ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/బెజవాడ

వికీసోర్స్ నుండి

ఆత్మచరిత్రము

ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ

1. బెజవాడ

1893 వ సంవత్సరము మార్చి 9 వ తేదీని నేను బెజవాడ కేగి, నాకు లభించిన యుద్యోగమునఁ బ్రవేశించితిని. నా కనుల కపుడు, విజయవాడయె కాక, జగతీరంగమంతయు నూతనకాంతులతో విలసిల్లెను. ఇదివఱకు తలిదండ్రుల పోషణమున నుండి, వారి చెప్పుచేతలకు లోనై, వినమ్రభావమున, నేను మెలంగితిని. నాహృదయమున గోదావరినదివెల్లువలవలె సంస్కరణవిషయములను గుఱించిన మహాశయము లుప్పొంగుచున్నను, కార్యస్వాతంత్ర్యము లేమింజేసి వాని నెల్ల నిరోధించి, లేనియోపికను దెచ్చుకొని మసలవలసినవాఁడనైతిని. ఇపుడన్ననో, నేను విద్యముగించి, వృత్తిఁ జేకొని, సంసారసాగరమును స్వతంత్రముగ నీదఁజొచ్చితిని. లోకమును గుఱించి వట్టి యూహా పోహములతోనే నే నిదివఱకుఁ గాలము గడిపితిని. ఇప్పుడొ, జీవిత మందలి కష్ట సుఖములు, మేలుకీడులును క్రమముగ నా కనుభవగోచరము కాఁజొచ్చెను. నా నూతనాశ్రమజీవితమును స్పష్టముగ సూచించుటలో యన నీనూతన పురనివాసమును నా కిపుడు సంఘటిల్లెను. బెజవాడ నే నిదివఱ కెఱుంగనిది కాదు. చెన్నపురి పోయి వచ్చు చుండినప్పుడు పలుమాఱు నేనీ పట్టణమును సందర్శించుచునే యుంటిని. కాని యిదివఱ కెపుడును, ఈనగర మామూలాగ్రముగ నేను బరిశీలింప లేదు. కావున విజయవాడపురము నా కెంతయుఁ గ్రొత్తగ నుండెను. ఇచటిప్రకృతిదృశ్యము లత్యంతరమణీయములు. కృష్ణవేణీనది, దాని కిరుపార్శ్వములనుండి ఱెక్కలవలె మింటి కెగయుపర్వతపంక్తులు, తూర్పున మొగలరాజపురపుకొండ, నదిమీఁదఁ గట్టినయానకట్ట రెయిలువంతెనలు, ఏటినుండి వెడలిన మూఁడు కాలువలు, దాపుననుండు కొండమీఁద వెలసిన కనకదుర్గాలయము, - ఇవి యన్నియు నేత్రోత్సవముఁ జేయుచుండును. బందరురైవిసుకాలువలమధ్య విచిత్రద్వీప కల్పమువలె నేర్పడిన బకింగుహాముపేట యుద్యానవనమువలె సొంపారుచుండును. బందరుకాలువ యొడ్డునందలి చిన్న బాటను చెట్లనీడను నడచిపోవునపుడు, కాలువనీటినుండి నీతెంచెడి చల్లనిగాలి ననుభవించుచు, పక్షుల మధురాలాపములు వినుచును, నే నేదో విచిత్రలోకవిహారము చేయునటు లనుకొనువాడఁను!

ఇచటివారికిని గోదావరిమండలజనులకును, వేషభాషాచారములం దనేకభేదములు నాకుఁ బొడఁకట్టెను. అయినను వీరును సోదరాంధ్రులే. కావున విద్యాబోధకరూపమున నాంధ్రావనియందు సాంఘిక సేవ లొనర్ప నే నవకాశములు గలిపించుకొనఁబూనితిని.

నేను బెజవాడ వచ్చిన మఱునాఁడే, ఆ పాఠశాలావిద్యార్థులకు బహుమతులు పంచి పెట్టఁబడెను. ఆ సభాసందర్భమున నచటికి విచ్చేసిన పౌరప్రముఖులతో ప్రథమోపాధ్యాయులగు శ్రీ ధన్వాడ అనంతము గారు నాకుఁ బరిచయము గలిగించిరి. మఱునాఁడు మా తండ్రి రాజమంద్రినుండి నా భార్యను, తమ్ముఁడు సూర్యనారాయణను బెజవాడకుఁ గొనివచ్చెను. మేము తాత్కాలికముగ నొక స్నేహితునియింట విడిసితిమి. పాఠశాల కొంతదూరమైనను, బకింగుహాము పేట వాస యోగ్య మగుటచేత, మే మచటనే యుండ నిశ్చయించితిమి. కాలువవంతెనకుఁ జేరువనుండు గోవిందరాజులవారియింటిలో నొకభాగమును మా తండ్రిగారు మాకుఁ గుదిర్చిరి. చదువుకొనుటకే సూర్యనారాయణ యిచటికి వచ్చినను, మా తల్లిని విడువనొల్లక, మూఁడునాలుగుదినములలో పయనమైన మాజనకునివెంటఁబడి యాపసివాఁడు రాజమంద్రి వెడలిపోయెను! మా క్రొత్తకాపురమునకు వలయు వస్తుసముదాయమును బజారునుండి కొనితెచ్చియిచ్చి, మా తండ్రి మమ్ము విడిచివెళ్లెను. అనంతముగారియొక్కయు, ద్వితీయోపాధ్యాయులగు దేవసహాయముగారియొక్కయు సాయమువలన, కూర్చుండుటకు కుర్చీలు బల్లలు మున్నగు సామాను నేను కొని, నూతనపురనివాసమున కాయత్తమైతిని.

