ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/బెజవాడ స్నేహితులు

వికీసోర్స్ నుండి

మరల 29 వ అక్టోబరు సోమవారమే నా యుద్యోగమునఁ బ్రవేశింపవలెను గాన, మేము ఉభయులమును వెనుకటిరోజుననే బెజవాడకు వెడలిపోయితిమి.

10. బెజవాడ స్నేహితులు

పెండ్లిలోనే యారంభమైన మాచెల్లెలి యస్వస్థతయు సన్ని పాతజ్వరముగనె బరిణమించెను ! మిత్రుఁడు రంగనాయకులు నాయఁడుగారు నాయందలి యవ్యాజసోదరబావమున నా తమ్మునికిఁ జెల్లెలికిని మిగుల శ్రమపడి వ్యాధి నివారణముఁ జేసిరి. జ్వరవిముక్తులై తెఱపిని బడిన వారిరువురును మిగుల బలహీనదశ నుండిరి. శరీరమున సత్తువ పుట్టుటకై నాయఁడుగారు వారికి మంచిమందు లొసఁగిరి. ఎట్టకేలకు వా రిరువురును పూర్ణారోగ్యవంతులైరి.

బెజవాడ "స్వయంకృషి సమాజము" వారు తమ సమాజవర్థంతికి న న్నధ్యక్షునిగాఁ గోరఁగా, నా యుపన్యాసము సిద్ధపఱచితిని. 10 వ నవంబరునం దాయుత్సవము జరిగెను. అనుకొనిన యంశము లనేకములు ప్రస్తావింప నే మఱచిపోయినను, మొత్తముమీఁద నా యుపన్యాసము సమగ్రముగనే యుండెను. దానిసారము వార్తాపత్రికలకుఁ బంపితిని. నా యాధిపత్యమున జరుగు జనానాపత్రికకే కాక, యితర వార్తాపత్రికలకును దఱచుగ నేను వ్రాయుచుండువాఁడను. నే నిట్లు వ్రాయుచుండుటవలన, నయూహలకు సుస్థిరత్వమును, పదజాలమునకు సులభగమనమును, కాలక్రమమునఁ బట్టువడెను.

మత సంఘ సంస్కరణ విషయముల గుఱించి నేను దీఱికసమయములందు పాఠశాలలో బాహాటముగఁ బ్రసంగించుచుండువాఁడను ఆకారణమున విద్యార్థుల మనస్సులలోఁ గొంత సంచలనము గలిగెను. క్రైస్తవ పాఠశాలలోని హిందూవిద్యార్థులు, అన్యమతధర్మములను గుఱించియు, సంఘసంస్కరణావశ్యకమును గుఱించియు వినుచుండు వారలయ్యును, హిందువునగు నానోటనే యట్టి వాక్యము లాకర్ణించుట కచ్చెరువొందుచుండువారు. దేవళ్రాజు అనంతరామయ్య యను మా పాఠశాలలోని ప్రవేశపరీక్షతరగతి విద్యార్థి, విగ్రహారాధనమును నిరసించి, తోడివిద్యార్థుల యాగ్రహమునకుఁ బాల్పడియెను. "హిందూబాలసమాజ" సభకు నే నొకమాఱు పోయి, అచట విగ్రహారాధనమును గుఱించి జరిగిన చర్చలోఁ బాల్గొంటిని. సంస్కరణ పక్షాభిమానులగు విద్యార్థిబృందమునకు నే నిట్లు నాయకుఁడ నైతిని. పాఠశాలలోను బయటను, సంస్కరణ విషయములను గుఱించి విద్యార్థులతో నేను జర్చలు సలుపుచుండువాఁడను. 15 వ నవంబరున పాఠశాలలో "విద్యార్థి ప్రసంగసమాజ" సంవత్సరోత్సవము జరిగెను. ఆ సందర్భమున సమాజసభ్యులను హెచ్చరించుచు నా యధ్యోక్షోపన్యాసము చదివితిని. సభకగ్రాసనాధిపతి యగు డిస్ట్రిక్టుమునసబు కొప్పరపు రామారావు పంతులుగారు నా యుపన్యాసమును గొంత నిరసించినను, సభ్యుల కది సమ్మోదముగ నుండుటచే నాకుఁ బ్రోత్సాహము గలిగెను.

లోకమున నెట్టి సాధుజనులకు నొక్కొక్కతఱిని శాంతముగ దినములు గడువవు. ఆ నవంబరునెలలో మా యుపాధ్యాయులలోఁ గొందఱి కాకాశరామన్న యుత్తరములు వచ్చెను. ఒక పుణ్యవతి వర్తనమును గుఱించి యందు హేయమగు నపవాదములు సూచింపఁ బడెను ! ఊరునకుఁ గ్రొత్తనగు నా కిట్టిలేఖలు రాకుండినను, మిత్రుల వలన నీసంగతి విని నేను మిగుల విషాదము నొందితిని. ఆదంపతుల కెంతో మనస్తాపము గలిగె నని వేఱె చెప్ప నక్కఱలేదు. "మానవ మాత్రులు భూషణదూషణములకు సరిసమానముగఁ దలయొగ్గవలయు" నను లోకోక్తిని ఆకష్ట సమయమున నొకమిత్రుఁడు వచించుచుండుట నాకిప్పటికిని జ్ఞాపకము.

