ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/సంరంభము

వికీసోర్స్ నుండి

వయోవ్యత్యాస మెక్కువగఁ గలిగి, ఆగ్రహ మితభాషిత్వములతో నొప్పెడి వీరేశలింగముపంతులుగారి నెన్నఁడునుగాని మేము వేయ వెఱగండెడిప్రశ్నములకు, సమవయస్కులగు నాయఁడుగారు సౌమ్య భావమున సదుత్తరము లిచ్చు చుండువారు. యువజనహృదయాకర్షము చేయుసమర్థతయు, వారలను సన్మార్గమునకుఁ బురిగొల్పెడి సౌజన్యమును, వారియందుఁ గలవు. కావున నేను గనులనుగుఱించి చెన్నపురికిఁ గట్టినపయనము వ్యర్థ మని యెంచక, అంతర్చక్షువికసనమున కిది సందర్భ మయ్యెనని మిగుల సంతసించితిని.

చెన్నపురియందు నే నుండు దినములలోనే యచటి బ్రాహ్మసమాజవర్ధంతి జరిగెను. ఆసందర్భమున నాయఁడుగా రొక యుపన్యాసము చేసిరి. ఆయుత్సవానంతరమున, 1892 జనవరి 4 వ తేదీ సోమవారమున చెన్నపురినుండి నే నింటికి బయలుదేఱితిని.

38. సంరంభము

ఆకాలమున చెన్నపురి నుండి యుత్తరాంధ్రమండలములకు రెయిలుపయనము చేయువారు మిగుల మెల్లగను, మిక్కిలి చుట్టు మార్గమునను పోవలసివచ్చెను. మద్రాసు నుండి గుంతకల్లువఱకును మెయిలులో నొకరాత్రి; గుంతకల్లునుండి కంభమువఱకు నొకపగలంతయు; అంత, కంభము చలిలో నిర్బంధ విశ్రమము రాత్రియంతయు; కంభమునుండి బెజవాడకు మఱునాఁటి యుదయమునుండి సాయంకాలము వఱకును. నేను పయనము చేయుబండిలో నదృష్టవశమున మద్రాసునుండి బెజవాడవఱకును ఇంజనీరింగ్ కాలేజివిద్యార్థు లుండిరి. వారిలో నా పూర్వసహపాఠి రంగనాయకులుగారుండుటవలన నాకుఁ గాలక్షేపము సుకర మయ్యెను. బెజవాడలో నే నెక్కినపడవలోనే నాగపూరులో జరిగినదేశీయమహాసభకుఁ బోయి వచ్చుచుండెడి కొందఱు మిత్రు లుండిరి. వీరిని రాజమంద్రి కొనిపోవుటకు పాపయ్యగారు మున్నగు స్నేహితులు వచ్చిరి. కాఁబట్టి పడవలోఁగూడ నాకు సుఖముగ నుండెను. 8 వ తేదీని రాజమంద్రి చేరితిని.

13 వ తేదీని సంక్రాంతినాఁడు రాజమంద్రి పురమందిరములో కీ. శే. బసవరాజు గవఱ్ఱాజుగారి ఛాయాపటము నెలకొల్పు సందర్భమున నొకబహిరంగసభ జరిగెను. కళాశాలాధ్యక్షులు మెట్కాపు దొరగారు ఆసభ కధ్యక్షులు.