కాని, జీవితమున నన్ను గాసిఁబెట్టుటయే వినోదముగఁ గైకొనిన వికటవిధి నా కిపుడైన మనశ్శాంతి లేకుండఁజేసెను! నూతన ప్రదేశమునఁ గ్రొత్తకాపుర మారంభించిన నా కాశాభంగ మొనరించెడి యుదంత మొకటి యంతట సంభవించెను. బెజవాడ పాఠశాలాధి కారియు, బందరు నోబిలుకళాశాలాధ్యక్షుఁడును, నా యుద్యోగ ప్రదాతయునగు రెవరెండుక్లార్కుదొర నాకొకలేఖ నిపుడు వ్రాసెను. నేను యల్. టి. పరీక్షలో పూర్తిగ విజయమందనిహేతువున నామూలమునఁ దమవిద్యాలయమునకు దొరతనమువారినుండి యాదాయ మేమియు రాదు గావున, తా నిదివఱ కేర్పఱచినట్టుగ డెబ్బదిరూపా యిలు కాక, అఱువదియే నాకు జీతమిచ్చెద నని యాయన తెలియఁబఱిచెను ! ఈ సంవత్సరమైన డెబ్బదిరూప్యము లిప్పింపుఁ డని వారికి వ్రాసికొని, ఆనాఁడే తమ్ముఁడు వెంకటరామయ్య పంపినజాబు ననుసరించి, అమలాపురము పాఠశాలలో ద్వితీయోపాధ్యాయుని యుద్యోగమునకై ప్రయత్నింప నే నారంభించితిని !

నా మనోవ్యాకులతను బూర్తిచేయుట కీ యుదంత మొకటియే చాలదేమో యనునట్టుగ, ఆ మొదటిదినములలో మాకింకఁ గొన్ని యిక్కట్టులేర్పడెను. దినదినప్రవర్ధమానమగు బెజవాడవేసవియెండలు మా యుభయులను మిగుల వేధించెను. ఇరువురమును కురుపులచేత బాధపడితిమి. కడుపునొప్పి, జ్వరము మున్నగు వ్యాధులు నా భార్యను బీడించెను. ఆ కష్టసమయములందు, ఇంటియజమానురాలగు శ్రీమతి సుబ్బమ్మగారు మా కమితముగఁ దోడ్పడిరి. మంచమెక్కిన నాభార్యకు చికిత్సాపరిచర్యలు చేయుచును, నాకు వేళకు నన్నపానము లొనఁగూర్చుచును, ఆయిల్లాలు మాకు రెండవతల్లి యయ్యెను !

16 వ మార్చిని మాపాఠశాలలోని "విద్యార్థిసాహితీసమాజము"వారు నన్నుఁ దమ యధ్యక్షునిగ నెన్నుకొనిరి. ఆ సమాజమునకు నే జేయవలసిన సేవనుగూర్చియు, దాని యభ్యున్నతికై నే గావింపవలసిన యపారప *శ్రమనుగుఱించియుఁ దలంచుకొనినపుడు, నా మేను పులకరింపఁదొడంగెను ! ఇంతియ కాదు, పాఠశాలలోని యనుదిన విద్యాబోధనాకార్యనిర్వహణమందే నాకు నిరుపమానందము గాన వచ్చెను. సతికి విద్యగఱపుట ముఖ్యవిధిగ నే జేసికొని, భారతాది గ్రంథములందలి కథలును, 'సత్యసంవర్థనీ' పత్రికకు నేను వ్రాయు వ్యాసములును, ఆమెకుఁ జదివి వినిపించుచుండువాఁడను. ఆబాలకు ముఖ్యముగ మతబోధనము చేయ నాసక్తి గొనియుంటిని. సంఘ సంస్కరణ విషయములను సతితోఁ జర్చించుచును, తీఱిక సమయములం దుత్తమవిషయములనుగుఱించి సంభాషించుచును, ప్రొద్దుపుచ్చుండు వాఁడను.