నేను బెజవాడ వచ్చిననాఁటినుండియు ద్వితీయోపాధ్యాయుఁడగు దేవసహాయముగారికిని నాకును మంచి స్నేహము కలసెను. మే మిరువురము సమవయస్కులము ; పలువిషయములందు పరస్పర సానుభూతి గలిగియుండువారము. క్రొత్తగ నుద్యోగమునఁ బ్రవేశించిన యువకుఁడనగు నాకష్టసుఖము లాయన యారయుచు, సోదరునివలె నిరంతరము నన్నుఁ బ్రేమించుచుండువాఁడు. ఈసంవత్సరాంతముననే యాయన బెజవాడ విడిచి మద్రాసులో నుద్యోగస్వీకారముఁ జేయ నుద్దేశించెను. నే నీపాఠశాలయం దెట్లు మెలఁగవలయునో, ఎవరి నెట్లు చూడవలయునో, నా కాయన బోధించుచుండువాఁడు. ఇరువురమును ప్రథమోపాధ్యాయునిదెస గౌరవభావము గలిగియేయుండెడివారము. ఐనను కొన్ని చిన్న సంగతులందు వారితో మాకుఁగల యభిప్రాయభేదములె, మాయిద్దఱి పొత్తును వృద్ధిచేసెను. దేవసహాయముగారు బెజవాడ వీడుదినములు రాఁగా, విద్యార్థులు తమగురువునకు బహుమానపూర్వకమగు విజ్ఞాపనపత్ర మొసంగ నిశ్చయించి, మాయిరువురికిని గల చెలిమిని బాటించి, నన్నే యాపత్రము సిద్ధపఱుపఁగోరిరి. 7 వ డిసెంబరున పాఠశాలలో జరిగిన బహిరంగసభలో నేనే విజ్ఞాపనపత్రమును జదివితిని. సహృదయుఁడు సరళ స్వభావుఁడు నగు దేవసహాయమహాశయునకుఁ దగినట్టుగ, సద్భావ పూరితముగను, లలితపదయుతముగను వినతిపత్ర మలరారుచుండెనని సదస్యులు సంతోషభరితులైరి. నా కాపాఠశాలలోఁ బ్రియమిత్రులయిన యింకొక యుపాధ్యాయుని గుఱించి కూడ నిచటఁ జెప్పవలయును. వీరు ఆంధ్రపండితులగు జానపాటి కామశాస్త్రిగారు. ఇంచుమించుగ నాయీడువారే. నావలెనే బకింగుహాముపేటలోఁ గాపురము. సామాన్యముగ మే మిద్దఱమును గలసియే పాఠశాలకుఁ బోవుచు వచ్చుచుండెడివారము. ఉభయులము పాఠశాల యావరణమున సాయంకాలమున బంతు లాడు చుందుము. సామాన్యదేశభాషాపండితులవలెఁ గాక, కామశాస్త్రిగారు ఉన్నతయాంగ్లవిద్య నభ్యసించిన యధ్యాపకునివలె విద్యార్థులను మంచియదుపులో నుంచి, వారి గౌరవ లాలనములకుఁ బాత్రు లగు చుండువారు. తాను గొంతవఱకు పూర్వాచారపరుఁ డయ్యును, కాలానుగుణ్యముగ సంఘమున కావశ్యకమైన కొన్ని సంస్కరణముల నీయన యామోదించుచుండువాఁడు.

తఱచుగ నాంధ్రవ్యాసములు రచించుచును మాసపత్రిక నొకటి ప్రకటించుచును నుండునాకు, వీరిసాయము నిరతమును గావలసి వచ్చెడిది. సరసులు, సాధుపుంగవులు, స్నేహపాత్రులును నగు శాస్త్రిగారు విసు వనుమాట నెఱుంగక, నావ్రాఁతలు దిద్దిపెట్టుచు నిరుపమాన స్త్రీవిద్యాభిమానమున నొప్పుచుండువారు.

నా కీ కాలమున పాఠశాలలోని బోధకులే గాక విద్యార్థులును గొందఱు స్నేహితులైరి. విగ్రహారాధనమును గుఱించి తనకుఁ గల స్వతంత్రాభిప్రాయములకొఱకు, సహచరుల యెత్తిపొడుపులకు గుఱియై నాయాదరము వడయుచుండిన అనంతరామయ్యను గుఱించి యిదివఱకే చెప్పితిని. మానికొండ రాజారావు, టేకుమళ్ల రాజగోపాలరావుగార్లు, తక్కినవారిలో ముఖ్యులు. మొదటి యాతఁ డానగరనివాసి. నేను షికారు పోవునపుడు ఆతఁడు నన్ను వెంబ డించుచు, పట్టణవార్తలు విడ్డూరములును బ్రస్తావింపుచుండువాఁడు. శిష్యుఁ డని యీసడింపక, అవ్యాజప్రేమమున నే నాతనిని మన్నించు చుండువాఁడను. రాజగోపాలరా వనిన రాజారావున కంతగఁ బడెడిది కాదు. ఆజానుబాహువగు రాజారావువలెఁగాక రాజగోపాలరావు పొట్టిగ సన్నముగ నుండి, ఆంధ్రసారస్వతమునఁ జక్కని యభిరుచి గాంచియుండుటచే నే నాతనిఁ బ్రేమించువాఁడను. పిమ్మట నీతఁడు నాపత్రికకు "స్త్రీచరిత కదంబము" అనుపేరిట కథలు వ్రాయుచుండువాఁడు.

