కవి జీవితములు/జక్కనకవి

వికీసోర్స్ నుండి

స్కరుఁడే రెడ్డివేమనవలన ననేకాగ్రహారములఁ గొనియె. ఈవేమనయే హరివంశకృతిపతి. ఇఁక నాశ్వాసాంతపద్యములలో నున్నయీసిద్ధమంత్రివిశేషము లరయఁగా నితఁడు బెల్లముకొండ భైరవునికృపచేత సామ్రాజ్యలక్ష్మిం గైకొనియె నని యున్నది. ఎట్లన-

"శా. శ్రీ మద్బెల్లముకోండ భైరవకృపాశ్రీనిత్యసామ్రాజ్యల
      క్ష్మీమాధుర్యగృహాంతరాంతర - - - -" రెండవయాశ్వసాంతము.

మూఁడవయాశ్వాసముచివరను కర్ణాటరాజును సేవించువాఁ డని యున్నది. ఎట్లన :_

"కా. శ్రీ కర్ణాట మహామహేశ్వర సదా సేవా ప్రధానోత్తమా."

ఇతనికాలము శా. స. 1268 శా. స. 1300 వఱకు.

22.

జక్కనకవి.

ఈకవి నియోగిశాఖాబ్రాహ్మణుఁడు. ఇతనితాతపేరు పెద్దన. తండ్రిపే రన్న యామాత్యుఁడు. ఇతనిచారిత్రము నుడువుటకుఁ బూర్వ మితని యాశ్వాసాంతగద్యమును వివరించెదను. ఎట్లన్నను :_

"ఇది శ్రీమదఖిలకవిమిత్ర పెద్దయయన్నయామాత్యపుత్త్ర శారదాదయావిధేయ జక్కయనామధేయప్రణీతం భైనవిక్రమార్క చరిత్రం బనుమహాకావ్యంబునందు సర్వంబు నష్టమాశ్వాసము."

ఆంధ్రకవినుతి.

ఇతఁడు భారతకవిత్రయమును వినుతించె. ఈకవి యెఱ్ఱాప్రెగడకుఁ దరువాతివాఁడుగాఁ గాన్పించు. ముందుగా నీతని కవిత్రయవర్ణనముం దెల్పి అనంతర మితనికాలము నిర్ణయించుటకు యత్నించెదను. ఎట్లన్నను :_

నన్నయభట్టువర్ణనము.

"ఉ. వేయివిధఁబులంచుఁ బదివేవురు పెద్దలు సత్ప్రబంధముల్
      పాయక చెప్పి రిట్టు రసబంధురవాగ్విభవాభిరామధౌ

   రేయులు శబ్దశాసనవరేణ్యులు నాఁగఁ బ్రశస్తికెక్కిరే
   యేయెడ నన్న పార్యుగతి నిద్ధర నట్టిమహాత్ముఁ గొల్చెదన్."

తిక్కనసోమయాజివర్ణనము.

"చ. పరువడి భారతాఖ్య గలపంచమవేదము నాంధ్రభాష సు
    స్థిరత రచించుచోఁ గృతిపతిత్వము గోరి ప్రసన్నుఁ డైనయా
    హరిహరనాథుచేఁ బడసె నవ్యయసౌఖ్యపదంబు నెవ్వఁ డా
    పురుషవరేణ్యుఁ దిక్కకవిఁ బూని నుతింతుఁ గృతాధ్వరోత్సవున్."

ఎఱ్ఱాప్రెగడవర్ణనము.

"ఉ. ఈత్రయిఁ దాఁ బ్రటంధపరమేశ్వరుఁడై విరచించె శబ్దవై
      చిత్రి నరణ్యపర్వమున శేషము శ్రీనరసింహరామచా
      రిత్రములున్ బుద్ధవ్రజగరిష్ఠత నెఱ్ఱయశంభుదాసుఁ డా
      చిత్రకవిత్వవాగ్విభవజృంభితుఁ గొల్చెద భక్తియుక్తితోన్."

సిద్ధమంత్రి జక్కయకవి తాతతండ్రుల కావ్యవిశేషములు సభవారికిఁ దెలియునట్లు చెప్పుట.