ఉద్యోగమునఁ బ్రవేశించినను నా వృత్తిసమస్య యింకను పరిష్కారము కానివిధముననే, మతమునుగుఱించి బాహాటముగ ప్రసంగములు సల్పుటకును వ్యాసములు వ్రాయుటకును నే నేర్చి యుండినను, నా విశ్వాసము లింకను జీవితమునఁ బెనఁగలసి, క్రియా రూపమున వెలువడ నేరకుండెను! ఒక నిముసమున నధిక పవిత్రస్థానము నధివసించెడి నాహృదయము, మఱుక్షణముననే హేయవిషయ వాంఛల నోలలాడుచుండును ! ఈశ్వరచరణకమల ధ్యానమే జీవిత కర్తవ్య మని నమ్మిననామనస్సు, పలుమాఱు విషయలాలసా పంకమున బ్రుంగుచుండెడిది ! తప్పించుకొనఁ బ్రయత్నించినకొలఁది కామోపభోగములందు నా మనస్సు మఱింత గాఢముగఁ గూరుకొనిపోవు చుండును ! ఒకనాఁటి మనోనిశ్చయము మఱునాఁటికి హాస్యాస్పదమగుచున్న దనియు, ఈ చిత్తచాంచల్యమునుండి నన్నుఁ దప్పింపు మనియు, దైన్యమున నే నెంతవేఁడుకొనినను, దీనరక్షకుఁడగు దైవము నా మొఱలు వినిపించుకొనక, చెవులు మూసికొని కూర్చుండునట్లు తోఁచెను !

మార్చినెల తుదిదినములలో నొకసాయంకాలము, మరల తన పుస్తకములు విప్పి యాంగ్లము నభ్యసింపుమని భార్యకు బోధించి, నేను బందరుకాలువయొడ్డున షికారుచేయుచు, నాప్రకృతదురవస్థను జ్ఞప్తికిఁ దెచ్చుకొని, నన్ను రక్షింపు మని దేవదేవుని వేఁడుకొంటిని. నామానసిక స్థితినంత నేను విమర్శించుకొంటిని. నా లోపపాపములలో, అసూయ, విషయవాంఛ, నిగ్రహరాహిత్యము, అసమగ్రభక్తియును ప్రముఖము లని నేను గనిపెట్టి, వీనిని సవరించి నా కాత్మవికాసము గలిగింపు మని పరాత్పరుని వేఁడుకొంటిని. లోకమందు భక్తులచిత్తములు నిరతము భగవదున్ముఖములగుచుండఁగా నాకుమాత్రము లోక విషయములె మఱింత హృదయరంజకము లగుచుండుటకు నే నెంతయు విషాదమందితిని !

2. ప్రార్థనసమాజము

రాజమంద్రి ప్రార్థనసమాజవార్షిక సభకు నా కిపుడు పిలుపు రాఁగా, ఆసందర్భమునఁ జదువుటకై "ఆస్తికమతాధిక్యము" అనునొక యాంగ్లోపన్యాసమును నేను సిద్ధపఱిచితిని. ఏప్రిలు 6 వ తేదీని నేను రాజమంద్రి వెళ్లితిని. మాయమ్మ యపు డారోగ్యవతిగ లేదు. మఱునాఁటిప్రొద్దున తమ్ముఁడు వెంకటరామయ్య యుపన్యాసము జరిగెను. ఆ సాయంత్రము నేను బ్రసంగించితిని. పలువురు సభికులు నా యుపన్యాసమును మెచ్చుకొనిరి. అందలి ముఖ్యవిషయము లిందుఁ బొందుపఱుచుచున్నాను : -

"ప్రార్థంసమాజమువారిమతము ఆస్తికమత మనియు, వారి యర్చనల కధిదేవత పరమాత్ముఁ డనియు నుడువనగును. ఇతరమతములకును దైవమే ముఖ్యమైనను, అవి యామహామహునికంటె నాతని యవతారములకును, ప్రవక్తలకును, ప్రతినిధులకును ప్రాధాన్య మొసంగుచున్నవి. పరిశుద్ధాస్తికమతమునకు మాత్రము దైవభక్తియె ప్రధానాంగము. దీనికి గొప్ప సిద్ధాంతగ్రంథములతోఁ బ్రసక్తి లేదు. మనష్యుని బాహ్యాంతరప్రకృతులే దేవదేవుని యునికికి సాక్షీభూతములు. జగత్తె యీశ్వరనిర్మితమగు దివ్యభవనము. మనస్సాక్షి మానవచారిత్రాదు లాస్తిక్యమునకు ముఖ్యనిదర్శనములు. పాప మనఁగ