కథలు - గాథలు (దిగవల్లి శివరావు)/కాశీ యాత్ర చరిత్ర

వికీసోర్స్ నుండి

ఏనుగుల వీరాస్వామయ్యగారి

కాశీ యాత్ర చరిత్ర

నూటపాతికేండ్ల నాటి భారతదేశ స్థితిగతులను గూర్చి

వర్ణించు అపూర్ఫమైన చరిత్ర గ్రంధము

డెమ్మీసైజు

500 పుటలు

చక్కని అచ్చు


సంపాదకుడు: ది గ వ ల్లి వేం క ట శి వ రా వు.

వెల: చందాదారులకు రు.1-8-0.

ఇతరులకు రు.2-0-0


శ్రీ గిడుగు రామమూర్తి పంతులుగారి అభిప్రాయం

"నూటయిరవై యేండ్లక్రిందట చెన్నపట్టణమందుండే సుప్రీం కోర్టులో ఇంటర్ ప్రిటర్ హోదాలో గొప్ప అధికారంవహించి చాలా పలుకుబడి గలిగి, తన విద్య చేతను ధర్మము చేతను శీలము చేతను త్యాగముచేతను అసాధారణపురుషు డని కీర్త్రి పొందిన ఏనుగుల వీరాస్వామయ్యవారు సకుటుంబముగాను సపరివారముగాను కాశీయాత్ర పోయినప్పుడు తాను చూచిన దేశములు, నగరములు, పల్లెలు, అందుండే నానాజాతుల మనుష్యులు వారి వృత్తులు ఆచారములు మొదలయిన విషయములు సవిస్తరముగా వర్ణిస్తూ దినచర్య రచించినాడు. అతని మిత్రుడు కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళ అనే ఆయన గవర్నమెంటువారి ఉత్తరువు ప్రకారము ఈ గ్రంధము 1838 వ సం॥లో అచ్చు వేయించి ప్రకటించినాడు. (డెమ్మీ 8 వ వంతు సైజులో చిన్న అచ్చులో) 328 పుటలు గలిగి ఉన్నది. గ్రంధకర్త చరిత్రకూడా పిళ్ళగారు రచించి చేర్చినారు--- గ్రంధకర్త పాండిత్యము లోకజ్ఞానము గ్రంధమంతా చదివితేకాని తెలియదు."

1838 లో అచ్చైన ఈ పుస్తకముయొక్క ప్రతులు ఇప్పుడు చదవడానికైనా ఎక్కడా దొరకడం లేదు. ఏమారుమూలనైనా తలవని తలంపుగా ఒక ప్రతిదొరికినా దానిలోని పుటలు త్రిప్పితేనే నుసిఅయిపొయేటంత పాతబడి పెళుసెక్కి వున్నాయి. వీరాస్వామయ్యగారు 1832 ఆ ప్రాంతంలో సి.పి.బ్రొను దొరగారికి వ్రాయించి పంపిన పుస్తకం వ్రాతప్రతియొకటి చెన్నపట్టణం ఓరియంటల్ మాన్యూస్క్రిప్టు లైబ్రరీలో ఉందిగాని అది చదవడానికి అక్కడకు వెళ్ళి కొన్నాళ్ళు ఉండాలి. అందువల్ల ఈగ్రంధము, మంచి కాగితములపైన చక్కగా ముద్రింపబడుచున్నది . ఇది పెద్ద అచ్చులో డెమ్మీసైజున 500 పుటలుంటుంది.

పుస్తకం రచియింపబడిన నాటికీ నేటికీ మనదేశ పరిస్థితులలో చాలా మార్పులు వచ్చాయి అందువల్ల అప్పట్లో వీరాస్వామయ్యగారు తన కాలమునాటి వారందరికీ తెలిసిన సంగతులే యని విపులముగా వ్రాయక సూచించి వదలిన రాజకీయ సాంఘిక చారిత్రక అంశము లనేకము లిప్పుడు విప్పి చెప్పితేనే గాని అర్ధంకావు. ఉదాహరణానికి తిరుపతి దేవస్థానం వల్ల కుంఫినీవారికి ప్రతిసాలున లక్షరూపాయిలు ఆదాయం వస్తున్నదని ఆ గ్రంధంలో వ్రాసివున్నది. ఆ కాలంలో మన ధర్మాదాయా లన్నీ కుంఫినీవారే స్వయంగా పరిపాలించే వారనిన్నీ భోగములు అర్చనలు కలెక్టర్లే చేయించే వారనిన్నీ మిగిలిన సొమ్ము కుంఫినీ ఖజానాలో చేరే దనిన్నీ ఆ కాలమునాటి చరిత్ర చదివితే తప్ప తెలియదు. ఇలాంటి చరిత్రాంశము లన్నటికీ తగిన వివరణములు, తబ్సీలు, వ్రాయబడినవి.

