ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/నూతన వత్సరము

వికీసోర్స్ నుండి

కొలఁది ఝరీవేగమునఁ బ్రసంగము చేయఁజాలినవాఁడు. సద్వర్తనముఁ గోలుపోయె నను కారణమున గొప్పవక్తయు ప్రసిద్ధన్యాయవాదియు నైన యొకదొరను సభలో మాటాడనీయవలదని ముల్లరుకన్య తెచ్చిన తీర్మానమును అధ్యక్షుఁడు త్రోసివేయుట, మిత్రుఁడు వెంకటరత్నమునాయఁడుగారు మున్నగు కొందఱి క సమ్మతమయ్యెను.

28 వ తేదీని నేను మహాసభకుఁ బోక, పూర్వగురువులు మిత్రులు నగు మల్లాది వెంకటరత్నముగారిని సందర్శించితిని. ముందు చెన్నపురిలో న్యాయవాదిపరీక్షకుఁ జదువఁబూనిన నాతమ్ముని కాయన తన యింట నొకగది యిచ్చెను. 29 వ తేదీని నేను కాంగ్రెసులోఁ గాంచిన యుపన్యాసకులలో నెల్ల సురేంద్రనాథబెనర్జీ మదనమోహన మాళవ్యాగార్లు అధిక ప్రతిభావంతులుగఁ దోఁచిరి.

డిసెంబరు 30 వ తేదీని బ్రాహ్మమందిరములో జరిగిన యొక బ్రాహ్మవివాహమును జూచితిని. జగద్విఖ్యాతిఁ గాంచిన భండార్కరు పండితుఁడు ఆసందర్భమున పురోహితుఁడు. ఇతఁడు సప్తపది మంత్రములు పఠించి, వధూవరులచే నడుగులు వేయించి వాని భావము విప్పి చెప్పునప్పుడు, పూర్వకాలపు ఋషివర్యు లెవరో యిపు డధ్వర్యము చేసి యీ యార్యవివాహామును నడపించుచుండినట్లు గాన వచ్చెను ! మఱునాఁడు క్రైస్తవకళాశాలలో చెన్నపురి సంఘసంస్కరణ సమాజ వార్షి కసభ జరిగెను. రేనడే, భండార్కరుగార్లు మహోపన్యాసము లొసంగిరి.

11. నూతన వత్సరము

1894 వ సంవత్సరము జనవరి 5 వ తేదీని నేను చెన్నపురినుండి తిరిగి బెజవాడ వచ్చినపుడు, దేశీయమహాసభ ప్రతినిధురాండ్ర: యొక్కయు, ఇతర ప్రతిభావతులయొక్కయు ప్రతిమలు కొన్నికొని చట్టములు కట్టించి నాతోఁదెచ్చితిని. ఇంట వెలిగించుకొనుటకు కాంతిమంతములగు గాజుదీపములును, ముఖము చూచుకొనుటకు ముకురములును గొనివచ్చితిని. రాత్రు లీదీపముల వెలుఁగున గోడలకుఁ దగిలింపఁబడిన పటములు ప్రతిమలును తళతళ మని మెఱయుచు, గాంధర్వలోకదృశ్యములను సూచించుచుండెను. దేశీయమహాసభయందును, తదితర మహాసభలందును నే నాకర్ణించిన సురేంద్రనాథబెనర్జీ, మదనమోహనమాళవ్యా ప్రభృతులగు మహావక్తల ప్రసంగములు నా వీనుల నింకను వినుపించునట్లే యుండెను. ఎచటఁ జూచినను నా కనులకు సౌందర్యవాహిని గోచరించెను. పక్షుల కలస్వనములందును, మానినీమణుల మందహాసములందును, ప్రకృతికాంత వదనముకురమందును, నాకు సర్వేశ్వరుని సుందరాకారము ప్రతిబింబితమయ్యెను. ప్రాచ్యదైవభక్తుల హృదయసీమలందలి బహుదేవతా విశ్వాసమున కిట్టి దృశ్యములే హేతుభూతములై యుండవచ్చునని నేను దలపోసితిని.