"సీ. సంస్కృతప్రాకృత శౌరసేన్యాదుల, ఘటికలో నొకశతకంబుఁ జెప్పఁ
      బ్రహసన ప్రకరణ భాణాదిబహువిధ, రూపకంబులయందు రూఢిమెఱయఁ
      జక్రచతుర్భద్రచతురుత్తరాదిక, క్షుద్రకావ్యములు పెక్కులు రచియింప
      నాంధ్రకవిత్వంబునందుఁ బ్రబంధంబు, మేలుగా దజ్జుఞలు మెచ్చఁ జెప్ప

      నిమ్ముల నేరీతి నేధాతువుల నేమి, రసముననైన వర్ణనము సేయ
      సరి నేకసంధా ద్విసంధా త్రిసంధలఁ, దొడరినం బొరిపొరిఁ గడవఁ జదువ
      నెవ్వఁ డేయవధాన మెఱుఁగు నయ్యవధాన, ముల వాని కించుక ముల్లు సూప
      వృత్తకందముఁ గందవృత్తంబునుం జతు, ష్కందంబు మొదలుగాఁ గలుగుగర్భ
      కావ్యవర్గము జెప్పగాఁ బ్రబంథంబులు, గ్రొత్తలు పుట్టించుకొని లిఖింపఁ
      గా నక్షరచ్యుతకంబు మాత్రాచ్యుత, కంబు బంధచ్యుతకంబు నామ
      గోప్యంబులుం గ్రియాగోప్యంబులును భావ, గోప్యంబులును జెప్ప గోష్ఠియందు
      బద్యంబు గీతికార్భటినొగిఁ జదువంగ, నెల్లవిద్యల సంచు లెఱుఁగ నేర్తు
      ననుచు నెల్లూరితిరుకాళమనుజవిభుని, సమ్ముఖమ్మున సాహిత్యసరణి మెఱసి
      మహిమఁ గాంచినపెద్దనామాత్యసుకవి, మనుమఁడవునీవునీవంశ మహిమయొప్పు."

జక్కనతండ్రివిషయము.

"క. అడఁడు మయూరరేఖను, గాడంబాఱండు బాణగతి మన మెరియన్
     బ్రోడగుపెద్దయయన్నయ, మాడకు మాడెత్త యతనిమాటలు జగతిన్.

క. అని మీతండ్రిమహత్వము, జనవినుతరసప్రసంగసంగతకవితా
    ఘనతేజులు కవిరాజులు, గొనియాడుదు రఖిలరాజకుంజరసభలన్."

జక్కనకవివర్ణనము.

"క. చక్కన నీవైదుష్యము, చక్కన నీకావ్యరచన చాతుర్యంబుల్
     చక్కన నీవాగ్వైఖరి, చక్కన నీవంశమహిమ జక్కనసుకవీ.

క. స్వాభావికనవకవితా, ప్రాభవముల నుభయభాషఁ బ్రక్ఖాణింపన్
    భూభువనంబుల సరిలే, రాభారతి నీవుఁ దక్క నన్నయజక్కా."

ఇట్లున్న జక్కనకవివంశచారిత్రములో మనకుఁ దేలవలసిన యంశ మొకటియున్నది. అది నెల్లూరితిరుకాళరాయని కాలవివర మై యున్నది. ఇది తేలినయనంతరమే జక్కనకవి కాలమును తేలఁగలదు. దానిం గూర్చి గ్రంథాంతరములఁ జూడవలసియున్నది. లోకల్‌రికార్డులు 5 సంపుటము 27, 28 పుటలలో (Local Records Vol V. P. 27 & 28) నీక్రింది విధంబున నున్నది.

"తిరుకాళతి చోళమహారాజు రాజ్యభారముచేసిన తరువాతను, గణపతి దేవ మహారాజులు రాజ్యభారం యేలుతూవుండఁగా వారిఅగ్రసేనాపతి గంగయదేవమహారాజు సిద్ధవటం, పొత్తపినాటి మొదలగు సీమలు ప్రభుత్వము చేయుచుండి అప్పుడు తాలూకు మజుకూరు, పరగణే దువ్వూరిపైకి మవుదుకూరు అను గ్రామమం దుండిరి."