1894 సంవత్సరము డిసెంబరులో మద్రాసున జాతీయ సభలు దర్శించుటకై, వీరేశలింగముపంతులు రంగనాయకులునాయఁడు గార్లు రాజమంద్రినుండి ప్రయాణముఁ జేసి, మార్గమధ్యమందలి బెజవాడలో నొకనాఁడు నా కతిథులైరి. వీరేశలింగముగారు మాయింట విడియుటకు నింటివారు తప్పుపట్టక, మీఁదుమిక్కిలి వారికి వంట చేయుటయందు నాభార్యకు సాయముఁగూడఁ జేసిరి. నేను మా తమ్ముఁడు వెంకటరామయ్యతోఁగూడి వారితోఁ జెన్న పురికిఁ బ్రయాణమైతిని. రాజమంద్రిస్నేహితుల మంత దేశీయమహాసభకుఁ బోయెడి తక్కినవిద్యాధికులతోఁ గలసి యొకబండిలో నెక్కితిమి కాన, ప్రయాణకష్టము మాకేమియుఁ దోఁపలేదు. పూర్వాచారాపరులగు సహచరులతో సంఘసంస్కరణమునుగుఱించి యత్యధికముగ వాదించుట వలన, వీరేశలింగముగారికి రెయిలులో గొంతు బొంగుపోయెను !

ఆ సంవత్సరమున జాతీయసభ కధ్యక్షుఁడు, వృద్ధుఁడు, బ్రిటిషుపార్లమెంటు సభ్యుఁడునునగు ఆల్ ఫ్రెడు వెబ్బుదొర, రెండవ నాఁటి యుపన్యాసకులలో పార్ల మెంటు సభ్యుఁడగు 'కీ' ముఖ్యుఁడు. ఈతఁడు తడవుకొనక, చేతనుండు కాకితమువంకనైనఁ జూడక, గంటల కొలఁది ఝరీవేగమునఁ బ్రసంగము చేయఁజాలినవాఁడు. సద్వర్తనముఁ గోలుపోయె నను కారణమున గొప్పవక్తయు ప్రసిద్ధన్యాయవాదియు నైన యొకదొరను సభలో మాటాడనీయవలదని ముల్లరుకన్య తెచ్చిన తీర్మానమును అధ్యక్షుఁడు త్రోసివేయుట, మిత్రుఁడు వెంకటరత్నమునాయఁడుగారు మున్నగు కొందఱి క సమ్మతమయ్యెను.

28 వ తేదీని నేను మహాసభకుఁ బోక, పూర్వగురువులు మిత్రులు నగు మల్లాది వెంకటరత్నముగారిని సందర్శించితిని. ముందు చెన్నపురిలో న్యాయవాదిపరీక్షకుఁ జదువఁబూనిన నాతమ్ముని కాయన తన యింట నొకగది యిచ్చెను. 29 వ తేదీని నేను కాంగ్రెసులోఁ గాంచిన యుపన్యాసకులలో నెల్ల సురేంద్రనాథబెనర్జీ మదనమోహన మాళవ్యాగార్లు అధిక ప్రతిభావంతులుగఁ దోఁచిరి.

డిసెంబరు 30 వ తేదీని బ్రాహ్మమందిరములో జరిగిన యొక బ్రాహ్మవివాహమును జూచితిని. జగద్విఖ్యాతిఁ గాంచిన భండార్కరు పండితుఁడు ఆసందర్భమున పురోహితుఁడు. ఇతఁడు సప్తపది మంత్రములు పఠించి, వధూవరులచే నడుగులు వేయించి వాని భావము విప్పి చెప్పునప్పుడు, పూర్వకాలపు ఋషివర్యు లెవరో యిపు డధ్వర్యము చేసి యీ యార్యవివాహామును నడపించుచుండినట్లు గాన వచ్చెను ! మఱునాఁడు క్రైస్తవకళాశాలలో చెన్నపురి సంఘసంస్కరణ సమాజ వార్షి కసభ జరిగెను. రేనడే, భండార్కరుగార్లు మహోపన్యాసము లొసంగిరి.

11. నూతన వత్సరము

1894 వ సంవత్సరము జనవరి 5 వ తేదీని నేను చెన్నపురినుండి తిరిగి బెజవాడ వచ్చినపుడు, దేశీయమహాసభ ప్రతినిధురాండ్ర: