ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/రాజమహేంద్రవరము

వికీసోర్స్ నుండి

6. రాజమహేంద్రవరము

రేలంగి పాఠశాలలోని మిక్కిలి పెద్దతరగతిపరీక్షలో జయమంది, నేనును మఱికొందఱు విద్యార్థులును మా ప్రథమోపాధ్యాయు వొద్ద ప్రత్యేకముగ నింగ్లీషు మూఁడవపాఠపుస్తకము చదువ నారంభించితిమి. ఇట్టి యసంపూర్ణ ప్రయత్నములవలన నంతగ లాభము లేదని గ్రహించి, మాతలిదండ్రులు మాయున్నతవిద్యాభివృద్ధికై మమ్ము రాజమంద్రి కొనిపోఁదలఁచిరి. మారెండవ పెత్తండ్రి పెద్దకొడుకు నాగరాజు, వయస్సున నాకంటె నైదారేండ్లు పెద్దవాఁడు, ఆంగ్ల విద్యనిమిత్తమై రాజంద్రి యంతకుమునుపే వెడలిపోయెను. దేశమంతయు తిరిగి, ఇంగ్లీషువిద్య నేర్చినవారికే యెల్లెడల నున్నతపదవులు లభించుట కనిపెట్టిన మాజనకుఁడు, మే మింక స్వగ్రామమున నుండుట ప్రయోజనకారి కా దనియు, కుటుంబమును పట్టణమునకుఁ జేర్చినచో మరల తనకుద్యోగసంపాదనమును మావిద్యాపరిపోషణమును గలుగు నని యెంచి, 1882 సం. జూలైనెలలో మమ్మందఱిని రాజమంద్రికిఁ గొనిపోయెను. ఇన్నిసుపేటలోని గొట్టుముక్కలవారి యింటిలోని మొదటిభాగము, పూర్వము మా మేనమామలు నివసించి యుండునది. మే మిప్పుడు నెల కొకరూపాయ యద్దెకుఁ బుచ్చుకొంటిమి. ఇప్పటివలె నింటిమీఁద నిల్లుండి, దోమలకును దుర్వాసనలకును తావలము గాక, ఆకాలమం దా పేట యుద్యానవనమువలెఁ జెన్నొందుచుండెను. మే మున్నయింటిపెరడు విశాలముగ నుండి, చూతనారికేళాది ఫలవృక్షముల కాకరమై, కొనసీమతోఁటవలెఁ జెలువారుచుండెను. పేటమధ్యమున పండ్లయంగడులు కాయగూరల దుకాణములు తదితర వస్తువిక్రయశాలలు నొప్పారుచుండెను. పెద్దవీధి కిరుకెలంకులందును పలురకముల పూలచెట్లు వెలసియుండెను. ఈదృశ్యములు మాచిన్ని కన్నుల కద్భుతామోదములు గొలుపుచు, స్వర్గలోక సౌదర్యముల స్ఫురింపఁజేయుచుండెను.

1882 వ సంవత్సరమున రాజమంద్రిలో "దేశాభిమాని పాఠశాలా"ధికారి సాహాయ్యమున వారిపాఠశాలలో ప్రవేశించి, ఆఱునెలలుమాత్రమే చదివి, ఆసంవత్సరాంతమున నేను వెంకటరామయ్యయును వరుసగా 3, 1 తరగతులపరీక్షల నిచ్చితిమి. మరుసటిసంవత్సరమున దానికంటె చేరువను క్రమముగ జరుగుచుండెడి "ఇన్నీసుపేట పాఠాశాల"లో మే మిరువురమును జేరితిమి. 1883 వ సంవత్సరాంతమున "తారతమ్యపరీక్ష"లోను, మరుసటి సంవత్సరమున "మాధ్యమికపరీక్ష"లోను, నేను గృతార్థుఁడ నైతిని. నావలెనే నాతమ్ముఁడును విద్యాభివృద్ధిఁ గాంచుచుండెను.