పాఠశాల కింకను సెలవు లుండినందున మేము రాజమంద్రివెళ్లి బంధుమిత్రులను జూచితిమి. మృత్యుంజయరావున కిటీవల జ్వరమువలన బలహీనత యతిశయించినను, ఇపుడు కొంచెము నెమ్మదిగ నుండెను. మిత్రుల మిరువురమును భగవద్విషయములను గుఱించి ముచ్చటించుకొంటిమి. ఈమధ్య వ్యాధి ముదిరి, పరిస్థితులు తలక్రిందైనపుడు తన్నావరించిన నిబిడాంధకారము నొక్కింతఁ దొలఁగించి, తన యాత్మముం దొక విద్యుద్దీపము వెలిఁగెనని నామిత్రుఁడు పలికినపుడు, నే నది యీశ్వర సాక్షాత్కారమే యని గ్రహించితిని. అనుభవసిద్ధమగు నిట్టియీశ్వరసందర్శనమే మతమునకు ప్రధానాంగము కాని, సూత్రములు సిద్ధాంతములు గావని నాకు ద్యోతకమయ్యెను. కుటుంబఋణము పెరుఁగుచుండుటచేత, అది తీర్చివేయు నుద్దేశమున మాభూము లమ్మఁజూపుటకై తండ్రియు నేనును గోటేరు మున్నగు ప్రదేశముల కపుడు ప్రయాణమైతిమి. ఈపద్ధతి మాతల్లికి సమ్మతముగ లేదు. ఈ సందర్భమున నా కామె దుర్గుణదురుద్దేశము లారోపింప వెనుదీయకుండెను ! అప్పులన్నియు విద్యాపరిపూర్తిఁజేసిన నేనును, నాపెద్ద తమ్ముఁడును మాత్రమే తీర్చివేసి, ఆస్తి యందఱమును సరిసమానముగఁ బంచుకొనుట న్యాయమని యామె తలంచెను. కుటుంబమరియాద నిలువఁబెట్టు విషయమున నాకుఁగల సద్భావ మామె సంశయించుటకు నేను మిగుల వగచితిని.

జనవరి 9 వ తేదీని మానాయనయు నేనును రాజమంద్రి నుండి బయలుదేఱి, రాత్రికి వేలివెన్నును, మఱునాఁటికి గోటేరును జేరితిమి. గోటేరులో ఋణదాత రామభద్రిరాజుగారు మాభూములు కొనుటకు మొదట సమ్మతింపకుండినను, మేము పట్టుపట్టినపిదప నద్దాని కొప్పుకొనెను. మేము తణుకులో నొకటిరెండురోజులు నిలిచియుంటిమి. నాపూర్వ సహపాఠి జనమంచి వెంకటరామయ్యగారచటి మాధ్యమికి పాఠశాలలో ప్రధానోపాధ్యాయుఁడు. జనానా పత్రికకు వ్రాయుటకాయన సమ్మతించెను. మే మంత రేలంగి వెళ్లి బంధువులను జూచితిమి. పట్టపరీక్ష నిచ్చి, ఉద్యోగస్వీకారము చేసి, స్వగ్రామ సందర్శనముఁ జేయవచ్చిన నన్ను గ్రామస్థులు మిగుల మన్నించిరి. కుటుంబ కలహములవలన మాపెద్ద పెత్తండ్రి మొదట నాతో మాటాడకుండినను, పిమ్మట నా కెంతయో దయ చూపించెను. న న్నాయన ముద్దాడి, కంట నీరు దెచ్చుకొనెను. మే మంత బయలు దేఱి, రాజమంద్రి తిరిగి వచ్చితిమి. నేను మరల మృత్యుంజయరావును గలసికొని మాటాడితిని. సత్యసంవర్థనితోడి సంబంధము కొన్ని మాసములనుండి నేను వదలుకొనినను, నాస్నేహితునిరీతిఁ జూచి, మార్చి నెలనుండి యాపత్రికకు వ్రాయుదు నంటిని. అంత నందఱి యొద్దను వీడ్కోలు గైకొని బెజవాడకు వెడలిపోయితిమి.

చదువు నిమిత్తమై తమ్ములు కృష్ణమూర్తి సూర్యనారాయణులను బెజవాడకు మాతోఁ గొనివచ్చితిమి. వారిని మాతో నంపుటకు మాతల్లి కెంతో కష్టముగఁ దోఁచెను. 16 వ తేదీని మేము బెజవాడ చేరితిమి. మాపాఠశాల మంచిస్థితిలో లేకుండుటకు నే నెంతయుఁ జింతిల్లితిని. ఇది కారణముగ బెజవాడలో నాయునికి కంతరాయము గలుగవచ్చు నని భయమందితిని.

17 వ తేదీని వీరేశలింగముగారు సకుటుంబముగ మద్రాసు నుండి రాజమంద్రికి వచ్చుచు, మార్గమధ్యమున భోజనము నిమిత్తమై బెజవాడలో మా యింటికి వచ్చిరి. అపుడు మాయింట నన్న మమర కుండుటవలన, వేఱుచోట వారు భుజించిరి. ఈయశ్రద్ధకై భార్యమీఁద నేను గోపించితిని.