వీరాస్వామయ్యగారి పర్యటనమును తెలుపగల ఒక హిందూదేశ పటము దీనిలో చేర్చబడినది. శ్రీ వీరాస్వామయ్యగారి యొక్కయు, ప్రజాసేవయందు వీరికి తోడ్పడిన వీరి మిత్రులైన కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళగారు, వెంబాకం రాఘవాచార్యులుగారు, జార్జి నార్టనుగార్ల యొక్కయు చిత్రపట మొకటి దీనిలో చేర్చబడినది.

1824-1826 మధ్య కలకత్తాలో కుంఫినీవారి కొలువులో ప్రధాన క్రైస్తవమతాధికారిగా నుండిన బిషప్ హెబరుదొర భారతదేశములో పర్యటనము చేసి తాను చూచిన సంగతులను తన దినచర్యలోను తన భార్యకు స్నేహితులకు వ్రాసిన ఉత్తరాలలోను వ్రాసియున్నాడు. ఇది బిషప్ హేబర్సు జర్నల్ అని మూడు సంపుటములుగా ప్రకటించబడి ఆ కాలంనాటి హిందూదేశ చరిత్రను గూర్చిన ప్రమాణ గ్రంధముగా పూజింపబడుతూ వున్నది. మన వీరాస్వామయ్యగారి గ్రంధం ఆ గ్రంధాని కేవిధంగాను తీసి కట్టుకాదు. సందర్భానుసారంగా హెబరుగారి గ్రంధంలో నుండి కొన్ని సంగతులీ గ్రంధంలో అక్కడక్కడ ఉదాహరింప బడినవి.

వలయువారు:-

దిగవల్లి వేంకట శివరావు, బెజవాడ, అని వ్రాయవలయును.


షరా:--చందాదారులు అచ్చుపూర్తయ్యేలోగా రు.1-0-0 చెల్లించవలెను.


ఏ.జి. ప్రెస్, బెజవాడ.

ఏనుగుల వీరాస్వామయ్యగారి

కా శీ యా త్ర చ రి త్ర

నూటపాతికేండ్ల క్రిందటి భారతదేశ స్థితికగతులు అందలి పుణ్యక్షేత్రాలు, వివిధప్రాంతాల స్త్రీ పురుషుల ఆచారవ్యహారాలు, దేశపరిపాలన, ప్రజల స్థితిగతులు, కన్నులకు గట్టినట్లు తేట తెలుగులో వర్ణిస్తూ విద్యాధికులైన వీరాస్వామయ్యగారు 1830-1831 సం॥ల మధ్య చెన్నపట్నంలోని తన స్నేహితునికి లేఖలుగాను దినచర్యగాను వ్రాసిపంపిన యాత్రావిశేషా లీ గ్రంధరూపకంగా ప్రకటింప బడ్డాయి. మధ్యమధ్య అనేక విషయాలను గురించి చర్ఫలు, ప్రసంగాలు ఉన్నాయి. మచ్చుకు ఈ క్రిందివిషయం చూడండి.