చెన్నపురినుండి వచ్చినపిమ్మట, మద్రాసు బ్రాహ్మసమాజ పద్ధతులను జూచివచ్చినహేతువున, మతవ్యాపనమం దెక్కువ శ్రద్ధ వహించితిని. సమాజమునకు నూతన సభ్యులను జేర్చితిని. ఇన్నిసుపేటలో రెండవ ప్రార్థనసభ నేర్పఱిచితిమి. జనవరినుండియు సత్యసంవర్థనీవ్యవహారకర్తగఁ బని చేయుటకు సాంబశివరావు సమ్మతించుట చేత, ఆపని యాతని కొప్పగింపఁబడెను. తమ్ముఁడు నేనును జదువుకొనుట కొకగది పెద్దరస్తా సమీపమునఁ గుదిర్చితిమి. అది యిపుడు సమాజాభిమానులు తఱుచుగఁ గూడి సంస్కరణవిషయములు, పత్రికా వ్యవహారములును జర్చించుకొను రచ్చసావడి యయ్యెను. ఇంతలో విశ్వవిద్యాలయ పరీక్షాఫలితములు తెలిసెను. కొండయ్యశాస్త్రి ప్రవేశపరీక్షయందును, కనకరాజు గంగరాజులు ప్రథమశాస్త్ర పరీక్షయందును నుత్తీర్ణులైరి. పట్టపరీక్షకుఁ జదువుటకై గంగరాజు చెన్నపురికిఁ బోయెను. చదువు చాలించి యుద్యోగము చేయఁజూచిన కనకరాజు, మిత్రులమగు మా ప్రోత్సాహమున రాజమంద్రి కళాశాలలో పట్టపరీక్షతరగతిలోఁ జేరెను. ఇంతియ కాదు. నే నిదివఱకు మిత్రులతోఁ గలసి యాలోచించుచుండిన "ఆస్తికపాఠశాలా" స్థాపనవిష యమై యిపుడు గట్టిగఁ దలపోయసాగితిమి. ఈ సంవత్సరము పట్ట పరీక్ష పూర్తిచేసి, బోధనాభ్యసనమునకై రాఁబోవువత్సరము తాను సైదాపేటకుఁ బోయెదనని మృత్యుంజయరావు చెప్పెను. నేనును పాఠశాలలోఁ బనిచేయ నిశ్చయించి, నరసింహరాయఁడుగారిని గూడఁ జేరున ట్లొప్పించితిని. కనకరాజు కూడ చేరెద ననెను.

సమాజప్రార్థనలతోఁ దనివి నొందక, నిత్యకుటుంబప్రార్థనలు జరుపుట కర్తవ్యమని వీరేశలింగముపంతులుగారు మాకు హితబోధనము చేసిరి. తమరు వారమువారమును జరుపు ప్రార్థనసభలకు నాతల్లిని భార్యను బంపు మని రాజ్యలక్ష్మమ్మగారు నన్నడిగిరి. లక్ష్మీనారాయణగారు నేనును మాటాడుకొనుచు, స్నేహితులసతీమణు లందఱు నొకచోట సమావేశమై చదువు సాగించుకొనుట యుక్తమని భావించితిమి. కాని, సమష్టికుటుంబములలో కూరుకొనిపోయెడి చిన్న కోడండ్రు ధైర్యమున బయటపడి, తమచదువు సాగించుటకుఁ గాని, ప్రార్థనసభలు జరుపుటకుఁగాని యెట్లు సాధ్య మగును?

లక్ష్మీనారాయణగా రిపుడు ప్రార్థనసమాజాదర్శములనుగుఱించి యెక్కువ సానుభూతిఁ జూపుచుండెడివారు. అపుడే జరిగిన యొక బోగముమేళమునుగుఱించి యాయన యొక పెద్దజాబు వ్రాసి, అది మాపత్రికలోఁ బ్రచురింపఁగోరెను. అంత పెద్దలేఖకుఁ దావు లేనందున, అది సంగ్రహవార్తగ ఫిబ్రవరిపత్రికలోఁ బ్రచురింపఁబడెను. ఆకాలమున మిత్రులలోఁ గలవరమునకుఁ గారణ మయ్యెను గావున, దాని నిచట నుల్లేఖించుచున్నాను. కనకరాజుయొక్క కటుపద ప్రయోగములతోఁ గూడిన దిద్దుఁబాటు లిందుఁ గానఁబడగలవు : -y

"కడచిన మకరసంక్రాంతినాఁడు, మన పట్టణములో పట్ట పరీక్షయందు తేరినవారు కొందరును, ఆపరీక్షకు పోదలచినవారు కొందరును, నిర్వ్యాపారులై కాలమువ్యర్థపుచ్చు మరికొందరును, మనయెదుటనే యెన్నియో సంసారముల గూలద్రోచి, ప్రస్తుతము కోరలు పెరికిన వృద్ధకాలసర్పమువలె నున్న ఒకవేశ్యాకాంతయొక్క ముద్దుకూతురిచే గజ్జె కట్టించిరి. కామశాస్త్రోపాధ్యాయి యగు ఆమెయు తనగాత్రముయొక్క అభివ్యక్తిచేతను, నేత్రవిలోకములచేతను, అభినయముచేతను, పాడినగీతముల దుర్నీతులచేతను, 'బ్రదుకుదినముల మోక్షంబు వెదుక నేల ?' అను మృగధర్మమును వారిమనస్సులకు నాటునట్లు బోధించి చెనెను. పామరజనులను సన్మార్గమునకు పురికొల్పవలసిన పట్టపరీక్షావిద్యార్థులే కులటల నాదరించుచున్నపుడు, మనదేశ మెప్పు డున్నాతస్థితికి వచ్చునో తెలియకున్నది."

