్పటివఱకో దానింగూడఁ జూడవలసియున్నది. ఆవివర మెట్లున్నదనఁగా :_

"కృష్ణమరాజుకుమారుఁడు పెదనారాయణరాజు. ఇతఁడును దండ్రివిధముగనే గుడ్లూరుపరగణా ననుభవించుచుండె. ఇట్లుండఁగా నితనికి భువనగిరిపైకి మోహి తర్లి పోవుటకు హుకుమైనది. ఆప్రకార మతఁడు పోయి లడాయి చేయఁగా దేహమంతయు గాయములుపడెను. ఇట్లుగా నున్నను గార్యము పూర్తిచేసుకొని వచ్చుటచేత నతనికిఁ దెల్లజెండా మొదలగు బిరుదు లనేకము లీయంబడినవి. వానిం దీసుకొని తిరుగ గుడ్లూరు చేరి ఆ గాయములవలననే పెదనారాయణరాజు మృతుఁ డాయెను. ఇతనివ్యవహారకాలము శా. స. 1522 ప్లవసం. మొదలు శా. స. 1558 ధాత సం. వఱకును ముప్పదియాఱుసంవత్సరము లై యున్నది."

అనియున్నది. కావున నీనారాయణరాజు మంత్రియు సేనానియు నైనవెన్నెలకంటి రామమంత్రికి యుద్ధము చేయవలసినయవసరము విస్తరించియే యున్నట్లు కానుపించును. ఈ యిర్వురికాలము నొక్కటియే అయియుండును గావున దానింగూర్చి వివరింపను.

(9) వేంకటాచలకవి.

పై రామన్నకు నన్న యగుసూరనకు నీగ్రంథకర్త కుమారుని కుమారుఁడు. ఆసూరనపుత్త్రులలోఁ బెద్దవాఁ డగుతిప్పన్న పై వేజెళ్లపె ఈపేజి వ్రాయబడినది. ఈపేజి వ్రాయబడినది. దనారాయణ రాజపుత్రుఁ డగుకృష్ణమరాజువలనఁ గరణికమును సంపాదించిన ట్లున్నది. అ దెట్లనఁగా :_

"గీ. పరఁగ వేజెళ్లకృష్ణభూపాలుకరుణ కరణ, మననేర్పు మీఱంగ థరణిఁ బ్రజల
     నరసి పాలించి శుభముల నలవరించి, మించి బంధులఁ జాల పోషించె నెలమి."

ఈకృష్ణమరాజు శా. స. 1558 మొదలు శా. స. 1600 వఱకు నలుబదిరెండుసంవత్సరములు పాలించె. అతనికాలమువారలే తిప్పయ్య జగ్గయ్య యనువారలు. జగ్గయ్యపుత్రుఁ డగునీవేంకటాచలకవి మఱి యేఁబదిసంవత్సరములకాలములో నున్నట్లుగా నూహింపవచ్చును. అటులనైన శా. స. 1558 మొదలు శా. స. 1580 లోపుగా జగ్గన్న యుండె ననియు నతనిపుత్త్రుఁ డగువేంకటాచలకవి శా. స. 1610 గల కాలములో నున్నాఁ డనియుఁ దేలుచున్నది. ఈవేంకటాచలకవి తనకుఁ బైప్రభువులతో సంబంధ మున్నట్లుగా నుడువలేదు. తాను ములుగు గురులింగమూర్తికి శిష్యుడఁ నని అతనికృపవలనఁ దనకష్టాంగయోగనిష్ఠ గలిగె ననుమొదలగు నంశములఁ జెప్పె. కావున నీతనితండ్రి పెద్దతండ్రులను బట్టియే యితని కాలము నిర్ణయింపవలసివచ్చినది. ఇతనివర్ణనపద్యముల వివరించెదను. ఎట్లన్నను :_

"క. ములుగు గురులింగమూర్తికి, పొలుపుగ శిష్యుండ నభవుపూజాపరుఁ డై
     యెలమి నష్టాంగయోగము, లలవడి తన్మయత నంది యానందించున్.