* * * * *

"(146) ఈ బ్రహ్మాండములో కన్యాకుమారి మొదలు కాశ్మీరమువరకు నుండే దేశము సర్వోత్తమమయిన కర్మ భూమియయి శాపానుగ్రహశక్తులయిన అగస్త్యాది ఋషులకు వాసయోగ్యమయి యుండిన్నీ ఈ బ్రహ్మాండము యొక్క చివరను వసింపుచు పూర్ఫకాలమునందు పశుప్రాయులుగా నుండిన యింగిలీషువారిచేత యిప్పుడు యేలబడి యున్నది. (147) మరిన్నీ ఇప్పుడు కర్మశూన్యులయిన ఆ యింగిలీషువారు ఈశ్వర కటాక్షమునకు ఈ కర్మ దేశస్థులకంటే యెక్కువగా పాత్రులై ఉండవలసిన కారణమేమని యోచించినంతలో నాకు శ్రీరాములు తోపచేసిన యుక్తియేమంటే తత్వబోధ సాధనమయిన విద్యాబుద్ధిలేని వారికిన్ని స్త్రీ బాలులకున్ను భక్తి జనితమయ్యే నిమిత్తముగా ముఖ్యముగా కర్మాదులనున్ను, బింబారాధనలనున్ను ఉద్దరించిన పూర్వీకు లయిన స్మర్తలు బింబాలకుమనోజ్ఞమయిన మధుఘృతాదులతోనున్ను, ఫలరసాదులతోనున్ను అభిషేకముచేసి, ఆలయాలు కట్టియుంచి అలంకరించి ఉపస్మర్తలు భక్తిని వృద్ధిచేస్తే అంతమంచిది, యెంత పెద్దగుడి చిత్రాలతో కట్టితే అంత పుణ్యము , యెన్ని విచిత్రాలతో అలంకరించితే అంత శ్రేష్టము, యెందరిని రూపవంతులయిన దాసీలను రాజోపచార నిమిత్తముగా గుడిలో వుంచితే అంత గుణ మని వ్రాసినందున యధోచితములయిన పంచామృతాభిషేకములను వదిలి అంతర్యామి రూపముతో పరమాత్మ వసింపుచు నుండే దేహములకు భోజ్యములయిన వస్తువులను విస్తరించి బింబములమీద పోయుచు వ్యర్ధ పరచుచు రాసాగి దర్శనమాత్రముచేతనే కామవికారములను పుట్టించే ప్రతిమలతోనున్న చిత్రములతోనున్ను దేవాలయములను కట్టసాగిరి. మరిన్ని సాధారణపు స్త్రీపురుషుల ధరించిన వికారవేషములతొనున్ను వికారచర్యలతోనున్ను బింబాలను అలంకరించ సాగిరి. మరిన్ని ఆగుడికంటే యీ గుడిలో విభవము యెక్కువ అనిపించవలెనని పై పోటీలతో వ్యర్ధముగా ద్రవ్యవ్యయముచేసి పయిన చెప్పిన పనికిమాలిన పనులు జరిగించి అలాటి అలంకార విభవముల గుండా లోకులకు భక్తిని కలగజేయ సంకల్పించినందున సర్వాంతర్యామియైన భగవంతునికి అది విరుద్ధముగా తోచినది. ఆ ప్రకారమే బ్రాంహ్మణులను సత్కర్మల నాచరింఫుచు లోకుల శ్రేయస్సును ప్రార్ధింపుచు అందరినిన్ని ఆశీర్వదింపుచు నుండునని చెప్పితే మేము సర్వోత్కృష్టులమని అహంకరించి ఇతరవర్గములను తృణీకరించ సాగిరి.

  • * * * *

సగుణబ్రహ్మారాధన విషయమయి చిత్తము భక్తికలిగి తదేక నిష్ఠతో ఉండేకొరకు ధ్యానారంభకాలమునందు (148) యధోచితముగా తగుపాటి మత్తద్రవ్యమును సకృదానృత్తి పుచ్చుకొను మని పూర్వీకులు దోవచూపితే సారాయి పీపాయీలను ఖాళీచేయ సాగినారు. గోబ్రాహ్మణ పోషణ ప్రకటన మయ్యేకొరకై వారిపోషణ విషయమై అబద్ధమయినా ఆడవచ్చునని పూర్వీకులు వారిపక్షముగా వ్రాస్తే అబద్ధముతోనే జీవనము చేయసాగిరి. వృద్ధమాతా పితృపోషణ ముఖ్యమని తెలియ పరచను "అప్యకార్యశతం కృత్వా" అని మనువు వ్రాస్తే పరద్రవ్యమును పేలపిండివలెనే భుజింప సాగిరి. ఈ రీతిగా పూర్వీకులు కడతేరేటందుకు వేశిన మొలకలను విషధారలతో పెంచినందుచేత విషజ్వాలాసహితములైన ఫలములే ఫలించినవి. కలిలో భావిఫలములను పూర్వీకులు ఊహించినట్టు ఈ కర్మఠులు బహుమంచిది బహుమంచిది అనిచేసే పనులంతా యీశ్వరదృష్టికి అపరాధములుగా తోచి, ఈ విపరీతము లయిన ఆచారములనున్ను అర్చనల నున్ను బొత్తిగ నిలప దలచి యిప్పుడు ఈ బ్రహ్మాండములో యధోచితముగా పదవాక్య ప్రామాణ్యముగల యింగిలీషు వారిని యీ కర్మభూమిని యేలేటట్టు చేసినాడు." 500 పుటలు: వెల రు.2--8--0

వలయువారు:-- దిగవల్లి వేంకట శివరావు, బెజవాడ, అని వ్రాయుడు.ఏ.జి. ప్రెస్, బెజవాడ.