ఈవార్త పత్రికలోఁ బ్రచురించినందున కనేకులు నన్ను నిందించిరి. సభకు వెళ్లిన విద్యార్థులు కొందఱు రోషపడిరి. తమ్ము నవమానించినందుకు నామీఁద నభియోగము తెచ్చెద మని కొందఱు భయపెట్టిరి. నామీఁద వ్యాజ్యెము తెమ్మని యా వేశ్యను కొందఱు పురికొల్పిరి. నామూలమునఁ దామును జిక్కులలోనికి వచ్చెద మని సమాజమిత్రులు కొందఱు భయపడిరి. తమ లేఖామాతృకను దమ కిచ్చి వేయుమని భీతిల్లిన లక్ష్మీనారాయణగారు నన్ను వేఁడిరి. నే నది యిచ్చివేసితిని. ఒకనాఁడు నాపూర్వసహచరుఁ డొకఁడు నాగదిలోనికి వచ్చి, "ఈసత్యసంవర్థనీపత్రికను నడపువారు, మీవిద్యార్థులే కాక, మీనాయకుఁడు వీరేశలింగముపంతులుకూడను కాదా ? పత్రికాధిపత్యమునందు ఆయనకును బాధ్యత యున్నదికాదా ? " అని నన్నడిగెను. ఆయనకూడ పత్రికాధిపత్యమున భాగస్వామియే యని నే జెప్పితిని. "పెద్దవారగు పంతులుగారియాలోచన పుచ్చుకొనియే మీరీపత్రిక నడుపుచున్నారుకాదా ?" అని నాసహచరునిప్రశ్న. "అవును. పంతులుగారు పత్రికాధిపత్యమందును మాకు నాయకులే !" అని నాసమాధానము.

ఈసంభాషణ జరిగిన యొకటిరెండురోజుల కీసావాసుఁడు మరల నాకుఁ గనిపించి, మానరక్షణమును గుఱించి వేశ్య వ్యాజ్యెము తెచ్చుట మానుకొనె నని చెప్పెను. కారణ మడుగఁగా, వెనుకటిసారి నాతో నతఁడు మాటాడునపుడు, ఆవేశ్య నాగదిప్రక్కగదిలో నిలుచుండి సంభాషణ యంతయు విని, పెద్దపులివంటి వీరేశలింగము పంతులే యీవ్యవహారములో నుండుటచేత, తనయాటలు సాగవని భీతితో నుద్యమము విరమించుకొనె నని చెప్పెను ! వేశ్యాజన ప్రియుఁడగు నా యీ పూర్వసహచరుఁడే, ఆ స్త్రీ యాప్రక్కగదిలోనికి వచ్చిపొంచుని వినునట్టి యేర్పాటు చేసేనట !

సత్యసంవర్థనీ పత్రికాధిపతిమీఁదను, ప్రార్థనసమాజముమీఁదను జనులకుఁ గొందఱికిఁగల యాగ్రహ మింతటితో నంతరింప లేదు. 19 వ మార్చితేదీని పురమందిరమున జరిగిన నాటకసందర్భమున, ప్రహసనములో ప్రార్థనసామాజికులు పత్రికాధిపతియును వెక్కిఱింపఁబడిరి. ఇది జరిగిన కొలఁదిదినములకే ప్రార్థనసమాజవార్షి కోత్సవము జరిగెను. ఏఁటేఁటను, ఈ సందర్భముననే ప్రార్థనసమాజమువారిని వెలివేయుటకు యత్నములు జరుగుచుండెడివి. పూర్వాచారపరులకు మామీఁద నిపుడు పూర్తిగ నాగ్రహము గలిగెను. ఉత్సవదినములలో నన్నదానమునకై వంట చేయుటకు బ్రాహ్మణులు రాకుండఁజేయు ప్రయత్నములు జరిగెను. వంటపందెర మీఁద రాళ్లు రువ్వఁబడెను. సారంగధరుని మెట్టమీఁద ఫలాహారములు చేసిన వారిని వెలివేయుట కిపుడు ప్రయత్నములు సాగెను. ఈసందర్భమున పూర్వాచారపరులను బురికొల్పుటకు కళాశాలోపాధ్యాయులు కొందఱును వారి శిష్యులు కొందఱును పట్టుదలతోఁ బనిచేసిరి. ప్రార్థనసామాజికులకు పూఁటకూళ్ల యిండ్లలో రెండుదినములు భోజనము దొరకకుండఁ జేసిరి. అంత, కనకరాజు నేనును కళాశాలాధ్యక్షుని దగ్గఱకుఁబోయి, ఉపాధ్యాయుల కుట్రను వారి కెఱిఁగించితిమి. ఆయన మాకుఁ దోడుపడెద నని చెప్పి, ఆయుపాధ్యాయులను వారించెను. బహిష్కరణప్రమాద మంతట మెల్ల మెల్లగఁ దొలఁగి పోయెను. కాని, ప్రార్థనసమాజ శత్రుల యీర్ష్యారోషము లింతటితో నస్తమింపలేదు. 11 వ ఏప్రిలు తేదీని "రాజమంద్రి యందలి ప్రస్తుత పరిస్థి"తుల ను గూర్చి యొక న్యాయవాది పురమందిరమున నుపన్యాస మిచ్చెను. వాదప్రతివాదనల తీవ్రతచేత సభ యల్లకల్లోల మయ్యెను. ఆసమయమున మిత్రుఁడు కనకరాజు చేసిన యప్రస్తుత ప్రసంగమునకు స్నేహితులము వానిని నిందింపఁగా సమాజము వదలివేతు నని యాతఁడు చెప్పివేసెను గాని, పాపయ్యగారి శాంతవచనములచే మనస్సు మార్చుకొనెను.