చ. యమనియమాదియోగము లహర్నిశమున్ సలుపంగఁ గొంత చి
    త్తము విమలత్వమంది వితతస్ఫురితేంద్రియజాలభీషణా
    క్రమ మడఁగంగఁ బూర్వ ఘన కల్మషదూరతచే యనంతత
    త్వము మది నాటఁగాఁ దనదుభావమునన్ గనియెన్ సదాశివున్.

గీ. అట్టిననుగూర్చి జలదంకిపట్టణమున, నున్న జానకి రామేశుఁ డొయ్యనొయ్యఁ
   బలికె నీచేత నుడువగాఁబడినకృతికి, నన్ను నధినాఁథుఁ జేయు మటన్న నలరి."

ఇట్లుగా నున్నగ్రంథములోని కవిత్వ విశేషాదులు తెలుపఁజాలు నన్ని పద్యముల నీవఱకే వివరించియున్నాఁడను, కావున నీచారిత్ర మింతటితో వదలెదను. విష్ణుపురాణకవి యగువెన్నెలకంటిసూరనయొక్క సంపూర్ణ వంశావళి

హరితసగోత్రములో

సూరనసోమయాజి (రాజేంద్రచోళునికాలీనుఁడు)

|

కొడుకు(పేరులేదు)

|

సిద్ధనమంత్రి.

వెన్నెలకంటివారి కాలనిర్ణయము.

విష్ణుపురాణము, విక్రమార్కచరిత్రము, కృష్ణవిలాస మను మూఁడుగ్రంథములలో వివరింపఁబడిన వెన్నెలకంటివారికాలము నాయా గ్రంథములలోని యాధారములంబట్టి చేసిననిర్ణయము ఎట్లన్నను :_

శా. స. మొదలు శా. స. వఱకు
1 సూరనసోమయాజి 1030 1080
2 ఇతనికొడుకు 1080 1130
3 ఇతనికొడుకు సిద్ధమంత్రి 1130 1180
4 ఇతనికొడుకు భాస్కరుఁడను సూర్యుడు, జన్న మంత్రియు, వీరిలో భాస్కరుఁ డనవేమారెడ్డిపేరఁ గృతుల నిచ్చె. 1180 1230
5 పైవారిలో జన్నయకుమారుఁడు సిద్ధమంత్రి 1230 1300
6 పైవారిలో భాస్కరుని మనుమఁ డగుసూరన్న [విష్ణుపురాణకవి] 1300 1350
7 ఈ సూరకవి కొడుకు వెన్నెలకంటి వీరిలో నొక్కక్కరికేఁబది సంవత్సరముల వంతున మువ్వురికిని నూటయేఁబది సంవత్సరములు 1350 + 150 = 1500
8 ఇతనికొడుకు చక్రప్ప వెన్నెలకంటి
9 ఇతనికొడుకు గంగయ్య వెన్నెలకంటి
10 ఇతనికొడుకు వెంగయ్య 1500 లకు బూర్వమును బరమందుఁగూడ నున్నాఁడు.
11 ఇతనికొడుకు రామమంత్రి 1500 1550
12 ఇతనికొడుకు జగ్గన 1550 1600
13. ఇతనికొడుకు వేంకటాచలపతి 1600 మొదలు 1650


24.

రామగిరి సింగనకవి.

(పద్మపురాణోత్తరఖండము)

ఇతఁడు పద్మపురాణోత్తరఖండమును వాసిష్ఠ రామాయణముం దెనిఁగించిన కవిశిఖామణి. నియోగిశాఖాబ్రాహ్మణుఁడు. ఆపస్తంబసూత్రుఁడు. భారద్వాజగోత్రుఁడు భారతముఁ దెనిఁగించినతిక్కనసోమయాజి సంతతివారితో సంబంధి. ఇతఁడు భాగవతదశమస్కంధముఁగూడఁ దెనిఁగించితి నని తెల్పె. ఈపైరెండుగాథలను స్థిరపఱుచుపద్యముల వాసిష్ఠ రామాయణమునుండి యీక్రిందవి వరించెదము. అవి యెట్లనఁగా :_