అని యున్నది. దీనింబట్టి కాకతీయగణపతి దేవుని రాజ్యమునకుఁ బూర్వము తిరుకాళచోడమహారాజు పైసీమను బాలించుచున్నట్లు గాన్పించును. కాకతీయులవంశచారిత్రముంబట్టి యాగణపతిరాజుకాలము శా. స. 1053 సంవత్సరమునకు బిమ్మట నైనట్లు స్పష్టమే. కావున నతనికిఁ బూర్వుఁ డగుతిరుకాళచోళమహారాజుకాలము శా. స. 1053 నకుఁ బూర్వమే అయియుండును. ఆరాజుపైఁ గృతులిచ్చి విఖ్యాంతిం గాంచిన పెద్దనకవి ఆసమీపకాలములో ననఁగా 1050 మొదలు 1150 సం. వఱకు నుండుననుటకు సంశయము లేదు. అతనిపుత్త్రుఁడు నన్నయ యను నతఁడు శా. స. 1150 మొదలు 1200 వఱకు నుండి యుండును. అతనికుమారుఁ డగుజక్కయకవి యేఁబదిసంవత్సరముల వాఁడే అయిన 1250 వఱకుగాని అంతకు నధికవయస్సువఱకు నుండిన శా. స. 1270 లేక 1300 వఱకుగాని యుండుటకు సందియముండదు. ఇది కృతిపతి యగు సిద్ధనకాల మై యుండినట్లుగా నీవఱకే మనము లెక్కించినారము ఆకారణమున నితఁ డెఱ్ఱప్రెగ్గడకుఁ గొంచెము దరువాతివాఁ డగుననుటకు సందియముండదు.

23.

వెన్నెలకంటి వేంకటాచలము

(కృష్ణవిలాసకవి)

ఇతఁడు నాఱువేలశాఖానియోగిబ్రాహ్మణుఁడు. హరితస గోత్రుఁడు. జగ్గనామాత్యునిపుత్త్రుఁడు. ఇతనివంశావళి వివరించుటకుఁబూర్వ మితనవలన వివరింపఁబడిన యాశ్వాసాంతగద్యమును వివరించెదను. ఎట్లన్నను :_

"ఇది శ్రీమదుమామహేశ్వర వరప్రసాదలబ్ధ శంకరభజనానంద ములుగు గురులింగారాధ్య పాదారవింద ధ్యానపరాయణ హరితసగోత్ర సుజనవిధేయ జగ్గనామాత్యపుత్త్ర వెన్నెలకంటి వేంకటాచల నామధేయ ప్రణీతం బైనకృష్ణవిలాసం బను మహాప్రబంధంబునందు"

ఆంధ్రగీర్వాణకవివర్ణనము.

ఈకవి యొకసీమలోఁ గొందఱఁ బ్రాచీన సంస్కృతకవులను మఱికొంద ఱాంధ్రకవులను గలిపి చెప్పియున్నాఁడు. ఇది యితరకవులలోఁ జూడఁదగుమార్గముకాదు. ఆపద్యమెట్లున్నదన :_

"సీ. కాళిదాసునిఁ దిక్కకవి నన్నపార్యుని, భారవి భవభూతి పాండుసు కవి
      మల్హ ణు బిల్హ ణు మాఘు మయూరుని, చోరుని నాచనసోము భీము
      పింగళిసూరన్న పెద్దనామాత్యుని, పొలుపొంద బమ్మెరపోతరాజు
      వంచేటిరంగన్న భాస్కరణమంత్రిని, వెల్లంకితాతప్ప మల్లుభట్టు

తే. మహిమమీఱంగ నాస్థానమంటపముల, సకలరాజులచేతను సన్ను తింపఁ
    బడినసుకవుల నందఱఁ బ్రస్తుతింతు, నింపుమీఱంగఁ గృతి రచియింపఁబూని."






`రంగ

</poem>