నా పూర్వమిత్రుఁడగు మహమ్మదు బజులుల్లా సాహేబు, ఒక బ్రాహ్మణ స్నేహితునితోఁ గలసి యిపుడు "సత్యాన్వేషిణి" యనునొక యింగ్లీషు వార్తాపత్రికను నెలకొల్పెను. దాని మొదటి సంచిక 12 వ ఏప్రిలున వెలువడెను. మతసాంఘిక విషయములు చర్చింప నుద్యమించిన యీతోడి మాసపత్రికకు ఏప్రిలు సంచికలో సత్యసంవర్థని సుస్వాగత మిచ్చెను గాని, సంస్కరణ నిరసనమే ముఖ్య కార్యముగఁ జేసికొన బయలువెడలిన యీనూతనపత్రికకు మాకును ముందు పోరు ఘోరముగ జరుగు నని మేమెఱిఁగియే యుంటిమి.

౩౯. స్నేహభాగ్యము

౧౮౯౨ వ సంవత్సరము మార్చి తుదివారమున జరిగిన మా ప్రార్థనసమాజ జయంత్యుత్సవసమయమున సభ్యుల మందఱము నమితోత్సాహమున నుంటిమి. వీరేశలింగముగారు "మానుషధర్మము"ను గుఱించియు, నరసింహరాయఁడుగారు "విశ్వాసము"ను గూర్చియు, కనకరాజు "దేవేంద్రనాధు"నిగూర్చియు, నేను "ప్రేమపారిశుద్ధ్యము"నుగుఱించియు,ధర్మోపన్యాసములు చేసితిమి. బీదజనులకు అన్నదానము చేయఁబడెను. ఏకాంతప్రార్థనమునకై సారంగధరపర్వతమునకుఁ బోయి వచ్చితిమి.

వేసవికి కళాశాల మూయుటచేత పట్టణమునుండి సమాజ మిత్రులు తమ తమ గ్రామములకు వెడలిపోయిరి. సత్యసంవర్థనిని విడిచి వెంటనే నే నెచటికిని బోలేకపోయితిని. పత్రికకు వ్యాసములు వ్రాయుచును, చందాదారులతో నుత్తరప్రత్యుత్తరములు నడపుచును, నేను రాజమంద్రిలో చల్లనిగాలి ననుభవించుచుంటిని! ఇపుడు స్కాటు దొరగారు నాయింగ్లీషువ్యాసములు దిద్దుటకు నిరాకరించుటచేత, ఆంగ్లేయవ్యాసరచనయం దెక్కువజాగ్రత్త వహించితిని.

ప్రార్థనసమాజసంపర్కము వదలుకొను మని తండ్రియు మామయు నాకు హితబోధము చేసిరి. పత్రికమూలమున నాతలంపులు కార్యములును రచ్చ కెక్కుచుండెను. ఇపుడు వేలివెన్ను నుండి వచ్చిన నాభార్య, సమాజవార్షిక సమయమందలి మాచర్యలు, అచటిచుట్టముల హృదయములను గలంచివైచె నని చెప్పెను. నేను విద్యాభ్యాసమును గూర్చి శ్రద్ధఁబూని, యుద్యోగసంపాదనమునకుఁ గడంగవలయునే కాని, నిరర్థక సంస్కరణములవిషయమై కాలమును వ్యర్థపుచ్చరా దని,