రాజమంద్రిలో మావిద్యావిషయమై మా జననీజనకులు పూనిన శ్రద్ధనుగుఱించి యొక్కింత ప్రస్తావింపవలెను. మా చదువుసాములు క్రమముగ నెరవేరుటకై మాతండ్రి మరల సర్వే యుద్యోగములోఁ జేరి సాధారణముగఁ బరదేశమున నుండెడివాఁడు. తా నెన్ని కడగండ్లుపడి యెట్టిశోధనలకు గుఱి యయ్యును, మా విద్యాభివృద్ధికిని కుటుంబ పరిపోషణమునకును వలయుధనము నాయన సముపార్జనము చేసి మాకుఁ బంపుచుండువాఁడు. ఈసొమ్ముతో మాతల్లి యిల్లు నడుపుచు, మాచదువులు సాగించుచువచ్చెను. తండ్రి యింట లేని బాలకులు, దుస్సహవాసముల మరగి, దుష్ప్రవర్తనలకు దిగి,కాలము దుర్వినియోగము చేసెద రను గట్టినమ్మకమున నామె, పాఠశాలకును బజారు వెచ్చములకును బోవునపుడు తప్ప తక్కినకాలమందు, మమ్ము గడపదాటనీయకుండెడిది! ఇది మాస్వేచ్ఛ కమితప్రతిబంధకమై కుఱ్ఱవాండ్రము సణుగుకొనుచుండెడివారము. మారెండవ పెద్దతండ్రి కుమాళ్లు, తలిదండ్రులను లెక్కసేయక, మాముందే స్వేచ్ఛావిహారములు సలుపుచుండుటకు మా కనులు మఱింత కుట్టెను.

గృహపాలనమున మాజనని పూనిన కఠినపద్ధతివలనఁ గొంత చెఱుపు కలిగె నని చెప్పక తప్పదు. తిరిగెడి కాలునకును చూచెడి కనులకును అడ్డంకి కలిగినచో, దేహమనశ్శక్తులు గిడసఁబారు ననవచ్చును. కూపస్థమండూకములవలె నిరతము నింటి నంటిపెట్టుకొనుటచే, తోడి బాలురకుండు గడుసుఁదనము లేక మేము లోకజ్ఞానవిషయమునఁ గొంతవఱకు వెనుకఁబడి యుంటిమి.

ఐనను, తల్లి యదుపులో నుండుటచే మొత్తముమీఁద మాకు మేలే చేకూరెను. ఆయిల్లాలిమాట జవదాటకుండుట వలననే, క్రొత్త ప్రదేశమందలి దుశ్శోధనములకును దురభ్యాసములకును మేము లోను గాకుండుటయు, మంచినియమములు కొన్ని మేము బాల్యమందె నేర్చుకొనుటయును సంభవించెను. రాజమంద్రి వచ్చిన క్రొత్తఱికమున మాతమ్ముఁడు వెంకటరామయ్య బడికిఁబోవుటయందుఁ గొంత కొంటె తన మగఁబఱచెను. ఇంటినుండి వాఁడు నాతో బయలుదేఱినను కొంతదూరము వచ్చినపిమ్మట మెల్లగ వెనుకఁబడి, ఏసందుగొందులలోనో దాగియుండి, నేను బడినుండి మరలి వచ్చు సమయమున ముందుగ నడుగు లిడి యిలు సేరుచుండును ! నావిద్యాధోరణినే యుండిన నే నీసంగతి కొన్ని దినములవఱకును గమనింపక, పిమ్మట వానిమీఁద ననుమానము కలిగి, వానితరగతివారి నడిగి వాని టక్కరితనము తెలిసికొని, ఈసమాచారము మాయమ్మ కొకనాఁడు చెప్పివేసితిని. అపు డామె పెరుగు చిలుకుచుండెను. మాతమ్ము నంతట ప్రశ్నించి, తగినసమాధానము వాఁ డీయ నేరకుండుటచేత, కవ్వపుఁ ద్రాటితో వాని నామె చిదుకఁగొట్టెను. నాఁటినుండియు మే మెవ్వరమును బొంకులకును బడిదొంగతనములకును బాల్పడువారము కాము !