అందఱు నొకచోట నివసించినచో కుటుంబవ్యయము తగ్గునని నేను జెప్పఁగా, రాజమంద్రిలోని కాపుర మెత్తివైచి, బెజవాడలో నాయొద్ద నుండుటకు మా తలిదండ్రులు సమ్మతించిరి. తగినంతస్థలము సమకూరుటకై గోవిందరాజులవారి యింటిలో నుత్తరభాగము విడిచి, విశాలమగు దక్షిణభాగమును, దానితోఁ జేరియుండు వీథివసారాగదియును మేము నెల కైదు రూపాయీల బాడుగకుఁ దీసికొని, దానిలోనికిఁ గాపురము తరలించితిమి. ఆకాలమున బెజవాడలో డిస్ట్రిక్టుమునసబుగనుండిన కొప్పరపు రామారావుగా రిచ్చిన కొన్నివేల రూపాయిల విరాళముమీఁద వచ్చెడి వడ్డితో, ఏఁటేఁట నాంధ్రదేశమం దున్నతవిద్య నేర్చెడి పేద నియోగి బాలురకు వేతనము లీయఁబడుచుండెడివి. ఈ "యాఱువేల నియోగివిద్యార్థి సహాయకసమాజ" కార్యనిర్వాహక సభలో న న్నిటీవల సభికునిగ నెన్నుకొనిరి. 19 వ జనవరిలో జరిగిన సభకు నే నధ్యక్షుఁడను. వర్ణభేదములను బాటింపని నే నీనియోగులసమాజమునఁ జేరుటకు సందేహింపమికి, అది వట్టివిద్యాసంస్థ యని భావించుటయే కారణము.

మా తలిదండ్రులు రాజమంద్రివిడిచి బెజవాడ రాలేకపోయిరి. బెజవాడలో నాతో నాతమ్ములిద్దఱుండుటచేత, ఇంటి పని యొక్కతెయుఁ జేసికొనిలేక, నాభార్య మూలుగుచు, నామీఁద చిరచిర మనుచుండెడిది. తలిదండ్రులను విడచి యుండుటకు సూర్యనారాయణ లోన బెంగపెట్టుకొనియుండెను. నేను "జనానాపత్రిక"కు వ్రాసినవ్యాసములు వానిచేఁ జదివించుచును, పత్రికకు సొంతముగ వ్రాయుమని హెచరించుచును, ఎటులో వానిదృష్టిని జదువునకు మరలింపఁ జూచితిని. ఇంకను బలహీనుఁ డగు కృష్ణమూర్తికి బలముపట్టు మందు లిప్పించుటకై రంగనాయకులునాయఁడుగారితో నే నుత్తరప్రత్యుత్తరములు జరిపితిని.

సంసార లంపటయు నింద్రియలోలత్వమును నాయందు పెచ్చు పెరిఁగి, నామనస్సు నీశ్వరధ్యానమునుండి మెల్ల మెల్లగఁ దొలఁ గించుచుండెను. దైవభక్తియందు నాకుమరల తీపి గలిగింపఁగల యుదంత మొకటి యిపుడు సంభవించెను. నాపూర్వపరిచితులగు దుగ్గిరాల రామమూర్తిగా రీపాఠశాలలో ప్రకృతిశాస్త్రబోధకులుగ నియమింపఁబడిరి. ఆయన బ్రాహ్మమతవిశ్వాసియు, స్నేహపాత్రుఁడును. పాఠశాలలోఁ గొన్ని క్రొత్తయేర్పాటులు చేసితిమి. విద్యార్థుల యుపయోగార్థమై పఠనాలయము నెలకొల్పితిమి. నే నీయేఁడు ద్వితీయోపాధ్యాయుఁడ నైతినిగాన, దేవసహాయముగారి స్థానమున పాఠశాలలో వ్యాయామాధికారినైతిని.

మా పాఠశాలాప్రవేశపరీక్షాఫలితము లంత తెలిసెను. అనంతరామయ్య యొకఁడు మాత్రమే జయమందెను. మేము దీనికి నిరుత్సాహ మందక, పరిస్థితులు ముందు బాగుపడు నుపాయము లాలోచించితిమి. పాఠశాలలో పాఠనిర్ణయపట్టికలు సిద్ధము చేయు పని నే నిపుడు నిర్వహింపవలసివచ్చెను. ఈపని నే నెంత సద్భావముతోను నిష్పాక్షికబుద్ధితోను నెరవేర్పఁబూనినను, నామూలమున తమపని యందు చిక్కు లధికమయ్యె నని సణుగుకొనుచు, బోధకులు కొందఱు నాకు దుర్గుణము లారోపింప వెనుదీయకుండిరి !

ఫిబ్రవరి 14 వ తేదీని మమ్ముఁ జూచిపోవుటకు, మా చిన్న చెల్లెలు కామేశ్వరమ్మతోఁ గలసి మాయమ్మ బెజవాడ వచ్చెను. మృత్యుంజయరావు చిన్నకూఁతురు రామాబాయి చనిపోయె నని వారివలన విని మే మెంతయు విచారపడితిమి.

12. నిత్యవిధులు

నేను యల్. టి. పరీక్షకు మార్చినెలలో మద్రాసు వచ్చి కొన్ని రోజు లుంటిని. అచట నాతమ్ముఁడు వెంకటరామయ్యతోను, మిత్రులు వెంకటరత్నము, నారాయణస్వామినాయఁడు, కనకరాజు, గంగరాజు గార్లతోను నేను బ్రొద్దుపుచ్చితిని. నా తమ్ముఁడు పట్టపరీ