మా పెదతండ్రికొడుకులు స్వయముగ ధనికుల నాశ్రయించి విద్యాసంపాదనము చేయుచుండుటకు సంతసించి, జననీజనకులు వారిజోలి కెపుడును బోకుండిరి. అందువలన నాపిల్లవాండ్రు, ఇచ్చవచ్చినపోకడలు పోయి, నాటకసమాజములఁ జేరి, తుదకు ఆయురారోగ్యములకే ముప్పు తెచ్చుకొనిరి. మమ్ముఁ జూచినపు డెల్ల లోకజ్ఞాన విషయమందు మేము వెనుకఁబడియుండుటకు వారు విచారించుచు, ఊరక మమ్ము నాటకములకుఁ గొనిపోవుదు మనియు, ఉత్సవాదులు చూపింతు మనియు జెప్పి మమ్ము శోధించుచువచ్చిరి. మేము వారివలలోఁ బడక, చీటికి మాటికిని వారు పలుకు చిన్నకల్లల కచ్చెరు వొందుచుందుము. అంత వ్యాధిగ్రస్థుఁడై ప్రవేశపరీక్ష తరగతిలోనే పెద్దవాఁడును, పిమ్మట కొంతకాలమునకు రెండవవాఁడును, అకాల మరణమువాతఁ బడిరి.

మాతల్లి మమ్ము రాత్రులు నాటకాదులకే కాక, పగలు చదువుకొనుటకు సావాసులయిండ్లకును బోనీయకుండును ! ఈకఠిన నియమము మాకును మిత్రులకును మొదట మిగులఁ గష్టముగఁ దోఁచినను, పిమ్మట నెంతో శ్రేయోదాయక మయ్యెను. స్వయంకృషిచేఁ జదువుకొనుటకు మాకు మహావకాశము లొదవెను. చదువుకొనునంత సేపును చదువుకొని, సోదరులము మాలో మేమే యాఁడుకొనుచుందుము. విద్యార్థుల కతిసూక్ష్మముగఁ బట్టుబడు బూతులు బాసలు నందువలన మాకు దూరీకృతము లయ్యెను. చదువుకొనుటకు మమ్ము రాత్రులు సహపాఠులయిండ్ల కెన్నఁడును ఆమె పోనీయదు. వారితోఁగలసి చదువుకొనుట మాకంతగ నావశ్యకమయ్యెనేని, వారినే మాయింటి కాహ్వానము చేయుఁ డని యామె చెప్పి, చదువుకొనుటకు మాకు సదుపాయములు గల్పించును. వారిమాటలు చేష్టలును బరిశీలించి, సుగుణ దుర్గుణములు గనిపెట్టి, దుస్సహవాసుల బారినుండి మమ్మామె తొలఁగించుచుండును.

ఎల్లకాలము మావిద్యాసౌశీల్య పరిపోషణకార్యమందు మా యమ్మ మఱు పెఱుంగని యిట్టితీక్ష్ణ జాగరూకతను జూపఁగలిగెనని నే జెప్పఁజాలను. సంతానము పెరిఁగి యోపిక తగ్గినకొలఁది, పిల్లల చదువుసాముల పెంపునుగూర్చి యామె వెనుకవలె శ్రద్ధ వహించుటకు సాధ్యపడలేదు. అద్దాని యావశ్యకమును పిమ్మట లేదయ్యెను. 1887 వ సంవత్సరమునుండి మాతండ్రి యుద్యోగము చాలించుకొని, సామాన్యముగ నింటనే విడిసియుండెను. నేనును నాతరువాతి వాఁడగు వెంకటరామయ్యయును, పెద్దతరగతులకు వచ్చు వఱకును మాయమ్మ మమ్ముఁ గనిపెట్టి కాపాడెను. చిరకాలాభ్యాసమున సోదరుల మిరువురమును సాధువర్తనము వీడక, విద్యయం దభివృద్ధి నొందుటయే, తక్కినవారికి మార్గప్రదర్శకమయ్యెను. బాల్యదశలో జనని యాజ్ఞానుసరణమువలెనే, యౌవనమున జనకుని ప్రేమానుభవమే మమ్ము న్యాయమార్గమును వీడకుండునట్లు చేసెను.

7. అల్లరిచేష్టలు

మాధ్యమికపరీక్షలో జయమంది నేను 1885 వ సంవత్సరరాంభమున నైదవ తరగతిలోఁ జేరితిని. నావలెనే యా పరీక్షలోఁ గృతార్థులై సంతోషమున మిన్నందు మిత్రబృందముతోఁ గలసి నేను వినోదించుచుండువాఁడను. మాకు గణిత ప్రకృతిశాస్త్ర